Saturday, April 26, 2008

sahiti parulatho sarasaalu 19






కొన్ని విశిష్ట కోణాల్లో ఆవుల గోపాలకృష్ణమూర్తి (ఎ.జి.కే.)






సుప్రసిద్ధ కవి ఒకరు ఎజికే దగ్గరకు వచ్చి ‘అడ్వకేటుకి, కవికి తేడా ఏమిటి? అని అడిగాడట. ఏముంది? అబద్ధానికి, అసత్యాలకి ఉన్న తేడానే అన్నాడట. చుట్టుపక్కల విన్నవారంతా, గొల్లుమని నవ్వారట. అడ్వకేటుగా తెనాలిలో ప్రాక్టీసు చేసిన ఎజికే తనపై తాను జోక్స్ వేసుకోగల సాహితీ ప్రియుడు, ఆయనకు కొన్ని కోణాలు గుర్తుపెట్టుకోదగినవి ప్రస్తావిద్ధాం.
ఒకేఒక్కసారి తెనాలి మున్సిపల్ చైర్మన్ గా ఎజికే పదవిలో ఉన్నప్పుడు గవర్నర్ సి.యం. త్రివేది వచ్చాడు. మున్సిపల్ సన్మానం ఏర్పాటు చేశారు. త్రివేది ఇతర కార్యక్రమాలన్నీ ముగించుకుని చివరగా మున్సిపల్ సన్మానానికి వచ్చాడు. ఆహ్వానం పలుకుతూ ఎజికే, ఐ.సి.ఎస్. అధికారిగా విధి నిర్వాహణ నియమాలు, బాగాతెలిసిన త్రివేది మున్సిపల్ కార్యక్రమానికి ప్రప్రధమంగా రావాలని మరచిపోవటం ఆశ్చర్యంగా ఉన్నదన్నారు. అంతటితో త్రివేది లేచి క్షమాపణ చెప్పి మాట్లాడాడు. ఆనాడు త్రివేది రాష్ట్రపతి పాలన విధించిన ఆనందంలో తిరుగులేని వ్యక్తిగా పేరున్నవాడు, ఆయన చేత కూడా ఎజికే అలా చెప్పించగలగటం చాలామందిని ఆశ్చర్యపరచింది.

ఎజికే మున్సిపల్ చైర్మన్ గా ఉండగానే రాష్ట్రముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి తెనాలి వచ్చి మున్సిపాలిటీ అడిగిన రెండు రోడ్లలో ఒకటి మంజూరు చేసినట్లు సభలో ప్రకటించారు. రెండులో ఒకటి సగమని, అంటే అడిగిన దానిలో 50 శాతం ఇచ్చామని, ఏ మున్సిపాలిటీకి అలా ఇవ్వలేదని ముఖ్యమంత్రి హర్షద్వానాల మధ్య ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ గా ఎజికే ధన్యవాదాలు చెబుతూ, అడిగిన రెండు రోడ్లలో ఒకటి సగం కాదని, ఒకరోడ్డు బడ్జట్ 1 లక్ష 20 వేలు అని, రెండవ రోడ్డు ఖర్చు 50 వేలు అని, 1 లక్ష ఇరవై వేల రోడ్డు కనుక మంజూరు చేస్తే వారు చెప్పిన లెక్క ఒప్పుకుంటాం అని జనం చప్పట్ల మధ్య అన్నారు. సంజీవరెడ్డి బిత్తరపోయి ఆ రోడ్డు ఇస్తున్నట్లు ప్రకటించవలసి వచ్చింది. తరువాత ట్రావిలర్స్ బంగళాకు వెళ్ళి స్థానిక ఎం.ఎల్.ఎ. ఆలపాటి వెంక్రటామయ్యను సంజీవరెడ్డి బాగా చీవాట్లు పెట్టాడట. నన్ను పిలిచి వేధిక మీద వెక్కిరించేటట్లు చేస్తావా అని.

అదే సంజీవ రెడ్డికి ముఖ్యమంత్రిగా శ్రీవెంకటేశ్వరర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. అప్పుడు గోవిందరాజుల నాయుడు-వైస్ ఛాన్సలర్, రామానుజల నాయుడు-రిజిస్ట్రార్, సెనేట్ అనుమతి లేకుండా అలా ఇచ్చినందుకు స్థానిక సంస్థల సెనేట్ సభ్యుడు ఎన్. విజయ్ రాజ్ కుమార్ అది చెల్లదని కోర్టులో దావా వేశారు. కేసు తేలేవరకు పేరు ముందు డాక్టర్ అని వాడరాదని ఛీప్ సెక్రటరీ భగవాన్ దాస్ ఉత్తరువులు జారీ చేశారు. కేసు నెల్లూరులో విచారణ జరిగింది. ఆవుల గోపాలకృష్ణమూర్తి అడ్వకేటుగా, యూనివర్శిటీ అధికారులను బోను ఎక్కించి నీళ్ళు తాగించారు. చివరకు తట్టుకోలేని జడ్జి విచారణ అనంతరం అది తన పరిధిలో లేదని, చిత్తూరు ప్రాంతంలో కేసు పెట్టుకోమని చెప్పారు. ఆ నాటి పరిస్థితి అది.

ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య, ఉన్నప్పుడు విజయవాడలో ఒక కొండ గుట్టమీద దళిత బాలికల హాస్టల్ సందర్శన కార్యక్రమం పెట్టుకొని వచ్చారు. పాత బెజవాడలో ఉన్న ఈ హాస్టల్ దగ్గర సంజీవయ్య కారు దిగి, ‘కొండపైకి ఎక్కాలా, నా వల్ల కాదు’ అని కార్యక్రమం మానుకుని వెళ్ళిపోయారు. ఈ వార్త తెలిసి ఎజికే, ‘ముఖ్యమంత్రి పదవికి దేక గలిగినవాడు దళిత బాలికల కోసం గుట్ట ఎక్కలేక పోయాడా’ అన్నాడు. అది ఆంధ్ర పత్రిక పతాక శీర్షికలో ప్రచురించింది. ఆ దెబ్బతో సంజీవయ్య వెంటనే కార్యక్రమం ఏర్పాటు చేసుకుని హాస్టల్ కు వెళ్ళి చూసి, ఎజికే కి ఉత్తరం రాశారు. ‘మీరన్నది నాకు బాగా తగిలింది, కళ్ళు తెరిపించింది’ అని.

1940 ప్రాంతాలలో కమ్యూనిస్ట్ పార్టీ వారు ఒక రహస్య తీర్మానం చేసి ఎమ్.ఎన్. రాయ్ పార్టీలోని రాడికల్ డెమోక్రాట్స్ తో మాట్లాడరాదని నిర్ణయించుకున్నారు. తెనాలి బోసు రోడ్డులో ఒకనాడు ఎజికే, కమ్యూనిస్ట్ నాయకుడు మాకినేని బసవ పున్నయ్య ఎదురయ్యారు. వారు ఎసి కాలేజీ, గుంటూరులో క్లాస్ మేట్స్, బసవ పున్నయ్య ముఖం తిప్పుకుని ఎరగనట్లు వెళుతుంటే, ఆయన వెనక చాలామంది అనుచరులు కూడా ఉన్నారు. అప్పటికే రహస్య తీర్మానం సంగతి తెలిసిన ఎజికే కావాలని, ఏడిపించటానికి బసవ పున్నయ్యను పిలిచి మాట్లాడబోతుంటే, నాకు అర్జంటు పని ఉన్నది వెళ్ళాలి అన్నాడట. ఆగవోయ్ ‘విప్లవాలు పరిగెత్తటం లేదులే’ అని ఎజికే 10 నిమిషాలు పిచ్చాపాటి కబుర్లతో నడివీధిన నిలిపేసరికి కమ్యూనిస్టులు లబలబ కొట్టుకున్నారట.

ఎజికే 1938 ప్రాంతాలలో లక్నోలో ఎం.ఏ. ఎల్.ఎల్.బి. చదివారు. ఆయన చదువుతుండగానే సుబాస్ చంద్రబోస్ కాంగ్రేస్ అధ్యక్షులుగా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. గాంధీజీ అనుచరులను కార్యవర్గంలో వేసుకోవద్దని ఎమ్.ఎన్. రాయ్ ఆనాడు బోసుకి సలహా చెప్పారు. కానీ ఆయన మంచితనానికి పోయి గాంధేయులను కార్యవర్గంలోకి తీసుకుంటే వారే ద్రోహం చేసి బోసుని ఒక సంవత్సరంలోనే దింపేశారు. అలా పదవి కోల్పోయిన బోసు లక్నో వస్తే స్టేషన్ కు ఎవ్వరూ రాకపోవటం, పలకరించే దిక్కు లేకపోవటం ఆశ్చర్యకరమైనదని ఎ.జి.కె. అన్నారు. విద్యార్ధిగా బోసును తన హాస్టల్ గదికి తీసుకు వచ్చి, సహచరులతో భోజనాలు చేసి బోసును ఆదరించి, గెలిచినా, ఓడినా, మాకు వ్యక్తిత్వం ముఖ్యమని రాయ్ అనుచరులుగా ఎజికే చెప్పటం గొప్ప సత్యం.

ఎజికే ఎమ్.ఎన్. రాయ్ శిష్యుడు అయినా గుడ్డి అనుచరుడు కాడు. 1948లో డెహరాడూమ్ లో జరిగిన శిక్షణ చర్చా శిభిరంలో కొరియా విషయమై రాయ్ తో తీవ్రంగా విభేదించాడు. రాయ్ రెండు రోజులు మాట్లాడలేదట. చివరకు ఆయనే దిగివచ్చి మళ్ళీ ఎజికే చెప్పిందే సరైనదని సర్ధుకు పోయాడట.

ఆచార్య ఎన్.జి. రంగా తరచు, ఎజికే దగ్గరకు సలహాలకు వచ్చేవారు. 1951లోనే కృషీకార్ లోక్ పార్టీ పెట్టినప్పుడు కేంద్రంపై దృష్టి పెడితే రాష్ట్రంలో ఊడుతుందని రంగాను రాడికల్ హూమనిస్ట్ పత్రికద్వారా ఎజికే హెచ్చరించారు. అప్పటి నుండి అప్పుడప్పుడు రాజకీయాల్లో సలహాలకు ఎజికేను సంప్రదించటం ఆనవాయితీ అయింది.

ఆలపాటి వెంకట రామయ్య, తెనాలి కాంగ్రెస్ ఎమ్.ఎల్.ఎ.గా, మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు స్థానిక పరిపాలన గురించి బిల్లు రాసిపెట్టి ఎజికె సహాయపడ్డాడు. ఆ బిల్లు చూసి చాలామంది ఆలపాటిని మెచ్చుకున్నారు. అతడిని మూడక్షరాల పండితుడని ఎజికే గమ్మత్తుగా అనేవాడు. ఎమ్.ఎల్.ఎ. అనే అక్షరాలను దృష్టిలో పెట్టుకు అలా నవ్వులాట పట్టించేవాడు.

ఎజికే దగ్గరకి వచ్చిన కవులు, ఎప్పుడైనా కుల ప్రస్థావన తెస్తుండేవారు. అప్పుడు ఆయన వార్ని ఉద్దేశించి “మీరు బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, రెడ్డి, కమ్మ, కాపు కావచ్చు, దళితులు కావచ్చు, కానీ మనుషులు ఎప్పుడౌతారు” అని అన్నప్పుడు వారు అవాక్కు అయ్యేవారు.

అలాంటి ఎజికేని గుర్తించిన అమెరికా ప్రభుత్వం 1963లో బి.ఎస్.ఆర్. కృష్ణ ద్వారా ప్రత్యేక ఆహ్వానం పంపి తమ దేశం సందర్శించమని కోరారు. కృష్ణ తెనాలి వచ్చిన నాడు (1963) ఎజికే కుమార్తె జయశ్రీ పెళ్ళిరోజు. మేకా రాజగోపాల్ పెళ్ళికుమారుడు. ఆవుల సాంబశివరావు పెళ్ళి నిర్వహిస్తూ కవుల గోష్టి జరిపారు. అందరూ ఆవుల-మేకల వియ్యం అంటూ కవిత్వాలు చదివారు. ఎజికే గుర్తింపుని మాత్రం ఎవరూ విస్మరించలేక పోయారు.

Wednesday, April 23, 2008

పుస్తక సమీక్ష

బిలియన్స్ అండ్ బిలియన్స్
Carl Sagan : Billions and Billions








కార్ల్ శాగన్ చివరి పుస్తకం బిలియన్స్ అండ్ బిలియన్స్. ఆయన భార్య చివరి మాట జోడించి, పాఠకులను ద్రవింపజేసే మమత చూపారు. కార్ల్ శాగన్ మరణానంతరం ఆమె అందుకున్న లక్షలాది సానుభూతి లేఖలను బట్టి శాగన్ భావాలలో బ్రతికే వున్నాడని డ్రుయన్ రాశారు.
శాగన్ ఇతర పుస్తకాలవలె యీ చివరి గ్రంథం కూడా జీవితం, మరణం, భవిష్యత్తు గురించి రాయగా, విపరీతంగా జనాకర్షణ పొందినది. సైన్స్ ను, మానవాళికి సాంకేతిక రంగ ప్రమాదాలను, నివారణను శాగన్ అతి సున్నితంగా చర్చించి, మార్గాంతరాలను చూపడం యిందలి ప్రత్యేకత.
రెండవ అధ్యాయం ఎత్తుగడలోనే చదరంగం కథను స్వీకరించారు. తొలుత యిది కనుగొన్న పర్ష్యా మంత్రి అద్భుత చర్యకు రాజు ఆకర్షితుడై, ఏం కావాలని కోరుకోమన్నాడట. 64 గడులకూ మొదటి గడికి ఒక గోధుమ గింజతో మొదలెట్టి, రెట్టింపు చేసుకుంటూ పోయి, 64వ గడికి ఎంత ధాన్యం వస్తే అంత యిప్పించమని మంత్రి అడిగాడట. అదేం కోరిక. డబ్బు, స్త్రీలు, భవనాలు, ఆస్తులు, అలాంటివి కోరుకోమన్నాడ రాజు. మంత్రి వినయంగా తానడిగింది యిప్పిస్తే చాలన్నాడట. సరేనని, లెక్క మొదలెడితే, మొదటి గడికి ఒక గోధుమ గింజ రెండవ గడికి రెండు, మూడో గడికి 4, అలా హెచ్చిస్తూ పోయారట. 64వ గడి వచ్చేసరికి రాజుగారి ధాన్యాగారం చాలలేదు సరిగదా, అప్పు పడి, రాజ్యం అప్పగించాల్సి వచ్చిందట.
ఈ ఉదాహరణను శాగన్ పేర్కొని భారత దేశంలో కూడా లెక్కలు కనిపెట్టిన ఖ్యాతి ప్రస్తావించారు. ఆ లెక్కలు మన జనాభాకు అన్వయిస్తే ఎంత ముంచుక పోయే స్థితి వస్తుందో చూడమన్నారు.
వాతావరణ కాలుష్యాన్ని గురించి శాగన్ రాసింది మరీ ఆకర్షణీయంగా, హెచ్చరికగా బాగా వున్నది. ప్రపంచం యావత్తూ కాలుష్యానికి తోడ్పడుతుండగా అందులో అమెరికా 20 శాతం అందిస్తున్న విషయం గుర్తు చేశారు.
భూమికి 25 కిలో మీటర్లు ఎత్తులో వున్న ఓ జోన్ పొరకు బెజ్జం పడింది. అంటార్కిటికా వద్ద తొలుత సైంటిస్టులు యిది కనుగొన్నారు. అయితే ఏమిటి? సూర్యరశ్మిలో వుండే ఆల్ట్రా వైలేట్ కిరణాలు సూటిగా మన మీద పడతాయి. అది కాన్యర్ వంటి రోగాలకు దారితీస్తుంది. శరీరానికి వుండే రోగనిరోధక శక్తి పోతుంది. ఓజోన్ పొరకు బెజ్జం పడడానికి కారణం మనమే. క్లోరోఫ్లూరో కార్బన్లు వాడటం వలన యీ ప్రమాదం ఏర్పడింది. మనం వాడే రిఫ్రిజిరేషన్, సెంట్లు, అనేక పరిశ్రమలలో వాడే స్ప్రేలు, ఇన్సులేషన్, సాల్వెంట్స్ లో యిది వున్నది. ఇందులో కణాలు ఆకాశంలో ఓజోన్ పొరలోని కణాల్ని ఎదుర్కొంటున్నాయి. అదే ప్రమాదం. భవిష్యత్తులో యీ ప్రమాదం యింకా పెరిగిపోతుంది. శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తే, తొలుత పారిశ్రామికులు నిరోధించారు. తరువాత ఒప్పుకొని, వీటి వాడకాన్ని తగ్గించడానికి అంగీకరించారు. పూర్తిగా వీటిని ఆపడానికి కొంతకాలం పట్టవచ్చు. కాని ఆపి తీరాలని, భవిష్యత్తు తరాల సంక్షేమకారుడుగా కార్ల్ శాగన్ స్పష్టం చేశారు. ఎ పీస్ ఆఫ్ స్కై యీజ్ మిస్సింగ్ అని ఈ అధ్యాయానికి చక్కగా శీర్షిక పెట్టారు.
సైన్స్ - మతం గురించి కార్ల్ శాగన్ చేసిన చర్య ఉత్తేజ పూరితంగా, మానవ వాదంతో యిమిడి వున్నది. రాజ్యాధిపతులు, మతాధిపతులు ఏర్పరచిన సంయుక్త సమావేశాలు 1988 ఏప్రిల్ లో ఆక్స్ ఫర్డ్ లోనూ, 1990 జనవరిలో మాస్కోలోనూ జరిగాయి. అందులో పాల్గొన్న శాస్త్రజ్ఞుడుగా శాగన్ తన అనుభవాల్ని రాశారు. వాతావరణ కాలుష్యాన్ని ఆపి, భూమిని కాపాడుకొవాల్సిన బాధ్యత గురించి ఒక విజ్ఞప్తి చేయగా దానిపై మతాల వారు, రాజకీయ నాయకులు ఒడంబడికపై సంతకాలు చేశారు. అందుకే యీ విషయంలో మతం - శాస్త్రం చేరువ అయ్యాయని శాగన్ రాశాడు. ఆ సందర్భంగా ఒక ఆసక్తికర విషయం ప్రస్తావించాడు.
వివిధ మతాల వారు సమావేశంలో ప్రార్థనలు చేశారు. అలాగే భారత వేద పండితుడు ఓం మంత్రాన్ని ఉచ్ఛరించగా అది అందరూ అనుకరించారట. సోవియట్ విదేశాంగ మంత్రి షెవర్ నాట్టి కూడా అందులో చేరి ఓం పఠనం చేశాడట. కాని గొర్బచేవ్ మాత్రం మౌనం దాల్చాడట. ఆయన వెనకే లెనిన్ విగ్రహం వున్నది.
మన శత్రువులు అనే అధ్యాయంలో ఇంకో విశేషాన్ని శాగన్ బయటపెట్టారు. అమెరికా రష్యాలు శాగన్ వ్యాసాన్ని ఒకేసారి ప్రచురించాయి. అమెరికాలో పెరేడ్ పత్రిక. రష్యాలో ఓగోన్యాక్ (Ogonyak) ఈ వ్యాసాన్ని ప్రచురించి చర్చకు పెట్టారు. 1988లో జరిగిన విశేషం యిది. మనకు వేరే ప్రపంచాల నుండి ఎవరో వచ్చి దాడి చేసే ప్రమాదం లేదనీ, మనం సహజ వనరులను తగలేయడంలో ప్రమాదం వుందనీ, బొగ్గు తగలేసి కార్బన్ డయాక్సైడ్ పెంచి, వాతారవణం వేడెక్కేటట్లు చేస్తున్నామని శాగన్ హెచ్చరించారు. అమెరికా-రష్యాలు యిది ఆపితే, ఎడారులుగా కొన్ని ప్రాంతాలు మారిపోకుండా వుంటాయన్నారు.
నిజం గురించి అటు అమెరికాకు గాని, యిటు సోవియట్ యూనియన్ కు గాని గుత్తాధిపత్యం లేదని శాగన్ అన్నారు. ఆ సందర్భంగా లెనిన్ మాటల్ని శాగన్ ఉదహరించారు. సోవియట్ యూనియన్ లో శాగన్ వ్యాసంలోని భాగాలను, లెనిన్ పై వ్యాఖ్యలను సెన్సార్ చేశారు. ఇప్పుడు తమదే తప్పు అని, లెనిన్ ప్రస్తావన చేసిన శాగన్ సరిగానే ఉదహరించాడని అర్బటోల్ తన స్మృతులలో ప్రకటించారు.
గర్భస్రావంపై చర్చించిన అధ్యాయంలో జీవనాన్ని హత్య చేయడం అంటే ఏమిటనే విషయంపై శాగన్ సునిశిత ప్రశ్నలు వేశారు. ప్రతి మనిషి రేతస్సులో భూమిని నింపగల శక్తి వున్నదనీ, రేతస్సు వృధా అవుతుంటే, అదంతా హత్యగా పరిగణించాలా అన్నారు. ప్రపంచ సంక్షేమ నిమిత్తం ఇస్లాం కూడా కుటుంబ నియంత్రణ పాటించాలని సిరియాకు చెందిన గ్రాండ్ ముప్తి 1990 ప్రపంచ సభలో చెప్పడం అందరినీ ఆకట్టుకున్న విషయం అని శాగన్ జ్ఞప్తి చేశారు.
మరణాన్ని సహజంగా స్వీకరించిన శాగన్ తన గొప్పతనాన్ని యీ గ్రంథంలో చూపాడు. సైన్స్ ను సామాన్యులకు అందించిన శాగన్ శ్లాఘనీయుడు.

Monday, April 21, 2008

సాహితి పరులతో సరసాలు-18

Puranam Subramanya Sarma


పురాణం (ఎడమ), శ్రీశ్రీ (కుడి) తో స్వాతి కార్యాలయంలో

పురాణం సుబ్రహ్మణ్య శర్మ
(1929 - 1996)
పురాణం సీత పేరిట ఆంధ్రజ్యోతి వారపత్రికలో కొన్నేళ్ళు రాసిన సుబ్రహ్మణ్యశర్మ వాడి, పలుకు వున్న విమర్శకుడు. గుచ్చుకునేటట్లు అనగలడు, అనిపించుకోగలడు.
చిన్న ఉద్యోగాలు కొన్ని చేసినా ఆంధ్రజ్యోతిలో ఎక్కువ రోజులు కుదురుగా పనిచేశారు. ఎందరో రచయితలను ప్రోత్సహించారు. కొత్త దనం వుంటే యిట్టే పట్టేసేవారు. ఉదయం దిన పత్రికలో కొద్దిరోజులు పనిచేశారు.
రిటైర్ అయిన తరువాత హైదరాబాద్ అశోక్ నగర్ లో వుండగా, నేనూ, ఆలపాటి రవీంద్రనాధ్ కూడ బలుకుకొని వెళ్ళాం. మధురవాణి ఇంటర్వ్యూ శీర్షిక చర్చించాం. పురాణంకు అది బాగా నచ్చింది. తన పలుకు, నుడికారం, విమర్శ, ప్రతిభ అంతా రంగరించి ఆ శీర్షిక ప్రతి నెలా రాశారు. బాగా ఆకట్టుకున్నది. ఒకటి రెండు చోట్ల నా ప్రస్తావనకూడా ప్రవేశ పెట్టారు.
పురాణం అతిగా పోయినచోట రవీంద్రనాథ్ నిర్థాక్షణ్యంగా కత్తిరించేవాడు. పురాణం అందుకు బాధ పడేవాడుకాదు. త్రిపురనేని రామస్వామి, నార్ల వెంకటేశ్వరరావులపై రాసిన చోట నా ప్రస్తావన తెచ్చారు. నార్లపై రాసిన దగ్గర కె.ఎల్.ఎన్ ప్రసాద్ వివాదాన్ని రవీంద్రనాథ్ నిర్ధాక్షిణ్యంగా తొలగించారు. అలాగే సమకాలీకులపై రాయడానికి కూడా అంగీకరించలేదు. మొత్తం మీద ఆశీర్షిక బాగా ఫలించింది. మాటల్లో రాతల్లో చమత్కారం పురాణం సొత్తు.
మేమంతా కలసి మధ్యం సేవించినప్పుడు ఎన్నో విశేషాలు, తెరవెనుక జరిగినవి చెప్పేవారు. ఇందులో సి. నరసింహారావు, తుమ్మల గోపాలరావు కొన్ని సార్లు పాల్గొన్నారు. వెల్లంకి విశ్వేశ్వరరావు విజయవాడ లొ సుప్రసిద్ద కమ్మ్యూనిస్టు.ఆయన ఇంట్లొ మొదటి అంతస్తులో పురాణం అద్దెకు వుండే వారు.ఒక రోజు బాగా మద్యం సేవించి, రాత్రి సమయాన,ఇంటికి, వచ్చేసరికి అద్దె వసూలు కు వెల్లంకి వారు, కోపంగా నిలబడి వున్నారు. అడుగులు తడబడుతూ మెట్లు ఎక్కలేక , ఏమి కమ్యూనిస్టులు వీరు , పేదల ఉద్దరణకు వున్నామంటారు, మెట్టు మెట్టుకు మధ్య, మరో మెట్టు కట్టాడు నేను ఇంటికి వచ్చే సరికి అన్నాడు. ఆది విన్న వెల్లంకి, నవ్వు పట్టలేక, అద్దె గురించి అడగకనే, లోనికి వెళ్ళిపోయారు.
త్రిపురనేని రామస్వామిపై నేను విమర్శిస్తూ రాస్తే, పురాణం అభ్యంతరాలు కొట్టిపారేసి, ఉదయంలో ప్రచురించి, తరువాత విమర్శ శీర్షిక నడిపారు. నార్ల దగ్గర తోకాడించ బోయిన పురాణంకు ఎదురు దెబ్బలు తగిలాయి. గురజాడపై విమర్శలు, పరిశోధనకు సంబంధించిన విషయమై అవసరాల సూర్యారావు పాత్రను వెనకేసుకొచ్చి, నార్లను విమర్శించిన, పురాణానికి, త్వరలోనే తన తప్పు తెలిసింది. నార్లకు క్షమాపణ చెప్పి, ఉద్యోగం నిలబెట్టుకున్నాడు. నండూరి రామమోహనరావు గుమస్తా ఎడిటర్ అని నార్ల అంటే, పురాణం ఆమోదముద్ర వేశారు.
వ్యక్తుల్ని విమర్శనాత్మకమైన అంచనా వేసేవారు. బి.ఎస్.ఆర్. కృష్ణ జన్మదినానికి గుంటూరులో మాట్లాడుతూ, సింగిల్ కాలం వలె నిటారుగా వుండే బి.ఎస్.ఆర్., సహృదయుడు, సచ్చేలుడని చెప్పారు. అదేమిటో గాని పురాణం చనిపోయేవరకూ ఎప్పుడూ ఆర్థిక యిబ్బందులతోనే వుండేవాడు.
విషయాల్ని కొత్త కోణం నుంచి కూడా పురాణం చూచేవాడు. తిట్లు రెండు రకాలని, బ్రాహ్మణులతిట్లు శాపనార్థాలతో వుంటాయనేవాడు. నీపాడె, పచ్చి బద్దలు, తలపండు పగల, యిత్యాదులు. శూద్రులతిట్లు సృష్టి కార్యానికి చెందుతాయట!

రచనలు : మధురవాణి ఇంటర్వూలు, కథాసాగరం, చప్రాసి, కలకానిది, నీతికథా సంపుటాలు, బృందావనం, ఇడియట్, జేబులో బొమ్మ, చంద్రునికో నూలుపోగు, (జీవనలీల-అనువాదం), ఇల్లాలి ముచ్చట్లు (వ్యాసాలు).

Sunday, April 20, 2008

పుస్తక సమీక్ష

మేధావులను ఏలా అంచనావేయటం?
PORTRAITS by Edward Shils. Introduction, edited Joseph Epstein, The University of Chicago Press, London & Chicago, PP 255.

ఒకసారి మనదేశం నుండి ఒకాయన “ఎడ్వర్డ్ షిల్స్, సోషల్ సైంటిస్ట్, ఇంగ్లండ్” అని ఉత్తరం, రాస్తే అది చేరింది. ఇది బ్రిటిష్ పోస్టల్ విధానపు గొప్పతనం చాటుతుండగా, ఎడ్వర్డ్ షిల్స్ ఖ్యాతిని కూడా చూపుతున్నది.
సోషియాలజి అంటే కొద్దో గొప్పో తెలిసిన ప్రతివారికీ ఎడ్వర్డ్ షిల్స్ పరిచయమే. ప్రపంచ మేధావుల గురించి రాసిన షిల్స్, తానూ ఆ కోవలోని వాడే. అతని పుస్తకం :



10 మంది మేధావుల గురించి ఎడ్వర్డ్ షిల్స్ రాసిన వ్యాసాలను ఎంపిక చేసి, ఆయన మరణానంతరం ప్రచురించారు. 1995 జనవరి 23న షిల్స్ 84వ ఏట కాన్సర్ తో చికాగోలో మరణించాడు. అమెరికన్ స్కాలర్ అనే మేధావుల ప్రతిక సంపాదకుడు జోసెఫ్ ఎఫ్ స్టైన్, షిల్స్ గురించి సుదీర్ఘ పీఠిక రాసి, ఆసక్తికరంగా అందించారు.
మనదేశం నుండి నీరద్ చౌదరి మాత్రమే యిందులో వుండగా, మిగిలిన వారు రేమండ్ ఆరన్, సిడ్నీ హుక్, రాబర్డ్ మేనార్క్ హచిన్స్, లె పోల్డ్ లబెజ్, హెరాల్డ్ లా స్కీ, కార్ల్ మన్ హం, అర్నాల్డొ డాంటెమొమిగ్లి యానో, జాన్ యు, నెఫ్, లియోజి లార్డ్ వున్నారు. షిల్స్ రాసిన మేధావుల పీఠిక కూడా వుంది.
ఎడ్వర్డ్ షిల్స్ మన దేశ మేధావులకు సుపరిచితుడు. 1956 నుండి 57 వరకు ఇండియాలో గడిపిన షిల్స్, ఆ తరువాత యేటా ఒకసారి వచ్చి వెడుతుండేవాడు 1967 వరకూ. అప్పుడే ఒకసారి బొంబాయిలో 1964లో ఎ.బి. షా తో ఆయన్ను కలిశాను. మినర్వా అనే పత్రిక నిర్వహించిన షిల్స్ అనేక రచనలు చేశాడు. ఎన్ కౌంటర్ ఇంగ్లీషు మాసపత్రికలో రాశాడు. The Bulletion of the Atomic Scientists అనేది కూడా లియోజి లార్డ్ తో కలసి నిర్వహించాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, క్రేంబ్రిడ్జి, చికాగో యూనివర్శిటీలలో ప్రొఫెసర్ గా పనిచేసిన ఎడ్వర్డ్ షిల్స్ కు సమకాలీన ప్రపంచ మేధావులతో సన్నిహిత పరిచయం వుంది. భారత మేధావుల గురించి ఒక పెద్ద వ్యాసం రాశాడు, అలాగే యూరోప్ మేధావుల గురించి కూడా.
ఆర్నాల్డొ మొమిగ్లియానో (Amaldo Momigliano)ను తన గురువుగా షిల్స్ భావించాడు. ఆయన మెచ్చుకున్న మేధావులలో ఎ.ఎస్. నయపాల్, ఫిలిప్ లార్కిన్, పీటర్ బ్రౌన్, అలెగ్జాండర్ సోల్జినిట్సిన్, బార్చగాహి ఇ.హెచ్. గోంబ్రిక్, ఎలికెడోరి వున్నారు.
రేడియో, టి.వి. సైతం వాడకుండా, న్యూయార్క్ టైమ్స్ కే పరిమితమైన ఎడ్వర్డ్ షిల్స్, సాహిత్యం ద్వారా సోషియాలజిలోకి వచ్చిన మేధావి, ఆయన రచనలు ప్రామాణికంగా ఉన్నత స్థాయిలో వుండేవి.
చికాగో విశ్వవిద్యాలయంలో ఒకప్పుడు ఎంత వున్నతస్థాయి పరిశోధన, పరిశీలన, బోధన కొనసాగిందో షిల్ప్ పీఠికలో అవగాహన అవుతుంది. హెరాల్డ్ లాసెవెల్, టాల్కాట్ పార్సన్స్, రాబర్డ్ పార్క్, ఫ్రాంక్ నైట్ వంటి వారు ఉద్దండులుగా వున్న యూనివర్శిటీలో షిల్స్ రాటు తేలాడు. వారి సహచర్యం, బోధనా పటిమలు స్ఫురణకు తెచ్చుకొని, ప్రస్తుతించాడు. కాని ఎక్కడా అతిశయోక్తి, భట్రాజీయం కనిపించదు. షిల్స్ అంచనాలు మాత్రం ఆకర్షణీయంగా వున్నాయి. లూయిస్ విర్త్ (Louise Wirth) తనపై చూపిన ప్రభావాన్ని షిల్స్ వివరించాడు.
జాన్ నెఫ్ నాడు చికాగో విశ్వ విద్యాలయంలో పేరొందిన ఆర్థిక శాస్త్రవేత్త, అతని లెక్చర్స్ కూడా షిల్స్ విన్నాడు. అప్పటికే మాక్స్ వెబర్, ఎమిలిడర్క్ హైగెల సోషియాలజీతో ప్రభావితుడైన షిల్స్ చికాగో వాతావరణంలో పైస్థాయికి ఎదిగాడు. ఆ పరిస్థితులు నేడు మారిపోయాయని, ఫెడరల్ ప్రభుత్వ యిష్టాయిష్టాలపై వుండడం, నిధులకోసం ట్రస్ట్రీలపై ఆధారపడడం, గిరిగీసుకొని గూడుకట్టుకొని ముడుచుక పోవడం నేడు స్పష్టంగా వున్నదనీ షిల్స్ విచారం వ్యక్తపరిచాడు. నేటికీ చికాగోలో ఉన్నతస్థాయి విద్యావాతావరణం వున్నదననే వారితో షిల్స్ అంగీకరించలేక పోయాడు. తరాల అంతరం కనిపిస్తున్నదన్నాడు. షిల్స్. ఒక్కొక్క వ్యక్తినీ కూలంకషంగా పరిశీలించిన వ్యాసాలు వున్నాయి.

నీరద్ సి ఛౌదరి : షిల్స్ చిత్రణలో ఒక భారతీయ మేధావి నీరద్ ఛౌదరి చోటు చేసుకున్నాడు. ఆ విధంగా ప్రపంచ మేధావుల కోవలో నీరద్ ఛౌదరి నిలబడ్డాడు. షిల్స్ కు బాగా పరిచితుడు, యిష్టుడైన మరొక భారతీయ నవలాకారుడు ఆర్.కె. నారాయణ.



1921లో కలకత్తా యూనివర్శిటీలో డిగ్రీ పొందలేక, వదిలేసిన నీరద్ ఛౌదరి ఆలిండియా రేడియోలో వుద్యోగం చేస్తూ పదవీ విరమణానంతరం ఇంగ్లాండ్ ప్రవాసం వెళ్ళాడు. రచయితగా భారతదేశంలో పేరున్నా బ్రతకడానికి తగిన ఆధారవృత్తి కాలేదు. అందుకని భార్య ప్రోత్సహంతో దేశాంతరం తరలి, పెద్ద పేరు పొందాడు. కాని దేశాన్ని ప్రేమించడం మానలేదు. ఆయన నిశిత పరిశీలన, విమర్శ చాలా మందికి నచ్చకపోయినా, అలాగే చెప్పదలచింది నిర్మొహమాటంగా రాశాడు. గాంధీజీ పట్ల తీవ్ర విమర్శ చేస్తూ, దేశాన్ని వెనక్కు నడిపించే ఆయన ధోరణిని దుయ్యబట్టాడు. ఆయన రచనలలో ది ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఏన్ అన్ నోన్ ఇండియన్, ది హేండ్ గ్రేట్ అనార్క్ అనే రెండూ గొప్పవని షిల్స్ పేర్కొన్నాడు. భారత సమాజం, పాశ్చాత్య భావాలతో సంబంధం అనేవి ఛౌదరి దృష్టిని బాగా ఆకట్టుకున్నాయి. 50 సంవత్సరాల ప్రాయంలో తొలిరచన ప్రచురించిన ఛౌదరి. ది ఇండియన్ ఇంటలెక్చువల్, హిందూయిజం కాంటినెంట్ ఆఫ్ సర్సి, క్లైవ్, మాక్స్ ముల్లర్ గురించి రాశాడు.
భారతీయుడుగా, బెంగాలీగా, యూరోప్ వాసిగా, స్పందించిన ఛౌదరి, విశిష్ట రచయితగానే నిలిచాడు. ప్రపంచ పౌరుడుగా పరిణమించాడు.
పొట్టిగా, బక్కపలచగా వుండే ఛౌదరి, ఎంతో ఆత్మ విశ్వాసంతో, నిబ్బరంగా రచన సాగించి తన జ్ఞాన పరిధిని విస్తరించి, ప్రతిభచూపాడని షిల్స్ రాశాడు. ఇంగ్లండ్ లో స్థిరపడినా ఇండియాను వదలని రచయిత ఛౌదరి, భారతదేశ విభజన పట్ల కూడా ఆయన బాధతో రచన చేసి Thy Handలో చూపాడు.
1955లో తొలుత యూరోప్ వెళ్ళిన ఛౌదరి అట్టే ప్రయాణం చేయని రచయిత, అంతవరకూ కలకత్తాలోనే గడిపిన ఛౌదరి, ప్రపంచాన్ని ఎంతో సన్నిహితంగా చూచాడని షిల్స్ అన్నాడు. బ్రహ్మసమాజ ప్రభావితుడైన ఛౌదరి, ఉదారవాది.
ఛౌదరి ఇంగ్లీషులో రాయడం మొదలు పెట్టిన తరువాత, ఇంగ్లండులో గుర్తింపు లభించింది. క్రమంగా ప్రపంచం గుర్తించింది. భారతదేశంలో ఆయనకు అవమానాలు నిరాదరణ వున్నా, తట్టుకొని నెగ్గుకొచ్చాడు. తలవంచని రచయితగా నీరద్ చౌదరి తన అభిప్రాయాలను చాటాడు. చాలా లోతుగా అధ్యయనం చేసిన అనంతరమే రచనకు ఉపక్రమించేవాడు.
ఎడ్వర్డ్ షిల్స్ తన అభిప్రాయాన్ని వెల్లడించి ఛౌదరికి న్యాయం చేకూర్చాడు.

సిడ్నీహుక్ : రాజకీయం పలికినా, తత్వం మాట్లాడినా సిడ్నీహుక్ హేతుబద్ధంగా రాసేవాడు. ఆయన ప్రభావం సమకాలీన సామాజిక శాస్త్రాలపై చాలా కనబడుతుంది. బెర్ట్రాండ్ రస్సెల్, జాన్ డ్యూయీ, మెరిస్ కోహెన్ ల శిష్యరికం చేసిన సిడ్నీ హుక్ మార్క్సిజం బాగా అధ్యయనం చేశాడు. సత్యాన్వేషణ అత్యున్నతమైనదని ఆయన సిద్ధాంతం. సోషలిస్టు భావాలు వున్నా, ప్రజాస్వామ్యాన్ని, వ్యక్తి స్వేచ్ఛను తప్పనిసరిగా ఆదరించాలన్నాడు.



ట్రాట్ స్కీ రక్షణ సంఘంలో పాల్గొన్న హుక్, మాస్కోలో మారణ కాండపై విచారణలో ఆసక్తి చూపి, సాంస్కృతిక స్వేచ్ఛ కావాలనే సంఘాల స్థాపనలో చేరాడు. ప్రజా జీవిత సమస్యలతో స్పందించిన హుక్, రేమాండ్ ఆరన్ వలె చాలా సందర్భాలలో పాల్గొని, వివాదాస్పద చర్యలకు దిగాడు. చాలా ప్రతిభావంతుడైన యూదుగా హుక్ తన జీవితంలో అత్యధిక కాలం న్యూయార్క్ లోనే గడిపాడు.

హెరాల్డ్ లాస్కీ : లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో 3 దశాబ్దాలు పనిచేసిన లాస్కీ పుస్తకాలు నేడు ఆ సంస్థలోనే చదవడం లేదు. కాని ఆయన సమకాలీనులు రాజకీయాల్లో లాస్కీ వద్ద వ్యాకరణం నేర్చారు. ప్రపంచ వ్యాప్తంగా లాస్కీ ప్రభావం వుండగా, వామ పక్షాలపై యీ ప్రభావం వీరారాధనకు పోయింది. 1993లో లాస్కీ శతజయంతి కూడా జరిపారు.



మాంచెస్టర్ లో సంపన్న యూదుకుటుంబంలో పుట్టిన హెరాల్డ్ లాస్కీ, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో బోధించి గొప్ప పేరు పొందాడు. తరువాతే లండన్ లో స్ధిరపడి 1950లో చనిపోయే వరకూ ఉపాధ్యాయుడుగా వున్నాడు. ఆయన రచయితే గాక, గొప్ప వక్త కూడా. ఇంగ్లండ్ రేషనిలిస్ట్ సంఘాధ్యక్షుడుగా కొంతకాలం వున్న లాస్కీ, లేబర్ పార్టీ సోషలిస్టుగా వున్నాడు. అయితే ఒకసారి నమ్మిన వాటిని మళ్ళీ మళ్ళీ రాస్తూ, కాలానుగుణంగా వస్తున్న మార్పుల్ని సరిగా గమనించకపోవడం ఆయన లోపం.
ఫేబియన్ సోషలిస్ట్ గా పరిణమించిన లాస్కీ, బలీయ కేంద్ర ప్రభుత్వం పట్ల విశ్వాసం ప్రకటించాడు. కొన్నాళ్ళు సిడ్నీ బీట్రిస్ వెబ్ సిద్ధాంతాల ప్రభావం కింద లాస్కీ వున్నాడు. సోవియట్ యూనియన్ ను సమర్థించి, అమెరికా సామ్రాజ్య వాదాన్ని లాస్కీ ఖండించాడు. లెప్ట్ బుక్ క్లబ్ స్థాపించిన లాస్కీ అటు ఉపాధ్యాయుడుగానూ యిటు ప్రపంచ వ్యవహారాలలోనూ ఆసక్తితో పాల్గొన్నాడు.

Wednesday, April 16, 2008

పుస్తక సమీక్ష

మదర్ తెరీసా ఇలా కూడా చేయగలదా!




















1. Christopher Hitchens : Missionary Position. Mother Terasa theory and practical.
2. Aroup Chatterjee : Mother Teresa The Final Verdict
(Meteor Books, 170/43, Lake Guaradens, Kolkata – 700 045. India. PP - 427)

1976లో హైదరాబాద్ లో నేను మదర్ తెరిసాను ఇంటర్వ్యూ చేసాను. అప్పట్లో ఆంధ్రజ్యోతి బ్యూరోఛీఫ్ గా పబ్లిక్ గార్డెన్స్ లో ఒక కార్యక్రమం సందర్భంగా మదర్ తెరిసాతో మాట్లాడాను. ఏది అడిగినా ఆమె సమాధానం ఒక్కటే. అంతా దైవకృప అనీ, పరిష్కారానికి ప్రార్థనే మార్గమని చెప్పడమే. చాలా నిరుత్సాహపడ్డాను. ఆమె నుండి నేను ఏవో సమాధానాలు ఆశించడం పొరపాటని గ్రహించాను. 2005లో కలకత్తాలో ఆమె స్థాపించిన పిల్లల శరనాలయాలు చూశాను.
కేన్సర్ బాధ భరించలేక ఒక రోగి మూలుగుతుంటే, జీసస్ క్రీస్తు నిన్న ముద్దెట్టుకుంటున్నాడని మదర్ తెరిసా అన్నది. అందుకు బదులుగా ఆ వ్యాధిగ్రస్తుడు, దయచేసి నన్ను ముద్దెట్టుకోవద్దని జీససంకు సిఫారసు చేయమని ఆమెను అడిగాడట.
ఇది జరిగింది కలకత్తాలోని మదర్ తెరిసా ఆశ్రమంలో. ఆమె నిర్వహించిన అనాధపిల్లల గృహాలలో పిల్లలకు రోగాలొస్తే, నయం కావడానికి మందులు వాడేవారు కాదు. ప్రార్థనలు చేసేవారు. అది వారి విశ్వాసం.
సుప్రసిద్ధ బ్రిటిష్ మెడికల్ మ్యాగ్ జైన్ లాన్సెట్ ఎడిటర్ రాబిన్ ఫాక్స్ స్వయంగా 1991లోనే కలకత్తాలో ఈ దృశ్యాలు చూచారు. అలాగే విశ్వవిఖ్యాత జర్నలిస్ట్ క్రిస్టోఫర్ హిచెన్స్ కూడా స్వయంగా మదర్ తెరిసాను కలసి ఇలాంటి సంఘటనలు గ్రహించారు.
అయితే మదర్ తెరిసాకు గుండెపోటు వస్తే, ప్రార్థన చేస్తూ, జీసస్ క్రీస్తు ముద్దు పెట్టుకున్నాడని సరిపెట్టుకున్నారా? స్టార్ హోటళ్ళ వంటి కార్పోరేట్ ఆస్పత్రులలో చేర్చారు. ఏమిటి విచక్షణ? అలాంటి ప్రశ్నలు భారతరత్న మదర్ తెరిసా గురించి వేయకూడదంతే.
మదర్ తెరిసా పేరుమార్చి, ఊరుమార్చి పోప్ జాన్ 2వ పాల్ దృష్టి ఆకర్షించి, నోబెల్ ప్రైజ్ 1979లో గ్రహించింది. భోపాల్ లో ఒకరోజు పొద్దున్నే నిద్రలేచే సరికి వేలాది కార్మికులు, పిల్లలు, తల్లులు యూనియన్ కార్పైడ్ విషవాయువులు కారణంగా చనిపోయారు. అమెరికా కంపెనీ యాజమాన్యం ఖంగుతిన్నది. కలకత్తానుండి హుటాహుటిన భోపాల్ చేరుకున్న మదర్ తెరిసా జీవకారుణ్యంతో ఒక విజ్ఞప్తి చేసింది. కార్మికులనుద్దేశించి ప్రకటన చేసిందనే భ్రమ పడితే పొరపాటే. యాజమాన్యాన్ని క్షమించమని మదర్ తెరిసా కోరింది. అది ఆమె ప్రత్యేకత.
అయితే ఆమెకు మద్దతుగా బలమైన క్రైస్తవమతం, ప్రభుత్వాలు, పాలకవర్గాలు ఉన్నందువల్ల సాగిపోయింది. మదర్ తెరిసా గురించి చాలామందికి చాలా విషయాలు తెలియవని, గుడ్డినమ్మకమే ఆధారమని గ్రహించాను. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు, నాలుగున్నర లక్షల స్త్రీలు, యువతులు చెరచబడి పారిపోయి, ఇండియా వచ్చారు. అయినా సరే, వారెవరూ గర్భం తొలిగించుకోరాదని అదంతా దేవుడిచ్చిన ప్రసాదం అని మదర్ తెరిసా ప్రకటించింది. అది ఆమె జీవకారుణ్యానికి, దైవభక్తికి గీటురాయి.
ఐర్లాండ్ లో కేథలిక్కులు అత్యధికంగా ఉన్నచోట గర్భస్రావం విడాకుల విషయం పార్లమెంటులో చర్చికి రాగా, మదర్ తెరిసా గూడా కల్పించుకుని తన మత ప్రకారం విడాకులు ససేమిరా వీలుకాదన్నది.
కానీ డయానా యువరాణి విడాకులు తీసుకుంటుంటే అది దైవేచ్ఛ అని మదర్ తెరిసా దీవించింది. ఆమెది నాలుకేనా అనబోకండి. డబ్బు, పలుకుబడి, ఆకర్షణ ఉన్న డయానా ప్రభావమే వేరు. మదర్ తెరిసా అక్కడ అవకాశవాదం చూపించింది.
ఇలాంటివి ఏకరువు పెట్టడం ఈ రివ్యూ ఉద్దేశం కాదు. లోకానికి తెలియని మదర్ తెరిసా గురించి నిజాలు చెప్పడమే ముఖ్యం. నీవు ఎన్ని నిజాలు చెప్పినా, మదర్ తెరిసా కీర్తి తగ్గదు అంటారా? వారికి నమస్కారాలు.
మదర్ తెరిసా (1910-1997) తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. ఆమె పుట్టింది మాసడోనియా దేశంలోని స్కోపీజేలో. సోదరి, సోదరుడు ఉన్నారు. క్రైస్తవమత శాఖలో నన్స్ అయ్యే ఒక సాంప్రదాయం పాటించి, 15వ యేట ఈమె ఐర్లాండ్ వెళ్ళింది. అక్కడి నుండి ఇండియాలో కలకత్తా చేరుకున్నది 1929లో. కొన్నాళ్ళు టీచర్ గా చేసి, చివరకు నన్ గా కుదురుకున్నది. తొలిపేరు ఆగ్నస్ గోన్షా బొజాక్సు.
చిన్నపిల్లల్ని సేకరించి, అనాధశరణాలయాలలో పెట్టడం క్రైస్తవ మత ప్రచారంలో ఒక భాగం. ఆ కార్యక్రమం మదర్ తెరిసా చేపట్టింది. చిన్నప్పుడు పిల్లల్ని రాబడితే, వారిని ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చనేది సెయింట్ ఆగస్టీన్ మూలసూత్రం. జెసూట్ ఫాదరీలు కూడా అదే పాటిస్తారు. నన్స్ కూడా ఆ దోవలో నడుస్తారు. మదర్ తెరిసాకు కలకత్తా వీధులు కావలసినంత మంది పిల్లల్ని అందించాయి. ఛారిటీస్ రావడం మొదలైంది. అనేకచోట్ల, వివిధ దేశాల్లో పిల్లల అనాధశరణాలయాలు స్థాపించారు.
పిల్లలకు జబ్బుగా ఉన్నప్పుడు ప్రార్థనలు చేయడం, చనిపోతున్న వారి పక్కన నిలబడి మత విధులు ఆచరించడం మదర్ తెరిసా ఆశ్రమం ఆచారమే. ఆ విధంగా మతమార్పిడి సున్నితంగా చాపకింద నీరువలె ఆచరించారు. అసలు ఉద్దేశం అది కాదంటుండేవారు. ప్రపంచ వ్యాప్తంగా కేథలిక్కులు, వారి సంస్థలు మదర్ తెరిసా సేవల్ని వూదరగొట్టాయి. పోప్ కూడా పొగిడాడు. అంతటితో గుర్తింపుతోబాటు డబ్బు కూడా రావడం మొదలైంది. డబ్బు సేకరించడానికి కేథలిక్కులు అనుసరించే అనేక మార్గాలలో ఛారిటీస్ సంస్థలు ముఖ్యం. మదర్ తెరిసా అరమరికలు లేకుండా కోట్లలో వసూళ్ళు చేసింది.
హైతీదేశపు పాలకులుగా, నరహంతకులుగా ప్రజల్ని నలుచుకుతిన్న డ్యువలియర్ కుటుంబానికి మదర్ తెరిసా సన్నిహితురాలైంది. జీన్ క్లాడ్ డ్యుయలిర్ ఆమెకు సన్మానాలు చేసి. డబ్బిచ్చింది. మదర్ తెరిసా తన సత్కారానికి సమాధానంగా డ్యువెలిర్ కుటుంబం పేదల ప్రేమికులని ఉపన్యసించింది. అంతకంటే పచ్చి అబద్దం మరొకటి ఉండదు.



అమెరికాలో అప్పులిస్తానని నిధులు సేకరించి, మోసగించిన ఛార్లెస్ కీటింగ్ జైల్లో పడ్డాడు. 252 మిలియన్ డాలర్ల మోసగాడికి జైలు శిక్ష తప్పించమని మదర్ తెరిసా జడ్జికి ఉత్తరం రాసింది. కీటింగ్ 1.25 మిలియన్ డాలర్లు ఆమె నిధికి ఇచ్చాడు. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తే కీటింగ్ చేతిలో మోసపోయిన కొందరినైనా ఆదుకుంటామని అడ్వకేట్ అడిగాడు. జవాబు లేదు. రాబర్డ్ మాక్స్ వెల్ అనే పత్రికా ప్రచురణ కర్త 450 మిలియన్ పౌండ్ల వాటాదార్ల దగ్గర మోసం చేసినప్పటికీ అతని వద్ద మదర్ తెరిసా డబ్బు పుచ్చుకున్నది. న్యూగినీ దేశంలో మత మార్పిడులు విపరీతంగా చేయించింది.
భారతదేశంలో ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితిని 1975 పొగుడుతూ ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఉద్యోగాలు బాగా లభిస్తున్నాయని, సమ్మెలు లేవని మదర్ తెరిసా సర్టిఫికేట్ ఇచ్చింది. అందువల్లనే అనలేం గానీ, ఆ తరువాతే ఆమెకు భారతరత్న లభించింది.
మదర్ తెరిసా వసూళ్ళ గురించి జర్మనీలో స్టెరన్ అనే పత్రిక విచారణ జరిపింది. నిధులు ఎంత, ఎక్కడ ఉన్నాయి? ఎలా ఖర్చు చేస్తున్నారని అడిగితే చెప్పలేదు. అంతా రహస్యం అన్నారు. స్టెర్న్ (STERN) పత్రికలో వాల్డర్ వ్యూలెన్ వెబర్ 1998 సెప్టెంబరు 1న సుదీర్ఘ విమర్శలు చేస్తూ మదర్ తెరిసా నిధులు, బాంకులో దాచి, పిల్లలకు ఖర్చు పెట్టనితీరు, చివరకు రోమ్ బాంకుకు చేర్చిన విధానం బయటపెట్టాడు. సూజన్ షీల్డ్స్ లోగడ మదర్ తెరిసా వద్ద పనిచేసి విసుగుతో బయటపడి న్యూయార్క్ లో డబ్బు విషయాలు వెల్లడించింది.
భారతదేశంలో డబ్బు పెట్టకుండా విదేశీ బాంకులలో దాచారు. చివరకు అంతా వాటికన్ బాంకుకు ముట్టింది. ఆమె చనిపోయేనాటికి ఒక్క న్యూయార్క్ లోనే 50 మిలియన్ డాలర్లు మూలుగుతున్నాయి. చట్టప్రకారం ఛారిటీస్ కు వసూలైన డబ్బు వేరే ఖర్చు చేయకూడదు. మదర్ తెరిసాను అడిగేదెవరు?
సుప్రసిద్ధ జర్నలిస్ట్ క్రిస్టోఫర్ హిచిన్స్, తారిక్ అలీ ఇంగ్లాండ్లో ఒక డాక్యుమెంటరీ తీసి (హెల్స్ ఏంజిల్) ఛానల్ 4లో మదర్ తెరిసా గుట్టు రట్టు చేసారు. ది మిషనరీ పొజిషన్ శీర్షికన హిచిన్స్ ఒక పుస్తకం వెలువరించారు. సునంద దత్త రే కూడా నిశిత పరిశీలనా వ్యాసాలు రాసారు. అరూప్ ఛటర్జీ న్యూ స్టేట్స్ మెన్ లో 1997 సెప్టెంబరు 26న తీవ్ర పరిశీలనా వ్యాసం రాసారు. ధీరూషా ఇండియాలో మతమార్పిడిలు చేసిన మదర్ తెరిసా గురించి రాసారు.
కలకత్తా వీధుల్లో మదర్ తెరిసాకు దానంగా వచ్చిన బట్టలు అమ్ముకోవడం, పేద పిల్లలు ఆమె ఆశ్రమాల్లో దిక్కులేక ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో బ్రతకడం వెల్లడయ్యాయి. ఏమైతేనేం, మతం ఆమెకు చాలా మంచి ప్రచారం చేసిపెట్టింది.
మదర్ తెరిసా చనిపోగానే, పోప్ జాన్ పాల్ కొత్త ఎత్తుగడకు నాంది పలికాడు. మత వ్యవస్థలో చనిపోయిన వ్యక్తిని సెయింట్ చెయ్యాలంటే రెండు అద్భుతాలు చూపాలి. కనీసం 5 సంవత్సరాలు వేచిఉండాలి. మత వ్యాపారంలో పోప్ ఆరితేరిన వ్యక్తి కనుక, అంత జాప్యం లేకుండా మదర్ తెరిసాను సెయింట్ చేయడానికి పూనుకున్నాడు. 19 అక్టోబర్ 2003లో అందుకు తొలిప్రక్రియ ప్రకటించాడు. ఇప్పుడు పోప్ బెనెడిక్ట్ 16 ఆది సాగిస్తున్నాడు.
ఇక అద్భుతాల సృష్టి ఎలా జరిగిందో చూద్దాం. పశ్చిమబెంగాల్ లో ఆదివాసి కుటుంబానికి చెందిన మోనికాబస్రా అనే ఆమెకు 5 గురు పిల్లలు. పేదకుటుంబం. ఆమెకు క్షయవ్యాధి ఉంది. కడుపులో పెద్ద గడ్డ వచ్చింది. బాలూర్ ఘటా ఆస్పత్రిలో డా. రంజన్ ముస్తాఫ్ చికిత్స చేయగా, కడుపులో గడ్డ పోయింది. మోనికాబస్రా ఒకనాడు కలలో మదర్ తెరిసాను చూసినట్లు, ఆమె సమాధిని సందర్శించినట్లు, దాని ఫలితంగా ఆమెకు ఉన్న కడుపులో గడ్డ మాయం అయినట్లు కథ సృష్టించారు. తొలుత అది సరైనది కాదని ఆమె భర్త సీకో అన్నాడు. తరువాత వారి పిల్లల్ని క్రైస్తవబడిలో చేర్చడం, వారికి కొంత భూమి సమకూర్చడంతో, అద్భుతకథ నిజమేనని చెప్పించారు.
మదర్ తెరిసా బ్రతికుండగా అనాధ పిల్లల పేర నిధులు వసూలు చేసి, రోమ్ కు చేరవేసే చనిపోయిన తరువాత సెయింట్ పేరిట డబ్బు వివిధ రూపాలలో వసూలు అవుతుంది. ఇది కొన్నాళ్లు సాగుతుంది. దీన్నే మతవ్యాపారం అనవచ్చు. ఇలా నిత్య నూతనంగా భక్తుల్ని వంచిస్తూ పోవడం ఆధ్యాత్మిక ప్రక్రియలో అనూచానంగా వస్తున్నది. ఇక మదర్ తెరిసా ఫోటోలు, విగ్రహాలు, రకరకాల చిహ్నాలకు ఏమాత్రం కొదవలేదు.
క్రిస్టొఫర్ హిచిన్స్ విమర్శల దృష్ట్యా పోప్ ఆయన్ను రోం పిలిపించి సాక్ష్యం తీసుకున్నారు. మదర్ తెరీసా మహత్తుల బూటక వ్యవహారంలో యిది జరిగింది.
అయినా మదర్ తెరిసాను సెయింట్ చేస్తే, కేథలిక్ వ్యాపారం బాగాజరుగు తుంది. అంటే ఏటా ఉత్సవాలు, విగ్రహాల ప్రతిష్టాపనలు, పూసల దండలు, పుస్తకాలు అమ్ము కోడం యిత్యాదులు ఎన్నో చేయవచ్చు. కేథలిక్కుల సెయింట్ వాణిజ్యం అంటే యిదే. జనంలో మూఢ విశ్వాసాలున్నంత వరకు యిది సాగిపోతుంటుంది.
అనాధ పిల్లల సంరక్షణ కోసం మదర్ తెరీసాకు చేరిన డబ్బు ఖర్చు పెడితే కలకత్తాలో అనాధ పిల్లలు వుండేవారే కాదు. మదర్ తెరీసా పట్ల కమ్యూనిస్టులు, భారతీయజనతా పార్టీ సైతం వూరుకొని, వెనకేసుకరావడం ఆమె మహిమేనేమో. 123 దేశాలలో ఆశ్రమాలు పెట్టి అతి జాగ్రత్తగా క్రైస్తవమత ప్రచారానికి పరోక్షంగా ప్రభావితం చేసిన మదర్ తెరీసా తగిన బహుమతి పొందింది.
నా మిత్రులు కె. రామచంద్రమూర్తి ఎడిటర్ గా వున్నప్పుడు ఆంధ్రజ్యోతిలో యీ సమీక్షను వేయజాలమన్నారు. మానవవాద పత్రికలు మాత్రం ప్రచురించాయి.

Sunday, April 13, 2008

సాహితి పరులతో సరసాలు-17 AGK





ఆవుల గోపాలకృష్ణమూర్తి

వ్యాసోపన్యాసక ఎ.జి.కె (1917-1966)

సాహిత్యంలో ఔచిత్యం వుండాలనేది ఆవుల గోపాలకృష్ణమూర్తి గట్టి అభిప్రాయం. ఆ దృష్టితోనే విశ్వనాధ సత్యనారాయణ మొదలు ప్రాచీన కవుల వరకూ తన విమర్శకు గురిచేశాడు. కవులు, రచయితలలో ఆవుల అంటే విపరీతాభిమానం గలవారు, తీవ్రంగా భయపడేవారు. రెండు వర్గాలుగా వుండేవారు. భయపడిన వారిలో విశ్వనాథ సత్యనారాయణ ప్రధముడు. ఆవుల వుంటే ఆ సభను విశ్వనాథ వచ్చేవాడు కాదు. వేయి పడగలు మొదలు రామాయణ కల్పవృక్షం వరకూ వుతికేసిన ఆవుల అంటే భయపడడం సహజం.

1941 ప్రాంతాలలో ఎజికె గాంధీజీ పై తీవ్ర విమర్శలతో కూడిన వ్యాసం ప్రచురిస్తే, ఎం.ఎన్. రాయ్ పక్షాన ఆంధ్రలో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడుగా వున్న అబ్బూరి రామకృష్ణరావు అదిరిపడ్డాడు. ఎం.ఎన్. రాయ్ కు ఫిర్యాదు చేశాడు. కాని రాయ్ వ్యాసంలో విషయం తెలిసి ఎజికెని సమర్ధించాడు.

ఎ.జి.కె. ఎం.ఎ.ఎల్.ఎల్.బి. చదివి అడ్వొకేట్ గా తెనాలిలో ప్రాక్టీసు చేశారు. తెలుగు, ఇంగ్లీషు సాహిత్యం రంగరించి వడపోసారు. కవులను, సాహితీ పరులను ఎజికె ఎంతగా ఆకర్షించారో చెప్పజాలం. ఏ మాత్రం పలుకు వున్న దన్నా ఎంతో ప్రోత్సహించేవారు. సాహిత్య వ్యాసాలు కొద్దిగానే రాసినా, ఉపన్యాసాలు చాలా చేశారు. కవులను ప్రోత్సహించారు. రాయించారు.
ఎం.ఎన్. రాయ్ అనుచరుడుగా ఎ.జి.కె. ఆంధ్రలో ప్రధాన పాత్ర వహించారు. సొంత ఖర్చులతో పత్రికలు, రాడికల్, రాడికల్ హ్యూమనిస్ట్, నడిపారు. ఇంగ్లీషు పత్రికలకు రాశారు. మానవవాద, హేతువాద ఉద్యమాలు తీవ్రస్థాయిలో నడిపించారు.
ఆవుల గోపాలకృష్ణ మూర్తి నోట్లో అతి సామాన్యమైన పలుకు కూడా మాధుర్యం సంతరించుకుంటుందని మూల్పూరుకు చెందిన (ఎ.జి.కె. గ్రామం) వెనిగళ్ళ వెంకట సుబ్బయ్య అనేవారు.









1955 నుండీ ఎజికెతో నాకు సన్నిహిత పరిచయం ఏర్పడింది. గుంటూరు ఎ.సి. కాలేజీలో చదువుతూ ఆయన ఉపన్యాసాలు ఏర్పరచాము. సాహిత్యంలో ఔచిత్యం అనే ఉపన్యాసం యివ్వగా, స్ఫూర్తి శ్రీ (బాస్కరరావు లెక్చరర్) రాసి, ఆంధ్ర పత్రికలో ప్రచురించారు. అది వాదోపవాదాలకు దారి తీసింది. అందులో నన్నయ్య ఆది పర్వం నుంచి అనేక మంది కవుల అనౌచిత్యాలను ఎజికె. విమర్శించారు.
పెళ్ళి ఉపన్యాసాలు కూడా ఎ.జి.కె. అద్భుతంగా చేసేవారు. సంస్కృత మంత్రాలు లేకుండా తెలుగులో అందరికీ అర్ధమయ్యేటట్లు ప్రమాణాలు చేయించి, వివరణోపన్యాసం చేసేవారు. అలాంటివి నేను ఎన్నో విన్నాను.
నా వివాహం 1964లో ఆయనే తెనాలిలో చేయించారు. ఆవుల సాంబశివరావు అధ్యక్షత వహించారు.
ఎ.జి.కె. పెళ్ళి ఉపన్యాసాలంటే అదొక సాహిత్య వ్యాసం అనవచ్చు. ప్రతి చోట ప్రత్యేక పాయింట్లు చెప్పేవారు.
ఎజికె చేత ఎందరో రచయితలు కవులు పీఠికలు రాయించుకున్నారు.

కొల్లా శ్రీకృష్ణా రావు
రారాజు
కావ్యానికి సుదీర్ఘ పీఠికలో ఎజికె నిశిత భారత పరిశీలన చేశారు.
వాసిరెడ్డి వెంకట సుబ్బయ్య తెలుగు పుస్తకానికి ఇంగ్లీషులో సుదీర్ఘ పీఠిక రాశారు. ఎందుకంటే, ఎజికె వాడుక భాష నచ్చదని, ఆయన అలా రాయించు కున్నారు. తెనాలి దగ్గర వడ్లమూడి గ్రామానికి చెందిన ప్రౌఢ కవి ఆయన సంస్కృత రచనకు తెలుగు అనుసరణ ‘భామినీ విలాసం’.
కొండవీటి వెంకట కవి, రావిపూడి వెంకటాద్రి, గౌరి బోయిన పోలయ్య యిలా ఎందరో రాయించుకున్నారు. వెంకటకవి నెహ్రూ ఆత్మకథ రాయడానికి తోడ్పడ్డారు. వందలాది టీచర్లు ఆయన వలన ప్రేరేపితులయ్యారు.







ఇంగ్లీషులో శామ్యుల్ జాన్సన్, మాథ్యూ ఆర్నాల్డ్, ఆర్ జి ఇంగర్ సాల్, ఎరిక్ ఫ్రాం, ఎం.ఎన్. రాయ్, రచనలు ఎజికె యిష్టప్రీతికాగా, రవీంద్రనాథ్ కవితల్ని పులుముడు రచనలుగా విమర్శించాడు. బెంగాలీ మానవ వాదులకు యిది ఒక పట్టాన మింగుడు పడేదికాదు.
ఎలవర్తి రోశయ్య చాదస్తంతో గ్రాంథిక వాదిగా నన్నయ తిక్కన వంటి వారిని అంటి పెట్టుకోగా, ఎజికె ఆయన్ను మార్చగలిగారు. కవిత అంటే చెవిగోసుకునే రోసయ్యకు త్రిపురనేని రామస్వామి సూతపురాణం పద్యాలు చదివి, పేరు చెప్పుకుండా ఆకర్షించారు. అది చదివిరోసయ్య చాలా మారారు. పిలక పెంచుకున్న రోసయ్యను మార్చడానికి, ఒక అర్థరాత్రి హాస్టల్ లో నిద్రిస్తున్న రోసయ్యకు పిలకకత్తిరించారు.
ఏటుకూరి వెంకట నరసయ్య కృషేవలడు రచన ఎజికెకు యిష్టం. అత్తోట రత్నం మొదలు జాషువా వరకూ ఎజికె సందర్శకులే. దళిత ఉద్దరణలో భాగంగా కవుల్ని ప్రోత్సహించాడు.








ఎం.ఎన్. రాయ్ మానవ వాద రచనను సరళంగా తెనిగించారు.
నాచుట్టూ ప్రపంచం అనే శీర్షికతో వాహిని వారపత్రిక (విజయవాడ)లో రాశారు 1956 ప్రాంతాల్లో. గుంటూరు నుండి వెలువడిన ప్రజావాణిలో రాశారు. చిన్న పత్రికలవారడిగితే ఎజికె అరమరికలు లేకుండా రాసేవారు.
వివేకానంద భావాల్ని ఆలోచనల్ని షూటుగా విమర్శించిన ఎజికెపై ఆనాడు ఆంధ్రప్రభ, నీలం రాజశేషయ్య సంపాదకత్వాన ధ్వజమెత్తింది, 1964లో. కానిఎజికె వెనుకంజ వేయలేదు.

బుద్దునిపై విశ్వనాథ సత్యనారాయణ చేసిన అనౌచిత్య విమర్శలపై ఎజికె పెద్ద ఉద్యమం చేశారు. 1956-57లో పాఠ్యగ్రంథాలనుండి, బుద్ధుణ్ణి రాక్షసుడుగా చిత్రించిన భాగాలు తొలగించే వరకూ నాటి విద్యామంత్రి ఎస్.బి.పి పట్టాభి రామారావుపై విమర్శలు చేశారు.
వి.ఎస్. అవధాని, ఎం.వి. శాస్త్రి, పాలగుమ్మి పద్మరాజు, పెమ్మరాజు వెంకటరావు, ఎ.ఎల్. నరసింహారావు మొదలైన వారెందరో ఎజికె సలహాలు పొందుతుండేవారు. కవులకు ఆయన యిల్లు యాత్రాస్థలమైంది.
ఎజికె ప్రతిభను గుర్తించిన అమెరికా ప్రభుత్వం 1964లో ఆయన్ను ప్రభుత్వ అతిధిగా పర్యటించమని ఆహ్వానించింది.
అమెరికాలో ప్రధాని జవహార్ లాల్ నెహ్రూను ఎజికె విమర్శిస్తే, నాటి రాయబారి బి.కె. నెహ్రూ బెదిరించి ఎజికెను వెనక్కు పెంపిస్తానన్నారు. కాని ఎజికె తన విమర్శనా వాద పటిమ తెలిసినవాడుగనుక జంకలేదు.

సాహిత్యంలోనే గాక, కళలు, సంగీతంలో కూడా చక్కని విమర్శలు, పరిశీలనలు ఎజికె చేశాడు. శాస్త్రీయ దృష్టితో పరిశీలన చేశాడు. బాల సాహిత్యాన్ని ప్రోత్సహించాడు.

ఎజికె తన ఆరోగ్యం పట్ల హేతు బద్ధంగా వ్యవహరించలేదు. గుండెపోటు వస్తే అశ్రద్ధ చేసి, కోర్టు కేసులు పడకలోనే పరిశీలించాడు. ఆ సందర్భంగా బొంబాయి నుంచి ఎ.బి.షా. (అమృత్ లాల్ భిక్కు బాయ్ షా-సెక్యులర్ ఉద్యమ నాయకుడు), నేనూ తెనాలి వెళ్ళి హెచ్చరించి, చికిత్స కైమద్రాసు వెళ్ళమన్నాం. అలా చేయలేదు.
ఆటల్లో, పాటల్లో, నాటకాల్లో ఆసక్తి, ప్రవేశం గల ఎజికె కోర్టులలో వాదిస్తుంటే, అదొక ఆకర్షణీయ దృశ్యంగా వుండేది. ఇంటగెలవని ఎజికె రచ్చగెలిచాడు.
ఎం.ఎన్. రాయ్ తో సుప్రసిద్ధ రచయిత చలంను, త్రిపురనేని రామస్వామిని కలిపినా, నిరాశేమిగిలింది. రాయ్ స్థాయిని వారం దుకోలేకపోయారు.
కాని 50 ఏళ్ళకే 1967లో ఎజికె చనిపోయారు.

రచనలు :

నా అమెరికా పర్యటన సాహిత్యంలో జేచిత్యం (సాహితీ వ్యాసాలు) హ్యూమనిజం. నవ్యమానవవాదం (రాయ్ రచనకు తెలుగు), పుంఖాను పుంఖంగా ఇంగ్లీషులు, తెలుగు వ్యాసాలు, పీఠికలు తెనాలి దగ్గర మూల్పూరు స్వగ్రామం. లక్నోలో చదువు. ప్రాక్టీసు తెనాలిలో, అమెరికా, యూరోప్ పర్యటన 1964లో.

Thursday, April 10, 2008

పుస్తక సమీక్ష--మానవ శ్రేయస్సుకు విజ్ఞానం






Consilience : The Unity of Knowledge
H.O.Wilson

ఒకప్పుడు తన సామాజిక సిద్ధాంతాలతో ప్రపంచాన్ని కలవరపెట్టి, ఉర్రూతలూగించిన ఎడ్వర్డ్ విల్సన్ నేడు కొత్త ఆలోచనలతో మళ్ళీ ప్రకోపింపజేస్తున్నాడు. మనకు విభిన్నంగా, విరుద్ధంగా కనిపించేవాటి మధ్య సమన్వయం సాధ్యమంటున్నాడు. అన్నింటికీ పరిష్కారం జీవశాస్త్రంలో చూడొచ్చు అంటున్నాడు. ఇందుకు ఆయన స్వీకరించిన పరిశోధన చీమలు.

చీమలకు మెదడులో 10 లక్షల కణాలే వున్నాయి. మనిషి మెదడులో వంద బిలియన్ కణాలున్నాయి. చీమల ప్రవర్తన, క్రమబద్ధత సాధ్యమైనప్పుడు మనిషి తన శక్తిని వినియోగిస్తే ఇంకెంతో సాధించగలడని విల్సన్ సిద్ధాంతీకరిస్తున్నాడు.

అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేసిన విల్సన్ పరిశోధనాలయంలో 538000 చీమల నమూనాలు, వర్గీకరణ నిమిత్తం సారాయిలో పెట్టి వుంచిన మరో 3 లక్షల చీమలు చూచేవారికి ఆశ్చర్యం వేస్తుంది. చిన్నప్పటి నుండే అలబామా రాష్ట్రంలో అడవులలో చీమల్ని సేకరించి, ప్రకృతిని అధ్యయనం చేసిన విల్సన్ పులిజర్ బహుమానం అందుకున్న రచయిత.

మన ప్రవర్తన మన తల్లిదండ్రుల జన్యుకణాల నుండి సంక్రమించిందని, వారి శిక్షణ నుండి పిల్లలు పుణికి పుచ్చుకుంటారని సిద్ధాంతీకరిస్తూ “సోషియోబయాలజీ” రాసినప్పుడు చాలామంది గగ్గోలు పెట్టారు. రానురాను విల్సన్ సోషియోలజీని సీరియస్ గా స్వీకరించి పరిశీలిస్తున్నారు.

నేడు జీవకణశాస్త్రం, ప్రకృతి శాస్త్రం, ఎన్నో సూక్ష్మాలు అందిస్తున్నది. కనుక మెదడు ఆలోచనా స్రవంతి లోతుపాతుల్లోకి పోగలమని విల్సన్ అంటున్నాడు.
సిద్ధాంతాలకు, నమ్మకాలకు బానిసలుగా బ్రతకడం కాదు, ఉన్నతస్థాయికి ఎదుగుతూ పోవడం మానవ లక్షణాలలో విశిష్టమైనదని విల్సన్ గట్టిగా చెబుతున్నాడు.
మనకు శాస్త్రాల వలన జ్ఞానం విపరీతంగా వస్తున్నది. దీని ఫలితంగా వివిధ జ్ఞాన శాఖల్ని సమన్వయీకరించి చూచుకోవలసిన అవసరం కలిగిందంటున్నాడు.

హెరాల్డ్ విల్సన్ 7వ ఏట మిలటరీ స్కూలులో చేరి చదివాడు. ఒక దుర్ఘటనలో ఒక కన్ను కనిపించకుండా పోయింది. పుట్టినప్పటి నుండీ చెముడు వచ్చింది. విల్సన్ ఒక్కడే సంతానమైనా తల్లిదండ్రులు విడాకులు యిచ్చుకున్నందున, చిన్నప్పటినుండీ కష్టజీవితానికి అలవాటుపడ్డాడు. హార్వర్డ్ యూనివర్శిటీలో చేరిన తరువాత, జీవశాస్త్రాన్ని యితర రంగాలకు అన్వయించవచ్చని గ్రహించాడు. సమన్వయం అతడి వూపిరిగా మారింది.

శ్రీలంక వరకూ పర్యటించి, చీమల నమూనాలు సేకరించి పరిశోధించిన విల్సన్, వాటిపై ప్రామాణీకరించిన శాస్త్రజ్ఞుడయ్యాడు. అది మూలంగా పెట్టుకొని, ఇతర జీవజాలమంతా పరిశీలించాడు. క్రమేణా మనిషికి కూడా విస్తరించాడు. దీని ఫలితంగా 1978లో “ఆన్ హ్యూమన్ నేచర్” ప్రచురించాడు.

మనిషి పరిణామంలో భాగం. తన జన్యుకణాల ప్రభావంతో అతడు ప్రవర్తిస్తుంటాడు. భవిష్యత్తులోకి తొంగి చూస్తుంటాడు. ఒకప్పుడు మనిషి సమాజం ద్వారా తన జ్ఞానాన్ని అదుపులో పెట్టాలనుకున్నాడు. నేడు కళల ద్వారా వివిధ గందరగోళాలను శాస్త్రాలను సమన్వయీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది విల్సన్ సిద్ధాంతం.

క్రైస్తవ మతంలో పుట్టి పెరిగిన విల్సన్ అందులో నుండి మానవవాదిగా ఎదిగాడు. ప్రకృతిలోని వైవిధ్యాన్ని అభినందించసాగాడు. పరిణామం సాగిపోతూ వున్నదన్నాడు. ఇందుకు మానవుడు ఇంకా ప్రయోజనాత్మకంగా దోహదం చేయాలంటే, వివిధ రీతుల్ని బాగా అవగాహన చేసుకోవాలన్నాడు అటు ప్రకృతి, యిటు జన్యుకణాల వలన మానవుడు మసలుకుంటున్నాడు. వీటిని సమన్వయించాలంటున్నాడు. పరిసరాలను ధ్వంసం చేయకుండా జీవనం కొనసాగించడం అవసరమంటాడు.

విల్సన్ భార్య ఐరీన్ (Irene) అతడికి బాగా సహకరిస్తుంది.

విల్సన్ రాసి ప్రచురించిన కొత్త పుస్తకం మళ్ళీ విజ్ఞాన ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్నది. జ్ఞాన సమన్వయీకరణ యీ గ్రంథానికి మూలం (Consilience : The Unity of Knowledge).
ఒకవైపు విజ్ఞానరంగం ఎంతో సాధించగా, మరొక పక్క దీనిని ఖండిస్తూ యీ సడిస్తూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అతీంద్రియ శక్తులు, దివ్యత్వం, మహిమల పేరిట కొందరు రంగంలోకి దిగి మోసాలకు పాల్పడుతున్నాడు. మరికొందరు మూర్ఖంగా మతగ్రంథాలలోనే సర్వస్వం వున్నదని నమ్ముతున్నారు. కాని ఇంకా కొందరు తత్వం పేరిట సిద్ధాంతీకరిస్తూ శాస్త్రాన్ని వెక్కిరిస్తున్నారు. పోస్ట్ మోడరనిస్ట్ శాఖ యిందులో ఒకటి. ఇంకా సాంస్కృతిక సాపేక్షత వాదులున్నారు. నియోమార్క్సిస్టులు వీరికి తోడయ్యారు. ఫాయర్ బాండియన్లు, కున్ వాదులున్నారు. అలాంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని విల్సన్ కొత్త పుస్తకం రాశాడు. విజ్ఞానం సంకుచితం కాదనీ, మానవుడిని పెంచేదేకాని తగ్గించేది కాదని విల్సన్ అన్నాడు. అందుకే వివిధ విజ్ఞాన శాఖల సమన్వయం కోరుతున్నాడు.

వికాసయుగం మానవుడిని స్వేచ్ఛవైపుకు నడిపించిన విషయం విల్సన్ గుర్తు చేస్తున్నాడు. మానవుడి పురోగతికి అత్యంత శక్తివంతమైన ఆయుధం విజ్ఞానమే.

విజ్ఞానాన్ని సమన్వయీకరించడం అవసరమని విల్సన్ మూల సిద్ధాంతం. ఎవరికి వారు ప్రత్యేక కృషి చేసి, ఆయా రంగాలలో ఎన్నో కనిపెడుతున్నారు. సాధిస్తున్నారు. కాని బయట ఏం జరుగుతున్నదో గ్రహించడం లేదు. అందు వలన మూఢనమ్మకాలు, మూర్ఖత్వాలు వుంటున్నాయి. సమన్వయీకరణ జరిగితే యీ లోపం సవరించవచ్చు. కెమిస్ట్రీలో జరిగేది, జీవశాస్త్రజ్ఞులకు, ఫిజిక్స్ లో పరిశోధనలు, భూగర్భ శాస్త్రజ్ఞులకూ, ఖగోళంలో ఏం జరుగుతున్నదో మానసిక శాస్త్రజ్ఞులకూ తెలియాలంటే, సమన్వయీకరణ జరగాలన్న మాట. ఎవరికి వారే మడిగట్టుకొని, తమదే గొప్ప రంగం అనుకొంటూ, మిగిలిన రంగాలను పట్టించుకోపోవడం లోపం. ఇది తొలగాలి.

లోగడ కార్నప్, రైకన్ బాక్, ఎం.ఎన్. రాయ్, వంటివారు యిలాంటి సమన్వయీకరణ ధోరణులు కొంత వరకు చేశారు. అలాంటి కృషి చాలా భారీ ఎత్తున యిప్పుడు జరగాలని విల్సన్ ఉద్దేశం.

విజ్ఞాన రంగంలో ఒక భాగం మరొక విభాగానికి ఎలా ఉపకరిస్తుందో శాస్త్రజ్ఞులు గ్రహిస్తున్నారు. సమన్వయీకరణలో కేవలం విజ్ఞానశాస్త్రాలేగాక, మానవశాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు చేర్చడం విల్సన్ విశిష్టత. అక్కడే వివాదం తలెత్తుతున్నది.

పరిణామంలో జన్యుకణాలు, పరిసరాలు రెండూ పరస్పరం ప్రాధాన్యత వహిస్తూ, పోతున్నాయనేది విల్సన్ మూలసిద్ధాంతం, అలాంటి సమన్వయీకరణ సాధ్యం కాదని రిచర్డ్ రోర్టీ (Richard Rorty) వాదిస్తున్నాడు. చాలాకాలం పట్టినాసరే అలాంటి సమన్వయీకరణ వైపు సాగిపోవడం అవసరమనీ, సాధ్యమనీ విల్సన్ అంటాడు.

విజ్ఞానాన్ని నీతికి సైతం అన్వయించవచ్చని విల్సన్ అంటాడు. మొత్తం మీద గొప్ప గ్రంథం రాసి విల్సన్ మళ్ళీ సంచలనం సృష్టించాడు.

Monday, April 7, 2008

సాహితీ పరులతో సరసాలు-16 Gokulchand






త్రిపురనేని గోకుల్ చంద్
(1923-1978)

ఒక నాటికలో యీ డైలాగ్ లు గమనించండి.
“మానవత్వానికి జ్ఞానం ఎంత అవసరమో, దయాదాక్షిణ్యం, జాలి అంతే అవసరం”
వెంకట్ : చివరికి ఆడదాని మెడలో మంగళసూత్రం కట్టడం కూడా తప్పేనన్న మాట?
అమ్మాయి : తప్పు కాకపోతే మొగవాళ్ళు కూడా ఎందుకు కట్టుకోరు? స్త్రీ పురుషుల వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన వివాహాలకు అంత తతంగం, అంత మంది ఎదుట ప్రమాణాలూ దేనికి? మీలో స్త్రీ పురుషులకి వొకరి నైతిక ప్రవర్తన మీద ఇంకొకరికి నమ్మకం లేదు. అందుకనే పెద్దలకీ సంఘాలకీ కట్టబెట్టి యీ భయంతో నైనా అణగి వుండడం ఆశిస్తున్నారు.
1947లో అపశ్రుతులు పేరిట వెలువడిన నాటికలో అలా వుంది.
త్రిపురనేని రామస్వామి రెండవ కుమారుడు గోకుల్ చంద్. తండ్రి చనిపోయిన 5 సంవత్సరాలకి రేడియో నాటికలు రాశారు. కరువు రోజులు, భగ్న హృదయాలు అనే నాటికలు నాడు ప్రజాసాహిత్య పరిషత్తు వారు కోగంటి రాధాకృష్ణ మూర్తి గారి ఆధ్వర్యాన వెలువరించారు.
అప్పటికే త్రిపురనేని రామస్వామి వివాహవిధి రాసి, అనేక వివాహాలు జరిపించారు. అందులో సంస్కృతంతో నిమిత్తం లేకుండా అందరికీ అర్థమయ్యే తెలుగులో పెళ్ళిళ్ళు జరిపించారు. పురోహితులుగా ఎవరైనా వుండొచ్చన్నారు. ఆనాడు అది పెద్ద మార్పు. సంప్రదాయ సమాజంపై ఎదురీత.
అలాంటి ప్రభావంలో గోకుల్ చంద్ యీ నాటికలు రాశాడు. తండ్రి ప్రభావం బాగా వున్నదని స్పష్టపడింది. అప్పటికి గోకుల్ చంద్ వయస్సు 24. మరో వైపు చలం సాహిత్యం, రాడికల్ హ్యుమనిస్టు ప్రభావం కూడా గోకుల్ చంద్ పై వున్నది.
గోకుల్ చంద్ నాకు సన్నిహిత మిత్రుడు. ఆయన చివరి 15 సంవత్సరాలు మేము కలసి మెలసి సంభాషించుకున్నాం. గోపీచంద్ తో పోల్చి చూస్తే యీయనకు ప్రచారం తక్కువ. రచనలు కూడా పరిమితమే. అడపదడప పత్రికలలో రాయడం, మిత్రులతో చర్చలు సాగించడం ఆనవాయితీగా వుండేది.
తమిళనాడులో పెరియార్ ఉద్యమ ప్రభావం త్రిపురనేని రామస్వామిపై వున్నట్లే గోకుల్ చంద్ పై కూడా వుంది. 1960 ప్రాంతాల్లో అన్నాదొరై తెనాలి రాగా, నాటి సమావేశాల్లో గోకుల్ చంద్ చురుకుగా పాల్గొన్నారు.
బెంగాల్ లో తీవ్ర కరువు వచ్చి ఎందరో చనిపోగా చలించిన గోకుల్ చంద్, కరువు రోజులు నాటిక రాశారు. ఆలిండియా రేడియో దీనిని ప్రసారం చేసింది.
కాకినాడ కాంగ్రెస్ మహాసభలు జరిగిన సంవత్సరం, కృష్ణాష్టమినాడు జన్మించినట్లు చెబుతుండేవారు. గోకుల్ చంద్, కోనేరు కుటుంబరావు, ఆలూరి భుజంగరావు, ఎం.వి. రామమూర్తి, నేనూ అప్పుడప్పుడూ చర్చలలో కాలక్షేపం చేసేవాళ్ళం.
విజయవాడలో అశోక్ ఆటో మొబైల్స్ షాపు నడిపిన గోకుల్ చంద్, రోజూ అక్కడే చర్చా సమావేశాలు జరిపేవారు.
సమకాలీన విషయాలపై బాగా స్పందించే వాడు సాహిత్యం విరివిగా చదివేవారు. సంభాషణశీలి. స్వేచ్ఛా న్వేషి.
గోపీ చంద్ వలె దిగజారకుండా, అరవిందుడి భక్తి రసంలో మునిగితేలకుండా చివరి వరకూ గోకుల్ వివేచనా పధంలో వున్నారు.
దేశంలో ఇందిరాగాంధి అత్యవసర పరిస్థితి పేరిట స్వేచ్ఛను కాలరాసినప్పుడు గోకుల్ చంద్ తీవ్రంగా స్పందించారు. మల్లాది రామమూర్తి ఎమర్జన్సీకి వ్యతిరేకంగా పోరాడుతూ, రహశ్య జీవనం గడపవలసి వస్తే, కొన్నాళ్ళు గోకుల్ చంద్ ఆశ్రయం యిచ్చి దాచి పెట్టారు.
తెనాలి భావపునర్వికాస కేంద్రంగా వున్న రోజులలో గోకుల్ చంద్ చురుకుగా వున్నారు. తన నాటికల్ని హిందీ పండిత్ నన్నపనేని సుబ్బారావుకు అంకితం యిచ్చారు.
విజయవాడనుండి వెలువడిన చార్వాక పత్రికను ప్రోత్సహించారు. కాళీపట్నం రామారావు నాడు దిన పత్రికలలో గోకుల్ చంద్ పై వ్యాసాలు రాశారు.
1978 నాటికే గోకుల్ చంద్ హైదరాబాద్ లో చనిపోయారు.

Sunday, April 6, 2008

పుస్తక సమీక్ష--పునర్జన్మ ఉందా

(REINCARNATION – A critical Examination)
- Paul Edwards


మనిషి ఒక్కసారే పుట్టి పోడనీ, ఎన్నో సార్లు జన్మ ఎత్తుతాడనీ, అందులో జంతువులు యితర జీవజాలం కూడా వుండొచ్చుననీ, ప్రతి జన్మకూ కొత్త దేహం వస్తుందనీ నమ్ముతారు. ఇది ఆద్యంత రహితంగా సాగుతుందని కొందరూ, నిర్యాణంతో జన్మ ముగుస్తుందని కొందరూ నమ్మారు.
కర్మ సిద్ధాంతానికి మంచి చెడ్డలను జత చేస్తారు. ప్రస్తుత జన్మకు కారణం లొగడ జన్మలలో చేసిన మంచి, చెడ్డలు కారణం అంటారు. వీటిలోనే శిక్షలు, బహుమతులు కూడా యిమిడి వున్నాయి.

ఈ పునర్జన్మ కర్మ సిద్ధాంతాలు నమ్మిన వారిలో సుప్రసిద్ధ వ్యక్తులున్నారు. కనుక సిద్ధాంతం సరైనదని చెబుతారు.
టి.హెచ్.హక్సలీ 1893లో పరిణామం నీతి గురించి చెబుతూ వంశపారంపర్యంగా శీలం రావడం కర్మ సిద్ధాంతం వంటిదన్నాడు. ఇంకేముంది. హక్సలీ సైతం పునర్జన్మను అంగీకరించాడన్నారు. ఆయన మనస్సు-శరీరం సమస్య చర్చించే సందర్భంగా ఆ ప్రస్తావన తెచ్చాడు. మరణానంతరం మానవుడు వుండడని కచ్చితంగా హక్సలీ పేర్కొన్నాడు.

పునర్జన్మవాదుల ప్రకారం తల్లిదండ్రులు నిమిత్తమాత్రులు. మానవుడిలోని అనేక గుణాలకు తల్లిదండ్రులు కారణం కాదన్నారు.
పునర్జన్మను నమ్మిన ఎఫ్.డబ్ల్యు.హెచ్.మైర్స్ (Myers) గురించి బెర్ట్రాండ్ రస్సెల్ చతురోక్తిగా చెబుతూ, ఒక విందులో చనిపోయిన తరువాత నీవు ఏ మౌతావని మైర్స్ ను ఒకరు అడిగారట. శాశ్వతానందం లభిస్తుందని మైర్స్ అంటూనే, తినేటప్పుడు అలాంటి అప్రియ ప్రస్తావన ఎందుకన్నాడట. అలాగే పునర్జన్మ నమ్మిన ఒక తండ్రికి అత్యవసరంగా ఆపరేషనం చేయాల్సిరాగా అతడు దిగాలుపడి వున్నాడట. అతడి కుమారుడు చూచి, నాన్నా, నీకు పునర్జన్మపై నమ్మకం వుందిగా, ఏం ఫరవాలేదన్నాడట. అందుకు తండ్రి మండిపడి, ఇలాంటి సందర్భంలో హాస్యంగా మాట్లాడొద్దన్నాడట.

ప్రపంచంలో వున్న అన్యాయం, అక్రమం చూస్తుంటే, దేవుడున్నాడని, కనుక న్యాయాన్యాయాలు నిర్ణయించడానికి, పునర్జన్మలు కర్మలు వుండాలి అంటారు కొందరు. కార్యకారణవాదం కూడా యిందులోకి తెస్తుంటారు. కాని ఆ వాదం ప్రకారం అన్యాయాలకు, అక్రమాలకు కారణమైన చెడ్డ దేవుళ్ళు వుండాలి. మానవులు సంతోషంగా వుండడానికి హామీయిచ్చే నియమం ఏదీ లేదని రస్సెల్ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి.

“కర్మ సిద్ధాంతాన్ని పరిశీలిస్తే, ఇందులో భవిష్యత్తు. అంచనా వేసే రీతి లేదని గ్రహించవచ్చు”. అనిబిసెంట్, బ్లావట్స్ రాసిన విషయాలు, ప్రొఫెసర్ జి. ఆర్. మల్కాని- ప్రొఫెసర్ వారెన్ స్టెయిన్ క్రాస్ మధ్య ఫిలసాఫికల్ క్వార్టర్లీ (1965)లో జరిగిన చర్చను ఇక్కడ ఉదహరించవచ్చు. కొన్ని మార్మిక విషయాలు మనకు తెలియవని, చర్చించరాదని మల్కాని అన్నారు. ఏ పాపానికి ఏ శిక్ష విధించాలి అనేది అలాంటిదే అన్నారు. ఈ లోకంలో యింత శిక్ష అన్యాయం ఎందుకున్నదో మనం వివరించలేమన్నాడు.
కొందరు దేవుడితో నిమిత్తం లేకుండా, కర్మ దానంతట అదే పనిచేస్తుందని నమ్ముతారు. కర్మ సహజ సిద్ధాంతం అని మల్కానీ వంటి వారు నమ్మారు.

ఏది మంచి, ఏది చెడ్డ అనేది ఎక్కడ ఎవరు నమోదు చేస్తారు?. దానిని బట్టి ఫలితం నిర్ణయించే తీరు ఎలా వుంటుంది? నిర్ణయాలు ఎవరు తీసుకున్నా వాటిని అమలుపరచేదెలా? అంటే లోగడ చేసిన పనులకు వచ్చే జన్మలో ఫలానా మనిషిగా పుట్టాలని నిర్ణయిస్తే అదెలా అమలుజరుగుతుంది? భూకంపంలో వేలాది మంది చనిపోవడం కర్మవలనా? టెర్రరిస్టులు కొందరిని చంపడం కర్మ సిద్ధాంతమా? కర్మను వెనుకేసుకొచ్చే మల్కాని వంటి వారు యిలాంటి వాటికి సమాధానం చెప్పజాలరు.

పునర్జన్మలు కర్మ ప్రకారం వస్తాయని అనిబిసెంట్ నమ్మినా, ఉత్తరోత్తరా జన్మలకు తగిన దేహాలను ఎలా వెతికి తెస్తారో చెప్పలేక పోయారు. మూకుమ్మడి హత్యలు, భూకంపాలు న్యాయంగా కర్మ ప్రకారం సంభవించాయని చెప్పగలరా? అలాగైతే కోట్లాది యూదులను నాజీలు హతమార్చడం కర్మ ప్రకారం న్యాయం కావాలి.

తార్కికంగా గాని, శాస్త్రీయంగా గాని, కర్మ నిలబడదు. ఈ విషయంలో ప్రాచ్యపాశ్చాత్య సిద్ధాంతకారులను పాల్ ఎడ్వర్డ్స్ పరిగణనలోకి తీసుకున్నారు. ఎ.జె. అయ్యర్ వంటి బ్రిటిష్ తాత్వికుల భావాలు కూడా ప్రస్తావించారు.

బెనర్జి హెచ్.ఎన్ :

పూర్వజన్మల గురించి ఇండియాలో కొన్నేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన హెచ్.ఎన్.బెనర్జి గురించి చూదాం. బెనర్జి అమెరికాలో కూడా కొంత ప్రచారం పొందాడు. ఒక కేంద్రం కూడా నెలకొల్పి, మూసేశాడు. ఏన్ మిల్లర్ అనే సినీతార పూర్వజన్మలో ఈజిప్టు రాణి హత్సెసుట్ అన్నాడు. అతడి పుస్తకాలు డబుల్ డే ప్రచురణకర్తలు వెలువరించారు. తరవాత బెనర్జిని ఇండియాలో అరెస్టు చేశారు. అతడివన్నీ కట్టుకథలని తేలింది. యు.జి.సి. వారు కూడా కొంత నిధిని సమకూర్చి తరువాత నాలుక కొరుక్కున్నారు. అమెరికాలో అతడు ఓక్లొహామా రాష్ర్టంలో షోఫెన్ బర్గ్ రీసెర్చ్ ఫౌండేషనం పెట్టి మూసేశాడు.
పూర్వజన్మలే గాక, రానున్న జన్మలు కూడా చెప్పడం మామూలే. ప్యూచరాలజీ పేర వీరు చెప్పేవన్నీ కొన్ని వందల వేల ఏళ్ళ అనంతరం జరుగుతాయంటున్నారు. కనుక రుజువుకు నిలబడవు.
గత జన్మల విషయం సాధారణంగా గుర్తుండవంటారు. ఎక్కడో కొందరు గుర్తున్నాయన్నప్పుడు, సంచలనం జరిగింది. ఇండియాలో యిలాంటివి అప్పుడప్పుడు ప్రచారంలోకి వచ్చాయి.
కృష్ణుడికి గతజన్మలన్నీ గుర్తున్నాయట. బౌద్ధులకు గత జన్మలు తెలుస్తాయని టిబెట్ లో నమ్ముతారు. అనిబెసెంట్ తన గత జన్మల గురించి చెప్పింది. జన్మలలో తేడా వచ్చినప్పుడు ఏమీ సంజాయిషీ వుండదు. అయితే యివేవీ రుజువులకు నిలబడవు.
సాయిబాబా :

సాయిబాబా అతీంద్రియ శక్తులు, నిర్ణయాలు అంగీకరించిన స్టీవెన్సన్ గురించి రాస్తూ పరిశోధనకు, రుజువుకు నిలబడకపోవడాన్ని ప్రస్తావించారు. గాలిలో నుండి చేయి చాపి వస్తువుల్ని సృష్టించగలిగితే, కొన్ని భౌతిక సూత్రాల్ని అధిగమించి పోయినట్లవుతుందన్నారు. అది conservation principleకు దాటిపోయినందున సైన్స్ లో గొప్ప విషయం అవుతుందనీ, ఆయన ప్రతిష్ట యినుమడిస్తుందనీ, కనుక రుజువుకు అంగీకరిస్తే బాగుంటుందన్నారు. సాయిబాబాను పరీక్షించడానికి శాస్త్రజ్ఞులు, మాంత్రికులు (Magicians) తగిన వారన్నారు.
మద్రాసు క్రిస్టియన్ కాలేజిలో కీ.శే. అయిన సి.టి.కె. చారి అతీంద్రియ శక్తులు గురించి చాలా రాశారు. చిన్న పిల్లల పునర్జన్మల గురించిన విషయాలు పచ్చి కట్టు కథలని ఆయన రాశారు.
దేవుడు నిర్వికారుడు, సర్వాంతర్యామి అనే వాదనను చూస్తే అలాంటి దేవుడికీ, మనుషులకూ, ప్రపంచానికి ఎలా సంబంధం వుంటుందో అడిగారు. మనుషుల ప్రార్థనలు అలాంటి దేవుడికి ఎలా వినిపిస్తాయని అడిగారు. ఒకవేళ వింటే, తన శక్తిని యీ ప్రపంచంలోకి ఎలా పంపిస్తాడని తెలుసుకోవాలన్నారు. కేవలం మనస్సు (Pure Mind) భౌతిక ప్రపంచంతో ఎలా సంబంధం పెట్టుకుంటుందనేది అవగాహన కానిది.
ఒకే ఆకారం లేదా శరీరం రెండు చోట్ల వుండడం, పరకాయ ప్రవేశం, రెండు జన్మల మధ్య ఆత్మ నిరాకారంగా తిరగడం, ముసలివాడుగా చనిపోయి, పిల్లల్లో పుట్టడం యిలాంటివన్నీ రచయిత చర్చించారు. మరోజన్మలో పునర్జన్మ సిద్ధాంతానికి విరుద్ధంగా 5 వాదనలు ఉన్నాయి. పరిణామ సిద్ధాంతం పునర్జన్మని తృణీకరిస్తుందని చూపారు. బిగ్ బాంగ్ తరువాత చాలాకాలం జీవం పరిణమించలేదు. అప్పుడు ఆత్మలు లేదా జన్మలు, ఎక్కడ వున్నాయి?
పునర్జన్మ సిద్ధాంతానికీ జనాభా పెరుగుదలకూ వైరుద్ధ్యం ఉంది. మానవశరీరం లోనే మానవుడి ఆత్మ వుండగలదంటే జనాభా సిద్ధాంతంలో యిమడదు. కొత్త ఆత్మలు పుట్టవనీ, ఆత్మలు అనాదిగా శాశ్వతమనీ అంటే, జనాభా సిద్ధాంతం దీనిని తిప్పికొడుతుంది.
అటు పాశ్చాత్యులు యిటు ప్రాచ్యవాదులు నమ్ముతున్న కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలను విపులంగా పరిశీలించిన గ్రంథం పాల్ ఎడ్వర్డ్స్ రాసిన రేయిన్ కార్నేషన్. పూర్వాపరాలన్నీ ప్రస్తావించి, చివరకు శాస్త్రీయాధారాలకు నిలవబోవడం లేదని చాటారు.
ఇండియాలో జరిగినట్లు వింతగా నమోదైన అనేక పునర్జన్మ విషయాలను రచయిత ప్రస్తావించారు. తాను కొలంబియా యూనివర్శిటీలో చదువుతుండగా వేద ప్రకాశం మనగ్దలా అనే సహపాఠి ఎన్నో ఉదంతాలు చెప్పాడట. ఏమీ చదువుకోని ఒక రైతు ఒకనాడు పొద్దున్నే లేచి ధారాళంగా సంస్కృతం మాట్లాడాడట. అలాగే 1926 ఉత్తరాదిలో జరిగినట్లు ప్రచురితమైన జగదీష్ పునర్జన్మ విషయాలు పేర్కొన్నారు. వాటిలో పూర్వాపరాలు చూడకుండా శాస్త్రీయ పరిశీలన చేయకుండా ఎలా నమ్మారో చూపారు. ఈ విషయమై సి.టి.కె. చారి రాస్తూ మతపరంగా కొందరు అబద్ధాలు ఆడడం, కథలు అల్లడం, పవిత్రత పేరిట ఆనవాయితీగా వచ్చినట్లు స్పష్టంచేశారు. పునర్జన్మ కథలలో భాష్యకారులను, నిలబడి చూచేవారిని, తల్లిదండ్రులను నమ్మజాలమని, ప్రశ్నించాలని చారి రాశారు.
రాకేష్ గౌర్ పునర్జన్మ ఉదంతం ఇండియాలో జరిగినట్లు ప్రచారంలోకి వచ్చింది. ఇది పేరా సైకాలజి జర్నల్ లో ప్రచురితమైంది 1981లో. 1969లో పుట్టిన రాకేష్ గౌర్ తోంక్ అనే నగరంలో విఠల్ దాస్ గా పుట్టి గిట్టినట్లు చెప్పిన కథయిది. రాకేష్ ప్రయాణం, వెంట తండ్రి వుండడాన్ని రాశారు.
పాశ్చాత్యులు రాసేసరికి నమ్మేస్తారు. పాశ్చాత్యులలో మనకంటే నమ్మకస్తులున్నారని మరవకూడదు. శాస్త్రీయ పరిశోధనా పద్ధతులు అన్వయించి పరిశీలించారా లేదా అనేదే ప్రధానంగా చూడాలి. రచయిత యీ దృష్టితో గమనించి, నమ్మకాలను నిరాకరిస్తున్నారు.
అబద్దాలు కొన్నాళ్ళుకు నిజాలుగా ప్రచారం గావడం, ఒక్కొక్క వ్యక్తి తన అబద్ధాలను ఉత్తరోత్తరా, నిజమని తానే నమ్మడం చూస్తున్నాం. పునర్జన్మ, కర్మ నమ్మకాలలో యిలాంటివి వున్నాయి. ముందుగానే నమ్మి, వెళ్ళి చూస్తే అద్భుతాలు జరిగినట్లే వుంటాయి. వాటిని నిశితంగా పరిశీలించే శక్తి నమ్మకస్తులకు వుండదు. ఇది చదువుకున్న వారికి, కొన్ని సందర్భాలలో శాస్త్రజ్ఞులకూ వర్తిస్తుంది. శాస్త్రజ్ఞులను సైతం అద్భుత మాయాజాలంతో మోసగించవచ్చు. కనుక పరిశీలక బృందాలలో మంత్రజాలం తెలిసిన వారిని చేర్చితే చాలా వాస్తవాలు బయటపడతాయి.
కొందరికి అద్భుతశక్తులు వస్తాయి. అవి ఎలా వచ్చాయో పరిశీలించే బదులు, ఆ వ్యక్తి చుట్టూ కథలు అల్లడం, పునర్జన్మ శక్తులు అంటగట్టడం కూడా ఉండాలి. ఐరిష్ గణిత శాస్త్రజ్ఞుడు విలియం హామిలున్ (1805-1865) 13 భాషలతో పండితుడు. చిన్నతనంలోనే గణితంలో విశేష ప్రజ్ఞ కనబరిచాడు. ఇలాంటి కోవలో మొజార్ట్ వంటి వారున్నారు. ఇదంతా పూర్వజన్మ సుకృతం అని నమ్మేవారున్నారు. అది శాస్త్రీయ పద్దతి కాదు. పరిశీలించి తెలుసుకోవడమే ఉత్తమం. అయితే మనకు తెలియని వాటిపట్ల, ఏదో ఒక కట్టుకథ అల్లే బదులు, రుజువులు దొరికే వరకూ వేచివుండడం, పరిశీలన కొనసాగించడం ఉత్తమ విధానం.

Thursday, April 3, 2008

పుస్తక సమీక్ష- Insanity


పిచ్చిఅంటే
(Insanity by Thomas Szasz
psychiatrist in USA,syracuse University
author of Myth of Mental Illness)





నీవు దేవుడితో మాట్లాడితే ప్రార్థన అంటారు. దేవుడు నీతో మాట్లాడాడంటే పిచ్చి అంటారు. సుప్రసిద్ధ సైకియాట్రిస్టు థామస్ సాజ్ సూక్ష్మంగా చెప్పిన సత్యమిది.

ఆయన గ్రంథం Insanity వెలువడింది. అందులో ఆయన కొన్ని మౌలికాంశాలు లేవనెత్తి, ప్రశ్నించి, వివరించాడు. మనం అలవాటుగా మాట్లాడే అనేక సందర్భాలు ఎంత అసమంజసమో, అశాస్త్రీయమో చెప్పాడు.

మానసిక రోగం అనేది ఉపమాలంకారం అని, పిచ్చి అనేది మిధ్య అని సాజ్ అంటుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఏది పిచ్చో చెప్పమని ఆయన అడిగితే నోరు నొక్కుకోవాల్సి వస్తుంది. అలాగే మానసిక రోగం అని అతిసులభఁగా వాడేస్తుంటాం. మానసికం అంటే ఏమిటి అని సాజ్ ప్రశ్నిస్తే సమాధానానికి తన్నుకోవాల్సిందే. వీటన్నింటినీ ఆయన చాలా లోతుగా పరిశీలించాడు.
రోగాలు శరిరానికి వస్తాయి. వాటి లక్షణాలు పరిశీలించి, చికిత్స చేస్తారు.
ప్రవర్తన మనిషికి సంబంధించినది. ఇందులో నవ్వడం, ఏడ్వడం, కోపగించడం, అనురాగం, మొదలైనవి వుంటాయి.
అంతవరకూ అర్థమైంది. మూడోది : మానసికం. అక్కడే వచ్చింది చిక్కు. తత్వవేత్తలు మనస్సు గురించి చాలా రాశారు. కాని మానసిక రోగాల జోలికి పోలేదంటాడు సాజ్. సైకియాట్రిస్టులు మనస్సు అంటే ఏమిటో చెప్పకుండానే మానసిక రోగాలకు చికిత్స చేస్తున్నారని సాజ్ అభ్యంతర పెట్టాడు. మానసిక చికిత్స అనేది దేవతా వస్త్రాలతో పోల్చి, దేవతలూ లేరు, వస్త్రాలు లేవని సాజ్ చెప్పాడు.
కొందరు యిటీవల పిచ్చి అంటే, మెదడుకు వచ్చే రోగం అంటున్నారని, అలాగయితే మెదడు స్పష్టంగా శరీరంలో ఒక భాగం అనీ, దానికి నిర్ధుష్టమైన శాస్త్రం, లక్షణాలు వున్నాయని అన్నాడు. మెదడు ఎలా పనిచేస్తున్నదో, దానికి చికిత్స ఏమిటో మెదడు శాస్త్రం అధ్యయనం చేస్తున్నదని సాజ్ స్పష్టం చేశాడు. కనుక “పిచ్చి” అనేది ఒక అంగానికి వచ్చే రోగంగా నిర్ధారించలేకపోయారని ఆయన అన్నాడు. ఆత్మ అనేది వున్నదనే భ్రమ కల్పించి దానికి చికిత్స నిమిత్తం వివిధ శిక్షలు సైతం విధించిన పురోహిత వర్గం ఎలా ప్రవర్తిస్తున్నదో, సైకియాట్రిస్టులు కూడా మానసికం పేరిట అలానే చేస్తున్నారన్నాడు.
ఫ్రాయిడ్ మానసిక రోగాలకు మూలంగా స్వప్నాలను స్వీకరించాడు. అదొక శాస్త్రంగా పెంపొందించే ప్రయత్నం చేశాడు. ఆ భ్రమలో సైకో ఎనాలసిస్ రూపొందింది. నేడు అదంతా శాస్త్రీయం కాదని, రుజువుకు నిలవడం లేదని తెలిసేసరికి, అనేక చిలవలు పలవలుగా మార్పులు చేశారు. కాని సైకియాట్రిని మాత్రం వదలకుండా, మానసిక చికిత్స అంటూ కొనసాగిస్తున్నారు.
మనుషులు వివిధ రకాలుగా ప్రవర్తిస్తారు. అందులో మనకు యిష్టం లేనివాటిని పిచ్చి, ఉన్మత్తత, మనోవికారం అని పేరు పెట్టడం, మానసిక చికిత్స చేయాలనడం, బలవంతంగా ఆస్పత్రిలో చేర్చించడం - యివన్నీ సాజ్ అభ్యంతర పెడుతున్నాడు. తనలో తాను నవ్వుకోవడం, ఏడ్వడం, రోడ్డు మీద పోతూ అలా ప్రవర్తించడం పిచ్చిగా వర్ణిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఎవరి జోలికీ రాకుండా, హాని చేయకుండా వున్నంతవరకూ, బలవంతంగా ఆస్పత్రి పాలు చేయడాన్ని కూడా సాజ్ ఆక్షేపిస్తున్నాడు.

స్ర్కూడ్రైవర్ అనే మత్తు పానీయం వుంది. ఓడ్కాలో నారింజ రసం కలిపి, స్క్రూ డ్రైవర్ అనే పేరు పెట్టారు. మరమేకులు విప్పడానికి మనం వాడే స్క్రూడ్రైవర్ వుంది. స్క్రూడ్రైవర్ తాగినప్పుడు మత్తెక్కి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తుంటే, స్క్రూడ్రైవర్ చెడిపోయిందని షాపుకు తీసుకెళ్ళి బాగు చేయమంటే ఎలా వుంటుంది? మానసిక చికిత్స కూడా అలాంటిదే అన్నాడు సాజ్.

మానసిక రోగం అనేది ఉపమాలంకారం వంటిదనే తన సిద్ధాంతాన్ని 5వ అధ్యాయంలో సాజ్ సమర్ధించాడు. ఒక విషయానికి మరో పేరు పెట్టి అలంకారంగా మనం వాడుతుంటాం. వాటిని సాగదీసి, నిజం అనుకుంటే చిక్కువస్తుంది. కాని సైకియాట్రి నేడు అలాగే చేస్తున్నది. ఫాదర్ అంటే తండ్రి, క్రైస్తవ ఫాదర్ అంటే పూజలు చేసే పురోహితుడు. నిజమైన తండ్రికీ క్రైస్తవ ఫాదర్ కూ వాడుకలో తేడా వుంది. రెండూ ఒకటే అనుకుంటే చిక్కు వస్తుంది.
అలాగే కొన్ని హాస్య ఉపమానాలుంటాయి. వాటిని విని నవ్వుకొని ఆనందించాలేగాని, తు.చ. తప్పకుండ స్వీకరిస్తే చిక్కువస్తుంది.
ఒక అమెరికా యాత్రికుడితో చైనా అధికారి యిలా అన్నాడు. ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏదో తెలుసా. క్యూబా. క్యూబా ప్రభుత్వం మాస్కోలో వుంటుంది. క్యూబా సైన్యం ఆఫ్రికాలో వుంటుంది. క్యూబావాసులు అమెరికాలో ఫ్లారిడా రాష్ట్రంలో వుంటారు.

ఇది సునిశిత విమర్శనాయుత వ్యంగ్యంగా, స్వీకరించాలి. వాస్తవంగా గ్రహిస్తే ప్రమాదం. సైకియాట్రిలో మనిషి ప్రవర్తనను యిలా స్వీకరించడం జరుగుతున్నదని సాజ్ చూపడానికి చాలా ఉదాహరణలు యిచ్చాడు.

అనుకరణ గురించి రాస్తూ, మానసిక రోగాలలో యిదెలా పరిణమించిందో చూపాడు. ఇతరులను అనుకరించడం, జబ్బుగా వున్నట్లు నటించడం సైకియాట్రి సమస్యలలో ప్రధానంగా వున్నట్లు సాజ్ వివరించాడు. చార్కాట్ కాలం నుండీ యిలా మానసిక రోగులుగా, మూర్ఛరోగులుగా నటించడం వస్తున్నది. దానికి తగ్గట్లే నయం చేసినట్లు నటించడం కూడా వచ్చింది. మానసిక రోగాలు వివరించి, మనస్సు, మానసిక రోగం అంటే విడమరిచి, అంతా గాలి మాట అని చూపారు.

మొత్తం మీద యీ పుస్తకం పిచ్చి వైద్యం చేసే వారికి మింగుడుపడని వాదనలతో వుంది. సాధారణ పాఠకులకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలున్నాయి. మనందరం అలవాటుగా, ప్రశ్నించకుండా ఆమోదించే విషయాలను సాజ్ ప్రశ్నించి మనల్ని ఆలోచించేటట్లు చేస్తాడు. జబ్బు అనేది చాలా లోతుపాతులతో సాజ్ చర్చించాడన్నాం గదా. ఉదాహరణకు కొందరకి ప్రేమజబ్బు. ఇది ఉపమానంగా స్వీకరించాలే గాని, శరీరానికి ఏదో జబ్బు చేసినట్లూ చికిత్స అవసరమైనట్లూ భావించరాదు. కొందరు ఆర్థిక యిబ్బందుల వలన దిగజారిపోవచ్చు. మాట్లాడడం యిష్టం లేక మౌనం వహించవచ్చు. వారికి జబ్బు వున్నట్లు భావించరాదు. కాని సైకియాట్రిస్టులు అలాంటి వారిని కూడా రకరకాల పిచ్చిపేర్లు పెట్టి అస్పత్రి పాలుచేస్తున్నారు.

రోగికీ వైద్యుడికీ గల సంబంధాన్ని చర్చించినప్పుడు, రోగిపై సైకియాట్రిస్టుకు గల పట్టు ఎలాంటిదో సాజ్ వివరించాడు. ఈ సందర్భంగా ఆయన అధికారానికి చెందిన వివిధ దృక్పథాలను బాగా విడమరచి చెప్పాడు.

రోగులకు గల హక్కులను సాజ్ చర్చించాడు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించని రోగులకు హక్కులుంటాయి. చట్టాన్ని అతిక్రమించిన వారిని శిక్షించే తీరు వున్నది. మానసిక రోగులు ఇతరులను కొడుతున్నారని, ఆస్తికి నష్టం కలిగిస్తున్నారని అంటారు. అలాంటి పనులు నేరం క్రిందకు వస్తాయి. కాని అలాగాక, వారికి పిచ్చి

అని ముద్ర వేసి, ఆస్పత్రి పాలు చేసి సైకియాట్రిస్టులు వారిని తమ బానిసలుగా చేసుకుంటున్నారనేది సాజ్ విమర్శ. మతం మత్తుమందు అని మార్క్స్ అన్నాడు. సాజ్ దృష్టిలో మతాన్ని సృష్టించిన మనిషే మత్తును కూడా సృష్టించుకున్నాడంటాడు. మాటలగారడీలో పడి కొట్టుకుంటున్నా మని సాజ్ వాదన.

జబ్బు వస్తే, డాక్టర్లు నయం చేయాలేగాని, ఉద్దేశాలు అంటగట్టకూడదు. సైకియాట్రిలో ఉద్దేశాలు చూస్తున్నారు. ఒక 42 ఏళ్ళ స్ర్తీ, తాగి, కారునడుపు తుండగా, పోలీసు పట్టుకొని వూపిరి పరీక్ష (తాగుడు నిర్ధారణకు) చేయబోగా ఆమె నిరాకరించింది. తన్నేసింది, అరిచింది. గొడవ చేసింది. కోర్టులో న్యాయమూర్తి ఎదుట చెబుతూ, బహిష్ఠుకు ముందు లక్షణాలుగా తన ప్రవర్తనను వివరించింది. కోర్టు ఆమెను వదిలేసింది. సాజ్ యిలాంటి ఉదాహరణలు యిస్తూ, నేరానికీ రోగానికీ తేడా చూడనప్పుడు యిలాంటి స్థితి వస్తుందన్నాడు.

సైకియాట్రీ పేర్కొనే అనేక లక్షణాలు వ్యక్తిగత, ఆర్థిక, చట్టబద్ధ, సామాజిక, రాజకీయరంగాలకు చెందినవని, వైద్యరంగంలోకి రానివనీ సాజ్ చూపాడు.
సాజ్ వాదనలకు సమాధానం చెబితే, సైకియాట్రిస్టుల వృత్తి దెబ్బతింటుంది. ఆదాయం పోతుంది. కనుక వాదనకు దిగరు. శాస్త్రీయ వివరణకు పూనుకోరు. తమ పలుకుబడి వినియోగించి పెత్తనం చేస్తున్నారు.

ఆత్మ, మనస్సు, మోక్షం, నరకం దేవుడు, దయ్యం మొదలైనవి పురోహిత వర్గానికి ఆయువుపట్టు, వాటిని రుజువు చేయాల్సిన బాధ్యత వారికి లేదు. మనుషులు నమ్మినంతకాలం అవి వారి ఆయుధాలే. మానసిక రోగం, మనోవికారం, ఉన్మత్తత, పిచ్చి యిత్యాదులు సైకియాట్రిస్టుల అస్త్రాలు. అవి రుజువుకు నిలబడతాయా లేదా అనేది వారికి పట్టదు. దీనిపై వారి వ్యాపారం సలక్షణంగా సాగిపోయినంతకాలం, జనం పిచ్చి వదలదు!