

జ్యోతిష్యం భారత దేశం సొత్తు కాదు. ప్రపంచంలో అగ్రరాజ్యాలతో సహా అనేక చోట్ల ఇది ఉన్నది. భారతదేశంలో ప్రధానంగా మత, ధోరణిలో జోతిష్యం సాగింది. ఎక్కువగా పూర్వీకుల రచనలు, వాదనలు, ఆధారంగా జ్యోతిష్యం నడుస్తున్నది. మనుషులలో ఉన్న బలహీనతలు, నమ్మకాలు, పెట్టుబడిగా జ్యోతిష్యం వాడుకుంటున్నది. ఇందులో దోషాలు దిద్దుకోవటం, తప్పులు సవరించుకోవటం కనిపించదు. పైగా కుంటి సాకులతో కప్పి పుచ్చుకోవటం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం రుజువులు ఆధారాలు లేకపోవటమే. గ్రహాల నుండి మనుషులపై ప్రభావం చూపే ఆధారాలేమీ లేవు. కానీ ఉన్నట్లుగా నమ్మించి, చెప్పి వ్యక్తులను తప్పుదారిన పట్టిస్తున్నారు. ప్రాచీనమైనంత మాత్రాన అదే సరైనదనే ధోరణి నడుస్తున్నది. ముఖ్యంగా భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఎన్నో దోషాలు అమలులో ఉన్నాయి. మంచిని మాత్రమే స్వీకరించి దోషాలను వదిలేయటం అవసరం. ఉదాహరణకు అంటరాని తనం, కులహెచ్చుతగ్గులు, చాలా కాలం నుంచి వస్తున్నాయి. అంతమాత్రాన అవి మంచివని, వాటినే అనుసరించాలని అనలేము. అలాగే జ్యోతిష్యం ప్రాచీన కాలంలో ఎవరో చెప్పారని ఇప్పటికీ మూర్కంగా అనుసరించటం మన జనాన్ని వెనక్కి నడిపించటమే. ఇదే దోరణి విదేశాల్లోనూ ఉన్నది. అక్కడ ఛాలెంజ్ చేసినప్పుడు వారు రుజువులకు ముందుకు రారు. ఇండియాలోనూ అదే ధోరణి ఉన్నది.