Thursday, July 31, 2008

ఏసుక్రీస్తు మహిమలు








మహత్తుల పేరిట జనాన్ని ఆకర్షించడం హిందువుల సొత్తు మాత్రమే కాదు. అన్ని మతాల్లోనూ యివి కొద్దో గొప్పో వున్నాయి. క్రైస్తవులలో కొన్ని శాఖలు మహిమలను ఖండిస్తాయి. మరికొన్ని తటస్థ వైఖరితో వున్నాయి. కేథలిక్ లు, ఎవాంజలిక్ లు, మరికొందరు మహత్తులున్నాయంటారు. బైబిల్లో మహిమల ప్రస్తావన వుంది.
ప్రపంచంలో క్రైస్తవ మహిమలు జరగడం, వాటిని పోప్ గుర్తించడం ఒక చరిత్రగా కొన్ని వందల సంవత్సరాల నుండీ జరుగుతున్నది. మేరీమాత విగ్రహం కన్నీళ్ళు పెట్టడం, క్రీస్తు సమాధిపై కప్పిన బట్టపై క్రీస్తు ముద్ర పడిందనడం, ఆఫ్రికాలో ఎడారి ఇసుకలో క్రీస్తు పాదాల ఆనవాళ్లు వున్నాయనడం వింతగా చెబుతారు.
క్రైస్తవ మఠాధిపతులు, ఫాదరీలు అప్పుడప్పుడు కొన్ని మహిమలు చేసి ప్రచారంలోకి తెస్తుంటారు. హేతువాదులు జేమ్స్ రాండి, ప్రేమానంద్ యిలాంటివి బయటపెట్టారు. క్రైస్తవమత ప్రచారకులు అత్యంత అధునాతన టి.వి. రేడియో మొదలైన ప్రసార సాధనాలు వాడుతున్నారు.
దేవాలయంలో కొవ్వొత్తిని ఫాస్ఫరస్ ద్రావణంలో ముంచి నిలబెడతారు. ద్రావకం తడి వున్నంత సేపూ ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాత తడి ఆరగానే కొవ్వొత్తి అంటుకుంటుంది. అదొక గొప్ప క్రీస్తు మహిమగా చూపుతారు.
మరో కొవ్వొత్తి స్టాండులో కొవ్వొత్తి క్రోమిక్ యాసిడ్ స్ఫటికాలు వేయాలి. ఇంకో కొవ్వొత్తిని ఆల్కహాలులో ముంచాలి. ఆల్కహాలులో ముంచిన కొవ్వొత్తిలో క్రొమిక్ యాసిడ్ స్ఫటికాలున్న కొవ్వొత్తిని తాకిస్తే రెండూ వెలుగుతాయి.
అప్పుడు కూడా ప్రార్థనలు చేసి ఏసు మహిమగా చెబితే పరీక్ష చేయకుండా నమ్మే భక్తులు నమ్ముతారు.

మదర్ తెరీసా పేరిట మోసపూరిత అద్బుతాలు చూపి ఆమెను సెయింటు చేసి మత వ్యాపారం చేస్తున్నారు.

Tuesday, July 29, 2008

ఇలాంటి పోలీస్ వుంటే


అబ్రహాం కోవూరు




అబ్రహాం కోవూరు సుడిగాలి పర్యటన చేస్తున్న రోజులవి. ఎమర్జన్సీ కాలమైనా, హేతువాద ప్రచారానికి అడ్డురాలేదు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, తెనాలి మొదలైనచోట్ల బహిరంగ ప్రదర్శన సభలు యువతని ఆకర్షించాయి. కోవూరు అప్పటికే బహుళ ప్రచారం పొందిన వృద్ధ హేతువాదమాంత్రికుడు.
కేరళలో చాలాకాలం వుండి, శ్రీలంకలో స్థిరపడి, పుస్తకాలు రాశారు. కోవూరు తన మంత్రజాల మహిమలతో బాబాల, మాతల గుట్టు రట్టు చేస్తూ పోయారు. అనేక మంది బాబాలను సవాల్ చేశారు. ఆయన థాటికి ఎవరూ నిలవలేకపోయారు. అమెరికా వెళ్ళి జేమ్స్ రాండితో కలసి పని చేశారు. ఆయన రచనలు విస్తృత ప్రచారం పొందాయి.
హేతువాద సంఘాల పక్షాన కోవూరును ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానించాం. పర్యటన అంతా సఫలమైంది.
1976 నవంబరు 30న అనంతపురం లలిత కళా పరిషత్ హాలులో సాయంత్రం సభ ఏర్పాటు చేశారు అక్కడి హేతువాద మిత్రులు. కాని పోలీస్ ఆ సభకు అనుమతియివ్వలేదు. కారణం?
కోవూరు నాడు పుట్టపర్తి సాయిబాబాను ఛాలెంజ్ చేస్తూ పోయారు. బెంగుళూరు దగ్గర వైట్ హాలుకు వెళ్ళి ఎదుర్కొన్నారు. సాయిబాబా మహత్తుల బూటకాలను బయటపెడుతూ రచనలు చేశారు.
ఈ నేపధ్యంలో గొడవ అవుతుందనే దృష్ట్యా కోవూరు సభను పోలీస్ లు అనుమతించలేదు. పొలీస్ లలో కూడా సాయిబాబా భక్తులుండడం మరో కారణం.
ఆనాడు రాష్ట్ర పొలీస్ ప్రధానాధికారిగా కోన రామచంద్రారెడ్డి వున్నారు. అప్పట్లో ఇన్ స్పెక్టర్ జనరల్ అనేవారు. ఇంకా డి.జి.పి. అని రాలేదు. హైదరాబాద్ లో పొలీస్ క్లబ్ దగ్గర, మసాబ్ టాంక్ సమీపంలో రామచంద్రారెడ్డి నివాసం.
మిసిమి సంపాదకులు ఆలపాటి రవీంద్రనాథ్ (ఇంకా మిసిమి రాలేదు), హేతువాత సంఘం తరపున నేను, కోనరామచంద్రారెడ్డి యింటికి వెళ్ళాం. అనంతపురంలో కోవూరు సభను స్థానిక పోలీస్ లు అడ్డుకుంటున్న విషయం ఆయన దృష్టికి తెచ్చాం. ఐ.జి. నాస్తికుడేమీ కాదు. అయినా విషయం అంతా విని, భావ స్వాతంత్ర్యం వుండాల్సిందేనన్నాను. వెంటనే ఫోను తీసుకొని స్థానిక పోలీస్ పై ఆగ్రహించి, సభకు అనుమతించమన్నారు.
సాయిబాబాకు వ్యతిరేకంగా మాట్లాడితే, సభకు అనుమతించకపోవడం అవివేకం అన్నారు. ఆయన నిర్ణయాలకు సహకారానికి చాలా సంతోషించాం. వెంటనే అనంతపురంలో హేతువాద సంఘానికి విషయం తెలియపరిచాం. వారంతా సంతోషించారు. కోవూరు సభ జయప్రదంగా జరిగింది. సాయిబాబా పంచినట్లు విభూతి పంచడం, గాలిలో చేతులు తిప్పి వస్తువులు, ఉంగరాలు, తాయత్తులు శివలింగాలు తీసి యివ్వడం ఎలాగో కోవూరు చేసి చూపారు.
కేవలం ప్రదర్శించడమే గాక, దాని వెనుక వున్న హస్తలాఘవం, సైన్స్ విడమరచి చెప్పడం కోవూరు విశిష్టత.
కోనరామచంద్రారెడ్డి వంటి పోలీస్ అధికారులు నేడు అవసరం. పోలీస్ అధికారులు తమ వ్యక్తిగత విశ్వాసాల నుండి విధులకు వేరు చేసి చూడగల విచక్షణ కావాలి.

Monday, July 28, 2008

Rare Honor to Telugu person







అమెరికా లొ ఆవుల గోపాలక్రిష్ణమూర్త్తి 1963 లో ఆ ప్రభుత్వ ఆహ్వానం పై పర్యటించినప్పుడు ఒక విశేషం జరిగింది. కాలిఫోర్నియా రాష్త్రంలో ఫ్రెస్నొసిటి మేయర్ గా ఒక రోజు నియమితులయ్యారు. ఇది అరు దై న గౌ రవం .మేయర్ వి ధు లు : He will perform the duties of office, and agrees to reveal to all, the beauties, attractions and culture of Fresno. He further agrees to boost Fresno as a place of work, live and play.

Saturday, July 26, 2008

సాహితీపరులతో సరసాలు

పాలగుమ్మి పద్మరాజు
(1915-1983)












పాలగుమ్మి పద్మరాజు సుప్రసిద్ధ రాడికల్ హ్యూమనిస్ట్. ఎమ్.ఎన్.రాయ్ అనుచరుడు. మానవ వాద తత్వ ప్రభావంతో, రచనలు చేసిన వ్యక్తి. అయితే అనేకమంది దృష్టిలో ఆయన సినీరచయిత, నవలా కారుడు, కథకుడు.
మదరాసు మైలాపూరులో పద్మరాజు చాలా ఏళ్ళు ఉన్నారు. అప్పుడే నేను, ఆలపాటి రవీంద్రనాథ్ ఆయన్ను తరచు కలిశాం. పద్మరాజు మానవ వాద సమావేశాలకు, గోష్టులకు, అధ్యయన శిబిరాలకు వచ్చి ఉపన్యాసాలు చేసేవారు. ఆయన ప్రసంగాలు ఆక్షర్షణీయంగా, లోతుపాతులతో ఉండేవి. ఎమ్.ఎన్.రాయ్ మానవ వాదాన్ని బాగా అర్థం చేసుకోవటమే కాక. తన రచనల్లో ఇమిడ్చి జనానికి చెప్పిన గొప్ప భావుకుడు.
పాలగుమ్మి పద్మరాజు కాశీ విశ్వవిద్యాలయంలో ఎమ్.ఎస్.సి. కెమిస్ట్రీ చదివి, లెక్చరర్ గా కాకినాడలో, భీమవరంలో పనిచేశారు. కాశీలో ఉండగానే ఆయనపై కమ్యూనిజం ప్రభావం చూపింది. అయితే తిరిగి వచ్చిన తరువాత మానవ వాదం వల్ల, కమ్యూనిజాన్ని పక్కన పెట్టేశారు.
పద్మరాజు 1915 జూన్ 24న తిరుపతి పురంలో (తణుకు తాలూకా, పశ్చిమగోదావరి జిల్లా) లో పుట్టారు. అత్తిలిలో 8వ తరగతి వరకు చదివి కవితలు అల్లడం మొదలు పెట్టారు. అది చివరి వరకూ సాగింది. కొవ్వూరులో హైస్కూలు విద్య ముగించి రాజమండ్రిలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. అడ్వకేట్ అవుదామని అభిలషించారు. కానీ లెక్చరర్ గా మారి చివరకు సినిమా రంగంలో కుదురుకున్నారు.
1949లో పద్మరాజు భీమవరంలో ఉండగా పెద్ద గాలివాన వచ్చి ఆయన ఉంటున్న నివాసం కూలిపోయింది. ఆయన భార్య అప్పుడు విపరీతమైన దెబ్బలతో కొంతకాలం బాధపడింది. బహుశా ఆ అనుభూతి వల్లన కావచ్చు పద్మరాజు గాలివాన శీర్షికన కథ రాశారు. దానికి ప్రపంచ స్థాయి గుర్తింపు, బహుకరణ వచ్చింది. న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ ఇంగ్లీషు దినపత్రిక నిర్వహించిన పోటీలో ఆ కథ ఎంపిక అయ్యింది.









ఎమ్.ఎన్.రాయ్ పార్టీ రహిత ప్రజాస్వామ్యం, వికేంద్రీకరణ, మానవ విలువలు సిద్ధాంతాలను దృష్టిలో పెట్టుకొని, “రెండవ అశోకుని మూణ్ణాళ్ళ పరిపాలన” అనే రచన చేశారు. ఒక జటిలమైన సిద్ధాంతాన్ని ఆక్షర్షణీయ మైన నవలగా చిత్రీకరించగల హ్యూమనిస్టు పద్మరాజు.
మేము ఒకసారి మదరాసులో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అరుగుమీద పడక కుర్చిలో కూర్చుని ఉన్నారు. మమ్ములను చూసి కొంచం సిగ్గు పడ్డారు. ఎందుకా అనుకున్నాం. ఆ రోజు ఇంట్లో ఆయన భార్య ఏదో వ్రతం చేస్తున్నది. స్త్రీల హడావిడి కనిపించింది. అందుకే ఆయన సిగ్గు పడ్డారు. ఇలాంటివి పద్మరాజుకు ఇష్టం లేనివి. కాని రాజీపడి ఊరుకున్నాడు. తను మాత్రం ఆచరణలో రచనల్లో మానవ వాదాన్ని చూపారు. పద్మరాజు చేయి తిరిగిన రచయిత.
నార్ల వెంకటేశ్వరరావు తన నాటకాలను ముందుగా చదివి వినిపించటం. చర్చకు పెట్టడం ఆనవాయితీగా మదరాసు, విజయవాడలలో అలవాటు చేశారు. సీతజోస్యం నాటకం అలా చర్చించినప్పుడు పద్మరాజు ప్రముఖంగా పాల్గొన్నారు. ఆవుల గోపాలకృష్ణమూర్తి, అబ్బూరి రామకృష్ణారావు, ఎమ్.వి. శాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బి.ఎస్.ఆర్. కృష్ణ, డి. ఆంజనేయులు మొదలైన వారెందరో పద్మరాజుకు సన్నిహితులు.
అనేక సినిమాలకు పద్మరాజు కథలు, సంభాషణలు రాశారు. డి.వి. నరసరాజుతో సన్నిహితంగా ఉండేవారు. బి.ఎన్. రెడ్డి ఆయనకు మంచి మిత్రులు.
పద్మరాజు రచనలు : బంగారు పాప (1954), రక్తకన్నీరు (సాంఘిక నాటకం) (1965), వెలుగు నీడలు-సాంఘిక నాటకం (1966), బతికిన కాలేజీ (1967), రామరాజ్యానికి రహదారి (1972), శ్రీ రాజేశ్వరి విలాస్ (1976), కప్పు మన్ను (1978), నల్లరేగడి (1989), రంగుల రాట్నం (కథ), భాగ్యరేఖ (కథ), చచ్చి సాధించాడు (నవల) ఇంకా నాటకాలు, నాటికలు, వ్యాసాలు.
1966లో స్టోరీస్ ఫ్రమ్ ఇండియాలో పద్మరాజు రాసిన పడవ ప్రయాణం అనే కథను చేర్చి తరువాత దానికి బహుమతి కూడా ఇచ్చారు. తన కథను తానే ఇంగ్లీషులోకి అనువదించారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో 1966లో ప్రచురించారు.
1968లో పద్మరాజు యూరప్ లోని హంగరీ, బల్గేరియా, రుమేనియా, యుగస్లేవియాలలో పర్యటించి, భారత ప్రభుత్వ సంస్కృతి ప్రతినిధిగా వ్యవహరించారు. పద్మరాజు కేంద్రరాష్ట్ర అకాడమీ అవార్డులు అందుకున్నారు. కొన్ని రచనలు నచ్చగా తెలుగులోకి అనువదించారు. సావిత్రి, వానకారు కథ, చచ్చిపోయిన మనిషి, జవ్వనులకు జాజాగేబర్ సలహాలు వంటివి పేర్కొన తగినవి.
పద్మరాజు సంపూర్ణ రచనలు ప్రచురించే ప్రయత్నాలు సాగుతున్నాయి. త్వరలోనే అవి వెలుగు చూడవచ్చు. పద్మరాజుతో సన్నిహితంగా ఉండగలగటం ఎంతో మంచి అనుభవం.
డి. ఆంజనేయులు ఇంగ్లీషులో పద్మరాజును గురించి చక్కని అంచనా వేసిన వ్యాసం తన పుస్తకం (Glimpses of Telugu Literary persons)లో చేర్చారు.
పి. పోలయ్య పరిశోధన చేసి పద్మరాజు సాహిత్యంపై సిద్ధాంత గ్రంధం శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతికి సమర్పించారు.

Tuesday, July 22, 2008

జస్టిస్ ఆమంచర్ల గంగాథరరావు


జస్టిస్ గంగాధర రావు పుస్తకం విడుదల చేస్తూ















కొందరు న్యాయ మూర్తులతో సన్నిహిత పరిచయం వుండడం గొప్ప అనుభవం.కేవలం కోర్తులకు పరిమితం గాక మానవ విలువలు పాటించే వారి పాత్ర విశేష మైనది.గంగాధర రావు ఆ కో వకు చెందుతారు .
జస్టిస్ గంగాథరరావుకు 87 సంవత్సరాలు, వాకర్ పట్టుకొని ఇంట్లోనే నడుస్తున్నారు. చూపు, జ్ఞాపకశక్తి బాగా వున్నాయి. సమకాలీన విషయాలు చదువుతారు.
జడ్జిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి రిటైర్ అయిన తరువాత కొన్ని కమీషన్ లకు అధ్యక్షత వహించారు. దుర్గాబాయ్ దేశ్ ముఖ్ సoస్థలకు ఆధిపత్యం వహించారు. అనేక మానవవాద హేతువాద సభలలో పాల్గొని ప్రసంగించారు.
1921లో నెల్లూరులో పుట్టిన గంగాథరరావు ఉన్నత విద్యను మదరాసులో పూర్తి చేసుకొని లాయర్ గా బొంబాయిలో హైదరాబాద్ లో ప్రాక్టీసు చేశారు. జడ్జి కాకముందు పబ్లిక్ ప్లాసిక్యూటర్ గా పనిచేశారు. జడ్జి కావడానికి అర్హత జాబితాలోకి వచ్చినా, పదవి రావటానికి 10 సంవత్సరాలు పట్టింది. అందుకు కారణం ఆయన విద్యార్థి దశలో కమ్యూనిస్టు ఉద్యమాలలో పాల్గొనటమే.
1940లోనే గంగాథరరావు విద్యార్థి ఉద్యమాలలో చురుకుగా పాల్గొని చక్కని ఉపన్యాసాలు చేసేవారు. ఆయన ఉపన్యాసాలు ఎంతగా ఆకట్టుకున్నాయంటే, ఏకగ్రీవంగా స్టూడెంట్ ఫెడరేషన్ కు రాష్ట్ర నాయకుడుగా ఎన్నుకున్నారు. కమ్యూనిస్టు ఉద్యమంలో జైలుకు వెళ్ళి 1942లో ఏడాదిపాటు వెల్లూరు కారాకారంలో అనుభవించారు. అప్పటికే ఆయనకు పెళ్ళి అయింది. జైలుకు పోయేముందు ఆయన భార్య గర్భిణి. ఆయన జైలులో ఉండగా తొలి కుమార్తె ఝాన్సీ పుట్టింది. కాని ఏడాది వరకు తన కుమార్తెను చూసుకొనే అవకాశం ఆయనకు లేకపోయింది. 1940 ప్రాంతాలలో గుంటూరు సభలలో హీరేన్ ముఖర్జి, జ్యోతిబసు వంటి వారు, ఆయన ఉపన్యాసాలు విని మెచ్చుకున్నారు.
వెల్లూరులో ఆయనతో పాటు పుచ్చలపల్లి రామచంద్రా రెడ్డి, పిల్లల మర్రి వెంకటేశ్వర్లు, కామరాజు నాడార్ మొదలైన వారు ఎందరో సహచరులు.
గంగాథరరావును అభిమానులు గన్ అని పిలిచేవారు. చాలా చురుకైన, పదునైన ఉపన్యాసాలు చేయటమే అందుకు కారణం. గంగాధరరావుగారితో నాకు చిరకాలంగా సన్నిహిత మిత్రత్వం ఉన్నది. అబద్ధాల వేట, అనే నా పుస్తకాన్ని ఆయన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరిస్తూ, విమర్శనాత్మక ప్రసంగం చేశారు.
అమెరికా ఒకసారి ఆయన పర్యటించినప్పుడు అక్కడ కూడా కలుసుకుని కాలక్షేపం చేశాం. న్యాయ సలహాలు ఇవ్వటంలో దిట్ట. ప్రొఫెసర్ శేషాద్రి, ఆలపాటి రవీంద్రనాథ్, నేను, గంగాథరరావు కలసి, ఎన్నో సందర్భాలలో చర్చలు జరిపాము. ఆయనతో సన్నిహితత్వం చక్కని అనుభవం.

Saturday, July 19, 2008

మావూరి సాహితీ పరులు


సూర్యదేవర రాజ్యలక్ష్మీ దేవి, వట్టి కొండ విశాలాక్షి, వాసిరెడ్డి సీతాదేవి కొర్నెపాటి శేషగిరి రావు, మారేమండ నాగేశ్వరరావు.
మా చేబ్రోలుకు చెందిన సాహితీ పరులలో బాగా పేరు తెచ్చుకున్న రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. అంతగా తెలియని కవి, టీచర్ కొర్నెపాటి శేషగిరి రావు.
సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి, కాంగ్రెస్ సేవాదళ నాయకురాలిగా, ఎన్.జి. రంగా శిష్యురాలుగా, గ్రామంలో మహిళా శిక్షణ కేంద్రాలు నిర్వహించారు. ఇది 1950 నాటి మాట. ఆ తరువాత ఆమె హైదరాబాద్ కు తరలి, స్థిరపడిపోయారు. తెలుగు దేశం అనే పత్రిక పెట్టి చాలా కాలం నడిపారు. అందులో రాజకీయ, సాంఘిక విషయాలు ప్రచురించారు. సాంఘిక, సేవకురాలిగా అనేక మంది యువతులకు ఉద్యోగాలు కల్పించడం ఆమె వృత్తిగా పెట్టుకున్నారు. హైదరాబాద్ లో వి.బి. రాజుతో కలసి రాజకీయాల్లో వున్నారు. మాకు కుటుంబ మిత్రురాలు.
వట్టికొండ విశాలాక్షి కథలు, నవలలు రాశారు. ఆమె భర్త వట్టికొండ రంగయ్య గుంటూరు నుండి నడిపిన ప్రజా వాజావాణి వారపత్రికలో ఆమె రచనలు ప్రచురితంకాగా, పుస్తక రూపం దాల్చాయి.
కొర్నెపాటి శేషగిరిరావు చేబ్రోలు ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా వుంటూ, కవితలు రాశారు. 1945 నుండీ కుటుంబం అంతా నాకు తెలుసు, నాకు టీచర్ కూడా, మా అన్న విజయ రాజకుమార్ కు కవిత్వం, రచన, ఛందస్సు, చెప్పేవాడు. పుస్తకాలు స్వయంగా అచ్చు వేయించుకొని, సంచిలో పెట్టుకుని తిరిగి అమ్ముకునే వారు.
మారేమండ నాగేశ్వరరావు నాకు ఎ.సి. కాలేజీలో తెలుగు టీచర్ 1954-58లో. ఆయన బోధన అంత ఆసక్తికరం కాదు. మిత్రులుగా సహృదయులు. కవితలు రాశారు. మారేమండ Made difficult అనిపించుకున్నారు, కత్తి అంటే ఛురక అంటూ పాఠాలు చెప్పేవారు.
వాసిరెడ్డి సీతాదేవి (1933-2007) చేబ్రోలులో నాకు పరిచయం లేదు. హైదరాబాద్ లో స్థిరపడిన తరువాత తెలుసు. బాగా సన్నిహితులమయ్యాం. ఆమెకు నవలా రచయిత్రిగా ఖ్యాతి లభించింది. చాలా మంది అనుకున్నట్లు ఆమె కమ్యూనిస్టు కాదు. కాని ఆమెకుటుంబంలో, సోదరుడు నారాయణరావు కమ్యూనిస్టు.
సీతాదేవి అవివాహిత. ప్రభుత్వ ఉద్యోగిని. తెలుగులో రచనలు చాలా చేయగా ఇంగ్లీషులో పరిమితంగా రాశారు. ఆమె రచనల ఆధారంగా సినిమాలు వచ్చాయి. కొన్ని రచనలు వివాదాలకు దారి తీశాయి. మరీచిక నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించగా కోర్టుకు వెళ్ళి అది తొలగింపజేసుకోగలిగింది. అనేక అవార్డులు, సత్కారాలు, సన్మానాలు పొందారు.
రచనలు : మట్టి మనిషి, కీర్తి నార్జించిన నవల. నవలలు-40, కథలు-9, వ్యాసాలు-3, పిల్లల పుస్తకాలు-5, మరీచిక (నవల-నిషేధానికి గురైంది)
ఎడిటర్ : వనితా జ్యోతి. హిందీ, ఇంగ్లీషు నుండి అనువాదాలు చేశారు.
సినిమాలుగా వచ్చిన నవలలు : సమత, ప్రతీకారం, ఆమెకథ, మృగతృష్ణ, మానని మనస్సు.

Wednesday, July 16, 2008

Sahiti Parulato Sarasalu-Talluri Nageswararao

తాళ్ళూరి నాగేశ్వరరావు
(1934-1986)

నవలలు, కథలు విపరీతంగా ఉత్పత్తి చేసిన తాళ్ళూరి నాగేశ్వరరావు మంచి మిత్రులు తెనాలి వద్ద కొలకలూరుకు చెందిన వారు. తెనాలిలో, సాగర్ లో చదివి, తెలుగు అకాడమీలో ఉద్యోగం చేశారు. యువ మాసపత్రిక హైదరాబాద్ నుండి వెలువడుతున్నప్పుడు, నిర్వహణ బాధ్యతలు చేబట్టారు. పేరు వుండేది కాదు.
వ్యక్తిగతంగా నాకు సన్నిహితుడు, స్నేహపాత్రుడు. తిరుపతి వెంకన్న భక్తుడు. సిగరెట్లు, విస్కీ బాగా అలవాటు. హైదరాబాద్ బోట్స్ క్లబ్ లో నేనూ, బూదరాజు రాధాకృష్ణ, ఆయనతో కాలక్షేపం చేసిన రోజులు చాలా వున్నాయి. (1980 ప్రాంతాల్లో) తెలుగు అకాడమీలో బండచాకిరీ చేసేవాడు. రచనలపై కొంత ఆర్జించారు.
ఆరోగ్యం దెబ్బతినడంతో త్వరగా చనిపోయారు. తెలుగు స్వతంత్రలో రచనలు 1948లోనే మెదలెట్టారు. ఆనందవాణి, భారతి, యువ పత్రికలలో చాలా రచనలు చేశారు.
రచనలు : కథకుని కర్మ సిద్ధాంతం, కొత్త యిల్లు, శ్రీవల్లి సంధ్య, రేడియో నాటికలు, కథానికలు, నవలలు.

Monday, July 14, 2008

సాహితీ పరులతో సరసాలు - బి.ఎస్.ఆర్.

బి. ఎస్. ఆర్. కృష్ణ (బండ్లమూడి శివరామకృష్ణ)




ఎడమవైపు మొదటి వ్యక్తి బి.ఎస్.ఆర్.



1954లో గుంటూరులో బి.ఎస్.ఆర్. కృష్ణతో పరిచయమైంది. అప్పుడు నేను ఎ.సి. కాలేజి విద్యార్థిగా ప్రజావాణి తెలుగు వారపత్రికలో రాస్తుండేవాడిని. వట్టి కొండరంగయ్య సంపాదకులు. ప్రతివారం శైలేంద్ర పేరిట రాజకీయ వ్యాఖ్యానం మొదటి పేజీలో బి.ఎస్.ఆర్. రాసేవారు. అలా కలిసిన మేము యిప్పుటి వరకూ సన్నిహితులుగా వున్నాం.
టాల్ స్టాయ్ కథలు కొన్ని తెనిగించిన బి.ఎస్.ఆర్. సొంత కథలు రాశారు. కర్షక పత్రికలో, మద్రాసు నుండి తాత్కాలికంగా నడిచిన విజయ ప్రభలో బి.ఎస్.ఆర్. పనిచేశారు. గుంటూరులో టుబాకో బోర్టు వారునడిపిన పోగాకు లోకం పత్రికను బి.ఎస్.ఆర్. ఎడిట్ చేశారు.
ఆనాడు ఆంధ్రప్రభ నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వాన మద్రాసు నుండి వచ్చేది. గుంటూరులో సోమయాజులు విలేఖరి. కొన్ని వాస్తవ వార్తలు పంపితే వేసేవారు కాదు. వారికి నచ్చి కొన్ని వార్తలకు అనూహ్య ప్రచారం యిచ్చేవారు. ఒకసారి ప్రజావాణి కార్యాలయంలో బి.ఎస్.ఆర్., నేనూ కూర్చొని ఒక వార్త సృష్టించాం. గుంటూరు జిల్లా కళాకారుల సంఘం ఏర్పరచినట్లు, ప్రారంభోత్సవానికి అక్కినేని నాగేశ్వరరావును ఆహ్వానిస్తున్నట్లు వార్త రాసి పంపాం. పెద్ద అక్షరాలతో బాగా ప్రచురించారు. నవ్వుకున్నాం.
బి.ఎస్.ఆర్. తో బాటు తరచుగా ప్రజావాణిలో దరువూరి వీరయ్య, వాసిరెడ్డి సత్యనారాయణ (చెరుకు లోకం సంపాదకులు), నల్లమోతు సత్యనారాయణ రాస్తుండేవారు. ఆ తరువాత బి.ఎస్.ఆర్., దరువూరి వీరయ్య వియ్యంకులు అయ్యారు. ఎన్నికల సమయంలో ఆచార్య రంగా పత్రిక వాహిని తాత్కాలికంగా దినపత్రికగా నడిపేవారు. 1955 ఎన్నికలలో విజయవాడ నుండి అలా నడిపినప్పుడు బి.ఎస్.ఆర్., కె.వి.సుబ్బయ్య అందులో పనిచేశారు.
1956లో బి.ఎస్.ఆర్. కొత్త ఉద్యోగం రీత్యా మద్రాసు వెళ్ళి, అమెరికన్ కాన్సలేట్ లో చేరారు.
అమెరికన్ రిపోర్టర్ పత్రిక నిర్వహించారు. నిబంధనల రీత్యా యితర పత్రికలకు రాయడానికి వీల్లేదు. 1983లో రిటైర్ అయ్యేవరకు ఆయన రాయలేదు.
మద్రాసు తరచు వెళ్ళి బి.ఎస్.ఆర్. ను కలిసేవాణ్ణి. అమెరికన్ కాన్సలేట్ వున్నాడు గనుక ఆయన సిఫారసు చేస్తే, వీసాలు సులభంగా వస్తాయని భ్రమించేవారు. అలా వచ్చిన వారికి నిష్కర్షగా బి.ఎస్.ఆర్. నిజం చెప్పేవారు. సిఫారసులు నడవవనీ, అలా చేస్తే అయ్యే పని కూడా చెడుతుందని అనేవారు. ఆశపడి వచ్చిన వారికి అది నచ్చేది కాదు.
కాన్సలేట్ లో ఆయనతో బాటు కె.వి. సుబ్బయ్య, వల్లభ జోస్యులు సుబ్బారావు కుమారుడు భాస్కరరావు, మాగంటి కోటేశ్వరరావు, ఎం. మాధవ రావులు సహచరులుగా పనిచేశారు. అక్కడ మంచి లైబ్రరీ వుండేది.
అమెరికన్ కాన్సలేట్ లో పనిచేస్తూ అమెరికా వెళ్ళని ఆఫీసర్ బి.ఎస్.ఆర్. రిటైర్ అయి, పెన్షన్ స్వీకరిస్తున్నారు. అప్పుడు రచనా వ్యాసంగం ప్రారంభించారు. ఆంధ్రజ్యోతిలో కొన్నాళ్ళు రాశారు. వివిధ చిన్న, పెద్ద పత్రికలకు రాశారు.
తెలుగుదేశం ఎన్.టి.రామారావు స్థాపించిన తరువాత, హైదరాబాద్ వచ్చి, వారి కోరికపై శిక్షణ విద్యాలయంలో కొన్నాళ్ళు బి.ఎస్.ఆర్. శిక్షణ యిచ్చారు.
చెన్నపురి ఆంధ్రమహాసభ, మద్రాసు తెలుగు అకాడమి, మద్రాసు జర్నలిస్టు అసోసియేషన్, రచన అనే రచయితల సంఘం, ప్రపంచ తెలుగు సమాఖ్య కార్యక్రమాలలో చురుకుగా పాలొంటున్నారు. ఇందిరాదత్ తో కలసి సమాఖ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందు లో అప్పుడప్పుడు పుస్తక సమీక్ష చేస్తున్నారు. సొంత యిల్లు అమ్మేసి, అద్దె యింట్లోనే హాయిగా వుంటున్నారు.
బి.ఎస్.ఆర్. తన కుమారుడి జ్ఞాపకార్థం రవీంద్రనాథ్ ఠాగోర్ రాసిన స్వేచ్ఛ గేయాన్ని పుస్తకంగా వేసి, పంచారు. ఒకే గేయాన్ని దాదాపు 30 మంది తెలుగులో చేసిన అనువాదం యీ గ్రంథం. సౌమ్యంగా మాట్లాడతారు. అలాగే రాస్తారు. ఆయన సన్నిహితంగా మెలగిన వారిలో పాలగుమ్మి పద్మరాజు, డి. ఆంజనేయులు, కొంగర జగ్గయ్య, మల్లిక్, రమణయ్య, రాజా, చందూర్, మాలతీ చందూర్, బెజవాడ గోపాలరెడ్డి, ఆచార్య రంగా, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బాపు, రమణ యిలా పెద్ద జాబితా వుంది.
జమీన్ రైతు వారపత్రిక వారిచ్చిన రామానాయుడు జర్నలిజం అవార్డ్ బి.ఎస్.ఆర్.కు సరైనది.
ఆయన జన్మదిన సన్మాన సభలో పురాణం సుబ్రహ్మణ్యశర్మ సింగిల్ కాలం వలె నిటారుగా బి.ఎస్.ఆర్, విలువలు నిలుపుతున్నాడన్నారు. బాగుంది.

Sunday, July 13, 2008

Mesmer cheated-final part-కనుకట్టు విద్యగా





ప్రాలిన్ పేరడిస్ అనే బాలిక 1763 డిసెంబరు 9 ఉదయం హఠాత్తుగా తన చూపు పోయిందని తెలుసుకున్నది. ఆ బాలిక వయస్సు 4 ఏళ్ళు. కంటి నరం పక్షవాతంతో వున్నందున యిది నయం కాదని వైద్యులు చెప్పారు. తల్లిదండ్రుల సంప్రదాయంగా ఆ బాలికకు పియానో వాయించడం అలవాటైంది. రాణి కొలువులో ఆమె తల్లిదండ్రులు పనిచేసేవారు. ఆ బాలిక ప్రతిభ రాణిని ఆకర్షించింది. 10 ఏళ్ళపాటు వియన్నాలో అత్యుత్తమ కంటి వైద్యుడు చికిత్స చేసినా చూపు రాలేదు. ఈలోగా పియానోపై తన ప్రతిభను చూపుతున్న పేరడిస్ (మరియా తెరీసా అని కూడా పిలిచేవారు) లండన్, ప్యారిస్ మొదలైన చోట్ల కచేరీలు చేసి, గుడ్డి అమ్మాయి అద్భుతంగా పియానో వాయించడం పట్ల అందర్నీ ఆకట్టుకున్నది. కంటి వైద్యుడు ఏంటన్ వాన్ స్టార్క్ 14 ఏళ్ళ ప్రాయంగల ఆ అమ్మాయి కంటి నరం చెడలేదని నిర్ణయించాడు. కాని అతడి చికిత్స పనిచేయలేదు. గుడ్డితనాన్ని నటనగా ఆమె వాడుకుంటుందన్నమాట. అది గిట్టుబాటు గుడ్డితనం.
అలాంటి దశలో మెస్మర్ తటస్తపడ్డాడు. శారీరకంగా కంటిజబ్బు వుంటే నయం కాదని, లేకుంటే చికిత్స చేయవచ్చనీ చెప్పాడు. 1778లో మెస్మర్ ఆమెకు చికిత్స ప్రారంభించాడు. 1777 నుండీ ఆమె మెస్మర్ చికిత్సాలయంలో వుండగా, కొద్దివారాలలోనే చూపు కొంతమేరకు వచ్చింది. తల్లిదండ్రులు సంతోషించారు. మొదటిసారి చూపు వచ్చినప్పుడు ఎదుట వున్న మెస్మర్ ను చూచి, ఎంత భయంకర దృశ్యం అని ఆమె వ్యాఖ్యానించింది. చూపు వచ్చిన తరువాత ఆమె మానసికంగా కృంగిపోయింది. బంధుమిత్రులను చూచినప్పుడు మూర్ఛపోతుండేది. ఆమె హిస్టీరియా జబ్బుతో వుందని బయటపడింది. కావాలని గుడ్డితనం నటించిన ఫలితమిది.
వియన్నాలో జోసెఫ్ బార్త్ ఆధ్వర్యాన వైద్యబృందం పరిశీలించి మెస్మర్ ను తీవ్రంగా విమర్శించింది. ముందున్న వస్తువుల్ని మరియా తెరీసా పేరడీస్ యింకా గుర్తించలేకపోతున్నదని వారు వెల్లడించారు. అంతటితో మెస్మర్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఆ అమ్మాయికి చూపు వచ్చి వుంటే (మెస్మర్ చెబుతున్నట్లు) రాణి యిచ్చేడబ్బు ఆమె తల్లిదండ్రులకు యిక యివ్వనవసరం లేదన్నారు వైద్యులు. పియానో వాయించే కచేరీలలో ఆమె పట్ల ఆకర్షణ సగం పోవడం ఖాయమన్నారు. దీంతో ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెను తమకు అప్పగించమని మెస్మర్ ను కోరారు. మెస్మర్ కుంగిపోయాడు తన ప్రతిష్ఠ దెబ్బతిన్నందుకు.!
మెస్మర్-రోగిగా వున్న మరియాతెరరీసా ప్రేమికులుగా వున్నట్లు సమాజంలో ప్రాకిపోయింది. వియన్నాలో యీ విషయం దుమారం వలె అల్లుకపోయింది. ఈ ఫార్సుకు అంతం పలుకమని రాణి మెస్మర్ ను ఆదేశించింది. 1777 మే 2వ మెస్మర్ ఆ ప్రేమికురాలిని తల్లిదండ్రులకు అప్పగించాడు. ఆమె వయస్సు 18 ఏళ్ళు.
తల్లిదండ్రుల వద్దకు చేరిన మరియా తెరిసాకు మళ్ళీ చూపులేదు. గుడ్డితనాన్ని ఆమె ఆనందించింది. అలాగే పియానో కచేరీలు చేసి కీర్తి ఆర్జించింది. మొజార్ట్ కూడా ఆమె కోసం ప్రత్యేకంగా సంగీతం సమకూర్చాడు. 1874 పారిస్ లో అంధురాలుగా ఆమెను జనం పొగుడుతుంటే, అపఖ్యాతి పాలైన మెస్మర్ అక్కడే వున్నాడు.!
1778లో వియన్నా నుండి పారిస్ వెళ్ళిపోయిన మెస్మర్ ఎకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడి వద్దకు చేరి తన మెస్మరిజాన్ని శాస్త్రీయంగా పరిశీలించమన్నాడు. అధ్యక్షుడు ఛార్లిస్ లి రాయ్ యీ విషయం పరిశీలించడానికి మెస్మర్ ను రాసి యివ్వమన్నాడు. మెస్మర్ 27 ప్రతిపాదనలు రాశాడు. చికిత్స సంపూర్ణతకు తన విధానం పరాకాష్ఠ అని మెస్మర్ గొప్పలు చెప్పుకున్నాడు. తన వైద్యవిధానం ప్రచారం చేయడానికి ప్రభుత్వం నియమించిన మతసంస్థ కావాలన్నాడు. ప్రభుత్వం, మతంతో నిమిత్తం లేకుండా సైన్సు పరిశోధన జరుగుతున్న పునర్వికాస కాలంలో మెస్మర్ అలా కోరాడు.
1778లో మెస్మర్, విశ్వసమాజం అనే రహస్య సంస్థ పారిస్ లో స్థాపించి తన వైద్య ప్రచారానికి పూనుకున్నాడు. దీని శాఖలు ఫ్రాన్స్ లో ఏర్పడ్డాయి. మెస్మర్ కు ఆదాయం పెరిగింది. తాను కనుగొన్న పశు అయస్కాంతం తనకు తప్ప ఎవరికీ తెలియదని, దీనిని ఖండించే అధికారం ఎవరికీ లేదని ప్రచారం చేసుకున్నాడు. చార్లస్ ది ఎప్లాన్స్, నికొలస్ బెర్ గస్ అనే యిరువురు శిష్యులు మెస్మర్ కు బాగా ప్రచారం చేసి పెట్టారు.
1784 మార్చి 12న లూయీ 16 ఒక విచారణ కమిషన్ మెస్మర్ గురించి నియమించారు. ఇది సైన్స్ అకాడమీ కోరికపై జరిగింది. మెస్మర్ శిష్యుడు ఛార్లస్ ఆస్పత్రిలో విచారణ సాగించారు. రసాయన శాస్త్రజ్ఞుడు ఏంటోని లవోసియర్, జీన్ సిల్వన్ బెయిలీ (ఖగోళశాస్త్రజ్ఞుడు) జోసెఫ్ ఇగ్నాస్ గిలోటన్ (వైద్యుడు-గిలోటన్ ఉరి ఇతడి పేర వచ్చింది) బెంజమిన్ ఫ్రాంక్లిస్ (అప్పట్లో అమెరికా రాయబారిగా ఫ్రాన్స్ లో వున్న సైంటిస్టు) కమిషన్ లో వున్నారు.
మెస్మర్ చికిత్సలో అయస్కాంత ప్రభావం ఏదీ లేదని కమిషన్ కనుగొన్నది. ఇదంతా తప్పుడు శాస్త్రంగా తేల్చారు. మెస్మర్ వైద్యంలో చికిత్స పొంది నయం అయిందన్నవారిలో చాలామంది శారీరక రోగులు కాదని కమిషన్ కనుగొన్నది. నిజంగా జబ్బున్న ఇద్దరు వ్యక్తులపై మెస్మర్ అయస్కాంత చికిత్స ప్రభావం ఏమీ లేదని గమనించారు. ఒకామె ఉబ్బసం రోగి. సెంట్ ఆర్మన్ అనే విధవ, మరొక యువతి అన్స్. ఆరేళ్ళ క్షయరోగి బాలిక కూడా ఎలాంటి నివారణ పొందలేదు.
మెస్మర్ శాస్త్రీయ పంథా తప్పుడుది అని కమిషన్ క్షుణ్ణంగా పేర్కొన్నది. మెస్మర్ చెప్పే ద్రవం లేదని కూడా చెప్పింది. 1784 ఆగస్టు 11న కమిషన్ తుది నివేదికలో మెస్మర్ ను ఖండించింది. మెస్మర్ పేర్కొన్న విశ్వద్రవ్య పదార్థ చర్య ఏదీ కనిపించలేదనీ, కొందరిలో వూహల కారణంగా శరీరంలో మూర్ఛలు వస్తున్నాయనీ చెప్పారు. ఊహలు రాకుండా అయస్కాంతం చేయగలిగిందేమీ లేదన్నారు. అయస్కాంతం శూన్యం. ఊహే అతిముఖ్యం అన్నారు. అంటే మెస్మర్ చికిత్స మానసిక సంబంధమే తప్ప, శరీరానికి వస్తే అతడేమీ చేయజాలడన్నమాట. పశు అయస్కాంతం అనేది సందేహాస్పదం అని బెంజిమిన్ ఫ్రాంక్లిన్ పేర్కొన్నారు. ఇలాంటి వాటి ఆధారంతో చికిత్స చేయబూనడం భ్రమే అన్నాడు. ఈ విధంగా కమిషన్ నివేదిక మెస్మర్ కు వ్యతిరేకంగా వచ్చింది. 17685లో ఆయన కుడిభుజం వంటివారు కూడా మెస్మర్ కు ఎదురు తిరిగారు. అయస్కాంత చికిత్స గురించి ఆయన అనుచరుడు బెర్గాసే ఉపన్యాసం యివ్వడాన్ని మెస్మర్ ఖండించాడు. రహస్యం బట్టబయలు చేసినట్లు భావించాడు. త్వరలోనే మెస్మర్ పారిస్ కు స్వస్తి పలకవలసి వచ్చింది.
1799లో మెస్మర్ (అది 1957లో ఇంగ్లీషులో జెరోం ఈడెన్ అనువదించారు) మానసిక రుగ్మతకు భౌతిక ఆధారం (అయస్కాంతం) కనుగొన్నవాడిగా తనకు గుర్తింపు రావాలని ఆకాంక్షించాడు. ప్రకృతి శాస్త్రంలో కొత్త సూత్రాలు కనుగొన్నట్లు మెస్మర్ భావించినా, అది రుజువు కాలేదు. మనుషులకు, జంతువులకు అయస్కాంత ద్రవ్యం వుందని మెస్మర్ పేర్కొన్నాడు.! ఈ విశ్వద్రవ్యం మెస్మర్ దృష్టిలో సర్వరోగనివారిణి. మెస్మర్ సృష్టించుకున్న కల్పనాలోకం నిజమని నమ్మాడు. భక్తితో రోగాలు కుదురుతాయనే వారికీ మెస్మర్ కూ తేడా లేదు. అయితే శరీరానికి వచ్చిన రోగాలు మెస్మర్ చికిత్స వలన నయం కాలేదు. రోగాలన్నీ నయం చేయవచ్చుగాని రోగుల్ని కాదని మెస్మర్ చెప్పాడు.! రోగలక్షణాలు శరీరానికి లేనప్పుడు అవి మానసిక చికిత్సలో ప్రధాన భాగాలుగా చెప్పారు. ఇలా మానసిక రోగాలు కుదుర్చుతామనే మెస్మర్ వంటివారే నేటి చికిత్సకు ఆధారమయ్యారు. నయం కావడం, కాకపోవడం ఆయా వైద్యుల మాటల ప్రతిభ, నాటకీయత, రోగుల మనోలక్షణాల బట్టి వుంటుందన్న మాట. ఇదీ మెస్మర్ కథ.

Saturday, July 12, 2008

మెస్మరిజం అంటే ఇదన్నమాట--Part 1


Mesmer




మెస్మరిజం

మెస్మరిజం అనే మాట బహుళ ప్రచారం పొందింది. మన సినిమాలలో, వైద్యంలో, వూళ్ళల్లో, ఎన్నో నోళ్ళల్లో మెస్మరిజం అనే మాట వింటుంటాం. అయినా మెస్మరిజఁ లోతుపాతులు చాలామంది తెలుచుకోకుండానే యీ మాట ప్రభావానికి లోనుగావడం మన అలవాట్ల బానిసత్వాన్ని సూచిస్తుంది. కనుక నిజానిజాలు విడమరచి చూద్దాం.
ఫ్రాంజ్ ఏంటన్ మెస్మర్ (1733-1815) ఆస్ట్రియా దేశవాసి. కాన్ స్టన్స్ సరస్సు ఒడ్డున చిన్న ఆస్ట్రియా నగరం - 1733 మే 23న ఇజ్నార్ లో పుట్టాడు. వైద్యం అభ్యసించక ముందు దైవశాస్త్రం చదివాడు. 1766 నాటికి వైద్యంలో కూడా డాక్టరేట్ పుచ్చుకున్నాడు. గ్రహాలు మానవుడిపై ఎలా ప్రభావం చూపుతాయనే విషయమై సిద్ధాంతం వ్రాసి డిగ్రీ స్వీకరించాడు. 1768లో మెస్మర్ ఒక భాగ్యశాలి అయిన విధవను వివాహమాడాడు. సాంస్కృతిక జీవనంలో కళలు ఆస్వాదించి, అనుభవిస్తూ జీవితం గడిపాడు. అయినా విలాసాలతో వృధా చేయక, జ్ఞానార్జనకు కృషిచేశాడు.
ఆనాడు యూరప్ లో కొత్తగా బహుళ ప్రచారం పొందుతున్న అయస్కాంతంతో చికిత్సపట్ల మెస్మర్ ఆకర్షితుడయ్యాడు. మరియా తెరీసా కొలువులో జ్యోతిష్యుడుగా మాక్సి మిలియన్ హెల్ అనే జెసూట్ ఫాదరీ అయస్కాంతంతో వైద్యం చేస్తుండేవాడు. ఇది 1774 నాటిమాట. మొదట్లో నీటితో వైద్యం చేస్తుండే ఫాదరీ, క్రమేణా అయస్కాంత రాళ్ళువాడాడు. ఒక సాంకేతిక నిపుణుడి సాయంతో భిన్న ఆకారాలు గల అయస్కాంతరాళ్ళు పెట్టేవాడు. వియన్నా వైద్య సంఘం యీ విషయమై అతడిని పట్టించుకో లేదు. 1774 వేసవిలో వియన్నాకు వచ్చిన విదేశస్తుడు తన భార్యకు అయస్కాంత వైద్య చికిత్స చేయమని కోరాడు. హెల్ నుండి ఇదంతా మెస్మర్ నేర్చాడు. మానసిక చికిత్స కూడా హెల్ ముందుగా మెస్మర్ కు చెప్పాడు. సంసపన్న స్త్రీకి తాను ఎలా చికిత్స చేస్తున్నదీ హెల్ ఎప్పటికప్పుడు మెస్మర్ కు తెలియజేసేవాడు. కొన్నాళ్ళకు ఆ స్త్రీకి నయమైనట్లు మెస్మర్ స్వయంగా తెలుసుకొని అయస్కాంత చికిత్స పట్ల ఆకర్షితుడయ్యాడు.
1774-1776 అయస్కాంత చికిత్సలు చేసిన మెస్మర్, విశ్వవ్యాప్తంగా ద్రవపదార్థం వుంటుందని నమ్మాడు. అదే అయస్కాంత ప్రభావానికి మూలం అనుకున్నాడు. అయస్కాంతం కేవలం కొన్ని అంగుళాల మేరకే ప్రభావం చూపుతుందని మెస్మర్ కు తెలుసు. కనుక అయస్కాంతంలో దాగివున్న శక్తులు వున్నాయని, అవే రోగాన్ని నయం చేస్తున్నాయని విశ్వసించాడు. రోగం వున్నదని భ్రమించి వచ్చే రోగులపై మెస్మర్ చికిత్స బాగా పనిచేసింది. అయస్కాంత రాళ్ళు సర్వాంతర్యామి శక్తిలో భాగం అని మెస్మర్ నమ్మిన తరువాత, నీటిని ఆ రాళ్ళతో అయాస్కాంతీకరణ గావించి రోగులచేత తాగించేవాడు. పింగాణి కప్పులు, పళ్ళాలు, బట్టలు, పరుపులు, అద్ధాలు అయస్కాంతీకరణ చేసేవాడు. విద్యుత్ వలె అయస్కాంత ద్రవం కూడా అట్టిపెట్టి, ఇతర వస్తువులకు అందించవచ్చని మెస్మర్ భావన. పెద్ద తొట్టు తయారు చేసి అందులో రెండు వరసల సీసాలు అమర్చి, వాటి మూతలకు బెజ్జాలు పెట్టి, వాటి నుండి ఇనుపచువ్వలు పైకి వచ్చేటట్లు చేసి, రోగులను ఆ ఇనుపచువ్వలను తాకమనేవాడు. సామూహికంగా రోగులు తొట్టిలో కూర్చొని యీ చికిత్స పొందేవారు. ఒకరి చేతులు మరొకరు పట్టుకొని కూర్చుంటే అయస్కాంతం ఒకరి నుండి మరొకరికి ప్రాకుతుందని మెస్మర్ నమ్మించాడు.
మెస్మర్ పలుకుబడి, కీర్తి ఆనోటా ఆనోటా పడి బాగా వ్యాపించగా రానురాను అయస్కాంత రాళ్ళతో పనిలేదని, తన వ్యక్తిత్వ ప్రభావంతో చికిత్స చేయవచ్చని మెస్మర్ గ్రహించాడు. లోగడ ఎవరికైనా నయమైందంటే అది తన వ్యక్తి ఆకర్షణ ప్రభావం వల్లనేనని కూడా అతను గ్రహించాడు. తానే ఒక అయస్కాంతం అని మెస్మర్ ఊహించాడు. 1776 నుండి అయస్కాంత రాళ్ళకు తిలోదకాలిచ్చాడు. ఆ తరువాత తమ మాటల మూటలతోనే చికిత్సకు ఉపక్రమించి కొనసాగించాడు.
ఆనాటి శాస్త్రజ్ఞులు మెస్మర్ చికిత్సను శాస్త్రీయం కాదని ఖండించారు. అయస్కాంత ప్రభావ పరిమితులు శాస్త్రజ్ఞులకు తెలుసు. కాని నయమైనదని చెప్పే రోగుల సాక్ష్యాలను మెస్మర్ వాడుకొని, తన చికిత్సను అలాగే చనిపోయేవరకూ చేశాడు. కనుకట్టు విద్యగా అది ప్రచారంలోకి వచ్చింది.
అయస్కాంత ప్రభావం శరీరంలోని అన్ని భాగాలలో వ్యాపించి ఉంటుందనీ, నరాలపై దీని ప్రభావం పడుతుందనీ 1775లో మెస్మర్ ఒక వైద్యుడికి రాశాడు. పశువుల అయస్కాంతం కూడా వున్నదని మెస్మర్ నమ్మాడు. మూర్చలు, ఉదాశీనత, మంకు మొదలైన లక్షణాలు నయం చేసే అయస్కాంత పరిశోధనలు చేస్తున్నట్లు మెస్మర్ పేర్కొన్నాడు. సూచన () అనేది వైద్యంలో భాగంగా మారిందన్నమాట. నిజమైన శారీరక రుగ్మతలు వుంటే మెస్మర్ చికిత్సకు స్వీకరించేవాడు కాదు. తనకేవో జబ్బు లక్షణాలున్నాయని భ్రమించేవారినే మెస్మర్ తీసుకునేవాడు. నరాల జబ్బున్న వారినే తాను చికిత్సకు చేర్చుకుంటానని మెస్మర్ స్పష్టం చేశాడు. అక్కడే అతడి కిటుకు పనిచేసింది. ఇదే మెస్మరిజంలో ఆకర్షణ. శరీరాన్ని బాధిస్తూ పైకి కనిపించే రోగలక్షణాలు అయస్కాంత చికిత్సకు పనికిరావన్నాడు. మాటలు, ఉపమానాలు సూచనలుగా పనిచేస్తాయని, అవి నరాల జబ్బున్న మానసిక రోగులకే పరిమితం అని మెస్మర్ వాదన.!
హస్తలాఘవం, కనికట్టు, మాటల ఉపమానాలు అనేవి మెస్మర్ ప్రయోగించిన ఆయుధాలన్నమాట. రోగంతో బాధ వున్నట్లు చెప్పే శారీరక భాగాల్ని మెస్మర్ తాకి నిమిరేవాడు. ఆ విధం నయమైతే అది వైద్యమే ననేవాడు. అదే చేతి చలవ (అయస్కాంత ప్రభావం) అనేవాడు. తన అబద్దాలను తానే నమ్మడం, ప్రచారం చేయడం, రోగుల్ని నమ్మించడం మెస్మర్ పనిగా కొనసాగించాడు. ఖనిజ సంబంధమైన అయస్కాంతం రోగిని నయం చేస్తుందనకుండా, అయస్కాంత ప్రభావం వేరే వుందని మెస్మర్ అనేవాడు. మనుషుల్లో మార్మికంగా అయస్కాంతశక్తి గర్భితమై వుందన్నాడు.
ఆనాటి శాస్త్రజ్ఞులు మెస్మర్ ను తీవ్రంగా ఖండించారు. పశు అయస్కాంతం అనే పేరిట మెస్మర్ ప్రచారంలో పెట్టిన భావనకు ఆధారాలేవీ లేవన్నారు. అయస్కాంత రాళ్ళకు బదులు, అయస్కాంత ప్రభావం గల చేతిస్పర్శ మెస్మర్ ఆకర్షణగా ప్రచారంలోకి వచ్చింది.
నమ్మకంతో నయం అవుతుందనే వారికి మాటలు ఆకర్షణ ప్రధాన లక్షణం. మెస్మర్ ఆనాడు ప్రయోగించింది అదే, మత పరంగా చేస్తున్నవారి ఆయుధమూ అదే. హోమియోవారు నేడుచేస్తున్నదీ యిదే. కొంతవరకు ఆయా నమ్మకం చికిత్స కారుల విచిత్ర వేషధారణ కూడా పనిచేస్తుంది. వారు వాడే కొన్ని వింత పరికరాలు కూడా దోహదం చేస్తాయి. నమ్మకం, భయం రోగిలో వుండగా అవే వైద్యుడికి అక్కరకు వస్తాయి.
Continued in part 2

Wednesday, July 9, 2008

రాజకీయ నాయకులు పార్టీలు మార్చిన వరుస

టంగుటూరి ప్రకాశం - కాంగ్రెస్ - స్వరాజ్య - కాంగ్రెస్ - ప్రజాపార్టీ - కిసాన్ - మజ్దూర్ ప్రజాపార్టీ - ప్రజాసోషలిస్టు - కాంగ్రెస్

ఎన్. జి. రంగా - జస్టిస్ - కాంగ్రెస్ - కాంగ్రెస్ సోషలిస్టు - కిసాన్ మజ్దూర్ - కృషికార్ లోక్ పార్టీ - ఐక్య కాంగ్రెస్ - స్వతంత్ర - కాంగ్రెస్ - ఇందిరా కాంగ్రెస్.

తెన్నేటి విశ్వనాథం
- కాంగ్రెస్ - ప్రజాపార్టీ - కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ - ప్రజాసోషలిస్టు - ప్రజా - జనత
గౌతు లచ్చన్న - కాంగ్రెస్ - కృషికార్ - ఐక్య కాంగ్రెస్ - సోషలిస్టు డెమోక్రటిక్ - స్వతంత్ర - కాంగ్రెస్ - ప్రజా సమితి - కాంగ్రెస్ - కాంగ్రెస్ ఐ.

మఱ్ఱి చెన్నారెడ్డి - కాంగ్రెస్ - సోషలిస్టు డెమోక్రటిక్ - స్వతంత్ర - కాంగ్రెస్ - ప్రజా సమితి - కాంగ్రెస్ - కాంగ్రెస్ (ఐ).
పి.వి.జి.రాజు - సోషలిస్టు - ప్రజా సోషలిస్టు - సోషలిస్టు డెమోక్రటిక్ - కాంగ్రెస్ - కాంగ్రెస్ (ఐ).
జి.సి.కొండయ్య - కమ్వూనిస్టు - సోషలిస్టు - సోషలిస్టు డెమోక్రటిక్ - కాంగ్రెస్ - పాత కాంగ్రెస్ - జనత.
పెద్ది రెడ్డి తిమ్మారెడ్డి - కాంగ్రెస్ - కృషికార్ లోక్ - కాంగ్రెస్ - జనత - జనత (ఎస్).
భాట్టం శ్రీరామ్మూర్తి - సోషలిస్టు - ప్రజా సోషలిస్టు - సోషలిస్టు - కాంగ్రెస్ (0) - కాంగ్రెస్ (ఐ).
కాకాని వెంకట రత్నం - కాంగ్రెస్ - సోషలిస్టు డెమోక్రటిక్ - కాంగ్రెస్ -
బండారు రత్న సభాపతి - సోషలిస్టు - స్వతంత్ర - కాంగ్రెస్ - ఇండిపెండెంట్ - కాంగ్రెస్ - కాంగ్రెస్ (ఐ).తెలుగు దేశం
రేబాల దశరథ రామరెడ్డి - కాంగ్రెస్ - పాత కాంగ్రెస్ - జనత - కాంగ్రెస్ (ఐ).
కందుల ఓబుల రెడ్డి - కాంగ్రెస్ - కృషికార్ - సోషలిస్టు డెమోక్రటిక్ - స్వతంత్ర - కాంగ్రెస్ (ఐ).
చంద్రబాబు నాయుదు -కాంగ్రెస్-తెలుగు దేశం-

కొణిజేటి రోశయ్య - కృషికార్ - స్వతంత్ర - కాంగ్రెస్ - కాంగ్రెస్ (ఐ).
కె. ప్రభాకరరెడ్డి - కాంగ్రెస్ - జనత - జనత (ఎస్) - కాంగ్రెస్ (ఐ).
తేళ్ళ లక్ష్మీ కాంతమ్మ - కమ్వూనిస్టు - సోషలిస్టు - కాంగ్రెస్ - జనత - కాంగ్రెస్ (ఐ).
చన్నమనేని రాజేశ్వరరావు - కమ్వూనిస్టు - తెలుగు దేశం
కె. చంద్ర శేఖర రావు - కాంగ్రెస్ - తెలుగు దేశం - తెలంగాణా రాష్ట్ర సమితి
దేవేంద్ర గౌడ్ - కాంగ్రెస్ - తెలుగు దేశం - కొత్త పార్టీ
గాలి ముద్దు కృష్ణమ నాయుడు - తెలుగు దేశం - బిజెపి - లక్ష్మీ పార్వతి తెలుగు దేశం - కాంగ్రెస్
జయపాల్ రెడ్డి - కాంగ్రెస్ - జనత - లోక్ దళ్ - జనత (యు) - కాంగ్రెస్
రేణుకా చౌదరి - తెలుగు దేశం - కాంగ్రెస్
తులసీ రెడ్డి - టిడిపి - లక్ష్మీ పార్వతి తెలుగు దేశం - బిజెపి - కాంగ్రెస్
కృష్ణం రాజు - కాంగ్రెస్ - బిజెపి.
సమరసింహా రెడ్డి కాంగ్రెస్ - బిజెపి - తెలుగు దేశం - నాదెళ్ళ టిడిపి - కాంగ్రెస్
నన్నపునేని రాజకుమారి - టిడిపి - కాంగ్రెస్ - నాదెళ్ళ టిడిపి - టిడిపి
కె.ఇ. కృష్ణమూర్తి - కాంగ్రెస్ - టిడిపి - కాంగ్రెస్-తెలుగు దేశం
నీలం సంజీవ రెడ్డి - కాంగ్రెస్ - కాంగ్రెస్ (ఐ) - జనత.
జీవన్ రెడ్డి - కాంగ్రెస్ - తెలుగుదేశం, భాస్కరరావు తెలుగుదేశం, కాంగ్రెస్
సంతోష్ రెడ్డి - కాంగ్రెస్ - తెరాస, కాంగ్రెస్
టి. పురుషోత్తమరావు - ప్రజాసమితి, స్వతంత్ర-కాంగ్రెస్
ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి - కాంగ్రెస్, జనత, కాంగ్రెస్
బలరామకృష్ణమూర్తి - కాంగ్రెస్, తెలుగుదేశం, కాంగ్రెస్, తెలుగుదేశం
దగ్గుబాటి వెంకటేశ్వరరావు - తెలుగుదేశం, బి.జె.పి, కాంగ్రెస్
ఎ. నరెంద్ర - బి.జె.పి., తెరాస, నరెంద్రతెరాస
వాసిరెడ్డి వరద రామారావు - కాంగ్రెస్, బి.జె.పి., కాంగ్రెస్


పార్టీలు ఎన్ని మారితేనేం? ప్రజాసేవలోనే తరిస్తున్నాంకదా అంటారు. అది సంగతి.

Tuesday, July 8, 2008

New Blog on Narla

కొత్త బ్లాగ్ సుప్రసిద్ద నార్ల వెంకటే శ్వరరావు పై మీ సూచనలు పోస్త్ చేయ మనవి
http://narlavr.blogspot.com

Monday, July 7, 2008

మన శాస్ర్తజ్ఞులలోనూ ఇలాంటి నమ్మకాలున్నాయా

11 వందల మంది సైంటిస్టుల నమ్మకాలు, విశ్వాసాలపై శాస్త్రీయ పరిశీలనాకేంద్రం, అమెరికా సెక్యులర్ సంస్థ అధ్యయనం చేశాయి. భారత దేశంలో 120 సంస్థలలోని సైంటిస్టుల అభిప్రాయాలను సేకరించి, క్రోడీకరించాయి. మనరాష్ట్రంలోని విశ్వవిద్యాలయ, పరిశోధనాలయాలలో సహా నిపుణుల గాఢఛాందసాలు గమనించింది.
విశ్వవిద్యాలయాలలో జ్యోతిష్య బోధన తగదని 44 శాతం శాస్త్రజ్ఞులు గట్టిగా వ్యక్తపరిచారు.
శ్రీహరి కోటలో ప్రయోగించిన రాకెట్ ను, ముందుగా తిరుపతి వెంకటేశ్వరుడి విగ్రహం ముందు నమూనా వుంచి, దీవెనలు అందు కోవడాన్ని 46 శాతం శాస్త్రజ్ఞులు నిరసించారు. 41 శాతం ఆమోదించారు.
సెక్యూలరిజం అంటే మత సహనం అని అత్యధికులు, ప్రభుత్వం నుండి మతాన్ని వేరుగా వుంచాలని మరికొందరు అన్నారు. మతరహితం అన్న వారు 20 శాతమే.
పరిణామ సిద్ధాంతాన్ని 88 శాతం అంగీకరించగా, అతి స్వల్పంగానే దీనితో విభేదించారు.
చికిత్సలలో మార్గాంతర వైద్యాలపట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. హోమియో పనిచేస్తుందని 50 శాతం నమ్మారు. ప్రార్థన అక్కరకొస్తుందని 49 శాతం భావించారు. స్వస్థత ప్రార్థన కూటాల చికిత్సకు 16 శాతం తలూపారు. వాస్తు, జ్యోతిష్యాలకు కేవలం 14 శాతం ఆమోదమే లభించడం గమనార్హం. అయస్కాంత చికిత్సను 13 శాతం ఔనంటున్నారు.
హస్తసాముద్రికాన్ని 10 శాతం, రేకీని, పంచాగాన్ని 8 శాతం, రత్నాల చికిత్సను, 7 శాతం, సంఖ్యా శాస్త్రాన్ని 6 శాతం, తాయెత్తులను 3 శాతం మాత్రమే ఆమోదముద్ర వేశారు.
రాజ్యాంగ మౌలిక విదులలో సైంటిఫిక్ ధోరణి ప్రచారం చేయాలనేది కొందరు నిశితంగా చూడగా, మరికొందరు నిరాదరించారు. కావాలన్నవారు స్వల్పం.
దేశంలో శాస్త్రీయ విద్య స్వల్పంగా వున్నట్లు అంగీకరించారు.
శాస్త్రీయంగా రుజువైన వాటికి మతం అడ్డొస్తే, విమర్శించడానికి 44 శాతం సైంటిస్టులు సంసిద్ధతచూపారు. 23 శాతం మతాన్ని విమర్శించ దలచలేదు.
సైంటిస్టులలో 14 శాతం తమ మతాన్ని చెప్ప నిరాకరించగా, 10 శాతం సెక్యులర్ అని స్పష్టం చేశారు. సర్వేచేసిన సైంటిస్టులలో 43 శాతం ఆరోగ్య రీత్యా, మత కారణాలుగా శాఖాహారులమన్నారు.
దేవుడిపట్ల నమ్మకం లేదని 12 శాతం చెప్పగా, గట్టిగా నమ్మకం గల దన్నవారు 26 శాతం వున్నారు. 4 శాతం సమాధానం చెప్పనిరాకరించారు. వ్యక్తిగత దైవంలో ఏమాత్రం నమ్మకం లేదన్నవారు 30 శాతం వున్నారు.
బాబాల మహత్తులను 24 శాతం నమ్మారు. అత్యధిక సంఖ్యాకులు కేవలం దేవుడు మాత్రమే మహత్తులు చేయగలడని, బాబాలు మాతలు కాదన్నారు.
కర్మను నమ్మినవారు 29 శాతం, మరణానంతర జీవనాన్ని 26 శాతం పునర్జన్మను 20 శాతం నమ్మారు. కులాన్ని నమ్మిన వారు 6 శాతం వుండడం పెద్ద విశేషం.
సైంటిస్టుకావడానికి వ్యక్తిగత ఆసక్తి కారణం అని 55 శాతం చెప్పగా, కేవలం ఉద్యోగ భృతి అన్నవారు స్వల్పమే.
సర్వే పూర్తిగావడానికి సంవత్సరం పట్టింది. శాస్త్రీయ పరిశీలనాకేంద్రం తలపెట్టిన యీ పథకానికి అమెరికా సెక్యులర్ సంస్థ పూర్తి సహకారం అందించింది.
తమ ప్రత్యేక శాఖలో శాస్త్రీయపద్ధతి పాటించిన సైంటిస్టులు, అన్ని రంగాలలో అదే వివేచనా పద్ధతి అనుసరిస్తే మూఢ విశ్వాసాలు తొలగిపోడానికి దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Saturday, July 5, 2008

పుస్తక సమీక్ష-వెంకటేశ్వర సుప్రభాతం

పచ్చి శృంగారం సంస్కృతంలో వుంటే ఫరవాలేదా!

రచన - వెనిగళ్ళ సుబ్బారావు
(శ్రీవెంకటేశ సుప్రభాత శృంగారం ప్రచురణ, కనమత వెంకట రామరెడ్డి, ప్రగడవరం, రేపల్లె మెయిన్ రోడ్, గుంటూరుజిల్లా).

వెంకటేశ్వర సుప్రభాతం సంస్కృతంలో వుంది. రోజూ రేడియోలలో, టి.వి.లలో మైకులు పెట్టి దేవాలయాలలో, ఇండ్లలో కేసట్లు వాడుతూ పారాయణం చేస్తున్నారు. సంస్కృతం తెలిసిన భక్తులు అతి స్వల్పం. కాని అలవాటుగా మిగిలిన భక్తులు అది విని తరించినట్లు భావిస్తున్నారు. వెంకటేశ్వర సుప్రభాత మహాత్మ్యంపై పత్రికలలో రాయించారు.
పిల్లల చేత కూడా యీ సుప్రభాతాన్ని పాడిస్తున్నారు. అర్థం లేని చదువు వ్యర్థం అంటారు గదా! పిల్లలకు అర్థం చెప్పకుండా వల్లే వేయించరాదు. కనుక అర్థం చెప్పాలి. అర్థం తెలిసిన తరువాత పిల్లలకు వెంకటేశ్వర సుప్రభాతం చెప్పవచ్చునా లేదా అనేది సృష్టపడుతుంది.

సుప్రభాతంలో 1వ శ్లోకం :
కమలాకుచ చూచుక కుంకమతో
నియతారుని తాతుల నీలతనో
కమలాయతలోచన లోకపతే
విజయీ భవ వేంకట శైలపతే

దీని అర్థం తెలుగులో యిది : లక్ష్మీదేవి చనుమొనలయందున్న కుంకుమపూ రంగువల్ల అంతటా ఎర్రగా చేయబడ్డ సాటిలేని నల్లని శరీరం కలవాడా తామర రేకులవంటి విశాలమైన కన్నులు కలవాడా జగన్నాయకుడా, వెంకటాచలపతీ, జయించే స్వభావం కలవాడవు కమ్ము.

సుప్రభాతంలో 3వ శ్లోకం :
మాతస్సమస్త జగతాం మధుకైటభారే
వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తి
శ్రీ స్వామిని శ్రితజనప్రియ దానశీలి
శ్రీ వెంకటేశదయితె తవ సుప్రభాతమ్

తెలుగులో అర్థం : అన్ని లోకాలకు తల్లివి. ఎప్పుడు విష్ణుమూర్తి రొమ్ములపై వుండేదానివి. మనోహరమైన ఆకారం గలదానవు. ఆశ్రయించినవారి కోర్కెలను తీర్చేదానవు. వేంకటేశ్వరుని ప్రియురాలివైన శ్రీ లక్ష్మీదేవి నీకు శుభోదయం అగుగాక.

13వ శ్లోకం :
శ్రీమన్నభీష్ట వరదాభిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైకసింధో
శ్రీ దేవతా వృషభుతాంతర దివ్యమూర్తి
శ్రీ వెంకటాచలపతీ తవసుప్రభాతమ్

తెలుగులో అర్థం : లక్ష్మీదేవితో కూడిన వాడా, కోరిన వరాలిచ్చేవాడా, సమస్త లోకాలకు బంధువైన వాడా, పూజ్యురాలైన లక్ష్మీదేవిని నివాసమైనవాడా. ప్రపంచానికంతటికీ ఒక్కడివే విశాలమైన దయగలవాడవు. లక్ష్మీదేవి రెండు చేతుల మధ్య గట్టిగా ఇరక్కున్నవాడా. మనస్సు హరించే అందమైన ఆకారం గలవాడా, వెంకటేశ్వరుడా, నీకు సుప్రభాతమగుగాక.

23వ శ్లోకం
కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తి
కాంతాకు చాంబురహ కుట్మలలోల దృష్టే
కళ్యాణ నిర్మలగుణాకర దివ్యకీర్తి
శ్రీ వెంకటాచలపతీ తవసుప్రభాతమ్
తెలుగులో అర్థం : మన్మధుడి గర్వాన్ని హరించగల అందమైన ఆకారం గలవాడా. ప్రియురాలి తామర మొగ్గుల వంటి చన్నుల మీద ఆసక్తితో చూపులు పెట్టినవాడా. శుభాన్ని కలిగించే మంచి గుణాలకు నిలయమైనవాడా. గొప్ప కీర్తి కలవాడా. వెంకటాచలపతీ నీకు సుప్రభాతముగుగాక.
ఇందులో శ్లోకాలకు తెలుగు అర్థాన్ని ఇంకో విధంగా భక్తులు రాస్తారేమో తెలియదు. ఇక్కడ చెప్పిన తెలుగు అర్థాన్ని కీ.శే. వెనిగళ్ల సుబ్బారావు రచన శ్రీ వెంకటేశ సుప్రభాత శృంగారం నుండి స్వీకరించాను.

నేను ఆమెరికాలో పై విషయాలను ఇంటర్నెట్ లో తెలుగు వారితో చర్చించినప్పుడు, కొందరు భక్తులు ఆగ్రహించారు. అదే వారి సమాధానం. మరికొందరు ఒస్! ఇంతే గదా! సంస్కృతంలో ఇలాంటి శృంగారం మాకు అలవాటే అన్నారు. ఇంకొందరు ఎంతో శృంగారం వుందనుకున్నాం, యీ మాత్రానికే దెప్పిపొడవాలా అన్నారు. చర్చ అలా సాగింది. భక్తుల నుండి అంతకు మించి ఆశించలేని నైతిక విప్లవం కావాలనే వారేమంటారో చూడాలి. ఏమైనా పిల్లల్ని వీటికి దూరంగా వుంచడం అవసరం.

Friday, July 4, 2008

వెంకటాద్రి ఉద్యమ వ్యాప్తి దృశ్యాలు

1958 సంవత్సరం. మే నెల చీరాలలో యోగేశ్వరరావు మేడపై ఒక సాయంకాల సమావేశం. చతురస్రాకారంగా అందరూ కూర్చున్నారు. అల్పాహారం ఆరగించిన అనంతరం చిరుప్రసంగ కార్యక్రమం ఆ రంభమైంది.
చీరాల విఆర్ఎస్ కళాశాల ప్రిన్సిపాల్ టేకుమళ్ళ రామారావు మాట్లాడారు. ఆయా విషయాలను తడిమి, రవీంద్రనాథ్ ఠాగోర్ మార్మిక కవితా ధోరణి మెచ్చుకుంటూ చెప్పారు. ఆయన కవితల అనుభూతి మనస్సును ఎక్కడికో తీసుకెడు తుందన్నారు.
తరువాత రావిపూడి వెంకటాద్రి (సుప్రసిద్ధ హేతువాద నాయకులు, హేతువాది పత్రిక సంపాదకులు, బహుగ్రంథ రచయిత, ప్రస్తుతం ఆయన వయసు 87 సంవత్సరాలు.) స్పందిస్తూ, రియాక్ట్ అయ్యారు. టాగోర్ ది పులుముడు వాదమని అన్నారు. సుబ్బారావు గారి వాదనను తీవ్రస్థాయిలో దుయ్యబట్టి, ఖండించారు. ఠాగోర్ మార్మిక వాదం మనుషుల్ని ముందుకు నడపజాలదన్నారు.
ఆనాటి సమావేశం రాడికల్ హ్యూమనిస్టుల గోష్ఠి. ప్రధాన అతిధి టేకుమళ్ళ రామారావు. అయినా వెంకటాద్రి అరమరికలు లేకుండా ఆయన వాదాన్ని తూర్పారబట్టారు.
టేకుమళ్ళ రామారావుకు మద్దత్తుగా లైబ్రెరియన్ నరసింహారావు మాట్లాడబోయారు. అధ్యక్ష స్థానంలో ఆవుల గోపాలకృష్ణమూర్తి వున్నారు. తనను తాను సమర్థించుకోగల శక్తి రామారావుకు వుందని చెప్పారు. తరువాత మాట్లాడుతూ, వెంకటాద్రి చెప్పినదంతా తాము అంగీకరిస్తున్నామన్నారు. ఎటొచ్చీ మా వాడు సుత్తి దీసుకొని బాదేశాడు. నేనైతే సుతిమెత్తగా ఆ మాటలనే చెప్పేవాడిని అన్నారు. సుబ్బారావును సమర్థించే వారెవరూ అక్కడలేరు. అయితే సుబ్బారావు స్నేహపూర్వకంగానే వున్నారు.
ఆవులగోపాలకృష్ణమూర్తి ఠాగూర్ పై ఉపన్యసించారు. వెంకటాద్రి ధోరణిని వివరిస్తూ మానవవాదాన్ని విడమరచి చెప్పారు. (ఆ ఉపన్యాసాన్ని రాడికల్ హ్యూమనిస్ట్ ఇంగ్లీషు వార పత్రికకు పంపాను. అయితే అది ప్రచురించటానికి శిబ్ నారాయణ్ రే ఎడిటర్ గా తటపటాయించాడు. అయితే మరొక ఎడిటర్ వి.బి. కార్మిక్ నాకు రాస్తూ ప్రచురించమని పట్టుపట్టవద్దన్నాడు. ఉత్తరోత్తరా ఏ.జి.కే. కూడా అంతటితో వదిలేయమన్నాడు.)
నాటి గోష్టిలో సిహెచ్ రాజారెడ్డి, బచ్చు వెంకటేశ్వర్లు, తోటకూర శ్రీరామమూర్తి ప్రభృతులు వున్నారు.
యోగేశ్వరరావు తరచు అలాంటి సమావేశాలు పెడుతుండేవారు. ఆయన బొంబాయిలో కొన్నాళ్ళు వున్నందున, జి.డి. పరేఖే, ఇందుమతి, వి.బి. కర్నిక్, జి.డి. దల్వి, వి.ఎం. తార్కుండే, ఎం.ఎ. రాణే, మణి బెన్ కారా, లక్ష్మణ శాస్త్రి, జోషి వంటి వారితో పరిచయస్తుడయ్యారు. ఆ ప్రభావంతో హ్యూమనిస్టు సమావేశాలు పెట్టేవారు.
ఆ రోజుల్లో ఏటా వేసవిలో చీరాలలో సాయంకాల సమావేశాలుండేవి. రాజారెడ్డి లిబర్టి ప్రెస్ హ్యూమనిస్టుల యిష్టాగోష్టి ప్రదేశం. వెంకటాద్రి ట్యూటోరియల్, విద్యాసంస్థలు నడుపుతూ, సమావేశాల్లో పాల్గొనేవారు. సంతరావూరులో తప్పనిసరిగా వేసవి చర్చా గోష్ఠులలో ఆయన ప్రసంగించేవారు. మధ్యమధ్య ఓడరేవు సందర్శన అక్కడా గోష్ఠి జరపడం ఒక అనుభూతి.

విజయవాడలో ఎమ్.ఎన్.రాయ్ శతజయంతిలో వెంకటాద్రి :
1988లో ఎమ్.ఎన్. రాయ్ శతజయంతి మహాసభ విజయవాడలో జరిగింది. తెలుగు అకాడమీ ప్రచురించిన రాయ్ పుస్తకాల అనువాదాలు (ఎన్. ఇన్నయ్య అనువదించిన వివేచన, ఉద్వేగం, విప్లవం రెండు భాగాలు, రష్యా విప్లవం, చైనాలో విప్లవం, ప్రతివిప్లవం, అధికారం, పార్టీలు, రాజకీయాలు, వి.వి. కర్నిక్ విరచిత రాయ్ జీవితచరిత్ర) ఒక సెట్ గా ఆ సందర్భంలో ఆవిష్కరించారు. నాటి మంత్రులు ఇంద్రారెడ్డి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు, ట్రినిడాడ్ రాయభారి సి. లక్ష్మన్న సమావేశంలో అధితులుగా పాల్గోన్నారు. హాలు నిండా జనం. అందులో విశిష్ఠ ఉపన్యాసకులు రావిపూడి వెంకటాద్రి. ఎన్. ఇన్నయ్య సభను నిర్వహిస్తుండగా, వెంకటాద్రి ఆ నాడు చేసిన ప్రసంగం మరపురానిది. వివిధ ఉద్యమాలు, మానవ వాద ఉద్యమ పరిణామం, ఎమ్.ఎన్. రాయ్ ఎదిగిన తీరు, కమ్యూనిస్టుల వైఫల్యాల పరంపర, మానవ వాద ఉద్యమ ఆవశ్యకత. సుదీర్ఘంగా చెప్పారు. ఆయన సమాయాభావం వల్లన ప్రసంగాన్ని తగ్గించుకోవలసి వచ్చింది. ప్రేక్షకులకు అధి నచ్చలేదు. ఇంకా కొనసాగించమని కోరారు. ఆనాటి ప్రసంగం, విజయవాడ ప్రముఖులను ఆకట్టుకున్నది. ఉద్యమానికి సంబంధం లేని మేధావులు, రచయితలు, కవులు, సభకు వచ్చి ఆకర్షితులై పుస్తకాలు కొనుక్కోని వెళ్ళారు. వెంకటాద్రి నాడు రాయ్ కు తగిన రీతిలో జోహారులు అర్పించారు.

Tuesday, July 1, 2008

దేశంలో - రాష్ట్రంలో పుట్టిగిట్టిన పార్టీలు

రెండో ప్రపంచయుద్ధం మొదలుకాకముందే కొన్ని దేశాలు ఓడిపోయాయట. మన దేశంలో స్వాతంత్రానికి పూర్వం, తరువాత చిన్న పెద్ద పార్టీలు లక్ష్యం చేరుకోకుండానే అంతరించాయి.
స్వాతంత్ర్యానికి ముందు పుట్టిన పార్టీలు కొన్ని చాలా పెద్దవారి నాయకత్వాన ఆవిర్భవించాయి.
మొదటి పుట్టిన పార్టీ కాంగ్రెస్, అది ఎన్ని ఒడిదుడుకులకు గురైనా, మరెన్ని వంకలు తిరిగినా, జీవనదివలె ప్రవహిస్తూనే వుంది. పడిలేస్తూనే సాగిపోతున్నది.
సిద్ధాంతాల, లక్ష్యాల విభేదాలతో మొదట కాంగ్రెస్ నుండి చీలిన పార్టీ స్వరాజ్య(1922) దీనిని స్థాపించిన వ్యక్తి సాక్ష్యాత్తు మోతీలాల్ నెహ్రూ. మనరాష్ట్రం నుండి టంగుటూరి ప్రకాశం అందులో చేరారు. బెంగాల్ నుండి చిత్తరంజన్ దాస్ వున్నారు.
కాంగ్రెస్ లో గాంధేయుల విద్రోహానికి గురైన నేతాజి సుభాస్ చంద్రబోసు 1939లో ఫార్వర్ బ్లాక్ పార్టీ పెట్టారు. దానిని యిప్పుడు పశ్చిమబెంగాల్ లో దుర్భిణి వేసి చూడాల్సిందే.
కాంగ్రెస్ లో అభ్యుదయం కావాలని సోషలిస్ట్ పార్టీ పుట్టింది. అందులో ఉన్నత నాయకులు జయప్రకాష్ నారాయణ మొదలు అశోక్ మెహతా, రామమనోహర్ లోహియా వరకూ వున్నారు. మధ్యలో కమ్యూనిస్టులు ముసుగు వీరులుగా చేరి యధాశక్తి తమ పాత్ర నిర్వహించారు.
ఎం.ఎన్. రాయ్ ఆధ్వర్యాన రాడికల్ డెమొక్రటిక్ పార్టీ 8వ సంవత్సరాలు వెలిగి ఆరిపోయింది. (1941-48) రామరాజ్య పరిషత్తు కూడా అలాగే వచ్చి పోయింది. పంజాబ్ కేసరి లాలాలజపతిరాయ్ కాంగ్రెస్ ఇండిపెండెన్స్ పార్టీ 1922లో పెట్టారు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మత వాదశక్తులు స్థాపించుకున్న జనసంఘ (1952) కొన్నేళ్ళకు అంతమై, కొత్త వేషం ధరించింది. అదే భారతీయ జనతాపార్టీ.
తొలి ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ నుండి చీలి చిగురించిన పార్టీ కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ. 1951లో కృపలానీ, రఫీ అహ్మద్ కిద్వాయ్, అజిత్ ప్రసాద్ జైన్, ఆచార్య రంగా, టంగుటూరి ప్రకాశం వంటి వారితో యిది అవతరించింది.
పుట్టుకతోనే చీలిన యీ అఖిలభారత పార్టీ నుండి ఆచార్యరంగా కృషి కార్ లోక్ పార్టీని పెట్టారు. (ఇది చివరకు రాష్ట్రంలో చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలలో సీట్లు గెలిచి, కీలకపాత్ర వహించి కన్నుమూసింది). టంగుటూరి ప్రకాశం కొన్నాళ్ళుండి మారిపోయారు. మిగిలిన వారంతా ప్రజాసోషలిస్టు పార్టీగా తలెత్తారు.
స్వాతంత్రానంతరం జవహర్ లాల్ నెహ్రూ విధానాలను వ్యతిరేకిస్తూ తలెత్తిన అతి ప్రధానపార్టీ స్వతంత్రపార్టీ (1959) చక్రవర్తుల రాజగోపాలాచారి (రాజాజీ) జయప్రకాష్ నారాయణ, ఎం.ఆర్. మసానీ, ఆచార్యరంగా, బెజవాడ రామచంద్రారెడ్డి, పీలూమోడీ, వంటి ఉద్ధండులతో పుట్టిన పార్టీ వయస్సు పదేళ్ళు మాత్రమే. తొలుత మర్రి చెన్నారెడ్డి లచ్చన్న వున్నారు.
భారత ఉద్యమకారుడుగా బి.ఆర్. అంబేద్కర్ నిర్మించిన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ఆలిండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీలను దళితులు నిలబెట్టుకోలేకపోయారు. బౌద్ధ సమాజం పెట్టిన అంబేద్కర్ ఒక ఏడాదికే చనిపోయారు.
లోక్ దళ్ పార్టీ, జనత పార్టీ కేంద్రంలో కీలకపాత్ర వహించినా అస్థిరంగానే నడిచాయి. చరణ్ సింగ్, జగజీవన్ రాం, మొరార్జీ దేశాయ్, రాజ్ నారాయణ, వి.పి. సింగ్, జార్జి ఫెర్నాండజ్ వంటి వారున్న పార్టీలు అవి!
ఈ లోగా కాంగ్రెస్ ఎన్నో అవతారాలు ఎత్తింది. కాంగ్రెస్ ఓ, కాంగ్రెస్ ఆర్, కాంగ్రెస్ ఐ యిలా పులి వేషాలు కనిపించాయి. అన్నీ పోయి, కాంగ్రెస్ కొనసాగు తున్నది.
వివిధ రాష్ట్రాలలో పుట్టిగిట్టిన పార్టీల జాబితా చాలా పెద్దది. కనుక ప్రస్తుతం మన రాష్ట్రానికి పరిమితం అవుదాం.

జస్టిస్ పార్టీ :
ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు, మద్రాసులో వుండగా, జస్టిస్ పార్టీ పుట్టింది. అది మద్రాసులో అధికారంలోకి వచ్చి పాలించింది. పానగల్లురాజా, బొల్లిని మునుస్వామినాయుడు, కట్టమంచి రామలింగారెడ్డి, కూర్మా రెడ్డి నాయుడు, వేణుగోపాలస్వామి, పిఠాపురం రాజా, కుప్పుస్వామి చౌదరి, చల్లపల్లి రాజా, బొబ్బిలి రాజా, త్రిపురనేని రామస్వామి వంటి వారెందరో యిందులో వున్నారు. 1937 నాటికి ఎన్నికలలో ఓడిపోయి నామరూపాలు లేకుండా నశించింది.
తెలంగాణాలో 1952 తొలిఎన్నికల సందర్భంగా, నిషేధానికి గురైన కమ్యూనిస్టులు పూపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరిట పోటీ చేసి ప్రధాన పక్షంగా నెగ్గారు. సోషలిస్టులు ఆలిండియా పార్టీలో భాగంగా బలం చూపగలిగారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత 1962 ఎన్నికలలో స్వతంత్రపార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థానానికి రాగలిగింది. లచ్చన్న నాయకత్వంలో కొనసాగింది.
1969 నాటికి ప్రత్యేక తెలంగాణా కోసం ప్రజాసమితి ఏర్పడింది. ఎ. మదన్ మెహన్, పురుషోత్తమ రావు వంటి వారు. స్థాపకులుగా ఉద్యమం చేబట్టారు. తరువాత కోర్టు తీర్పు, పదవులు కోల్పోయిన మర్రిచెన్నారెడ్డి వుద్యమంలో చేరి, ఉర్రూతలూగించారు.
1971 ఎన్నికలలో 10 లోక్ సభ స్థానాలు గెలిచి, ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని జయప్రదంగా అంతం చేశారు. రెండుసార్లు గవర్నర్, రెండుసార్లు రాష్ట్రముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి లోక్ సభకు గెలిచిన 10 మంది మూకుమ్మడిగా ప్రజాసమితిని తుదముట్టించారు. ఆ ఉద్యమంలో పిలకపార్టీలు పుట్టినా అవి లెక్కలోకి రాలేదు.
దేశంలో పుట్టిన పెద్దపార్టీ జనతకాగా, ఈ రాష్ట్రంలో అది ప్రతిపక్ష స్థానానికే పరిమితమై, తరువాత అదృశ్యమైంది. అలాగే లోక్ దళ్, భారతీయలోక్ దళ్ రాష్ట్రశాఖలు పోయాయి.
1955లో అధికారంలోకి రాగలదన్న వూపుచూపిన కమ్యూనిస్టు పార్టీ, 15 స్థానాలకు సరిపెట్టుకోవలసివచ్చింది. తరువాత చీలిపోయి, రాష్ట్రంలో క్షీణిస్తూ వుంది ఇతర పార్టీలు మద్దత్తుతో వేళ్ళపై లెక్కించే స్థానాలకు పరిమితం అయ్యారు. నక్సల్ మావోయిస్టు ముఠాలు ఎన్నికల జోలికి రావడం లేదు గనుక, వారిని యీ కోవలోకి తీసుకోలేం. 1922లో పుట్టిన తొలి కమ్యూనిస్టు పార్టీ మాత్రం లేదు.
1982లో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీ ఎన్ టి. రామారావు నాయకత్వాన రెండుసార్లు ముఖ్యమంత్రి స్థానాన్ని, ఒకసారి ప్రతిపక్ష హోదాను తెచ్చుకున్నారు. ఎన్.టి. రామారావు చనిపోవడం ఒరిజినల్ పార్టీ పోయింది. మధ్యలో నాదెళ్ళ భాస్కరరావు అధికారం చేజిక్కించుకోడానికి పెట్టిన తెలుగుదేశం పదవితో పాటే నెల రోజులలో పోయింది.
చంద్రబాబు నాయుడుకు పోటీగా లక్ష్మీపార్వతి పెట్టిన ఎన్.టి.ఆర్ తెలుగుదేశం నేడు లేనట్లే.
ఒకే ఒకసారి హరికృష్ణ పెట్టిన అన్న జై తెలుగు దేశం తుడుచుకపోయింది.
ఇప్పుడు తలెత్తిన తెలంగాణా రాష్ట్ర సమితికి పోటీగా కొన్ని పిలకలు, మొలిచినా అవి గాలికి రెపరెపలాడుతూ పోతున్నాయి. తెలుగుతల్లి, తెలంగాణా రాష్ట్రపార్టీ, తెలంగాణా సాధన సమితి యిత్యాదులు ఇలాంటివే.
ఇతర రాష్ట్రాలలో నాడు నేడు వచ్చిపోయిన పార్టీల జాబితా చేంతాడంత అవుతుంది. ఇక పార్టీలు మార్చిన వారి చిట్టా ఆ వర్జా పెద్ద దస్త్రం అవుతుంది. ప్రస్తుతానికి సరి.

పట్టిక
పుట్టి పోయిన రాజకీయ పార్టీలు

క్రమ
సంఖ్య దేశ స్థాయిలో మన రాష్ట్రంలో
1. స్వరాజ్య (1922) జస్టిస్ (1920-1937)
2. కాంగ్రెస్ ఇండిపెండెంట్ (1922) కృషికార్ లోక్ (1951)
3. ఫార్వర్డ్ బ్లాక్ (1939) ప్రజాపార్టీ (1952)
4. రాడికల్ డెమొక్రటిక్ (1942) ప్రజాసమితి (1969)
5. కాంగ్రెస్ సోషలిస్ట్ (1935) జనత (1981)
6. కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ (1951) ఎన్.టి.ఆర్. తెలుగుదేశం (1982)
7. ప్రజాసోషలిస్ట్ పార్టీ (1952) జై తెలుగుదేశం
8. స్వతంత్రపార్టీ (1959) తెలుగుదేశం (నాదెళ్ళ భాస్కరరావు)
9. జనత తల్లి తెలంగాణ
10. లోక్ దళ్ తెలంగాణ రాష్ట్రసాధన సమితి
11. భారతీయలోక్ దళ్ జై తెలంగాణ పార్టీ
12. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ
13. ఆలిండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్
14. కాంగ్రెస్ (ఓ), (ఆర్), (ఎస్)