Friday, February 27, 2009

ఎస్.వి.పంతులు – RARE PERSONALITY



left S.V.Pantulu,right Innaiah



ఎస్.వి.పంతులు –
హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కు వెడితే అక్కడ సాధారణమైన దుస్తులతో పొట్టిగా ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ప్రముఖ నాయకులు తరచు పంతులుగారిని పిలవండి అంటూంటారు. ఆయనే ఎస్.వి. పంతులు. ఎవరికి ఏ సందేహం వచ్చినా, ఏ సమాచారం కావలసినా పంతులుగారే ఆదుకుంటారు. విషయ పరిజ్ఞానంలో అసాధారణ జ్ఞాపక శక్తిగల పంతులుగారు సౌమ్యుడు, స్నేహపాత్రుడు.
ఎస్.వి. పంతులు పూర్తి పేరు సంకా వినయ పంతులు. 1934లో తెనాలిలో పుట్టారు. 1950 ప్రాంతాల నుండి ఆచార్య ఎన్.జి. రంగాకు సన్నిహితంగా, అనధికార పి.ఏ.గా ఉన్నారు. ఆయన చనిపోయే వరకూ అలాగే కొనసాగారు. పార్టీ రాజకీయాలలో తలదూర్చకుండానే ఎందరో నాయకులకు కార్యకర్తలకు సలహాదారుగా, సన్నిహితుడుగా ఉండగలగడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. రంగా గారి సాన్నిహిత్యం వల్ల రాష్ట్ర, దేశనాయకులతో దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి.
పంతులుగారి పరిచయాలు పరికిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇందులో పేర్కొనదగింది కీ.శే. బి.ఆర్. అంబేద్కర్ తో 1952లో పరిచయం. అటు ఆచార్య రంగా, ఇటు అంబేద్కర్ 1952 ఎన్నికలలో ఓడిపోయి, న్యూఢిల్లీ వెస్ట్రన్ కోర్టులో పక్క పక్క గదుల్లో ఉండేవారు. వారిని పలకరించడానికి ఎవరూ వచ్చేవారు కాదు. భారతదేశంలో ఓడిపోయిన వారి పరిస్థితి అలాగే ఉంటుంది. అప్పుడు పంతులుగారు వారిరువురికీ సేవలు చేస్తూ సన్నిహితంగా ఉండడాన్ని మధురస్మృతిగా భావిస్తారు. అంబేద్కర్ తో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయడం అసాధారణ విషయమే.
ఎస్.వి. పంతులు 1951లో తెనాలిలో నాకు పరిచయమయ్యారు. అప్పటి నుండి మా స్నేహం కొనసాగుతూనే ఉన్నది. కాంగ్రెస్ నుండి చీలిపోయి ఆచార్య రంగా కృషికార్ లోక్ పార్టీ పెట్టి తెనాలిలో తొలి మహాసభలు నిర్వహించారు. ఎడ్లపాటి వెంకటరావు, ఎలవర్తి శ్రీరాములు మొదలైనవారు ఆ సభల ఏర్పాట్లు చూశారు. వాటికి హాజరైన నాయకులలో గౌతు లచ్చన్న, కందులు ఓబుల రెడ్డి, విద్యార్థి నాయకుడుగా ఉన్న కె. రోశయ్య (నేటి మంత్రి) వీరాచారి, విజయరాజకుమార్, ఆర్.సి.హెచ్. మనోహరం, వై.ఆర్.కె.రెడ్డి, సుంకర సత్యనారాయణ ఇత్యాదులెందరో ఉన్నారు. సినీ నటుడు చిత్తూరు నాగయ్య వచ్చారు. శ్రీకాకుళం నుండి అంపోలు అప్పల స్వామి ఆనాడు తాటిచెట్టు పెకలించి వేయడం సభలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పంతులుగారు నేను అప్పుడు ప్రేక్షకులుగా వాటిని ఆనందించి అనేకమందితో పరిచయాలు ఏర్పరుచుకున్నాం.
పంతులుగారికి టంగుటూరి ప్రకాశంపంతులు, తెన్నేటి విశ్వనాథం, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, కె. విజయభాస్కరరెడ్డి, బండారు రత్న సభాపతి, కాకాని వెంకటరత్నం. పి.వి.చలపతిరావు బాగా తెలుసు. కమ్యూనిస్టు నాయకులలో తరిమెళ నాగిరెడ్డి, సి.హెచ్. రాజేశ్వరరావు దగ్గరా తెలుసు. ఆ తరువాత కాంగ్రెసువారిలో కేంద్రరాష్ట్రాలలో తెలిసినవారు అసంఖ్యాకంగా ఉన్నారు.
అఖిల భారత స్థాయిలో రాజగోపాలాచారి, మీనూ మసానీ, పీరూ మోడీ, హెచ్.ఎమ్.పటేల్, ఎన్. దండేకర్, ఆర్.సి.కూపర్, సంతోష్ బగ్వోడియా, దగ్గరగా తెలుసు.
1975లో పంతులుగారు యూరోప్, రష్యా పర్యటన చేశారు. అప్పుడు జర్మనీ పరిచయస్తులకు మీనూ మసానీ లేఖనిచ్చి, పంతులుగారికి తోడ్పడమని రాశారు. ఇంగ్లండు పర్యటనలో సహాయపడమని అక్కడి వారికి ఆచార్య రంగా లేఖ పంపారు. రష్యాలో పర్యటనకు ఇస్కస్ సంస్థ పంతులుకు సహాయం చేసింది. ఫ్రాన్స్ హాలండ్ తదితర దేశాలు చూచి విశేషాలు తెలుసుకున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితిని ఇందిరాగాంధీ ప్రకటించిన రోజులలో పంతులుగారు అలాంటి విదేశీ పర్యటన చేశారు.
సుప్రసిద్ధ సైంటిస్ట్ స్వామినాథన్ పంతులుగారికి ఎలా తెలుసు అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. హైదరాబాదులో స్వామినాథన్ తో సమావేశాలు ఏర్పాటు చేసిన ఘనత పంతులుగారిదే. ఆయనకు వ్యవసాయమంటే రైతుల సమస్యలంటే ప్రత్యేక శ్రద్ధ ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ లో నిపుణలుగా ఉన్న వ్యవసాయ సైంటిస్టులను గుర్తించి రాష్ట్ర ఫ్రభుత్వంతో వారికి సత్కారాలు అందించగలిగారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ గా చేసిన ఎమ్.వి. రావు ఎంతో ఆదరణగా పంతులుగారిని చూస్తారు.
పత్రికారంగంలో ఎమ్.చలపతి రావు (నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపాదకుడు), న్యాపతి నారాయణ మూర్తి (ఆంధ్రప్రభ తొలి సంపాదకుడు – పాన్ సుపారీ శీర్షిక ద్వారా పాఠక లోకానికి సుపరిచితుడు), బి.ఎస్. ఆర్. కృష్ణ (ప్రసుతం మదరాసులో ఉంటున్నారు), వామన రావు (ఖాసా సుబ్బారావు అల్లుడు – న్యూ స్వరాజ్య సంపాదకుడు), ఆంధ్రపత్రిక విలేఖరి శర్మ (ముక్కు శర్మ అనేవారు), రాజేద్రప్రసాద్ (హిందూ పత్రికలో చనిపోయేవరకూ పనిచేశారు), నర్రావుల సుబ్బారావు (ఆలిండియా రేడియో, దూరదర్శన్ లో పనిచేశారు. ఇలాంటి వారి జాబితా సుదీర్ఘంగా ఉన్నది.
కీర్తి శేషులు వి.వి.గిరి రాష్ట్రపతిగా పోటీ చేసినపుడు పంతులుగారు ఎన్నికల ఏజెంటుగా పనిచేశారంటే వినేవారికి వింతగానే ఉంటుంది. హైదరాబాదులో శాసన సభ్యుల సమావేశం ఏర్పాటు చేస్తే ఒక్క వావిలాల గోపాలకృష్ణయ్య తప్ప గిరిగారిని సమర్థించడానికి ఎవరూ రాలేదని పంతులుగారు చెపుతుంటారు.
ఎమ్. రత్న స్వామి, వి.కె. సుందరం, హండే, మారిస్వామి మొదలైనవారు తమిళనాడునుండి పంతులుగారికి దగ్గర మిత్రులుగా ఉండేవారు. సంజీవరెడ్డి హైదరాబాదు వచ్చినప్పుడు పంతులుగారిని ఫోన్ చేసి సరోవర్ హోటల్ లో రూము అట్టి పెట్టమని చెపుతుండేవారు. 1955 ఎన్నికలలో ఐక్య కాంగ్రెస్ పక్షాన ఆచార్య రంగా సంజీవరెడ్డి ఒకే కారులో ఆంధ్రదేశమంతా పర్యటిస్తూ పంతులుగారినే వెంటబెట్టుకెళ్ళారు.
అలాంటి పంతులుగారికి నేటికీ సొంత ఇల్లు లేదు. ఏర్పరుచుకోవాలనే ఆసక్తీ లేదు. ఒకప్పుడు ఒక డొక్కు స్కూటరు మీద తిరుగుతూండేవారు. వృద్ధాప్యం వలన ఇప్పుడు సి.టీ.బస్సులలోనే వెళ్ళివస్తుంటారు. పార్లమెంటు సెంట్రల్ హాలులోకి నిరాఘాటంగా ఎన్నోసార్లు వెళ్లివచ్చిన పంతులుగారు సాధారణ జీవితాన్ని ఎంచుకున్నారు. విషయాలను విడమరచి చెప్పడంలో ఎన్నికల ఫలితాలు అంచనా వేయడంలో ఆయన వాస్తవ వాది. పబ్లిసిటీ కోరని వ్యక్తి. పంతులుగారిని గురించి చెప్పదలచుకున్న అంశాలలో ఇప్పటి వరకూ ప్రస్తావించింది మొదటి దశ.

Wednesday, February 25, 2009

తెలుగును కాపాడుకోడానికి ఉద్యమం









Mandali Buddha Prasad, Cnaare, YLP in the rally























concluding meet in Srikakulam



Dr Yarlagadda Lakshmiprasad








Ghajal Srinivas moved the participants with his ghajals on greatness of Telugu language


సాహిత్య జైత్రయాత్ర

కీ.శే. నార్ల వెంకటేశ్వరరావు శతజయంతి సందర్భంగా తెలుగు భాషను కాపాడుకోవడానికి స్కూళ్లల్లో 11వ తరగతి వరకు తెలుగు తప్పనిసరిగా నేర్చుకునేటట్లు చేయటం, వీధుల్లో బోర్డుల నుండి వాడుకలో అన్ని విధాలా తెలుగుని ఆంధ్రప్రదేశ్ లో బాగా వినియోగించటానికి ఒక ఉద్యమం తలపెట్టారు. ఫిబ్రవరి 21, 2009న విజయవాడ నుండి ప్రారంభమైన ఈ ఉద్యమ సాహిత్య యాత్ర శ్రీకాకుళం వరకు సాగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జర్నలిజం, తెలుగు శాఖల విద్యార్థులు ఈ యాత్రను శిక్షణగా వినియోగించుకున్నారు. ముందుగా కృష్ణాజిల్లాలో నార్ల వెంకటేశ్వరరావు మెట్టిన కౌతరం గ్రామం నుండి బయలుదేరి విజయవాడలో ఊరేగింపులు, సభలు జరిపారు.
ఈ సాహిత్య యాత్రకు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (హిందీ అకాడమీ అధ్యక్షులు, మాజీ రాజ్య సభ సభ్యులు) ఆధ్వర్యం వహించారు. ఆయనకు తొడుగా గజల్ శ్రీనివాస్ నిలిచారు. నార్ల వెంకటేశ్వరరావు భాషకు చేసిన సేవ, ప్రచురించిన సాహిత్యం, ప్రచారం చేస్తూ యువతరంలో తెలుగు భాష పట్ల మక్కువ పెంచటానికి ఈ ఉద్యమం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇంగ్లీషుతో సహా పర భాషలను చదువుకుంటూనే తెలుగు మాధుర్యాన్ని నుడికారాన్ని మరువకుండా సహజమైన పదజాలంతో వినియోగించుకుంటూ పోవాలని అన్నారు.
ఈ యాత్ర విజయవాడ నుండి భీమవరం, రాజమండ్రి, కాకినాడ, తుని, పాయకారావు పేట, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వరకు సాగింది. ప్రతిచోటా కళాశాల, పాఠశాల విద్యార్థి, విద్యార్థునులను పాల్గొనెటట్లు ప్రోత్సహించారు. ప్రెస్ క్లబ్ వారు కూడా ఈ యాత్రకు బాగా సహకరించారు.
జస్టిస్ రఘురాం, జస్టిస్ భానుప్రసాద్, మంత్రి మండలి బుద్ధ ప్రసాద్, ఎమ్. వెంకయ్యనాయుడు, శాసన మండలి సభ్యులు శేషారెడ్డి, రత్నకుమారి, సుప్రసిద్ధ కవి, రచయిత సినారె, మాజీ గవర్నర్, రచయిత్రి రమాదేవి, ఎన్. ఇన్నయ్య, బాబి వర్ధన్, చల్లా రామకృష్ణ, కాళిపట్నం రామారావు, కొల్లి శారద (నార్ల వెంకటేశ్వరరావు పెద్ద కుమార్తె) వెలగా వెంకటప్పయ్య, పర్వతనేని సుబ్బారావు, విజయకుమార్ (ఎమ్.ఎస్.కో) ప్రచురణ కర్త, కృష్ణాజిల్లా రచయితల సంఘం వారు, నన్నయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, శ్రీకాకుళం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సుధాకర్, నడుస్తున్న చరిత్ర పత్రిక సంపాదకుడు, ఆచార్య బాలవర్ధన్, కె. రాం ప్రసాద్, శంకర్ నారాయణ, గుమ్మా సాంబశివరావు, కొండపల్లి సుదర్శన్ రాజు మొదలగు వారు పాల్గొన్నారు.
తెలుగు సాహిత్యంలో నార్ల వెంకటేశ్వరరావు కృషిని యువతరం వారు తెంచుకోవటానికి వీలుగా ఆయన్ను గురించి అనేక వివరాలు తెలియజేశారు. విశాలాంధ్ర ప్రచురణాలయం వారు నార్ల రచనల 12 సంపుటాలను విక్రయిస్తున్న సమాచారాన్ని తెలియపరచి అవి ప్రతీ సంస్థలో ఉంచి, చదివి, నార్ల నాటికలను ప్రదర్శించి, తెలుగు నుడికారాన్ని ఇనుమడింప చేయాలన్నారు.
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తలపెట్టిన ఈ సాహిత్య యాత్రకు అటు పత్రికల్లోనూ, ఇటు టీ.వీ.ల్లోనూ చక్కని ఆదరణ లభించింది. ఇలాంటి సాహిత్య యాత్రను ఇంకా కొనసాగించాలని నిర్ణయించారు. శ్రీకాకుళంలో కాళిపట్నం రామారావు నడుపుతున్న కథా కేంద్రానికి విద్యార్థులను తీసుకు వెళ్ళి చూపారు. అక్కడ కథా రచయితల, రచయిత్రుల ఫోటోలను ప్రదర్శించిన తీరును, కథలను అట్టి పెట్టిన పద్ధతిని రామారావు గారు సందర్శకులకు వివరించారు. 82వ ఏట కూడా ఆయన సాహిత్యంలో నిర్విరామ కృషి చేయడాన్ని అందరూ అభినందించారు. తరువాత సాహిత్య సమావేశంలో కూడా రామారావు గారు వచ్చి పాల్గొన్నారు. ఇది 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు (2009) వరకు జరిగింది. ఈ యాత్రలో గురజాడ, వీరేశలింగం విగ్రహాలకు పూలమాలలు వేసి గౌరవించారు. నార్ల విగ్రహాన్ని త్వరలో విజయవాడలో ప్రతిష్టించబోతున్నట్లు ప్రకటించారు.






Friday, February 20, 2009

ఈ చికిత్సలు, మందులు అమానుషాలు

electropathy
magnet attraction














enjoying urine therapy












సాక్ష్యాత్తూ భారత దేశ ప్రధానిగా చేసిన మొరార్జీ దేశాయ్, తాను మూత్ర వైద్యాన్ని చేసుకుంటున్నట్లు భాహాటంగా ప్రకటించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం మరచిపోవద్దు
ఆధునిక వైద్యంలో ఖరీదు, లోపాలు చూపి మార్గాంతరంగా వేరే వైద్యాలు, చికిత్సలు మార్కెట్ లోకి వచ్చాయి. జనాకర్షణగా అవి అన్ని రకాల ప్రజలనూ ఆకట్టుకుంటున్నాయి. వాటికి శాస్త్రీయత ఉందా, ప్రామాణికత నిర్ధారణ అయిందా, ఫలితాలపై పరిశోధన జరిగిందా, వైఫల్యాలకు ఎవరు బాధ్యత వహిస్తారు, ఎప్పటికప్పుడు లోపాలను దిద్దుకుంటూ పోయే పద్ధతి ఉన్నదా ఇత్యాదులు బొత్తిగా పట్టించుకోవటంలేదు. కానీ ప్రభుత్వ మద్దత్తులు కొన్ని చోట్ల లభిస్తుండగా మరికొన్ని చోట్ల మత నమ్మకాలను, మూఢ విస్వాసాలను, అడ్డం పెట్టుకుని ఈ మార్గాంతర చికిత్సలు జనాన్ని మోసగిస్తున్నాయి.
మాకు కూడా గుర్తింపు కావాలని, ప్రభుత్వం సహాయం అందించాలని మార్గాంతర చికిత్సల వారు పట్టుబట్టారు. కోర్టుకు వెళ్ళారు. వారి కోరిక సబభేనా, కాదా? పరిశీలించి చెప్పమని ఢిల్లీ హై కోర్టు అడిగింది. తొలిసారి ఎలక్ట్రోపతి, ఎలక్ట్రో హోమియోపతి వారు అలా కోర్టుకు వెళ్ళి అడిగారు. అంతటితో కథ ఆరంభమైంది.
కేంద్ర ప్రభుత్వం అఖిల భారత వైద్య, శాఖ, మెడికల్ కౌన్సిల్ ద్వారా నిపుణులను ఒక సంఘంగా నియమించి (1999) మార్గాంతర చికిత్సల శాస్త్రియతను పరిశీలించమని కోరింది. ఆ సంఘం వారు కూలంకషంగా విషయాన్ని మూలానికి వెళ్ళి చూచారు. ఫలితాన్ని నివేదికగా సమర్పించారు. ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ డా. ఎన్. కె. గంగూలి అధ్యక్షతన ఈ నిపుణుల సంఘం ఎర్పడింది. ఇందులో డా. ఎస్.పి. అగర్వాల్, డా. ఆర్.ఎ. మాష్ లేకర్, అశ్వనీకుమార్, ప్రొఫెసర్ బి.ఎన్. ధవన్, ప్రొఫెసర్ ఎస్.ఎస్. హండా, డా. వి. ఎన్. పాండె, డా. ఆర్. హెచ్. సింగ్, హకీం కలీఫతుల్లా, యునాని వైద్య శాఖ అధిపతి, డా. ఆర్. కన్నన్, డా. లీనా మెహండలే, డా. ప్రమీలాచారీ, డా. జె.ఎన్. పాండే, డా. బి.కె. శర్మ, డా. వసంత ముత్తు స్వామి ఉన్నారు.
వీరు పరిశీలించిన అంశాలు. 1. మార్గాంతర చికిత్స పేరిట చెప్పే వైద్యం. స్థిరమైన ప్రమాణాలతో ఉన్నదా? 2. అందులో ప్రాక్టీస్ చేసేవారు, ఆ వైద్య విధానం తగినంత క్రమ పద్ధతులను పెంపొందించిందా. 3. ఈ వైద్య విదానానికి సమగ్రమైన వైద్య సాహిత్యం ఉన్నదా. 4. ఈ చికిత్సను ప్రభుత్వం గుర్తించవచ్చా. 5. ఈ విధానాన్ని వైద్య శాఖలో బోధించి, డాక్టర్లను తయారు చేయవచ్చా. 6. ఈ వైద్య విధానానికి అనుగుణంగా శాసనాలు చేయవచ్చా.
ఈ వైద్య విధానాలలో కేవలం కొన్ని రోగాలకే పరిమితమై కాక సమగ్రంగా, అన్నింటిని చికిత్స చేసే రీతులు ఉన్నాయా.
ఈ వైద్య విధానాలలో అవి పుట్టిన దేశాలు, వాటిని గుర్తించాయా.
ఈ వైద్య విధానాలకు తగిన రోగ నిర్ధారణ పద్ధతులు, పరిశీలనా అంశాలు, చికిత్స రీతులు, విఫులంగా, విస్తారంగా పరిశీలించి ప్రకటించారా.
శాస్త్రీయ పరిశీలనకు నిలిచే మందులు, చికిత్సా రీతులు, ఆహార పద్ధతులు, వ్యాయామ రీతులు ఉన్నాయా. ఈ చికిత్సలో వాడే మందులు అర్హమైనవి అని పరీక్షకు పెట్టి తేల్చారా. ఈ వైద్య విధానాలలో శిక్షణ ఇవ్వటానికి తగినన్ని పద్ధతులు పెంపొందాయా. పరిశోధనకు శిక్షణకు అనుకూలమైన రీతులు లభిస్తున్నాయా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ నిపుణుల సంఘం పరిశీలించింది.
భారత దేశంలో మార్గాంతర చికిత్సల పేరిట అమలు జరుగుతున్న వైద్య, విధానాలు : అయస్కాంత చికిత్స (మాగ్నటిక్ తెరపీ), ఎలక్ట్రో పతీ, ఎలక్ట్రో హోమియోపతి, రేకీ, రిఫ్లెక్సాలజీ, మూత్ర చికిత్స, సమ్మోహన చికిత్స (హిప్నో తెరపీ). అరోమా తెరపీ (సువాసనల చికిత్స). కలర్ తెరపీ, ప్రాణిక్ హీలింగ్ (ఒక విధమైన యోగా), జమ్స్, స్టోన్స్ తెరఫీ (రత్నాలు, రాళ్లు చికిత్స), మ్యూజిక్ తెరఫీ (సంగీత చికిత్స), అక్యూపెంచర్ (సూదులు గుచ్చే చికిత్స).
ఈ చికిత్సలు శాస్త్రీయమని రుజువు కాలేదని కనుక వీటిని ప్రభుత్వాలు గుర్తించరాదని వీటికి ఆర్థిక సహాయం అందజేయరాదని, వీటి పేరిట సర్థిఫికెట్, ఢిగ్రీ కోర్సులు ఇవ్వరాదని, వీటి పేరిట డిగ్రీలు తగిలించుకొని ప్రాక్టీసు చేయరాదని వీటిని అమలు పరిచేవారిని డాక్టర్లని పిలవరాదని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కమిటీ సిఫార్సులను అటు కోర్టు, ఇటు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. వీటిని రాష్ట్రాలకు పంపి వెంటనే అమలు పరచమని 2005 నుండి నిర్దేశించింది. కాని ఆచరణలో అమలు జరగటంలేదు. ప్రతీ మార్గాంతర చికిత్సల వెనుక రాజకీయాలు, వత్తిడులు, మత ప్రభావాలు ఉన్నాయి. ప్రజలల్లో వీటి పట్ల ఉన్న నమ్మకాలు, మరొక్క కారణం, వీటిని విస్తృతంగా ప్రజల్లోకి ప్రజారం చేయవలసిన అసరం ఉన్నది. అంతేకాక హోమియోపతి మొదలైన చికిత్సలలో శాస్త్రియ ఆధారాలేమిటో నిర్థారించాల్సిన అవసరం కూడా ఉన్నది. భారత రాజ్యాంగం స్పష్టంగా శాస్త్రియ పద్ధతిని ప్రజల్లో ప్రజారం చేయటం విధి అని (51 ఎ.హెచ్) ద్వారా పెర్కొన్నది.

Thursday, February 19, 2009

జీవితమంతా నాస్థికురాలిగా


















93 సంవత్సరాల నాస్తిక హేతువాది

సాధారణంగా వయస్సు ముదిరే కొద్దీ భక్తి పెరిగి, చాందసం ఎక్కువై భజనలు చేస్తూ కాలం గడపటం, కర్మ, పునర్జన్మ పట్ల ఆశక్తి చూపుతూ ఉండటం సర్వసాధారణం. అందుకు విరుద్దంగా తన శక్తిపై తనకు నమ్మకం ఉన్నదని, జీవితంలో ఒకటే జన్మ ఉంటుందని, అందులోనే సాధించాలని పట్టుదలగా ఉండే వ్యక్తులు కొద్ది మందే ఉన్నారు. వారు తరతరాల వారికి ఆధర్శ ప్రాయులు. అలాంటి అరుదైన వ్యక్తిని ఫిబ్రవరి 8న (2009) ఇంకొల్లు (ప్రకాశం జిల్లా, పరుచూరు దగ్గర) కలిశాను. ఆమె కొడాలి కమలమ్మ. మంచంలో లేవలేని స్థితిలో ఉన్నారు. నడుం దగ్గర నుంచి కింది భాగం పనిచేయటం లేదు. అయితే మాట్లాడటం, వినటం, మెదడు పనిచేయటం, మామూలుగా ఉండటం విశేషం. ఆమె 1940 నుండి అన్ని నాస్తిక సభలకు, హేతువాద కార్యక్రమాలకు మహిళా శిక్షణ తరగతులకు వెళుతుండేవారు. నేను అనేక పర్యాయాలు ఆ విధంగా ఆమెను కలుసుకున్నాను. తనకు చేతనైనంత ఆర్థిక సహాయం కూడా నాస్థిక ఉద్యమాలకు అందజేస్తుండే వారు.
వృద్ధాప్యంలో అంత దృఢ విశ్వాసంతో సాగిపోవటం బేట్రాండ్ రసెల్, నార్ల వెంకటేశ్వరరావు మొదలైన వారిని చూచి ఆశ్చర్యపోయాం. ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తిగా మొపర్రు (గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గ్రామం)లో 1916లో పుట్టిన కమలమ్మ కొద్ది పాటి చదువులతో ఖద్దరు ధరించి గాంధీజీ స్వాతంత్ర పోరాట ఉద్యమాలలో పాల్గొని జైళ్ళ పాలయ్యారు. హిందీలో విశారద చదివారు. కుల నిర్మూలన ఉద్యమాల్లో పనిచేశారు. బ్రహ్మ సమాజం ప్రభావం వల్లన అలా చేయగలిగారు. వ్యక్తి గత సత్యాగ్రహంలో జైలుకు వెళ్ళి జరిమానా కూడా కట్టింది. సహపంక్తి భోజనాలు చేసి కుల పట్టింపులు త్రోసి పుచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. మరొకసారి జైలుకు వెళ్ళారు. విజయవాడలో గోరా గారి నాస్థిక ఉద్యమంతో సన్నిహిత సంబంధం పెట్టుకుని అలాగే కొనసాగారు. రాజీ పడకుండా నాస్తిక నైతిక ఉద్యమంలో ఉన్నారు. చెబ్రోలు గ్రామంలో మహిళా శిక్షణ నిర్వహించిన సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి పాఠశాలలో పాల్గొన్నారు. ఆమె భర్త కుటుంబరావు 1962లో చనిపోగా వాళ్ళ కుమారుడు ధర్మానందరావును డాక్టర్ చదివించింది. అతడు ఇప్పుడు ఇంకొల్లులో ప్రాక్టీసు చేస్తున్నాడు. అతని వద్దే ఆమె ప్రస్తుతం ఉన్నారు. ఆమె కుమార్తె సరళ ఎమ్.ఎస్.సి. చదివి గద్దె రామచంద్రరావును పెళ్ళాడి, అమెరికాలో నయాగర వద్ద స్థిరపడ్డారు. నేను అమెరికాలో వారింటికి వెళ్ళి ఆతిద్యం పొంది అనేక విషయాలు ముచ్చటించుకున్నాం. గద్దె ఇంటిపేరుగల వారి చరిత్రలను స్వేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. కమలమ్మ అమెరికా వెళ్ళి 1977 లో కొన్ని ప్రదేశాలు చూడగలిగారు. అప్పుడు ఫ్రొఫెసర్ ఆలపాటి కృష్ణకుమార్, జ్యోతిర్మయి వంటి వారిని కలుసుకుని అనుభవాలు స్వీకరించారు. మాంసాహారం ప్రయాణాల్లో తిన్నప్పుడు కూడా ఆమె ఎలాంటి అసహనం కనబరచలేదు.


జీవితమంతా నాస్థికురాలిగా, ఆనందంగా, తోటివారికి సహాయపడుతూ జీవితపు విలువలను గౌరవించింన వ్యక్తి ఆమె. ఒకప్పుడు సత్య సాయిబాబా విజయవాడకు రాగా నిరసన తెలిపి అతడి చర్యలను అడ్డగించటానికి పూనుకున్నారు. అప్పుడు ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ప్రజలను మోసగించే బాబాలను ఆమె క్షమించలేదు. నిప్పులు మీద నడచి, అది మహత్తు కాదని ప్రాక్టీసనీ 1980లోనే ఆమె నిరూపించారు. నేను ఇంకొల్లులో కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించి ఇటీవలె తన జీవితాన్ని గురించి ప్రచురించిన విరామమెరుగని పురోగమనం అనే పుస్తకాన్ని నాకిచ్చాకు. ఇది కావాలంటే ఎవరైనా ఉచితంగా డాక్టర్ బీరం సుందరరావు, తెలుగు లెక్చరర్, ఇంకొల్లు – 5231676, ఫోన్ – 08594-244111, 98480-39080. ఈ పుస్తకాన్ని ఇటీవల చనిపోయిన జాషువా కుమార్తె, లవణం భార్య హేమలతకు అంకితం ఇచ్చారు..



Monday, February 16, 2009

షిర్డి సాయి గుడి కడితే గిట్టుబాబు


abdul baba marketed as shirdi sai?










Is it real or propagatated by hindu trustees

ఆంధ్రప్రదేశ్ లో షిర్డీ సాయి గుడులు కొన్ని వెలిశాయి. ఇంకొన్ని రాబోతున్నాయి. భక్తులు ఇలా గుడులు కట్టుకుంటూ పోవటం ఇతర రాష్ట్రాలకంటే ఇక్కడ ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం. కొందరు ఈ భక్తిని అమెరికాకు ఎగుమతి చేసి అక్కడా గుడులు కడుతున్నారు. తీరా విచారిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఈ షిర్డీసాయి గుడులపై అజమాయిషీ చేసే అధికారం, లెక్కలు చెప్పమనే అర్హత లేదని తెలిసింది. అలా ఎందుకు, ఎప్పుడు మినహాయింపు ఇచ్చారో, దీనివెనుక ఏఏ శక్తులు పనిచేశాయో తెలియదు. ఇలా కొత్తగా షిర్డీ సాయి గుడి కట్టినవారు ఒక ట్రస్టు ఏర్పరచి, వివిధ రూపాలలో డబ్బు సంపాదించి ఆస్తులు కూడబెట్టి, సాగిపొతున్నా అదేమని అడిగేవారు లేరు. ఆ విధంగా గిట్టుబాటుగా ఆధ్యాత్మిక వ్యాపారం సాగిపోతున్నది. ఇలాగే మరి కొందరు బాబాలకు మినహాయింపులు తెచ్చుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రభుత్వం వీటికి ఎందుకు పనులు వేయరో తెలియదు. వివిధ వస్తువులు తయారు చేసి దేవుడి పేర అమ్మతుంటే వాటిని అమ్మకపు పన్ను నుండి ఎందుకు మినహాయిస్తారో తెలియదు. వ్యాపారానికి దేవుడు పేరు పెట్టగానే బాబా నామ కరణ చేయగానే దాని వెనుక ఏమి జరుగుతున్నా పట్టించుకోకపోవటం, అవినీతికి ఆధ్యాత్మిక ముసుగు కప్పటం, మత విలువగా ఉంటున్నది.
మానవులు గొప్ప సృష్టికర్తలు. అనాదిగా మొదలెట్టి నేటివరకూ సృష్టని కొనసాగిస్తూనే ఉన్నారు. రాను రాను తాము సృష్టించినవి నిజమేనని నమ్మి వాటికే మొక్కుతున్నారు. అలాంటి గొప్ప సంఘటన ఆధునిక కాలంలో జరిగింది.
శాస్త్రీయ పరిశీలనా సంఘం చేసిన కృషి ఫలితంగా వెలుగులోకి వచ్చిన సత్యాలను ఇక్కడ ప్రవేశ పెడుతున్నాం. మహరాష్ట్రలో నానానవతి ప్రభాకర్ ఆధ్వర్యాన ఈ పరిశోధన జరిగింది.
మహారాష్ట్రలో షిర్డీ ఒక మారుమూల గ్రామం. ఒకప్పుడక్కడ బంగారం పనిచేసే వాళ్ళుఎక్కువగా ఉండేవారు. ఆ కుగ్రామానికి 1838 ప్రాంతాలలో ఒక ఫకీరు వచ్చి అక్కడ ఉన్న ఒక దర్గాలో ఉంటుండేవాడు. అతడు తిరుగుతూ, తనలో తను మాట్లాడుకుంటూ రాత్రిళ్ళు వచ్చి అక్కడ పడుకునేవాడు. జనం జాలి తలచి ఆహారం పెట్టేవారు. అతడెవరో, అతడి అసలు పేరేమిటో, తలిదండ్రులెవరో, ఎక్కడ పుట్టాడో రికార్డు లేదు. అతనికి సహాయంగా బయాజాబాయ్ అనే వ్యక్తి ఉండేవాడని గ్రామస్తులు చెప్పుకునేవారు. సూఫీ సూక్తులు ఆసువుగా చెపుతుండేవాడని అన్నారు. 1914 ప్రాంతాలలో నాటి కలెక్టర్ దేశాయ్ అతని ఫొటో తీశాడని కథ అల్లారు. సాయికి తోడుగా సహాయపడుతూ వచ్చిన అబ్దుల్ బాబా అనే అతను అక్కడ ఉంటుండేవాడు. సాయికి చదవటం రాయటం రాదు గనక అతడు మాట్లాడుతూ ఆలాపిస్తూ పోయిన సూఫీ సూక్తులను అబ్దుల్ బాబా కాయితాలపై రాశాడు. అవి ఉర్దూలో, మరాఠీలో ఉన్నాయి. 1917లో సాయి చనిపోయాడన్నారు. ఆ తరువాత క్రమంగా కొందరు తెలివిగల హిందువులు చిన్న కమిటీగా ఏర్పడి, క్రమేణా ట్రస్టు రూపొందించారు. దీనికి మూల సూత్రకారుడు దభోల్కర్, దేశ్ పాండే, సహరాబుధ్ అనే వారు. సాయిని ముస్లిముగా చెబితే జనం వచ్చి ఆరాధించరనీ, వీరు ట్రస్టుగా ఏర్పడి అతడిని హిందూబాబాగా ప్రచారం చేశారు. క్రమేణ చిన్న మందిరంతో ప్రారంభించి విస్తృతపరుస్తూ పోయారు. అంతేగాక సాయి పేరుతో అద్భుతాల జరుగుతన్నట్లు నోటి ప్రచారం చేసి తరువాత రాతలు అమలులోకి తెచ్చారు. సాయిని రకరకాల అవతారాలుగా ప్రచారం చేశారు. జీవిత చరిత్రలు రాసి కట్టు కథల్ని పెట్టుబడిగా వాడుకున్నారు. ఈ అబ్దుల్ బాబా 1950 ప్రాంతాలలో చనిపోయాడు. అతడు బ్రతికుండగా ఈ ట్రస్టీలు అతడి ఫోటో తీసి అదే సాయి ఫోటోగా ప్రచారంలో పెట్టారు. అదే మసీదులో వీరికి సేవలు చేస్తూ కొనసాగిన రసూల్ బాబా ఉండేవాడు. సాయిని గురించి, ఫోటోలు గురించి ఇతర నిజానిజాలను గురించి అడిగితే అతడు నవ్వి ఊరుకునేవాడు. వివాదాలలోకి వెళ్లేవాడు కాదు. కాని సాయి సూఫీ సూక్తులను అట్టిపెట్టాడు. వాటి కాపీ మేము కూడా సేకరించాము. టి.వి. 9 ఛానెల్ ద్వారా హైదరాబాదులో ప్రచారం చేశాం. అయితే అప్పటికే భక్తి ముదిరి, సాయి విషయంలో అబద్ధాలే నిజమై స్థిరపడ్డాయి గనుక వీర భక్తులు సత్యాలను స్వీకరించే స్థితిలో లేరు.
ఆంధ్రపై ఒకప్పుడు పండరీనాథ్ ప్రభావం ఉండేది. దాని స్థానంలో ఇప్పుడు సాయి పూనకం వచ్చింది. సాయి వ్యాపారం జోరుగా దశదిశలుగా విచ్చలవిడిగా సాగిపోతున్నది. ట్రస్టువారు రెండుచేతులా ఆర్జిస్తుండగా ఒక స్థాయిలో మహరాష్ట్ర ప్రభుత్వం ట్రస్టీలను అరెస్టు చేసి జైల్లో పెట్టింది. మహరాష్ట్ర శాసన సభలో తీవ్ర చర్చకూడా జరిగింది. ఇప్పుడు సాయి భజన ఎక్కువై ఆదాయం పెరిగి ప్రభుత్వాన్నే ప్రభావితం చేసే స్థాయికి వచ్చింది.
ప్రశ్నించకుండా, పరిశోధించకుండా గుడ్డిగా నమ్మే భక్తులు ఉన్నంత కాలం సాయి వ్యాపారం సాగిపోతుంది. వాళ్లను తానే సాయి అవతారమని పుట్టపర్తి బాబా దక్కించుకోగా, మరికొందరు చిన్న బాబాలు కూడా యథాశక్తి ఈ వ్యాపారంలోకి దిగారు.

Thursday, February 12, 2009

సైకిక్ సర్జరీ భ్రమలు – మోసాలు



Alex Orbito


ఈ ఫొటోలో ఎడమ నుంచి కీ.శే. ఎం. బసవ పున్నారావు, విక్రమ్, ఎన్. ఇన్నయ్య. బల్లమీద పరున్న వ్యక్తి తనకు దోషం ఉన్నదని చెప్పిన మనిషి.






అమెరికాలో మోసాలు చేసి జేమ్స్ రాండీకి పట్టుబడి, గుట్టు బట్టబయలు కాగా పారిపోయిన అలెక్స్ ఆర్బిటో ఫిలిప్పిన్స్ నుండి వచ్చిన సైకిక్ సర్జరీ మాయగాడు. ఆ మధ్య ఆయన హైదరాబాదు వచ్చినప్పుడు స్టార్ హోటల్లో సంపన్నులకు సైకిక్ సర్జరీ చేశాడు. బి.ఎన్. రెడ్డి, శైలజ (రామోజీరావు కోడలు) ప్రభృతుల సమక్షంలో మీడియా పబ్లిసిటీ ఇవ్వగా, బాగా డబ్బు గుంజి, నయం చేశాననే వార్త వ్యాపింప చేశాడు. అప్పటికే ఇతడి వ్యవహారం తెలిసిన మేము మరునాడే ప్రెస్ క్లబ్బులో ప్రదర్శన పూర్వకంగా అసలు విషయం బయట పెట్టాం. హేతువాద మానవ వాద సంఘం పక్షాన మెజీషియన్ విక్రమ్ తో ప్రెస్ సమక్షంలో ప్రదర్శన చేసి చూపాం. ఈనాడు పత్రిక, టి.వి. ఛానల్స్ బాగా ఈ విషయాన్ని తెలియపరిచాయి. అంతటితో అలెక్స్ అర్బిటో బెంగుళూరు పారిపోగా అక్కడ కూడా మా హేతువాదులు వెంటబడి విషయం వెల్లడించారు. అతడు అరెస్టు కాకుండా తప్పించుకు పోయాడు. భవిష్యత్తులో సైకిక్ సర్జరీ మోసాలకు ఎవరూ లోను కాకూడదని విక్రమ్ ద్వారా తెనాలి మొదలైన చోట్ల ప్రదర్శనలు చేశాం.
ఎలా చేస్తారంటే
ఒక మనిషిని బల్లమీద పడుకోబెడతాం. అతడి పొట్టలోకి ఐదు వేళ్ళు లోనికి గుచ్చుతున్నట్లు చూపిస్తాం. అలా నొక్కినప్పుడు వేళ్ళు ముడిచి ఉంచుతాం. ఒక వేలి గోరులో కృత్రిమంగా దాచిన ఎర్రని రంగు నీరు బయటికి వస్తుంది. అది తుడిచివేయటానికి దూదిని లేదా బట్టను వినియోగిస్తాము. ముందుగానే ఆ బట్టలో ఉన్న పేగు ముక్కలు దాచి ఉంచుతారు. అవి పొట్ట లోంచి తీసినట్లు చూపుతారు. లోన ఉన్న దోషం పోయినట్లు అందరికీ చాటుతారు. నిజమేకాబోలని రోగి భ్రమిస్తాడు. శరీరంలో ఇతర భాగాల్లోంచి ఇలాగే చేస్తాడు. ఈ వైద్యం ఫిలిప్పిన్స్ లో బహుళ ప్రచారంలో ఉన్నది. అమెరికా సంపన్నులు వెళ్లి చికిత్స చేసుకుని తాత్కాలికంగ తగ్గినట్లు భావించి ఇంటికొచ్చి ఆస్పత్రిపాలవుతారు.

Tuesday, February 10, 2009

గోపీచంద్ లో వెలుగు నీడలు

AGK
Gopichand with family











గోపీచంద్ 1910-1962

ఆవుల గోపాలకృష్ణమూర్తి (ఎజికె) వ్యక్తుల్ని అంచనా వేయటంలో అందెవేసిన, ఆరి తేరిన మేధావి. సునిసితంగా విమర్శించటం, కటువుగా హెచ్చరించటం ఆయన నిరంతరం చేసిన పని. వ్యాసోపన్యాసకుడు అని పేరొందిన మానవ వాది. తన మిత్రుడు త్రిపురనేని గోపీచంద్ గురించి తనదైన శైలిలో మనకు చూపిన రచనను మీకు అందిస్తున్నాను.
- ఇన్నయ్య




గోపీచంద్ 1910-1962




కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి విప్లవజ్యోతి. ఆయన తొలిబిడ్డ త్రిపురనేని గోపీచంద్. యిద్దరూ లాయరు వృత్తిలోవున్నా, అది వారికి ప్రధాన వ్యాసంగం- ముఖ్యవృత్తి కాదు. యిద్దరికీ రచన ప్రధాన విక్రియ. ఒకరు విమర్శక, విప్లవ కవిరాజులు, యింకొకరు ప్రతిభాయుత వచన రచయిత, అంతవరకే వారి సామ్యం. గోపీచంద్ 938 నుంచి 1950 దాకా రాడికల్ వుద్యమంలోనే వున్నాడు. ‘ఇండిపెండెంటు ఇండియా’ అన్న రాడికల్ వారపత్రికలో 1940 దాకా, అప్పుడప్పుడూ వ్రాసేవాడు. తెలుగు ‘రాడికల్’ పత్రికలో 1942 నుంచి 1949 దాకా వ్యాసాలు, కథలు వ్రాసేవాడు.
గోపీచంద్ తెలుగు, యింగ్లీషు భాషలు బాగా చదివినవాడు. యింగ్లీషులో చదువు జాస్తి, తెలుగులో రచన జాస్తి, గోపీచంద్ సంభాషణల్లో నిపుణుడు కాని మంచివక్తి కాదు వుపన్యాసాలంటే, కొంత వెనకాడేవాడు. చర్చలకు దూకేవాడు. రచనకు ముందడుగు వేసేవాడు.
గోపీచంద్ రచనలను కథలుగా, నవలలుగా, వ్యాసాలుగా, నాటికలుగా, నాటకాలుగా చూడవచ్చు. నాటికలు, నాటకాలు తక్కువ. మాంచాల, నాయకురాలు వ్యాసాల్లో రాజకీయ, సామాజిక, తాత్త్విక రంగాలు ప్రధానం. అందులో తాత్విక రచనలు ప్రముఖాలు. పోస్టు చెయ్యని వుత్తరాలు, తత్త్వ వేత్తలు - యీ రంగంలో ప్రశస్తాలు. సామాజిక రచనలుగా, ‘ఉభయకుశలోపరి’ వుత్తమ మైనది.
గోపీచంద్ రచనల్లో రాజకీయ వ్యాసాలు తక్కువ. పట్టాభిగారి సోషలిజం ముఖ్యం. యితర వ్యాసాలు యితరాలే. గోపీచంద్ నవలా రచయితగా ప్రఖ్యాతినార్జించాడు. అసమర్ధుని జీవయాత్ర, పరమేశ్వర శాస్త్రి వీలునామా, చీకటి గదులు, యెన్నికైనవి. డైరెక్టరుగా రైతుబిడ్డతో కథ మొదలు పెట్టి మధ్యలో ఆగిపోయి తరువాత ఐదారేళ్ళు ఆరంగంలోనే వున్నాడు. ప్రియురాలు, లక్ష్మమ్మ, గృహప్రవేశం మొదలైనవి ఆయన తీసిన చిత్రాలు.
గోపీచంద్ అసలు రంగం కథా క్షేత్రం. కథకుడుగా - అది రాజకీయ, సాంఘిక, వైజ్ఞానిక, సాంకేతిక విషయాల్లో యేమైనా కానివ్వండి – అతను మూసపోసి, తనది గాజేసి, సిసలైన బాణీలో కథా వస్తువును రంగరించి అన్ని హంగులూ తీర్చి దిద్ది సర్వాంగ సుందరంగా కథను తయారు చేస్తాడు. యిందులో గోపీచంద్ సిద్దహస్తుడు. అందె వేసిన చేయి.
గోపీచంద్ లో చక్కటి చమత్కారం. భాషా పటిమ, నాటకీ కరణ గుణం వున్నవి. అది కథగాని, నవలగాని, వ్యాసంగాని, పరిచయం గాని గోపీచంద్ రచనల్లో అతను హెచ్చుగా కనబడతాడు. గోపీచంద్ ని యెరిగిన వాళ్ళు, ఆయన్ని ఆయన రచనల్లో చిరస్థాయిగా చూడవచ్చు, వినవచ్చు. ‘’శైలి ఆ వ్యక్తి యొక్క గురుతు’’ అనడానికి గోపీచంద్ సాక్షం. ప్రమాణం గూడాను. అది రచనలో ఆయన విశిష్టత. గోపీచంద్ రాడికల్ సాక్షం. ప్రమాణం గూడాను. అది రచనలో ఆయన విశిష్టత. గోపీచంద్ రాడికలం డెమో క్రాటిక్ పార్టీలో పనిచేసి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గూడా పనిచేశాడు. రాడికల్ వుద్యమంతో సంబంధం వున్నన్నినాళ్లూ గోపీచంద్ ప్రధానంగా హేతువాది గానే వున్నాడు. హేతువాది నాస్తికుడు గనుక, ఆయనా నాస్తికుడుగానే వున్నాడు. ఆ వుద్యమంతో సంబంధం పోయినకొలదీ ఆయనలో పరి వర్తనం వచ్చి రాను రాను ఆస్తికుడైనాడు. అరవిందుని భక్తుడైనాడు. తనలోని పరివర్తననే తండ్రితో గూడా చూడగలిగినాడు. ‘వర్గచైతన్యం’ సడలిపోయింది.
గోపీచంద్ వాక్య విన్యాసం కోసం చాలా తాపత్రయపడతాడు. శ్రమపడతాడు, తెగతిరగ వ్రాస్తాడు. రానురాను ఆ గుణంమారి, రచన వలచబడింది. వేగంలో రచన చిక్కితె, ఆ పరివర్తన తప్పదు.
కాని, గోపీచంద్ యేది వ్రాసినా విశుద్ధంగా క్లిష్టతలేకుండా సూటిగా చెప్పుతాడు. అట్టి గోపీచంద్ ని తన 52వ యేట మనం కోల్పోవటం మనలో ఒక మేధావిని, పెద్దను కోల్పోవటమే.

గోపీచంద్ కవిరాజు రామస్వామి చౌదరిగారి అబ్బాయి. అందుచేతనే గోపీచంద్ మా గోపీచంద్ కాలేడు. ఒకనాడు గోపీచంద్ రాయిస్టు, అప్పటికి రాడికల్ అవునోకాదో తెలియదు. ‘రాయ్ వ్యాసాలు’ ‘ప్రజామిత్ర’ వార పత్రికలో వ్రాసేవాడు. అది 1938 ప్రాంతంలో ఎం.ఎన్. రాయ్ సంపాదకత్వాన నడిచే ‘ఇండిపెండెంటు ఇండియా’ అనే ఇంగ్లీషు వారపత్రికలో సంపాదకుని లేఖలుగా వ్రాసేవాడు.
కవిరాజు మీద నాకు అప్పటికే వున్న విశ్వాసం, రాయ్ మీద కలిగిన గురుత్వం, నన్ను గోపీచంద్ వైపుకు కదల్చినవి.
కాని ఆరోజుల్లో తీవ్రతరమైన గ్రాంథిక భాష వాదిని. మా ఎలవర్తి రోశయ్య గారితో కలసి ‘యధార్థ నవ్య సాహితీ సమితి’ని పెట్టి దాని పీఠాధిపత్యం వహిస్తూ వున్న రోజులు. అంటే మిత్రులు, పెద్దలు తల్లావఝ్ఝుల శివశంకరశాస్త్రి గారు (తరువాత స్వామి శివ శంకరులు) అధ్యక్షత వహిస్తూ వున్న ‘నవ్య సాహితీ సమితి’కి ప్రతిగా, పోటీగా, భాషావివాద పరిష్కారం కోసమని, మేము మడిగట్టిన భాషా వాదాల్ని ప్రోత్సహించే రోజులవి.
గోపీచంద్, శ్రీ జి.వి. కృష్ణయ్య (డా. జి.వి. కృష్ణారావు). కోగంటి రాధాకృష్ణ మూర్తి, పి.వి. సుబ్బారావు మొదలైన వారంతా ఒకవైపున రాయిస్టులు, మరో వైపు సాహిత్యావలంబులు, సాహిత్యంలో రాయిస్టు దృక్పధగాములుగా వీరివంక ఆంధ్రదేశం చూచేది.
నేను, మిత్రుడు ఎలవర్తి రోశయ్య గోపీచంద్ సాహిత్యాన్ని గురించి వ్రాసిన వ్యాసాన్ని చూచి, వారి పరిభాషను చూచి (సాహిత్యంలో బూర్జువా డెమొ క్రాటిక్ విప్లవం రావాలి అన్న వారి నినాదాన్ని) అంగీకరించకపోగా, యేవగించు కొనేవాళ్లము.
అందువల్ల రాజకీయరంగంలో, సాంఘిక రంగంలో నాకు గోపీచంద్ కు వున్న సన్నిహితత్వం, సాహిత్య రంగంలో లేకపోయింది. తరువాత కొన్నాళ్లకు నేను గ్రాంధిక వాదాన్ని వదలటం జరిగింది. గోపీచంద్ సాహిత్యాన్ని రాజకీయదృష్టితో అన్వయించటం ఆపివేశాడు.
నేను తెనాలికి 1942లో వచ్చినప్పటి నుంచీ మా యిద్దరికీ యెక్కువ సాన్నిహిత్యం వుండేది. అంతకు ముందు 1942 వేసంగిలో కవిరాజు సన్మాన సంచిక వేసేరోజుల్లో ఒకటి రెండు సార్లు మాత్రం కలిశాము.
గోపీచంద్ చురుకైన సంభాషణలు చేసే వ్యక్తి. అతనిలో ప్రధానమైన గుణం అదే. అతని సంభాషణలు అతనికి ఎంతో సంతోషాన్ని, బలాన్ని యిచ్చేవి. ఆ చురుకుదనంలో ఒక రకమైన హాస్యం వుండేది. వక్రోక్తి కొంతహెచ్చు, అయినా రక్తి కట్టేవి.
గోపీచంద్ లో మరొక ముఖ్యగుణం – బాగా చదివేవాడు. చదివినట్లు కనబడేవాడు కాదు. చదివింది మననం చేసేవాడు. తనలోకి లాక్కొని తనదిగా చేసేవాడు. చేసిన తర్వాత గాని వ్రాసేవాడు కాదు. వ్రాయటం మొదలుపెట్టినా అచ్చుకు వెళ్లనిచ్చే వాడుకాదు.
వ్రాసిన కథలే అనేక పర్యాయాలు వ్రాసేవాడు. చెడగొట్టి, చెడరాసి, అచ్చుకిచ్చాక మళ్లీ చూచి, ప్రూపుల్లో దిద్ది. ఫారం కట్టినాక గూడా దిద్ది దుంప త్రెంచేవాడు. అదంతా మంచిగా చెప్పాలన్న మనోగత భావాన్ని పురస్కరించుకొని జరిగేది. రచనలో తన వ్యక్తిత్వాన్ని బాగా ప్రతిబింబించేవాడు. శైలిని బట్టి మనిషి వరవడిని చెప్పటానికి గోపీచంద్ శైలి మంచి నమూనాపాకంగా వుండేది.
1942 నుండి మూడునాలుగేళ్లు పార్టీగత, రాయి గత విషయాలమీద బాగా శ్రద్ధ చూపి, ఆంధ్రరాష్ట్ర రాడికల్ డెమెక్రాటిక్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినాడు. ‘రాడికల్’ పత్రికలో తరచు వ్రాసేవాడు.
ఆనాటి సాంఘికాభిప్రాయాలుగాని, రాజకీయాభిప్రాయాలు గాని, తాత్త్విక రంగానికి సంబంధించిన భావాలు గాని హేతువాద పునాది మీద వుండేవి. ఆనాడు గోపీచంద్, నావంటి చాలా మంది లాగ నాస్తికుడు.
తరువాత గోపీచంద్ రాడికల్ పార్టీకి దూరంగా, తెనాలికీ దూరంగా వెళ్ళి, మద్రాసులో సినిమా రంగంలోకని వెళ్ళినదగ్గర నుండి గోపీచంద్ లో క్రమానుగత పరిణామం వచ్చింది. సినిమా డైరెక్టరు కావాలన్న ధ్యాస ఆయనకు హెచ్చుగా వుండేది. మనతత్త్వాన్ని కదిపడదు. అందులో మీకు బొత్తిగా పడదు. వ్రాస్తే దూరంగా వుండి కథలు వ్రాస్తూ, రచనలోనే ప్రధానంగా వుండండి అని నేనెన్నో సార్లు చెప్పాను. మీ తత్త్వానికిపడదేమో - కాదనట్లు నవ్వేవాడు. గోపీచంద్ నవ్వు అనేది ప్రత్యేకం, పెద్దగా యిల్లు కప్పు యోగిరేటంతగా నవ్వేవాడు.
సినిమాలో యిమడలేదు. కొన్నాళ్లు కాసట బీసటగా వుంది. హేతువాదిగా వున్న గోపీచంద్ దిగజారి, మతవాదిగా మారిపోయాడు. రాయ్ ని వదిలి అరవిందుని ఆశ్రయించాడు. కవిరాజులో నాస్తికతకు బదులు ఆస్తికత చూడనారంభించాడు. రచనలో పూర్వం వున్న బిగువుపోయి పలచబడింది. గోపీచంద్ లో అపూర్వ పరిణామం వచ్చింది. పోస్టు చెయ్యని ఉత్తరాల్లో పడింది వరవడి. దాంతో గోపీచంద్ మాకు కొంచం దూరంగా జరగటం మొదలు పెట్టాడు. మనుషులము దగ్గరగా కూర్చున్నా భావాల వలయాలు వేరువేరుగా వుండిపోయినై.
హేతువాదంలో కన్నా మత వాదంలో పరిధి పెద్ద దన్న భ్రాంతిలోపడ్డాడు. రాడికల్ గా వున్న గోపీచంద్, హ్యూమనిస్టు కాకుండానే మతవాదిగా రూపాంతరం పొందాడు. దానితో మాకు మార్గభేదం, వాదభేదం యేర్పడినవి. రచయితగా గోపీచంద్ ప్రాయికంగా కథకుడు. కథకుడుగా అతని స్థానం వుదాత్తమైంది. మనిషిగా గోపీచంద్ అతని రచనల్లో కనబడినట్లు తెలుగునాటి మరే రచయితా కనబడడు. అతని వ్యక్తి త్వానికిదే తార్కణం. రచయితగా, వ్యక్తిగా గోపీచంద్ చిరస్థాయిగా మనగలడు.

Thursday, February 5, 2009

కాలుష్య నివారణకు కొల్లూరు కృషి





తెనాలి నుండి అమెరికా వెళ్ళి ఒక పుష్కర అనుభవంతో యిప్పుడు తాను పుట్టిన సమాజాన్ని కొంతైనా బాగు చేద్దానుకోవడం విశేషం.
కొల్లూరు వెంకటసుబ్బారావు అమెరికాలో కొల్లూరు రావుగా సమాజంలో పెద్ద పేరు పొందారు. ఆయన రచనలు మెగ్రాహిల్ ప్రచురణ కర్తలు వెలువరించారు. విశ్వవిద్యాలయాలు, వివిధ వ్యాపార సంస్థలు, సుబ్బారావు గారి పుస్తకాలు, వ్యాసాలు చదువుతూ సలహాలను పాటిస్తున్నారు. ఆయన చేబట్టిన సమస్య అంతటి ప్రాధాన్యత గలది.
కాలుష్యం, ఆరోగ్యం, జనాభా, ఆర్థిక సమస్య, విద్య, శిక్షణ, వివిధ పరిశ్రమల పెంపుదలతో వీటిని సక్రమంగా నివారణ, చిక్కులు ఎదుర్కోవడానికి మార్గాంతరాలు యివన్నీ చాలా ప్రధాన మైన అంశాలు. పరిశ్రమ, వ్యవసాయ, విద్యారంగంలో యివి నూరిపోయాలి. కొల్లూరి వారి తపన అంతా కాలుష్య నివారణ చేస్తూ, సమాజాభివృద్ధి గావించడమే.
కొల్లూరు వారు భారతదేశంలో ప్రారంభమైన విద్య పూర్తి చేసి, ఉన్నత విద్య అంతా అమెరికాలో, జర్మనీలో చేశారు. కేవలం డిగ్రీల చదువుకు పరిమితం కాకుండా, అనుభవం కోసం ప్రపంచమంతటా పర్యటించారు. ఆయన వెళ్ళిన ప్రాంతాలలో రష్యా, చైనా, ఇంగ్లండ్, జపాన్, థాయ్ లాండ్, కెనడాలు పేర్కొనదగినవి.
అమెరికా, కెనడాలలో వాతావరణ పరిసరాలు మెరుగుపరిచే కృషిజరిపిన, కొల్లూరు వారు, తాను చిన్నప్పడు తిరిగిన ఆంధ్రప్రాంతం కొన్ని సంవత్సరాల తరువాత చూస్తే అక్కడ చేయాల్సింది ఎంతో వుందనిపించింది. పిల్లలు చదువుకోవాలి, కాని వారి చుట్టూ మురికి అనారోగ్యం, దుర్భర స్థితి. అది పోగొట్టాలి. ఎలా?
కొల్లూరు వారు ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీలో వుంటూ, పరిసరాల ఆరోగ్య సేవా సంస్థ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. విశ్వవిద్యాలయాలలో పరిసరాలు, ఆరోగ్యంపై బోధనా నిపుణులుగా వున్నారు. రిస్క్ ఎనాలసిస్ సంఘానికి అధ్యక్షులు (న్యూయార్క్, న్యూజెర్సీలో) ఇవన్నీ అమెరికా స్థాయిలోనే ఉన్నతమైన సాధనాలు.
కొల్లూరు సుబ్బారావు తెనాలిలో కీ.శే. డాక్టర్ కొల్లూరు వెంకట్రాయుడు గారి కుమారుడు.
జనాభాను అదుపులో పెట్టి జీవన ప్రమాణాన్ని పెంచడానికి చర్యలు సత్వరమే చేబట్టాలని కొల్లూరు సూచిస్తున్నారు. ఆర్థికాభివృద్ధికి గాను అడ్డొచ్చే రాజకీయ ప్రతిబంధకాల్ని పక్కబెట్టాలని ఆయన మరోసూచన. దేశంలోని అన్ని వాణిజ్య వ్యాపార సంస్థలు వారానికి కనీసం 8 గంటలు శిక్షణ విధిగా యిచ్చి, ఉత్పత్తి పెంచడానికి కృషి చేయాలని సుబ్బారావు గారి సూచన. రోడ్లు, ఇతర సదుపాయాలు పెంపొందించే వందేళ్ళ పథకాలు చేబట్టాలని ప్రభుత్వం దీనికి గాను దేశభక్తి బాండ్లను జారీ చేయవచ్చునంటున్నారు.
పరిశ్రమలు స్థాపించినప్పుడు అందువల్ల వచ్చే కాలుష్యాన్ని నివారిస్తూ, చిక్కులు తొలగిస్తూ, వ్యాపారాలు సాగించే పద్ధతులను కొల్లూరు వారు సూచించారు. అనేక పరిశ్రమలు వీరి సలహాలను పాటిస్తున్నాయి. మన దేశంలో యివి చాలా అవసరం. కాలుష్య నివారణకు అవసరమైన పద్ధతులు, డబ్బు ఖర్చు రీత్యా, చాలా మంది అవలంబించడం లేదు. అందువలన మనుషులకు వచ్చే ప్రమాదాన్ని విస్మరిస్తున్నారు.
మేమిద్దరం లాస్ ఎంజలిస్లోనూ ,న్యూయార్క్ లోనూ కలసి తిరిగి అనేక విశేషాలు గ్రహించాము

Monday, February 2, 2009

గంజాయి పరిశోధన

అంతర్జాతీయ అవార్డులందుకున్న రాపాక సాంబశివరావు గారు రాష్ట్రంలో పశ్చిమ గోదావరి రాపాక కుగ్రామం నుండి అమెరికాకు వెళ్ళిన తెలుగు వారు. ప్రస్తుతం ఆయన అమెరికా జాతీయ డ్రగ్ ఎబ్యూజ్ పరిశోధనా కేంద్రంలో వున్నారు.
గంజాయి వంటి ఆరోగ్యానికి మంచిదేనని కొందరూ, కాదని మరికొందరూ సిగపట్టు పడుతున్న అమెరికాలో సాంబశివరావు పరిశోధన చేస్తున్నారు. మన సాధువులు గంజాయి దమ్ము పట్టిస్తూ, సామూహికంగా అనుభవిస్తూ, అది ముక్తి మార్గానికి సన్నిహితమని నమ్మారు. రానురాను గంజాయి పండించడం, తాగడం, అమ్మడం ప్రపంచవ్యాప్తంగా నేరం కింద ప్రకటించారు. అయినా దొంగచాటుగా పండిస్తూ, వ్యాపారం సాగిస్తున్నారు.
సాంబశివరావు గారు పని చేస్తున్న డ్రగ్స్ పరిశోధనాలయం వారు కూడా గంజాయిని పండిస్తున్నారు.
అది కేవలం పరిశోధన నిమిత్తమే. అందువలన సాంబశివరావు గారి బాధ్యత మరీ పెరిగింది.
మన యోగులు, బుషులు లోగడ ధ్యానం చేసినప్పుడు, ఏవైనా గ్రంథులు విడుదల అయ్యాయా? అయితే అవి మెదడుపై ఎలా పనిచేసి వుంటాయి. అనే ప్రశ్నలకు సమాధానం కోసం వెతుకుతున్నాం అని సాంబశివరావు గారంటున్నారు.. మెదడును పరిశీలించే కొద్దీ చాలా లోతుపాతులు బయటపడుతున్నాయి. చిక్కులు ఎక్కువగా వుంటున్నాయని సాంబశివరావు గారంటున్నారు.
సైన్స్ తో పాటుగా భారతీయ చింతన కూడా ఆసక్తి చూపుతున్న సాంబశివరావు గారు ........ రాజారావు, పురుషోత్తమ్మ దంపతులకు పుట్టారు. నరసాపూర్, వాల్తెరులలో చదివి ఫార్మసీలో నిపుణులుగా కలకత్తాలో పని చేసి 1968లో అమెరికా వెళ్ళారు. బర్కిలి యూనివర్శిటీ ఫార్మసీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.
అమెరికా ప్రభుత్వ పరిశోధనా సంస్థ నేషనల్ డ్రగ్ ఎబ్యూజ్ కేంద్రంలో కుదురుకున్నారు.
సైప్రస్ లో సాంబశివరావు గారి సేవలకు గుర్తింపుగా అంతర్జాతీయ అవార్డు లభించింది. పరిశోధన విభాగాధిపతి కావడం వలన తరచు పత్రికల వారి ప్రశ్నలకు తట్టుకోవలసిన స్థితి కూడా ఆయనకు వస్తున్నది.
వ్యసనానికి దారి తీసే యీ గంజాయిని చికిత్స పేరిట మార్కెట్ లో అనుమతించవచ్చా అనేది సాంబశివరావు గారి సంస్థ ఎదుర్కొంటున్న సమస్య.
ఇలా పరిశోధనారంగంలో వుంటూనే, తెలుగు వారి సంస్కృతితో సంబంధాలు పెట్టుకుని, సాంబశివరావు గారు, తీరిక వేళలో తెలుగు సాహిత్యం చదవడానికి ప్రయత్నిస్తారు.
1970 నుండీ నేటి వరకూ శాస్త్రీయ పరిశోధనారంగంలో సాంబశివరావు గారు అనేక ప్రమాణ పూరిత వ్యాసాలు ప్రచురించారు. కొన్ని ఇతరులతో కలసి రాశారు. 15 పుస్తకాలు పరిష్కరించారు. వ్యాసాలలో సెంచరీ కొట్టారు.
మన దేశ సైంటిస్టులు ఆర్.ఎస్.భట్ నగర్, ఎ.కె. ప్రసాద్, రేణుగోపాల కృష్ణన్, ఎన్. పట్టాభిరామన్, హెచ్.ఎన్. భార్గవ, బి.ఎన్. దవన్ వంటి వారితో సన్నిహితంగా సాంబశివరావు గారున్నారు.
సాంబశివరావు గారు శాస్త్రీయ పరిశోధనలోకి యోగం, మిగిలిన ఆధ్యాత్మిక విషయాలు ఎక్కడైనా యిముడుతాయా అని ఆసక్తితో చూస్తున్నారు. వైదవ్యాస్ వంటి వారి జోశ్యాలను గమనిస్తూ, నిజం ఉందేమో అని దుర్భిణి చేసి చూస్తున్నారు. సాంబశివరావు గారు సౌమ్యులు, మితభాషి, అన్వేషి వారికి భారతీయులకు చేతనైనంత చేయూతనిస్తున్న విజ్ఞాని.