Saturday, May 31, 2008

సాహితి పరుల తొ సరసాలు 25


Left Sasanka
శశాంక
(ఓ లేటి సుబ్బారావు)

(1929-1974)














కవిగా శశాంకతో నాకు బొత్తిగా పరిచయం లేదు. లెక్చరర్ శశాంక కొంత తెలుసు. మిత్రుడుగా బాగా సన్నిహిత స్నేహం వుంది. హైదరాబాద్ లోని ఆదర్శనగరంలో 1970 ప్రాంతాల్లో వుంటుండగా, నేను న్యూ ఎం.ఎల్.ఎ. క్వార్టర్స్ లో వుండేవాడిని. అప్పుడే కలుసుకుంటూ వుండేవాళ్ళం.

శశాంకతో నా పరిచయం అంతా గోరా శాస్త్రి ద్వారానే, శశాంక అప్పుడప్పుడు జీరాలోని గోరా శాస్త్రి యింటికి రాగా, అక్కడే సరస సల్లాపాలు జరిపాం. గోరాశాస్త్రి చనువుతో శశాంకను ఏవేవో అంటుండేవాడు. శశాంక చిన్నవాడుగనుక ఆ మాటలన్నీ పడేవాడు.

నేను శశాంక యింటికి వెళ్ళి వరండాలో కూర్చొని ఎన్నో ముచ్చట్లు చెప్పుకునేవారం. ఇరువురం దేవులపల్లి కృష్ణశాస్త్రి యింటికి వెళ్ళి కాలక్షేపం చేసేవారం. సేత అనసూయలు అప్పుడు ఆదర్శనగర్ లో వుండేవారు. వారూ పరిచయమయ్యారు.

1969లో గోరా శాస్త్రికి 60వ జన్మదిన సభ తలపెట్టినప్పుడు శశాంక సహకరించారు. అందరం కర్నూలు వెళ్ళి సన్మాన సభలో పాల్గొన్నాం. సి. ధర్మారావు, మండవ శ్రీరామమూర్తి, శశాంక, నేను ఆ సమావేశాల్లో చురుకుగా కార్యక్రమాలు జరిపాం. ఫోటోలు తీయించుకున్నాం.
నేను ఆకాశవాణి కేంద్రానికి వెళ్ళినా, శశాంక కవితాలోకం వేరు. నా చర్చలు, ప్రసంగాలు అన్నీ వేలూరి సహజానంద నిర్వహించేవారు. కనుక శశాంక కవితా విభాగంలోకి వెళ్ళేవాడిని కాదు. ఎప్పుడైనా దండమూడి మహీధర్, శశాంక, నేనూ కాంటీన్ లో లాంచనంగా కలసి కబుర్లు చెప్పుకునేవారం. రవీంద్ర భారతిలో కార్యక్రమాలకు గోరాశాస్త్రితో కలసి నేను వెళ్ళినప్పుడు, శశాంక జత అయ్యేవారు. అక్కడ పాతూరి వారు, సి. ధర్మరావు చేరేవారు. శశాంక మిత భాషి. చక్కగా నవ్వుతూ పలకరించేవారు. సంజీవరెడ్డి నగర్ మారిన తరువాత మా కలయిక సన్నగిల్లింది. శశాంక చెణుకులు గోపాలశాస్త్రి వద్ద సరసాలు బాగుండేవి.

గోరాశాస్త్రి గారింట్లో వి.ఎస్. రమా దేవిని కలసినప్పుడు, ఒక పర్యాయం శశాంక వచ్చారు. అప్పుడు జరిగిన సంభాషణలన్నీ కవితా గోష్టిని తలపించాయి.

నాకు ఈమని శంకరశాస్త్రి గారితో కించిత్తు పరిచయం వుండేది. ఆయన వీణా కార్యక్రమాలకు నేను, నా భార్య కోమల, కుమార్తె నవీన వెళ్ళేవాళ్ళం. అలాంటి ఒక కార్యక్రమంలో ఒక గేయాన్ని వీణపై పలికించగా, అదేమిటో తెలియకుండానే, అభినందించాం. శశాంక రాసిన గేయం అది అన్నారాయన. సంతోషించాం. ఆ విధంగా ప్రత్యక్ష పరోక్ష రీతులలో శశాంకతో సన్నిహితత్వం వుంది. ఆయన కుమారుడు పార్వతీశం ఆ తరువాత దూరదర్శన్ లో పరిచయమయ్యారు.

రచనలు :
నయా జమానా కవితలు, స్వర లహరి కవితలు, రాగ వల్లరి కవితలు.




Sasanka at extreme left sitting

Thursday, May 29, 2008

పుస్తక సమీక్ష

అంబేద్కర్ ను ఎలా అర్థం చేసుకోవాలి!























1. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన సంపుటాలు ఇంగ్లీషులో.
2. తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన అనువాద సంపుటాలు.

దేశంలో ఎక్కడ చూచినా అంబేద్కర్ పేరు వినవస్తున్నది. వినిపించే వారెవరనుకున్నారు? కాంగ్రెసు, భారతీయ జనతాపార్టీ, జనతాదళ్ పార్టీలు అంబేద్కర్ ను భుజాన వేసుకొని మోస్తున్నాయి. పోటీపడి ఫోటోలు పెడుతున్నారు. విగ్రహాలు వేస్తున్నారు. వీధులకు పేర్లు పెడుతున్నారు. ఉత్సవాలు చేస్తున్నారు. అంబేద్కర్ ను తెగ పొగిడేస్తున్నారు. అన్ని పార్టీలు, అందరు రాజకీయవాదులు అంబేద్కర్ ను గౌరవిస్తుండగా ఇక కావాల్సిందే మున్నది! సాంఘిక న్యాయం రాకేం చేస్తుంది!
అంబేద్కర్ కూలంకషంగా హిందూ సమాజంలోని దోషాల్ని పరిశీలించారు. వాటిపై పోరాడారు. ధ్వజమెత్తారు. ఆయన చెప్పినవి, చేసినవి సబబే అనిపించారు. అంటరాని కులాలవారు, శూద్రులు సమాజంలో గణనీయంగా వున్నారు. వారికి ఓట్లున్నాయి అవి లేనిదే ఏ పార్టీ గెలవదు. కనుక రాజకీయపార్టీలు కొత్త ఎత్తుగడలతో, తాత్కాలికంగా ఓటర్లను మభ్యపెట్టే వ్యూహాలు అనుసరిస్తున్నాయి. అందులో భాగంగా నేడు అంబేద్కర్ ను తెగ పొగిడేస్తున్నారు. అది విని అటు దళితులు, ఇటు శూద్రకులాలు సంతోషపడి ఓట్లు వేయాలని రాజకీయ పార్టీల ఉద్దేశం.
అంబేద్కర్ సిద్ధాంతీకరించిన వాటిని ఆమోదించి ఆచరిస్తామంటే అభ్యంతరం ఏమిటి అనే ప్రశ్న రావచ్చు. అంబేద్కర్ రాసినవి, చెప్పినవి ఏ రాజకీయపార్టీ ఆమోదిస్తున్నది? ఎంతవరకు ఆచరించగలవు నిజంగా ఆమోదిస్తే సంతోషం. కాని పొగుడుతూ, గోతులు తవ్వి అంబేద్కర్ ను పూర్తిగా చంపేయాలనే ఎత్తుగడ అయితే, జాగ్రత్త పడాలి. ఆ విషయం శ్రద్ధగా, లోతుగా పరిశీలించాలి. అంబేద్కర్ పేరిట, కొందరు బయలుదేరి ప్రభుత్వాన్నికి విజ్ఞప్తులు చేస్తూ కమిటీలు వేయమనీ, విగ్రహాలు ప్రతిష్ఠించమనీ, ఉత్సవాలు జరపమనీ కోరుతున్నారు. ఇలాంటి అంబేద్కర్ వాదులను సంతృప్తి పరచడానికి ప్రభుత్వాలు ఎప్పుడూ సిద్ధమే. అది కూడా అంబేద్కర్ వాదాన్ని ఉరితీయడానికి పన్నుగడే. ఈ విషయం గ్రహించడానికి అంబేద్కర్ వాదులకు కొంతకాలం పట్టొచ్చు. ఈలోగా ప్రమాదం జరిగిపోతుంది.
కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ ప్రేమ
“కాంగ్రెస్, గాంధీజీ అంటరాని వారికేం చేశా”రని ప్రశ్నిస్తూ అంబేద్కర్ పుస్తకం రాసి, గాంధీ బ్రతికుండగానే ప్రచురించారు. ఆ ప్రశ్నలకు నాటికీ, నేటికీ సమాధానం రాలేదు. బహుశా రాదుకూడా. గాంధీజీ సమాధానం చెప్పకపోవడానికి వ్యూహం, ఎత్తుగడ కారణాలైతే, కాంగ్రెసు వారు జవాబివ్వకపోడానికి ఆశక్తత కారణం. అప్పటి కాంగ్రెసు వేరు, నేటి కాంగ్రెసు వేరు అనడానికి వీలున్నదా అంటే, వీల్లేదేమో. 100 సంవత్సరాల కాంగ్రెసు ఉత్సవాలు జరుపుకున్న కాంగ్రెసు వారు, కాంగ్రెసు సంస్కృతి పుణికి పుచ్చుకున్నట్లు సగర్వంగా చెప్పుకున్నారు. కనుక, అదంతా చరిత్ర. నేడు కొత్తగా ఆరంభిద్దాం అనడానికి వీల్లేదు. అలాగే కాంగ్రెసుకు గుత్తాధిపత్యంగా గాంధీజీని స్వీకరించిన పార్టీ అంబేద్కర్ ప్రశ్నలకు ఏం చెబుతారు?
అంటరానితనం తొలగించాలంటూ అనిబిసెంట్ అధ్యక్షతన కాంగ్రెస్ తీర్మానించి, ఆచరణలో ఏమీ చేయకుండా వుండడం (1917లో) గమనిస్తే, నిమ్మజాతుల్ని మోసగించడం ఒక పథకం ప్రకారం సాగిపోయిందని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు.
గాంధీజీకి చిత్తశుద్ధి లేదా?
ఆ తరువాత గాంధీజీ రంగప్రవేశం చేసి, కాంగ్రెసును ఆక్రమించి, అంటరానివారి ఉద్ధారకుడుగా ఎప్పటికప్పుడు భ్రమలు కల్పించడం, ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం. అంటరానితనం తొలగించడానికి కార్యక్రమం చేబట్టాలని 1922లో గాంధీజీ ఆధ్వర్యాన కాంగ్రెసు పార్టీ తీర్మానించింది. దీనినే బార్డోలీ తీర్మానం అంటారు. అంతే, తీర్మానంతోనే పని ఆగిపోయింది. గాంధీజీ మాత్రం అంటరానివారి ఆర్తత్రాణపరాయణుడుగా పేరు తెచ్చుకున్నాడు. కాంగ్రెసు వారు కమిటీలు వేశారే తప్ప, ఏమీ చేయలేదు. గాంధీజీ మిగిలిన విషయాలలో వెంటాడి పనులు చేయించినా, అంటరానితనం వరకూ తీర్మానాలకే పరిమితం చేశారు. తిలక్ స్వరాజ్యనిధి మసూళ్ళు చేసి, నిర్మాణ కార్యక్రమం సాగించి, అంటరానితనం నిర్మూలనకు ఉపక్రమించారు. గాంధీజీ విజ్ఞప్తి మేరకు ప్రజలు 1921లోనే ఒకకోటి 30 లక్షల రూపాయల నిధి యిచ్చారు. అంటరానితనం నిర్మూలనకు ఎంత ఖర్చు చేశారయ్యా అంటే 43 వేలు మాత్రేమే. గాంధీజీ యీ విషయమై ఏమీ అనలేదు.
అంటరానివారికి ప్రత్యేక ప్రాతినిధ్యం వుండాలని అంబేద్కర్ కోరారు. బ్రిటిష్ పాలకులు అంగీకరించారు. ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం అంగీకరించిన గాంధీజీ, అంటరానివారికి ప్రత్యేక ప్రాతినిధ్యం వుండాలంటే ఆమరణ నిరాహారదీక్ష పూనారు. అంటరానివారు శతాబ్దాలుగా ఎలా వుంటున్నా సరే, వారు బాగుపడక పోయినాసరే, గాంధీజీ ప్రాణం విలువైంది గనుక, ఆయన్ను బ్రతికించుకోవాలన్నారు. అంబేద్కర్ పై వత్తిడి తెచ్చి, బలవంతంగా ఆయనచేత ప్రత్యేక ప్రాతినిధ్యం కొరకు పట్టుబట్టనని ఒప్పించారు. అంటే గాంధీజీ కోరినట్లు అంటరానివారు హిందువులలో భాగంగా అలాగే అణిగిమణిగి పడివుండేటట్లు పూనా ఒడంబడిక చేసిందన్నమాట. అంబేద్కరంను ఓడించి, గాంధీ నెగ్గి, అంటరానివారిని చాలా అన్యాయాలకు గురిచేశారు.
కేరళలోని గురువాయూర్ దేవాలయంలో అంటరానివారికి ప్రవేశం కల్పించకపోతే ఆమరణ నిరాహారదీక్ష పూనుతానని బెదిరించిన గాంధీజీ ఆ మాట ఎన్నడూ నిలబెట్టుకోలేదు. అగ్రవర్గాలవారు అంటరానివారి దేవాలయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తుంటే, కాంగ్రెసు పార్టీ ఓట్లకోసం అగ్రకులాల వారిని సమర్థిస్తుంటే, గాంధీ, కాంగ్రెసును ఖండించలేదు.
చీటికిమాటికి సత్యాగ్రహాలు, ఆమరణ నిరాహారదీక్షలు చేసిన గాంధీజీ, ఒక్కసారైనా అంటరానితనం నిర్మూలనకు నిరాహారదీక్ష పూనలేదు. ఎందుకని? హిందూ సమాజంలో అంటరానివారిని అట్టిపెట్టాలని గాంధీజీ ప్రయత్నించడమే గాక సనాతనవాదిగా కులాలు, వర్ణాలు వుండటాన్ని సమర్థించాడు. వాటికి మూలమైన శాస్త్రాల్ని, గీతను ప్రచారం చేశాడు. కులాన్ని కాదని, వర్ణ వ్యవస్థను సమర్థించడం కూడా గాంధీజీ ఎత్తుగడే.
కనుకనే గాంధీజీవల్ల జాగ్రత్తగా వుండమని అంబేద్కర్ పదేపదే హెచ్చరించాల్సి వచ్చింది. అంటరానితనం తొలగించనిదే స్వరాజ్యం రాదన్న గాంధీజీ ఒక్కసారైనా నిరాహారదీక్షకు పూనుకోపొవడం, కాంగ్రెసు చేత ఎలాంటి కార్యక్రమాన్ని చేబట్టించకపోవడం గాంధీజీ చిత్తశుద్ధికి గీటురాయి. అలాగే సత్యాగ్రహం అనే ఆయుధాన్ని అంటరానివారి కోసం ఎన్నడూ ఉపయోగించని గాంధీజీ, 1929లో దేవాలయ ప్రవేశానికి అంటరానివారే సత్యాగ్రహానికి పూనుకుంటే, గాంధీజీ స్వయంగా వారిని ఖండించారు. అంబేద్కర్ ఆశ్చర్యపోయాడు. దేవాలయ ప్రవేశార్హత బిల్లును కేంద్ర శాసనసభలో రంగ అయ్యర్ ప్రవేశపెట్టడానికి గవర్నర్ జనరల్ అనుమతించకపోతే, చూసుకోమరి అని గాంధీజీ బెదిరించాడు. ఎన్నికల దృష్ట్యా యీ బిల్లుకు కాంగ్రెసు పార్టీ మద్దత్తును ఉపసంహరించింది. గాంధీజీ కాంగ్రెసును వెనకేసుకొచ్చారే గాని, అంటరానివారిని కాదు. హరిజన సేవాసంఘం పక్షాన హక్కుల పోరాటానికి గాంధీజీ ఎన్నడూ అనుమతించలేదు. పైగా హరిజన సేవాసంఘ యాజమాన్యంలో హరిజనుల్ని గాంధీజీ తొలగించారు. పూనా ఒడంబడిక తరువాత అంటరాని వారికి కేటాయించిన స్థానాలలో వారిపై పోటీపెట్టవద్దని కాంగ్రెసుకు గాంధీజీ సలహాయివ్వలేదు. కాంగ్రెసు మంత్రివర్గాలలో అంటరానివారికి ప్రాతినిధ్యం వుండాలని గాంధీజీ ఎన్నజూ పట్టుబట్టలేదు. పైగా మధ్య పరగణాలలోని మంత్రిమండలిలో అగ్నిభోజ్ అనే అంటరాని ప్రతినిధి నియామకాన్ని గాంధీజీ వ్యతిరేకించాడు.
గాంధీజీకి అంటరానివారిపట్ల చిత్తశుద్ధి లేదనడానికి అంబేద్కర్ ఎన్నో ఉదాహరణలు చూపాడు. అలాగే కాంగ్రెసువారి చర్యల్ని వస్త్రకాయంపట్టి వారి విద్రోహచర్యల్ని బట్టబయలు చేశాడు. కనుక వీటికి సమాధానం కాంగ్రెసువారే చెప్పాలి. లేదా, గాంధీజీని, స్వాతంత్ర్యానికి ముందున్న కాంగ్రెస్ ను పూర్తిగా ఖండించాలి. తాము కొత్త అవతారం ఎత్తామని చూపాలి. అది సాధ్యమా? ఆచరణలో కాంగ్రెసువారు ఎలా వున్నారు? అదీ పరిశీలిద్దాం.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన హిందూ కోడ్ బిల్లును సనాతన హిందువులు వ్యతిరేకించారు. జవహర్ లాల్ నెహ్రూ పైకి సెక్యులర్, అభ్యుదయవాదిగా వున్నా ఎన్నికల సమయానికి సనాతనులకు లొంగిపోయాడు. ఫలితంగా అంబేద్కర్ నెహ్రూ మంత్రిమండలి నుండి రాజీనామా చేసి బయటకు పోవాల్సి వచ్చింది. ఆ తరువాత అంబేద్కర్ అంటరానివారి విమోచనకై ఉద్యమించి, హిందువులలో వున్నంతకాలం వారికి సమానత్వం రావడానికి వీల్లేదని గ్రహించి, బౌద్ధంలో చేరాడు, చేర్పించాడు. అంటరానివారి పట్ల ప్రేమ నటించిన కాంగ్రెసువారు, అంతవరకూ వున్న సౌకర్యాలను, ప్రత్యేక కేటాయింపులను అంబేద్కర్ అనుచరులకు లేకుండా చేశారు. జనతా ప్రభుత్వంలో గాని మళ్ళీ వారి హక్కుల పునరుద్ధరణ కాలేదు.
భారతీయ జనతాపార్టీ - అంబేద్కర్
అంబేద్కర్ కు ప్రస్తుతం దేశంలో కొత్త అభిమానులు ఏర్పడ్డారు. భారతీయ జనతాపార్టీ ఇటీవల ఒకనోట గాంధీజిని, మరోనోట అంబేద్కర్ ను పొగుడుతూ, వారి ఆశయాలను ఆచరిస్తామంటున్నది. ఒక వేదికపై గాంధీజీని, అంబేద్కర్ ను చేర్చారంటేనే బిజెపిని శంకించవలసి వస్తున్నది. గాంధీజీని కొత్తగా గుత్తకు తీసుకున్న బి.జె.పి. తమ ఎత్తుగడలో అంబేద్కర్ ని కూడా చేర్చడం గమనార్హం. కాని యీ ఎత్తుగడ విఫలంగాక తప్పదు. అంబేద్కర్ లో బి.జె.పి. ఆమోదించే అంశమేదీ కనిపించడం లేదు. కేవలం ఓట్ల కోసమే, కాంగ్రెసువారి వలె, బిజెపి కూడా అంబేద్కర్ ను శ్లాఘిస్తున్నా, అది మరీ కృత్రిమంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వుంది. అయినా, బిజెపి నీతికి తానే పట్టం గట్టినట్లు పేర్కొంటున్నది.
ఇటీవలే బిజెపి వారు అయోధ్యలో రామమందిర నిర్మాణానికై కంకణం కట్టుకున్నారు. రామరాజ్యం నిర్మిద్దాం అంటూ, అయోధ్య మందిర నిర్మాణానికై దేశవ్యాప్తంగా బిజెపి కార్యకర్తలు రాళ్ళు మోసుకొని వెళ్ళారుకూడా. అదంతా మతకలహాలకు దారితీసింది. కాని అంబేద్కర్ ను పొగుడుతూ, ఆయన ఆశయాలను పాటిస్తామంటున్న బి.జె.పి వారికి అసలు విసయం తెలియదనుకోలేం గదా. అందులో బాగా చదువుకున్న నాయకులు, అనుచరులు ఉన్నారు. వారిలో అందరూ కాకున్నా, కొందరైనా అంబేద్కర్ రచనలు చదివి వుంటారు. హిందూమతాన్ని గురించి, రాముడిని-రామాయణాన్ని గురించి అంబేద్కర్ రాసింది వారి దృష్టికి వచ్చే వుంటుంది.
అంబేద్కర్ రచనలలో అముద్రితంగా వున్న రచనలు కొన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచురించగా, అందులో రాముడి గురించిన విషయమై పెద్ద ఆందోళన జరిగింది. బిజెపి శివసేన, హిందూ ఛాందసులు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. కనుక అంబేద్కర్ లో బిజెపి వారు అంగీకరిస్తున్నదేమిటో, నిరాకరిస్తున్నదేమిటో జనానికి తెలియాలి. ఫలానా విషయం తృణీకరిస్తున్నామంటే, ఎందుకో కారణాలు కూడా బిజెపి చెప్పాలి. ఇదేమీ చేయకుండానే బిజెపి హఠాత్తుగా అంబేద్కర్ వర్థంతులు, జయంతులు జరుపుతూ వూరేగింపులు చేస్తుంటే అంబేద్కర్ వణికిపోతుండాలి. బుద్ధుడికి హిందువులు పట్టించిన గతి, అంబేద్కర్ కు బిజెపి వారు పట్టించదలచారా?






















అంబేద్కర్ హిందుమతాన్ని ఖండించారు. వేదాలనుండే మొదలైన వర్ణవ్యవస్థ, పురుషసూక్తం నుండీ 4 వర్ణాల వర్ణన పేర్కొని, నిరసించారు. ధర్మశాస్త్రాల అమానుష నియమాలను, రామాయణ, మహాభారత అవినీతి పంధాను బట్టబయలు చేశారు. హెచ్చుతగ్గుల హిందూసమాజంలో శూద్రుల స్థితి, బౌద్ధంపై పోరాడి సృష్టించిన అంటరానితనం హిందువులు ఎలా పోషించారో చారిత్రకంగా పెర్కొన్నారు. హిందువులు పూర్వం యజ్ఞయాగాదులు పేరిట ఆవుల్ని చంపి, ఆవు మాసం తిన్న ఉదంతాల్ని చూపారు. హిందూమతంలో అంటరాని వారికి స్థానం లేదని, సమానత్వం రాదనీ స్పష్టం చేశారు. కనుక హిందూమతాన్ని తృణీకరించి, బౌద్ధులుగా మారి అంటరానివారంతా సమానతను సాధించుకోవాలన్నారు.
అంబేద్కర్ కేవలం ద్వేషంతో, పగతో హిందువులలో అగ్రవర్ణాల వారిని, ముఖ్యంగా బ్రాహ్మణ ఛాందసులను తిట్టలేదు. సుదీర్ఘంగా పరిశోధించి, ప్రమాణాలతో విషయ పరిశీలన చేసి చూపారు. పరస్పర విరుద్ధ విషయాలను ఎత్తి ప్రస్తావించారు.
మనువు తన ధర్మశాస్త్రంలో పేర్కొన్న అమానుష, క్రూర, ఘోర నియమాలు, నిషిద్ధాలు, అక్రమశిక్షలు, నిచ్చెనమెట్ల సమాజాన్ని బిగించిన తీరు చూపారు. అంటరానితనాన్ని శాస్త్రోక్తంగా సమర్థిస్తున్న ధర్మాలను అంబేద్కర్ చూపారు. ఇవేవీ తెలియనట్లు బిజెపి నటిస్తోందా? లేక అవన్నీ మరచిపోదాం అంటోందా? అంబేద్కర్ ఆశయాలు అమలు జరగాలంటే, కొన్ని శాస్త్రాల్ని, గీతను, వేదాలను, రామాయణ, మహాభారతంలోని అంశాలను, ధర్మశాస్త్రాల్ని పక్కన బెట్టాలి. వాటిని పాటించరాదని, మానవ హక్కులకు అవి విరుద్ధమని గ్రహించాలి. పాఠ్యగ్రంథాలలో యీ అంశాలు రాకుండా చూడాలి. అంటరానితనాన్ని పాటించే ఆశ్రమాధిపతుల్ని ఖండించాలి. ఇవి చేయడానికి బిజెపి సిద్ధపడితే మనం సంతోషించాలి, ఆహ్వానించాలి. కేవలం అంబేద్కర్ ను పొగిడితే అది ఓట్ల వ్యూహంగానే భావించాలి. ఎన్నికల నినాదంలో (ప్రణాళికలో) రాంమందిర్ ప్రస్తావన బిజెపి విరమించాలి. రాముడిని గురించి అంబేద్కర్ ఏమంటున్నాడు?
రాముడు కావాలా? మానవ హక్కులు కావాలా? తేల్చండి
రాముడని దేవుడిగా పరిగణిస్తూ వుండేవారు. అతడు సీత శీలాన్ని శంకించి ప్రవర్తించిన తీరుకు అసహ్యపడాలి. ఈ విషయంలో రాముడి చర్య నేరంతో కూడింది. రాజుగా రాముడు, తపస్సు చేస్తున్న శూద్రుడు శంబుకుడిని చంపడం, అతడు ధర్మాన్ని అతిక్రమించాడనడం, ఇదంతా ఒక చనిపోయిన బ్రాహ్మణ యువకుడి నిమిత్తం చేశాడనడం తప్పు.
రాముడి పుట్టుక వ్యవహారమంతా ఆదర్శప్రాయం కాదు. బుద్ధ రామాయణం ప్రకారం సీత రాముడి సోదరి. కనుక యీ యిరువురి పెళ్ళి ఆదర్శం కాదు. రాముడు ఏకపత్నీవ్రతుడూ కాదు. వాల్మీకి రామాయణాన్ని బట్టి కూడా రాముడికి చాలామంది భార్యలున్నారు. (అయోధ్యకాండ 8వ సర్గ 12వ శ్లోకం) ఇంకా ఉంపుడుకత్తెలు కూడా వున్నారు. రాముడిని దేవుడిగా చూచేవారు ఈ విషయాలు పరిగణనలోకి తీసుకోవాలని అంబేద్కర్ అన్నారు. సమాధానం చెప్పజాలని భక్తులు కర్రలు తీసుకొని వీధిన పడ్డారేగాని సహనంతో చర్చించలేకపోయారు. అదీ రామ సంస్కృతి.
మనం కోరుకునే మానవ హక్కుల్ని హిందూమత సమాజంలో సాధించడం సాధ్యంకాదని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం సమానత్వం లేదు. స్వేచ్ఛకు గుర్తింపు లేదు. జ్ఞానాన్ని అందరికీ అందుబాటులో వుండే అవకాశం లేదు. సౌభ్రాతృత్వం అసలే లేదు. కనుక హిందుమతం ప్రజాస్వామిక విలువలకు చోటు పెట్టడం లేదని అంబేద్కర్ స్పష్టం చేశాడు (ఫిలాసఫి ఆఫ్ హిందూయిజం). హిందూ ధర్మాలు, పవిత్ర గ్రంథాల ఆధారంగానూ, ఆచరణరీత్యానూ జరుగుతున్న తంతును అంబేద్కర్ విశదీకరించాడు. సాంఘిక న్యాయానికి తోడ్పడని హిందూమతాన్ని అమానుషమైనదిగా సహజంగానే అంబేద్కర్ నిర్థారించాడు.
బి.జె.పి. వారు అంబేద్కర్ తత్వాన్ని, వాదనల్ని ఏ మేరకు అంగీకరిస్తున్నారో, ఎక్కడ ఎందుకు నిరాకరిస్తున్నారో తెలపాలి. అంటరానితనం పోవాలి అని చిలుకపలుకులు ఉచ్ఛరిస్తే సరిపోదు. అది ఎలా సృష్టి అయిందీ, మూలస్థంభాలుగా నిలచి దీనిని ఎవరు పోషిస్తున్నదీ, అది పోవాలంటే ఏం చేయాల్సిందీ అంబేద్కర్ చెప్పారు. హిందూ సమాజం పాటిస్తున్న యీ మహానేరం ప్రపంచ చరిత్రలోనే మచ్చగా నిలచింది. అంబేద్కర్ ను వాడుకుని ఓట్లు తెచ్చుకుందామనే బిజెపి తప్పు త్రోవలో పయనిస్తున్నదేమో చూచుకోవాలి. బుద్ధుడిని చంపేసినట్లే, అంబేద్కర్ ని కూడా నాశనం చేయాలనే పెద్ద కుట్రలో భాగస్వామిగా బి.జెపి. వ్యవహరిస్తున్నదా? కాదంటే, అందుకు భిన్నంగా ఆచరణలో కనిపించాలి.
జనతాదళ్ కూడా అంబేద్కర్ ను గౌరవిస్తున్నది. పార్లమెంటు హాలులో నిలువెత్తు ఫోటో పెట్టారు. దళితులపై అత్యాచారాల్ని అందరూ ఖండిస్తున్నారు. కాని వాటికి మూలంగా నిలచిన మతం, ధర్మశాస్త్రాలు, ఆశ్రమాలు, హిందూ దురభ్యాసాలు రూపుమాపకుండా, అంబేద్కర్ ను గౌరవించడం సాధ్యం కాదని గ్రహించాలి. కాంగ్రెసు, జనతాదళ్ ఒక తానులో వస్త్రాలే. ఎటొచ్చీ బిజెపి కొంచెం భిన్నమైంది. ముగ్గురూ కలసి అంబేద్కర్ వాదాన్ని తియ్యని మాటల్తో, చేతల్తో ఉరితీయదలచారు. ఈ విషయం అమాయకులైన వారికి అర్థం గావడానికి కొంత సమయం పట్టొచ్చు.




మార్క్సిజం-అంబేద్కర్
అంటరానివారు, శూద్రులు హెచ్చుతగ్గుల సమాజంలో అనుభవిస్తున్న కిరాతక చర్యల్ని గమనించిన అంబేద్కర్ అనేక మార్గాంతరాలను అధ్యయనం చేశారు. మార్క్సిజాన్ని పోల్చి కూడా అంబేద్కర్ చూచాడు.
శాస్త్రీయ సోషలిజంగా తన సిద్ధాంతాన్ని నిలపదలచిన మార్క్స్ అది విధిగా వచ్చి తీరుతుందని భావించినట్లు అంబేద్కర్ విశ్లేషించాడు. కాని 1917లో రష్యాలో వచ్చిన విప్లవం మార్క్స్ సిద్ధాంతాలకు అనుగుణంగా రాలేదన్నాడు. అది విధిగా సంభవించలేదంటే, ఎంతోహింస, రక్తపాతం జరిగిందనీ, మానవ ప్రయత్నం వలన రష్యాలో విప్లవం వచ్చిందనీ అంబేద్కర్ చెప్పారు. చరిత్రను ఆర్థిక దృక్పధంతో చూడడం సరైనది కాదని రుజువైందని కూడా అంబేద్కర్ స్పష్టం చేశారు. క్రమేణా కార్మికుడు పేదరికంలోకి పయనిస్తునట్లు కూడా సిద్ధాంతీకరించడాన్ని ఎవరూ అంగీకరించడం లేదన్నారు. ప్రపంచాన్ని పునర్నిర్మించడమే తత్వం చేయాల్సిన పని అని మార్క్స్ చెప్పింది సరైనదిగా అంబేద్కర్ భావించారు. వర్గాలమధ్య సంఘర్షణ వున్నట్లు మార్క్స్ అన్నది వాస్తవం. వ్యక్తిగత ఆస్తివలన ఒకరు శక్తివంతమైన వర్గంగా, దోపిడీ వలన పరిణమిస్తున్నారు. ఈ వ్యక్తిగత ఆస్తిని తొలగించి సమాజం శ్రేయస్సును కాపాడాలి.
ఈ లక్ష్యాలను సాధించడానికి మార్క్స్, హింసను, కార్మిక నియంతృత్వాన్ని సూచించగా, బుద్ధుడు అహింసను, మానసిక మార్పును అవలంబించాడు.
మార్క్సిజంలో రాజ్యపరమైన సిద్ధాంతం బలహీనమైనదని, శాశ్వతంగా నియంతృత్వాన్ని అది సూచిస్తున్నదనీ అంబేద్కర్ విమర్శించాడు. రాజ్యం హరించిపోతుందని చెప్పినా అది ఎన్నడు జరుగుతుందో, అలా జరిగిన అనంతరం ఏమౌతుందో స్పష్టపరచలేదన్నాడు.
రష్యా విప్లవం సమానత్వాన్ని సాధిస్తుందని ఆహ్వానించాం. కాని స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం సమానత్వం సమాజానికి అవసరం. కమ్యూనిజంలో ఇవి లేవు గనుక తృణీకరించాలని అంబేద్కర్ అన్నాడు.
చివరగా
అంబేద్కర్ భారత సమాజాన్ని విభిన్న కోణాల నుండి క్షుణ్ణంగా పరిశీలించారు. పరిశోధనా ఫలితాలను ప్రచురించారు. శూద్రులెవరు అనే అంశం తీసుకొని, వేదకాలం నుండీ వర్ణాలుగా విభజించి చీల్చిన విషయాలను చూపారు. వేదాలలో వర్ణాలు లేవనే వారి వాదనను ఖండించారు. వర్ణాలు, కులాలు వేరని చూపి, సమర్థించుకొనే ధోరణులు కూడా అంబేద్కర్ ఖండించారు. ఈ విషయంలో ఆర్యసమాజ్, గాంధి మొదలైన వారంతా అంబేద్కర్ విమర్శలకు గురైనారు. చారిత్రకంగా బ్రాహ్మణులు నిర్వహించిన పాత్ర వివరంగా పరిశీలించాడు.
అంటరానివారంటూ మనువుకు పూర్వం లేరనీ, గుప్తుల కాలం నుండీ యీ జాడ్యం అమలులోకి వచ్చినట్లు అంబేద్కర్ చూపారు. మను ధర్మశాస్త్రాన్ని బాగా పరిశీలించి, ఖండించారు. ఆ మాటకొస్తే ధర్మశాస్త్రాలలో వున్న హెచ్చుతగ్గుల ప్రస్తావన, అమానుష ధోరణులు అంబేద్కర్ విమర్శలకు గురైనాయి. హిందువులకు, బౌద్ధులకు జరిగిన సంఘర్షణలో అంటరానివారు ఏర్పడినట్లు, అలాగే గోవధ నిషేధం కూడా మతపరం చేసినట్లు చూపారు.
హిందూ సమజాంలో ప్రజాస్వామిక లక్షణాలు, మానవహక్కులు లేవనీ, ఉండడానికి వీల్లేదని సోదాహరణగా అంబేద్కర్ తెలిపారు. సమానత్వం సోదరత్వం, స్వేచ్ఛలకు హిందూమతంలో తావులేదన్నారు. హిందుమతం అనేది కలగాపులగం అనీ, క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధంలవలె నిర్ధుష్టంగా నిర్వచించ వీల్లేదనీ విపులీకరించారు.
హిందువులలో భాగంగా అంటరానివారిని పరిగణించినంతకాలం వారికి వియోచన, సమానత్వం, స్వేచ్ఛ రాదని అంబేద్కర్ నిర్థారించారు. అందుకే వారికి ప్రత్యేక ప్రాతినిధ్యం కావాలన్నారు.
రాజకీయాధికారం లేనిదే, అంటరానివారికి హక్కులు ఏర్పడవనీ, బానిసలకంటె అధములుగా వారిని చూస్తారని అంబేద్కర్ పేర్కొన్నాడు.
ఆచరణలో, రాజకీయవాదులు కేవలం ఓట్ల కోసం అంటరానివారిపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు అంబేద్కర్ గ్రహించారు. ఇందులో అగ్రగణ్యుడు గాంధీజీగా ఆయన పసిగట్టి పోరాడారు. గాంధీ చెప్పే మాటలకు, చేసే వాటికి ఎలా పొంతనలేదో చూపారు. హిందువులలోనే అంటరాని వారిని అట్టిపెట్టి, శాశ్వత వెట్టిచాకిరీ చేయించుకొనే ధోరణిని గాంధీ సమర్థించారన్నారు. బౌద్ధంలో మాత్రమే సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం లభించగలవని అంబేద్కర్ నమ్మారు. బౌద్ధం మనదేశంలో ఏనాడో చంపేయబడింది. దీనిని పునరుద్ధరించడం చాలా కష్టమని అంబేద్కర్ గ్రహించలేదు. మానవ హక్కులకై అంబేద్కర్ పోరాటం ముందుకు సాగించవలసి వుంది.
అంబేద్కర్ మనువా?
అంబేద్కర్ ను తరచు మనువుతో పోల్చి, ఆధునిక రాజ్యాంగనిర్మాత అనీ, ఆధునిక మనువు అనీ నాజూకుగా తిడుతుంటారు. జీవితమంతా అంబేద్కర్ ఎన్నో పరిశోధనలు చేసి మనువు చేసిన ఛండాలమంతా బయటపెట్టాడు. మనదేశంలో విప్లవ ప్రతీఘాతుకం మనువుతోనే వచ్చిందన్నాడు. అంటరానితనం మనువునుండే ఆరంభమైనదన్నాడు. ఆడవాళ్ళకు స్వేచ్ఛ పోవడం, హక్కులు పోవడం మనువుతోనే మొదలయ్యాయన్నాడు. అలాంటి చండాలపు మనువుతో అంబేద్కర్ ను పోల్చడం పరోక్షంగా ఆయన్ను అవమానపరచడమే.
మన రాజ్యాంగాన్ని తగులబెట్టాలని అంబేద్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ పాల్గొన్నప్పటికీ, తనకు యిష్టం లేనివి ఎన్నో చోటుజేసుకోవడంతో ఆయన అలా భావించాల్సి వచ్చింది. కనుక రాజ్యాంగంలో వున్న వాటన్నిటికీ అంబేద్కర్ ను బాధ్యుడుగా చేయడమూ భావ్యంకాదేమో.
అంబేద్కర్ ఆరంభించిన కృషి అడుగడుగునా అగ్రకులాల అవరోధాలతో వెనుకంజ వేసింది. కనుక రాజకీయ, ఆర్థిక, మత ప్రలోభాలకు లొంగక, మానవహక్కుల నిమిత్తం పోరాడటం, అంబేద్కర్ లక్ష్యాలను సాధించడానికి కృషిచేయడమే.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాయావతి వచ్చినా, అంబేద్కర్ తత్వాన్ని అమలుపరచడం లేదు.

Monday, May 26, 2008

సాహితి పరులతో సరసాలు 24






ధూళిపూడి ఆంజనేయులు
(1924-1998)








గోపాలచక్రవర్తి ఆయన్ను డాంజనేయులు అని చమత్కరించేవారు. తెలుగు వాడైనా, ఆంజనేయులు రచనలన్నీ ఇంగ్లీషులోనే చేశారు. గుంటూరు జిల్లా తెనాలి తాలూకాకు చెందినప్పటికీ కాలేజి చదువంతా మద్రాసులోనే. ఎన్నో ఉద్యోగాలు చేసి, వూళ్ళు తిరిగినా చివరకు మద్రాసులోనే స్థిరపడ్డారు.
తెలుగు ప్రసిద్ధ రచయితల్ని బయట ప్రపంచానికి తెలియజేసిన ఆంజనేయులు చక్కని ఇంగ్లీషు రాసేవారు. అందుకే నార్ల వెంకటేశ్వరరావు వంటివారు తమ రచనల్ని ఆయనచే దిద్దించుకునేవారు.
యూరోప్ పర్యటనచేసి (Window to the West) అనే చిన్న గ్రంథం బాగా రాశారు. ఆంజనేయులుగారి భార్య ఆదిలక్ష్మి మాస్కోలో రేడియోలో పనిచేస్తూ, శాంతిశ్రీని ప్రసవించిన అనంతరం అక్కడే చనిపోయింది. టాన్యాపేరిట కొన్నేళ్ళు పెంచి, తండ్రికి అప్పగించగా ఆయన శాంతిశ్రీ అని పేరు పెట్టారు. ఆమెకు 18 ఏళ్ళు ప్రాయంనిండగానే ఆమె పేరిట బాంక్ లో వుంచిన డబ్బును తండ్రికి అప్పగించింది రష్యా ప్రభుత్వం. శాంతి శ్రీ పూనాయూనివర్శిటీలో ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ గా వున్నారు.

మద్రాసులో, ఢిల్లీలో, హైదరాబాద్లో ఆంజనేయులు కేంద్ర సమాచార శాఖలో ఉద్యోగం చేశారు. హిందూ పత్రికలో పనిచేశారు. మద్రాసు జర్నలిస్టు క్లబ్ అధ్యక్షులుగా వున్నారు.
Between you and me అనే శీర్షికకు హిందూలోకొన్నేళ్ళు రాశారు. జాతీయ అంతర్జాతీయ సెమినార్లలో అనేక వ్యాసాలు రాశారు. ఢిల్లీ నుండి విదేశీవ్యవహారాల శాఖ పక్షాన పత్రికకు సంపాదకత్వం వహించారు.
ఆంజనేయులుగారే తొలుత నన్ను దేవులపల్లి కృష్ణశాస్త్రికి పరిచయం చేశారు. తన పుస్తకాలు ముఖ్యంగా సి.ఆర్. రెడ్డి వంటివి నాకు పంపించి, నా అభిప్రాయాలు తీసుకున్నారు. అది ఆయన ఔదార్యానికి నిదర్శనం. తన పుస్తకాలలో నాకు ధన్యవాదాలు చెప్పారు కూడా.
సుప్రసిద్ధ జర్నలిస్టుల గురించి పరిశోధించి, వ్యాసాలు రాశారు. కోటం రాజు పున్నయ్య, రామారావు, సి.వై. చింతామణి, వంటివారిని గురించి మంచి పరిచయ వ్యాసాలు రాశారు.
సంగీతం, సంస్కృతం ఆంజనేయులుగారికి ప్రీతిపాత్రం. నన్ను వెంటబెట్టుకుని చక్కని పాటకచేరీలకు, సెమినార్లకు తీసుకెళ్ళారు. అవి మధురస్మృతులు.
ఆలిండియా రేడియో మద్రాసులో పనిచేస్తున్న దాశరథి కృష్ణమాచార్యను పరిచయం చేశారు.
ఆంజనేయులుగారి సన్నిహిత రాజకీయ వాదులలో బెజవాడ గోపాలరెడ్డి ఒకరు. మద్రాసులో బి.ఎస్. ఆర్. కృష్ణ, జగ్గయ్య, బాజి, ఆయన సన్నిహితులు.
ఆంజనేయులుగారికి మంచి గ్రంధాలయం వుండేది. ఎన్నో పత్రికలలో ఆయన వ్యాసాలు రాశారు. ఇంగ్లీషులో రాస్తే అనువదించి ప్రచురించేవారు.
Window to the West, Veeresalingam, C.R. Reddy, Author as artist, The art of Biography, Nehru - Nirad Choudary, Literary Criticism, Aspects of Modern Telugu Literature, Translation into English., గ్రహణం విడిచింది (ద్వివేదుల విశాలాక్షి).

Friday, May 23, 2008

పుస్తక సమీక్ష

పురాణ ప్రలాపం








ఇన్నాళ్ళు హేతువాదులు, మానవవాదులు, నాస్తికులు, సందేహ వాదులుసూటిగా, ఘాటుగా, చెప్పిన తీరు జనంలోకి ఆకర్షణీయంగా పోలేదు. ఈ గ్రంథ రచయిత హరిమోహన్ ఝా అనుసరించిన పద్ధతి వ్యంగ్య, వినోద ప్రక్రియ. కనుక ఇది పిల్లలకు, పెద్దలకు పట్టే అవకాశం ఉన్నది.

తెలుగులో అనువదించిన జె. లక్ష్మి రెడ్డి చూపిన దోరణి గమినిస్తే ఇందులో అనువాదం అనిపించే లక్షణాలు లేవు. సొంతంగా వ్రాశారేమో అనే భ్రమ కలుగుతుంది. అది గొప్ప చేయితిరిగిన విధానం.

రచయిత 23 అంశాలను ఎంపిక చేసి, తన సునిసిత విమర్శలకు, వ్యంగ్య బాణాలకు, నవ్వించే దోరణికి పొందికగా అమ్మర్చారు. ఆ విధానమే ఈ పుస్తకానికి తిరుగులేని, మణిపూస.

వేధాలు మొదలు గీత వరకు, రామాయణం నుండి భారతం వరకు, ఆయుర్వేదం నుండి గ్రహణాలు, జ్యోతిష్యం వంటి ప్రజాబాహుళ్య అంశాలు చర్చనీయాంశాలుగా స్వేకరించారు. ప్రతి అంశాన్ని చీల్చి చండాడు తున్నప్పుడు మూల గ్రంధాలనుండి ఆధారాలు చూపి, విమర్శకులు, భక్తులు మాట్లాడకుండా చేయగలిగారు.

రచయిత బీహార్ ప్రాంతంలోని మిధిలకు చెందినవాడు. ఆ భాషలోనే ఈ పుస్తకం రాశాడు. దీనిపై వీరభక్తులు, చాందసులు ధ్వజమెత్తారు. కానీ విమర్శలకు సమాధానం చెప్పలేకపోయారు. ‘ఖట్టర్ కాకా’ శీర్షికన ప్రచారంలోకి వచ్చిన హరిమోహన్ గ్రంధం విస్త్రుత ఆదరణకు గురైంది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో హిందీ శాఖలో ప్రొఫెసర్ గా రిటైర్ అయిన లక్ష్మిరెడ్డి ఈ పుస్తకాన్ని తెలుగులోకి తెచ్చి శాస్త్రియ ఆలోచనకు, నేటి సమాజంలో రాను రాను ముదిరిపోతున్న మూఢ భక్తిని ఎదుర్కోటానికి బాగా ఆయుధాలని అందించారు.

వేదాలు చదవరాదని పూర్వం స్త్రీలకు, బ్రాహ్మణేతరులకు ఆంక్షలు విధించారు. ఈ రచయిత ఇందుకు కొత్త వారిని చేర్చి, బ్రహ్మచారులు కూడా వేదాలు చదవరాదన్నారు. వింతగా అనిపిస్తుంది కదూ. వేధాలలో సోమపానం తాగి తందనాలాడిన పురుషులు, పచ్చి శృంగారంలో తేలిపోయిన మునులు, వావి వరసలు చూడకుండా వ్యభిచరించి సంతానాన్ని ఉత్పత్తి చేసిన పద్ధతులు, భోగలాలసత్వం, ఆధికారికంగా చూపాడు. జిగుప్స కలిగించే సెక్స్ వేధాలనిండా నిండిపోయిన విధానాన్ని మూలగ్రంథాలనుండే చూపాడు.

వేధాల తర్వాత నేడు అంత ప్రమాణాన్ని, అధికారాన్ని చూపుతున్న గీతను చేపట్టి కృష్ణుడు దారుణమైన ప్రవర్తన, హింసను పురికొలిపి విధ్వంసాన్ని చేయించటం, వికటించిన శృంగారం సర్వత్ర విమర్శకు గురిచేశాయి. కర్మ ఫలం పేరిట జరిగిన నాటకాన్ని గుట్టు రట్టు చేశాడు.

ప్రజలలో మూలగ్రంథాలు తెలియకపోయినా, మూఢాచారాలకు లోపం లేదు. అందులో పేర్కొనధగినవి, జ్యోతిష్యం, సత్యనారాయణపూజ, దుర్గాస్తోత్ర పారాయణం, భూతాల మంత్రం, బ్రాహ్మణ సందర్పణ, పురోహితుల నీచపాత్ర చెప్పుకోదగినవి. వాటిని వెంగ్యంగా, ఎత్తిపొడిచి గొప్పగా నవ్వించి ఆటపట్టించాడు. జ్యోతిష్య మూలగ్రంథాల నుండే ఉదాహరణలు ఇచ్చి వెక్కిరించాడు. ‘పారాశర హోరాసారః!’ నుండి ఉదాహరణలు చూపినప్పుడు సాక్ష్యాత్తు జ్యోతిష్యుడే పారిపోతాడు. అందులో ఒకచోట ఇలా ఉంది. శుక్రుడు మంగళగ్రహ క్షేత్రంలో ప్రవేశించినా, లేక మంగళ గ్రహంతో పాటు కనిపించినా ఆ జాతకునికి భగచుంబన సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఇక జ్యోతిష్యుడు ఆదరబాదరగా వెళ్ళిపోక ఏం చేస్తాడు.

ఆయుర్వేదం :

‘భావప్రకాశ్’ అనే ఆయుర్వేద మూలగ్రంథం నుండి ఉదాహరణలు చూపి, శివుని అంగం నుండి భూమిపైన పడిపోయిన ధాతువే పాదరసం అని, మరొక చోట “లావుపాటి తొడలు, స్థూల నితంబాలు ఉన్న యువతి పుష్టి కలిగిన తన స్తనాలతో గాఢాలింగనం చేస్తే చలి తొలగి పోతుంది” అని చూపి ఇలా అంటాడు : ఇలాంటి ప్రిస్క్రిప్షన్ ఏ మెడికల్ పుస్తకంలోనైనా దొరుకుతుందా? తరువాత విమర్శ చేస్తూ - ఇతర దేశాల్లో చికిత్సా పద్ధతి వైజ్ఞానిక రీతిలో వికసించింది. కాని, ఈ దేశంలో మాత్రం తాత-తండ్రులు చెప్పిన మాటే సత్యం అదే ఆయుర్వేదంలో ప్రధాన లోపంగా చూపుతారు. ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఇచ్చి ఆయుర్వేదాన్ని అపహాస్యం చేస్తాడు.

రచయిత ఈ పుస్తకంలో చిన్నాన్న అనే పాత్రను ప్రధానంగా ప్రవేశపెడతాడు. విమర్శలన్నీ నవ్విస్తూ, కవ్విస్తూ, దెప్పి పొడుస్తూ, ఆ పాత్ర ద్వారానే చెప్పిస్తాడు. చిన్నాన్న ప్రాచీన హిందూ సంప్రదాయ ఆచార్య వ్యవహారాల్లో స్వీకరించిన భంగును తాగుతూ, వక్కపొడి నములుతూ ఇలాంటి విషయాలు అవలీలగా చెబుతాడు. ఒకవేళ భంగు తాగి ఆషామాషీగా చెప్పాడనటానికి, ఎక్కడికక్కడ ప్రమాణాలు చూపుతూనే పోతాడు. కనుక అతడి తర్కానికి ఎదురు లేదు.

భూతాల మంత్రం :

మన మూర్కత్వానికి సూచనగా భూత మంత్రాలు కొల్లలుగా ఉదహరిస్తారు. శత్రు సంహారానికి ప్రయోగించాల్సిన మంత్ర తంత్రాలను అగ్ని పురాణం నుండి చూపి అలాంటివి మనల్ని లోకం దృష్టిలో ఎలా చవకబారుగా చెస్తుందో చెబుతాడు. ఈ మంత్రాల కిటుకులు చాలా దారుణమైనవని విమర్శిస్తాడు. ఉదాహరణకు తంత్రసారంలో “శుభనక్షత్రంలో అపామార్గ మూలిక నూరి పూసుకుంటే ఏ ఆయుధం దెబ్బా శరీరానికి తగలదు”. దత్తాత్రేయ తంత్రంలో “శనివారం గాని, బుధవారం గాని శత్రువు మూత్ర విసర్జనం చేసే చోట ఒక ఊసరవెల్లిని పట్టుకొచ్చి పాతిపెట్టు. అంతే, శ్రతువు నపుంసకుడైపోతాడు”. ఈ గుప్త రహస్యం స్వయంగా శంకరుడే చెప్పాడు. రచయిత ప్రకారం మన తలపైన కూర్చొని సవారీ చేస్తున్న మూర్ఖత్వమనే భూతం భస్మీభూతం అయిన తరువాతే దేశ భవిష్యత్తు బాగుపడుతుంది.

శాస్త్ర వచనాలు :

ఎవరు గానీ తన ఇష్టప్రకారం ఒక పూచిక పుల్ల కూడా తుంచకూడదు మరి. మనవు ఆదేశమంటే - గోళ్ళతో గడ్డిపరకను తుంచరాదు, ఇక్కడ తుమ్మినా, దగ్గినా, ఉమ్మినా ప్రాయశ్చిత్తం చేయాలి అని శాతాతప స్మృతిలో ఉందట. ఇలాంటివి రచయిత కోకొల్లుగా ఉదహరించి, మన శాస్త్రకారులు లెక్కలేనన్ని విధి-నిషేధాలు కల్పించి మనుషులను బంధించారు. ధర్మశాస్త్రంలో ఏదైనా కొరత ఉండి ఉంటే దాన్ని జ్యోతిష్యం పూర్తి చేసింది అన్నాడు. మనువు, యాజ్ఞవల్క్యుడు ధర్మమనే బేడీలు ప్రజల చేతులకు బిగించారు. భృగువు, పరాశరుడు కాలపు సంకెళ్ళు కాళ్ళకు తగిలించారు. ఈ దేశంలో బంధనాలకు ముఖ్యకారణం శృతులు, స్మృతులు, జ్యోతిష్యం, పురాణాలు. రచయిత అంత ఘాటుగానూ, సాధికారికంగానూ విషయాలు చెప్పాడు.

రామాయణాన్ని స్వీకరించి రాముడి పాత్రను తీవ్రంగా విమర్శకు గురిచేశారు. అందులో భార్యను అడవి పాలు చేయటం. ఆమె శీలాన్నిశంకించడం గర్హిస్తాదు

భారతాన్ని పరిశీలించి ధర్మరాజు ప్రవర్తనను, జూదరిగా భార్యను తాకట్టు పెట్టడం మొదలుకొని ద్రౌపది చేసిన తప్పులను ఎత్తి చూపుతాడు.

సత్యనారాయణ పూజ :

వ్రత ప్రభావంతో ధన ఫ్రాప్తి, పుత్ర ప్రాప్తి లభిస్తుందని ప్రచారం చేసిన రీతులను భ్రోకర్, భీమా ఏజెంట్ లతో పోల్చి చెప్పాడు. సత్యనారాయణుడు లోభి, స్వార్ధపరుడు, క్షుద్రుడు, దుష్టుడుగా అర్థమౌతాడని కథను చదివినవారికి తెలుస్తుందన్నారు. గృహస్తులకు ఆశలు చూపి, చవక బేరాలకు ఎగబడేటట్లు బ్రాహ్మణులు ప్రచారం చేశారని, చిన్నాన్న పాత్ర విమర్శిస్తుంది. పూజ చేయించే గృహస్తుడి కోరిక సిద్ధిస్తుందో లేదో గాని, పురోహితుడి కోరికలు మాత్రం తీరతాయన్నాడు.

కావ్య రసం :

ప్రాచీన కావ్యాలలో విద్యాపతి పదావళి వంటివి పిల్లలకు పాఠ్యగ్రంథాలుగా చెప్పటాన్ని రచయిత తీవ్రంగా పరిగణించారు. వాటినిండా సెక్స్ అది అశాస్త్రీయమైన ధోరణిలో ఉండటాన్ని విపులంగా చూపారు. ఇలా సెక్స్ నిండిపోయిన కావ్యాలను గీతగోవిందం మొదలు శంకరాచార్యుడి భగవతి భుజంగ స్తోత్రం వరకు చూపారు. ఈ సందర్భంగా అనువాదకుడు లక్ష్మిరెడ్డి వెంకటేశ్వర సుప్రభాతం నుండి పచ్చి శృంగారాన్ని ఉదహరించారు.

సుప్రభాతంలో 1వ శ్లోకం :

కమలాకుచ చూచుక కుంకమతో
నియతారుని తాతుల నీలతనో
కమలాయతలోచన లోకపతే
విజయీ భవ వేంకట శైలపతే
దీని అర్థం తెలుగులో యిది : లక్ష్మీదేవి చనుమొనలయందున్న కుంకుమపూ రంగువల్ల అంతటా ఎర్రగా చేయబడ్డ సాటిలేని నల్లని శరీరం కలవాడా తామర రేకులవంటి విశాలమైన కన్నులు కలవాడా జగన్నాయకుడా, వెంకటాచలపతీ, జయించే స్వభావం కలవాడవు కమ్ము.
23వ శ్లోకం

కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తి
కాంతాకు చాంబురహ కుట్మలలోల దృష్టే
కళ్యాణ నిర్మలగుణాకర దివ్యకీర్తి
శ్రీ వెంకటాచలపతీ తవసుప్రభాతమ్

తెలుగులో అర్థం : మన్మధుడి గర్వాన్ని హరించగల అందమైన ఆకారం గలవాడా. ప్రియురాలి తామర మొగ్గుల వంటి చన్నుల మీద ఆసక్తితో చూపులు పెట్టినవాడా. శుభాన్ని కలిగించే మంచి గుణాలకు నిలయమైనవాడా. గొప్ప కీర్తి కలవాడా. వెంకటాచలపతీ నీకు సుప్రభాతముగుగాక.

ఇలాంటివి పిల్లలచేత పారాయణం చేయిస్తుంటే చూస్తూ ఊరుకుంటున్న సమాజం మనది. సంస్కృతంలో బూతు ఉంటే పరవాలేదనే ధోరణి ప్రభలి ఉన్నది.

ఈ పుస్తకాన్ని 23 చిన్న నాన్ డీటేల్డ్ పాఠ్యగంధ్రాలుగా పెట్టించటం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. నవ్విస్తూ, వాస్తవాలను ఇంత బాగా చెప్పిన ఈ విషయాలు భవిష్యత్తు తరాలవారికి ఉండాలి. ఒక వైపున సమాజం, చదువుకున్న వారితో సహా మూడనమ్మకాలతో, వెన్నకి పోతుండగా, సొంత శక్తిపై ఆధారపడలేని వాళ్ళు చదువుకున్న వారిలో కూడా ఉండగా అలాంటి వారికి కళ్ళు తెరిపించే ఈ పుస్తకం బహుళప్రచారంలోకి రావాలి.

పురాణప్రలాపం :
వ్యంగ్య వినోద ప్రసంగం
మైథిలీ మూలం : హరిమోహన్ ఝా
తెలుగు అనువాదం : జె. లక్ష్మిరెడ్డి.
పేజీలు : 268, వెల : రూ.100.
అన్ని విశాలాంధ్ర బుక్ హౌస్ లలో లభించును.

Translater

Wednesday, May 21, 2008

సాహితి పరులతో సరసాలు-23



ఆవుల సాంబశివరావు
(1917-2003)

ఆవుల సాంబశివరావు జడ్జిగా, వైస్ ఛాన్సలర్ గా, లోకాయుక్తగా పేరు తెచ్చుకున్నారు. కాని ఆయనకు మరికొన్ని కోణాలున్నాయి.
తెనాలితాలూకా మూల్పూరు గ్రామానికి (గుంటూరు జిల్లా) చెందిన సాంబశివరావు కుటుంబానికి వూళ్ళో దేవాలయం, దానికింద ఆస్తులు, ట్రస్ట్ వుండేవి. ఏటాఉత్సవాలు జరిగేవి. సాంబశివరావు వాటిని వదులుకోలేదు.


గాంధేయుడుగా ఆరంభమైన ఆవులసాంబశివరావు, క్రమేణా ఎం.ఎన్. రాయ్ ప్రభావితుడై అఖిలభారత మానవ వాద సంఘాధ్యక్షుడుగా, భారత హేతువాద సంఘ కార్యదర్శిగా, ఇండియన్ రేషనలిస్ట్ పత్రిక సంపాదకుడుగానూ పనిచేశారు. స్టడీ కాంపులలో ఉపన్యాసాలిచ్చారు. మానవవాద తత్వంపై వ్యాసాలు రాశారు. ఇది కొందరికే తెలుసు.

ఆయనకు సాహిత్యాభిలాష వుండేది. త్రిపురనేని గోపీచంద్ సన్నిహితుడు. ఆయనపై సంచిక వెలువరించారు. వీరేశలింగంపై రాశారు. త్రిపురనేని రామస్వామి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు.

ఆర్య సమాజ్ నాయకుడు గోపదేవ్ తో సన్నిహిత సంబంధం వుండేది. కవితా గోష్టులలో పాల్గొన్నారు.
వివాహాలలో మంత్రాలు లేకుండా, త్రిపురనేని రామస్వామి పద్ధతిలో తెలుగులో ప్రమాణాలు చేయిస్తూ ఆవుల సాంబశివరావు అనేక పెళ్ళిళ్ళు జరిపించారు. 1964లో తెనాలిలో జరిగిన నా పెళ్ళికి ఆయన అధ్యక్షత వహించి ఉపన్యసించగా, ఆవుల గోపాలకృష్ణమూర్తి పౌరోహిత్యం చేశారు. వారిరువురూ ముల్పూరు వారే. వారి తాతలిద్దరూ అన్నదమ్ములు.

సాంబశివరావు ఇంగ్లీషు, తెలుగులో సరళంగా, సాఫీగా, ఉపన్యసించేవారు. లౌక్యంగా ఆకట్టుకునేవారు.
ఆవుల సాంబశివరావు కుమార్తె మంజులత సుబ్రహ్మణేశ్వరరావు పెళ్ళి హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగింది. నేనూ కొండవీటి వెంకట కవి ఉమ్మడిగా లౌకిక తీరులో పెళ్ళి జరిపించాం.









ఆంధ్రయూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా ఆవుల సాంబశివరావు విఫలమయ్యారు. నేనూ, మల్లాది రామమూర్తి కలసి విశాఖ వెళ్ళి, సైంటిఫిక్ మెథడ్ (ఎ.బి.షా రచన) విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ పుస్తకంగా పెట్టించమన్నాం. బెంగుళూరు యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ హెచ్. నరసింహయ్య అలా చేసి సఫలమయ్యాడని ఉదాహరణ చూపాం. సాంబశివరావు తనకు నరసింహయ్య నమూనా అవసరం లేదనీ, తప్పనిసరిగా ఆ పనిచేస్తానని చెప్పి, మరచిపోయారు. మానవ వాదిగా విఫలమైన వైస్ ఛాన్సలర్ ఆయన. అలాగే లోకాయుక్త గానూ అంతగా రాణించలేదు. ఆయన దగ్గర ఆఫీసర్ గా వున్న పర్వతనేని కోటేశ్వరరావు (కీ.శే) సాంబశివరావు వైఫల్యాలు, పక్షపాతాలు చూచి, తప్పు కోవలసి వచ్చింది.

కాని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆవుల క్రమశిక్షణ పాటించి, జడ్జీల చే పాటింప జేశారు. అది అభినందనీయం. తాను మానవవాదినని ఘంటా పథంగా వేదిక మీద చాటిన సాంబశివరావు, రచనల్లోనూ ఆ విషయాలు రాశారు. కుటుంబ పరంగా విఫలమైన సాంబశివరావు, సమాజంలో పెద్దమనిషిగా హ్యూమనిస్ట్ గా నిలిచారు.

భవనం వెంకట్రాం ముఖ్యమంత్రిగా నాకు అత్యంత సన్నిహితులు. ఆంధ్రయూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా పేరు సూచించమని నన్ను అడిగితే, సాంబశివరావు పేరు చెప్పాను. నన్నే వెళ్ళి అంగీకారం అడుగమన్నారు. వెళ్ళి, ముఖ్యమంత్రి ఫోను చేస్తారు. అంగీకరించండి అని ఒప్పించాను.

మద్రాసు నుండి కుంటుతూ నడుస్తున్న ఇండియనే రేషనలిస్ట్ పత్రికను హైదరాబాద్ కు తరలించినప్పుడు, ఆవుల సాంబశివరావు ఆర్థికంగా తోడ్పడి, ఎడిటర్ గా సహాయపడ్డారు. నేనూ, ఎన్.కె. ఆచార్య, ఎ.ఎల్. నరసింహారావు పత్రిక నిర్వహణ గావించాం కొన్నేళ్ళ పాటు ఎందరో కవుల్ని, కళాకారుల్ని, రచయితల్ని ఆవుల సాంబశివరావు ప్రోత్సహించి, పీఠికలు రాశారు. బౌద్ధం అంటే యిష్టపడేవారు. ఇంటిపై పెద్ద బౌద్ధ ప్రతిమ పెట్టారు. ఆయన భార్య జయప్రద సామాజిక సేవాకార్యక్రమాలలో నిమిగ్నమైంది. హ్యూమనిస్ట్ చర్యలలో విముఖత చూపింది.

మద్రాసు, గుంటూరు, హైదరాబాద్ లో హైకోర్టు న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా, జడ్జిగా పనిచేసిన ఆవుల, ఉన్నత విద్య అంతా మద్రాసులోనే అభ్యసించారు. ఎం.ఎన్. రాయ్, సి. ఆర్. రెడ్డి, వి.ఎం. తార్కుండే, ఇందుమతి పరేఖ్, వి.బి. కర్నిక్, గోరా, పండిత గోపదేవ్

వంటి వారితో పరిచయాలున్నాయి.

రచనలు : నాటికలు, వ్యాసాలు, వీరేశలింగం (సవనీర్), గోపీచంద్ (సవనీర్), ప్రజలు-రాజ్యాంగం, మనిషి కథ, నవ భావన, త్రిపుర నేని రామస్వామి, టేకింగ్ రూరల్ ఇండియా ఇన్ టు ది 21 సెంచరి, నీ డెడ్ ఎ కల్చరల్ రివల్యూషన్.
రచనలన్ని మూడు సంపుటాలుగా 2008 లొ వెలువడ్డాయి

Sunday, May 18, 2008

పుస్తక సమీక్ష









సుభాష్ బోసు గెలవక పోవడమే మంచిది!

1. Milan Hauner : India in Axis Strategy, 1981, Klett-Cotta, Stuttgart.
2. Agehanand Bharathi : The Ochere Robe, 1961, George Allen and Unwin, London.

సుభాష్ చంద్రబోసు చనిపోయిన తరువాత చాలా గాధలు వ్యాపించాయి. కేంద్ర ప్రభుత్వం కమిషన్ వేసింది. వీరభక్తులు కొందరు చిలవలు పలవలుగా బోసు గురించి వదంతులు ప్రచారంలో పెట్టారు. హిమాలయాలలో వున్నాడన్నారు. తిరిగి వస్తాడన్నారు.
ఒకవైపు గాంధీజీ మరో పక్క ఎం.ఎన్. రాయ్ సలహాలు చెప్పినా బోసు వినిపించుకోలేదు. బ్రిటిష్ వారిని దేశం నుండి ఎలాగైనా తరిమేయాలనే పట్టుదలతో బోసు వ్యవహరించారు. చిత్త శుద్ధిలో లోపం లేదు. ఎటోచ్చీ ఆ వేశంలో విచక్షణ తగ్గింది.
జైలునుండి తప్పించుకుని రహశ్యంగా రష్యా మీదుగా వెళ్ళి జర్మనీలో హిట్లర్ ను కలసిన బోసుకు ఏమైంది? ఆ తరువాత జపాన్ వారెలా ప్రవర్తించారో గమనిస్తే, బోసు చేసింది ఏమంత విజ్ఞతతో కూడిన పనికాదనిపిస్తుంది.
1942 మే 27 సాయంత్రం హిట్లర్ ఎట్టకేలకు బోసుకు దర్శనమిచ్చాడు. అప్పుడు రిబ్బన్ ట్రాప్, కెప్లర్, హెవెల్ కూడా వున్నారు. హిట్లర్ ను వృద్ధ విప్లవ కారుడుగా పేర్కొని బోసు అభివాదం చేశాడు. జపాన్ చేతుల్లోకి ఇండియాకు సంబంధించిన ప్రచారం పూర్తిగా పోకుండాచూడమని, తరువాత తన పథకాన్ని బోసు చెప్పాడు.
హిట్లర్ ఏక పాత్రాభినయంలో ప్రసంగం వలె భవిష్యత్తులో ప్రపంచాన్ని గురించి తన భావాలేమిటో ఏకరువు పెట్టాడు. శత్రువును పూర్తిగా ఓడించకుండా ఇండియా స్వాతంత్ర్య ప్రకటన చేసినందువలన ప్రయోజనం లేదన్నాడు. తానొక సైనికుడుగా రాజకీయాధికారంతో పోరాడుతున్నందున తప్పుడు అంచనాలు వేయనన్నాడు. ప్రకటన చేయాలంటే తనకు యింకా అనేక డివిజన్ల సైన్యం అవసరమన్నాడు. అయితే మూడు మాసాలలో గాని, ఒకటి రెండు సంవత్సరాలలో గాని అలాంటి అవకాశం లభించగలదన్నాడు. ఇండియా చాలా దూరాన వున్నందున విమానాల్లో చేరగలమని లేదా పర్షయన్ అఖాతం, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా కాల్బలంతో వెళ్ళవలసి వుంటుందని అన్నాడు. హిట్లర్ అలా మాట్లాడుతూ ఇండియాకు సరైన దారి రష్యామీదుగా వుందన్నాడు. జపాన్ వారు తరువాత ఏం చేయనున్నారో తెలియదనీ, చాంగ్ కై షేక్ పై దాడి చేస్తారో, ఆస్ట్రేలియా పైకి పోతారో, ఇండియా పైకి వస్తారో చూడవలసి వున్నదని అన్నాడు. ఇండియాకు ప్రత్యక్ష సహాయంతో జర్మనీ పాత్ర తక్కువే అయినా, ఉత్తర ఆఫ్రికాలో సైన్యాల ఓటమి వలన ఇండియాలో జాతీయ పోరాటానికి తోడ్పడినట్లేనని హిట్లర్ చెప్పాడు. బ్రిటిష్ వారిని ఓడించాలంటే ఇండియాలో అంతర్గత పోరాటం, బయట జర్మనీ, ఇటలీ, జపాన్ లు దాడి చేస్తేనే సాధ్యమన్నాడు. జర్మనీ ప్రభావం మాత్రం కొన్ని మాసాలలోనే వుండొచ్చునని అన్నాడు. కనుక జపాన్ వెళ్ళ వలసిందిగా బోసుకు సలహాయిస్తూ జపాన్ వారివ్వక పోతే, తానే ఒక సబ్ మెరైన్ యిస్తానని హిట్లర్ తన సుదీర్ఘ ప్రసంగాన్ని ముగించాడు.
తనను స్కూలు పిల్లాడివలె హిట్లర్ పరిగణించడం బోసుకు నచ్చలేదు. అయినా మెయిన్ కాంపులో (జైలులో హిట్లర్ రచన) ఇండియన్ల గురించిన వ్రాతలపై వివరణ అడుగుతూ, శత్రువులు వీటి ఆధారంగా తనకు అనుకూల ప్రచారం చేసుకున్నారని బోసు చెప్పాడు.
తన భావాలలో తప్పేమీ హిట్లర్ కు అగుపించలేదు. ఇండియాను చూచిన తరువాత అహింసాయుత పోరాటాన్ని జర్మనీలో నిరుత్సాహ పరచి ప్రపంచ వ్యాప్తంగా అణచివేతకు గురైన వారి ఐక్య సంఘటన ఏర్పరచాలన్నదే తన ధ్యేయమని హిట్లర్ అన్నాడు.
ఇది జరిగిన తరువాత, హిట్లర్ తలబిరుసుగా స్వేచ్ఛా భారతదేశం ఎలా ఉండాలో చెప్పాడు. బ్రిటిష్ ప్రభావాన్ని తటస్థం చేయడం, రష్యా ఒత్తిడికి అడ్డుగా నిలవడం తూర్పు సరిహద్దు గురించి ఒకటి రెండు వందల ఏళ్ళు పట్టొచ్చని హిట్లర్ అభిప్రాయపడ్డాడు.
హిట్లర పై బోసు పెట్టుకున్న ఆశలన్నీ ఆ విధంగా ఏకైక సమావేశంలో పటాపంచలయ్యాయి. కనీసం కొద్ది నిమిషాలైనా ఏ ఒక్క విషయాన్ని గురించి కూడా హిట్లర్ తో చర్చించడం సాధ్యం కాదని బోసు చెప్పాడు. జర్మనీలో 14 మాసాలు పడిగాపులు కాచిన బోసు శ్రమ అంతా వృధా అయింది.
1942 సెప్టెంబరులో బోసు, ఎమిలీషెంకిల్ దంపతులకు కుమార్తె పుట్టింది. బెర్లిన్ లోని ఇండియా కేంద్రాన్ని ఎ.సి.ఎన్. నంబియార్ కు బోసు అప్పగించేశాడు. అప్పటికి ఆ కేంద్రంలో 25 మంది భారతీయులకి, 10 మంది జర్మన్ లు పనిచేస్తున్నారు.
1943 జనవరిలో ఎట్టకేలకు జపాన్-జర్మనీ మధ్య ఒప్పందం వలన బోసు ఒకే భారతీయ అనుచరుడు అబిద్ హసన్ తో పాటు కీవ్ హార్బరుకు చేరాడు. ఫిబ్రవరి 8 జర్మనీ సబ్ మెరైన్ యు-180 ఎక్కాడు. రిబ్బన్ ట్రాప్ వీడ్కోలు తంతి పంపాడు. జపాన్ వారు మడగాస్కర్ కు తమ సబ్ మెరైన్ ను పంపిస్తామన్నారు. ఏప్రిల్ 28న జర్మనీ సబ్ మెరైన్ నుంచి బోసును జపాన్ సబ్ మెరైన్ కు మార్చారు. అక్కడి నుండి బోసు మే 6కు సబంగ్ చేరారు.
1943 మే 16న బోసు టోక్యో విమానంలో వెళ్ళారు. ప్రముఖ రాజకీయ, సైనికాధిపతుల్ని కలిశారు. రాస్ బిహారి బోసు తక్షణమే బోసుకు ఉద్యమ నాయకత్వం అప్పగించారు. జపాన్ ప్రధాని టోజో జూన్ 10న 14న బోసును కలిశారు. బోసుతో సమావేశం టోజోకు బాగా నచ్చింది. ఇండియాకు అన్ని విధాలా తోడ్పడి బ్రిటిష్ వారిని పారద్రోలడానికి కృషి చేస్తామని జపాన్ పార్లమెంట్ డయట్ లో టోజో రెండు రోజుల అనంతరం ప్రకటించారు.
టోకియో రేడియో ద్వారా ప్రతిరోజు ప్రసారం చేయడానికి బోసుకు అనుమతిచ్చారు. సహాయ నిరాకరణోద్యమం సాయుధ పోరాటంగా ఇండియాలో మారాలని, భారతీయులు అగ్ని కణాలతో పునీతమైతేగాని స్వాతంత్ర్యానికి అర్హులుకారని బోసు అన్నారు.
1943 జులై 4న సింగపూర్ లో ఇండియా ఇండిపెండెంట్ లీగ్ అధ్యక్ష పదవిని బోసు అంగీకరించాడు. ఆగష్టు 26న పునర్వ్యవస్థీకరించిన అజాద్ హింద్ ఫౌజు నాయకత్వాన్ని స్వీకరించాడు. 1943 అక్టోబరు 21న స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని బోసు ప్రకటించాడు.
జర్మనీలో నిరాశానిస్పృహలుచెంది, అవమానాలకు గురై, జాప్యానికి విసుక్కొన్న బోసు అక్కడ సైన్యాన్ని సమకూర్చడంలోనూ, నచ్చజెప్పడంలోనూ విఫలుడయ్యాడు.
అయితే చాలామంది భ్రమలో ఉన్నట్లు అజాద్ హింద్ ఫౌజును సుభాస్ చంద్రబోసు స్థాపించలేదు. ఆయన జర్మనీలో ఉండగానే ఆజాద్ హింద్ ఫౌజు ఆసియాలో స్థాపితమైంది. అక్కడ 25 లక్షలకు పైగా భారతీయులు నివసిస్తుండేవారు. జపాను బందీగా 55 వేల మంది భారతీయ సైనికులున్నారు. బ్రిటిష్ వారు ఓడిపోవడం, ఇండియాకు దగ్గరగా మలయా, బర్మా ఉండటం కూడా కలసివచ్చింది. 1942 వేసవి వరకూ భారత సైనికులను గూఢచారి పనులకు, ప్రచారానికి మాత్రమే జపాన్ ప్రయోగించింది. క్విట్ ఇండియా ఉద్యమంలో అజాద్ హిందుఫౌజు స్థాపనకు ప్రోత్సహం లభించింది. రామస్వరూప్ ముఠాను, అమర్ సింగ్ ముఠాను, సంఘటితపరచి, కెప్టెన్ మన్ మోహన్ సింగ్ ఆధ్వర్యాన ఫౌజు ఏర్పరచడానికి జపాను సిద్ధపడింది.
1942 ఆగస్టులో 40 వేల మంది భారత ఖైదీలు అజాద్ హింద్ ఫౌజులో చేరడానికి సంసిద్ధత వ్యక్తపరచారు. ఇందులో సైనికాధికారుల బెదరింపుల వలన, చిత్రహింసల వలన చేరారు. సెప్టెంబర్ నాటికి పదహారు వేల మూడు వందల మందితో ప్రథమ అజాద్ హింద్ ఫౌజు ఏర్పడింది. మోహన్ సింగ్ మాజీ సైనికాధికారి. ఆయన విజ్ఞప్తికి చాలా మంది ఉద్విగ్నులయ్యారు. జాతీయవాదం, బ్రిటిష్ వారి ఓటమి, తాను నాయకత్వం వహించడం ఫౌజు ఏర్పడడానికి తోడ్పడినట్లు మోహన్ సింగ్ చెప్పాడు.







మోసపోయిన సుభాష్
లాహోర్ లో రహమత్ ఇచ్చిన సమాచారం బ్రిటిష్ వారికి ఎంతో ఉపయోగపడింది. సోవియట్ రష్యా రికార్డ్ లలో ఇతడిని గురించి ఏమున్నదో బయటపడితే గాని మరికొన్ని సత్యాలు తెలియవు. ఏమైన రహమత్ మొదటి నుండి సౌవియట్ రష్యాకు విధేయుడుగా ఉంటూ బోసుకు నమ్మకద్రోహం చేశాడు.
1943లో రష్యావారు కాబూల్ లోని జర్మన్ వాణిజ్యాధికారి రస్మస్ ను, ఇతరులను ఇరకాటానబెట్టి వారి రహస్య చర్యలను బట్టబయలు చేస్తామనే సరికి, వారంతా తెల్లబోయి రహమత్ ఖాన్ పేరు చెప్పారు. అయినా ఈ విషయం బైటకు పొక్కితే జర్మనీలో తమ బాధలను గుర్తు తెచ్చుకొని కాబూలులో జర్మనీలు రహమత్ జోలికి పోలేదు. ఇలాంటి వ్యక్తిని నమ్మి సుభాస్ ఎలా మోసపోయోడో చెప్పనక్కరలేదు.
అజాద్ హింద్ ఫౌజు
రద్దయిన ఆజాద్ హింద్ ఫౌజుకు బోసు మళ్ళీ జీవం పోసి 20 వేలకు పెంచాడు. ఝాన్సీరాణి పేరిట స్త్రీల దళాన్ని ఒకటి ఏర్పరచాడు. 10 వేల మందితో కూడిన మరో మూడు దళాల్ని ఏర్పరచాలనే కోర్కె కాగితంపై నిలిచిపోయింది.
1943 అక్టోబర్ లో తాత్కాలిక స్వేచ్ఛా భారత ప్రభుత్వాన్ని సుభాస్ ప్రకటించాడు. రాష్ట్రపతి, ప్రధాని, యుద్ధ మంత్రి, విదేశాంగ మంత్రిగా తన పేరును బోసు ప్రకటించుకున్నాడు. ఉద్యమ నేతగా తనను ఇక ముందు నేతాజీ అని పిలవాలన్నాడు. సైనిక యూనిఫారం వేసుకున్నాడు.
1943 నవంబరులో అండమాన్, నికొబార్ దీవులకు బోసు తాత్కాలిక ప్రభుత్వాన్ని అప్పగించి పెత్తనమంతా తమ సైనాధ్యిపత్యం క్రింద జపాన్ అట్టిపెట్టింది. అజాద్ హింద్ ఫౌజులో నిర్బంధించిన 4 వేల మందిని, వారి నాయకులను, ముఖ్యంగా బోసు నాయకత్వాన్ని తొలుత నుండి కోరిన మోహన్ సింగ్ ను విడిపించడానికి సుభాస్ కించిత్తు ప్రయత్నం చేయలేదు. జర్మనీలో ప్రతి భారతీయ ఖైదీని కాపాడడానికి బోసు ప్రయత్నించాడు.
బోసు ఓటమి
1943 డిసెంబరులో బోసు వెళ్ళి మోహన్ సింగ్ ను జైలులో చూచి చర్చలు జరిపారు. బోసు సరైన వ్యక్తి అయినప్పటికి తగిన సమయం, తగిన సాధన లేదన్నాడు. సింగ్ అజాద్ హింద్ ఫౌజుకు తగిన సాధనా సామగ్రి లేదని బోసు అంగీకరిస్తూనే, తన “ఛలో ఢిల్లీ” నినాదానికి దేశంలోని సైన్యమంతా బ్రిటిష్ వారిపై తిరగబడి, తనను అనుసరిస్తారన్నాడు. మోహన్ సింగ్ సైన్యం నుంచి వచ్చిన వ్యక్తి. బోసు ఆత్మ విశ్వాసం పట్ల అతను దిగ్భ్రమచెంది, పట్టుబడిన సైనికులందరినీ బ్రిటిష్ వ్యతిరేకులుగా చేయడంలో విఫలమైన విషయం గుర్తుచేశాడు. జర్మనీలో బోసు వైఫల్యంతో తిరిగి వచ్చినవాడే. ఇండియాలో జనంగాని సైన్యం యావత్తు, గాని బ్రిటిష్ వారిపై తిరగబడతారనేది మిధ్య అంటూ, జపానుకు వ్యతిరేకంగా వాతారవరణం ప్రబలిందని మోహన్ సింగ్ చెప్పాడు. బ్రిటిష్ వారిని సరైన సమయంలో కొట్టే అవకాశాన్ని జారవిడచిన రీత్యా, బోసు సాహసం కేవలం చెలగాటమవుతుందని హెచ్చరించాడు. బోసుకు మోహన్ సింగ్ వాస్తవిక ధోరణి నచ్చలేదు. 1943 వేసవిలో అజాద్ హింద్ ఫౌజు భారత భూభాగంపై అడుగుపెడుతుందని బోసు సైన్యాలతో చెప్పాడు. జపాను వారు కూడా ఇది విని ఆశ్చర్యపోయారు. జపాను దాడిలో 6 వేల మంది అజాద్ హింద్ ఫౌజును జపాను అనుమతించింది. అది కూడా యుద్ధరంగంలో కాదు. జపాను సైన్యాలకు అండగా సరఫరాలు అందించే ద్వితీయ శ్రేణి ఫౌజుగా అనుమతించారు. ఇంఫాల్ పై దాడిలో జపాను సైన్యాలు చింద్విన్ నదిని దాటారు. అజాద్ హింద్ ఫౌజుకు షా నవాజ్ ఖాన్ ఆధ్వర్యం వహించగా, మరికొందరు ఫౌజులో గూఢచారులుగా దేశంలో ప్రచారానికి వినియోగించబడ్డారు.
పర్వత ప్రాంతాలుగా భారీ వర్షాలవలన దార్లన్నీ కొట్టుకుపోగా, జపాను సైన్యాలకు ఆహారం, ఆయుధాలు సరఫరా కాలేదు. అజాద్ హింద్ ఫౌజువారు స్థానిక గిరిజనులపట్ల క్రూరంగా, అమానుషంగా ప్రవర్తించి వారి ఆగ్రహానికి గురైనారు. ఫౌజులో చాలా మంది లొంగిపోయారు. కొందరు సైన్యం వదలి పారిపోయారు. 2,20,000 ల జపాను సైన్యంలో బ్రతికిబయటపడిన వారు 1,30,000 మాత్రమే. అజాద్ హింద్ ఫౌజులో బ్రతికిన 2,600 మందిలో 2,000 మంది ఆస్పత్రి పాలైనారు. 715 మంది సైన్యం వదలిపోగా 800 మంది లొంగిపోగా, చనిపోయినవారు 400 మంది. పదిహేను వందల మంది రోగాలతో, ఆకలితో అలమటించి చనిపోయారు. అజాద్ హింద్ ఫౌజు ఎత్తుగడలు, ఎదురుదెబ్బతీసే ధోరణి లోపించిందని జపాను సైన్యాధిపతి పూజివారీ వ్యాఖ్యానించాడు. ఇదంతా 1944 వర్షాకాలంలో జరిగింది.
బోసు దశాలలో దిగజారుడుతనం ప్రబలింది. ఇంఫాల్ లో ఏమీ జరగనట్లే బోసు ఇంకా ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాడు. బ్రిటిష్ సైన్యాలకంటే అజాద్ హిందు ఫౌజు గొప్పదని ప్రసంగాలు చేశాడు. ఫౌజును ఇంకా విస్తరించి శిక్షణ ఇవ్వాలని, జపాను సైన్యం కాడికింద పారేసినా ఫౌజు పోరాటం సాగించాలని బోసు ఆవేశంతో మాట్లాడేవాడు. బ్రిటిష్ వారిపై పోరాటంలో సోవియట్ సహాయం స్వీకరించాలనే ధోరణి బోసుకు ఆఖరు క్షణాలవరకు అంటే పెట్టుకునే ఉన్నది.
జపానువారు ఫౌజులోని వారు బోసుకు నచ్చజెప్పి ఆయన్ను మంచూరియా ప్రయాణానికి సన్నద్ధం చేశారు. అక్కడకు సోవియట్లువస్తే వారికి నచ్చజెప్పి, సహాయం స్వీకరించాలని బోసు ఆశ. కాని 1945 ఆగష్టు 18న తైవాన్ లోని తైహూకూవద్ద విమాన ప్రమాణ ప్రమాదంలో బోసు దుర్మరణం చెందాడు. ఆకర్షణీయమైన ఉద్రేక పూరితమైన దేశభక్తుడు బోసు అలా అంతమయ్యాడు.
జపాను వారు ఇండియాపట్ల ఏం చేయదలచిందీ బోసుకు ఎన్నడూ చెప్పలేదు. ఆయన్ను వాడుకోవడమనేదే జపాను ఎత్తుగడ. ఉద్రేకంలో, ఉద్వేగంలో ఉన్న బోసు జపానువారి ప్రోత్సాహాన్ని అపార్థం చేసుకున్నారు. జర్మనీవలె ఇండియా స్వాతంత్ర్యం కొరకు జపాన్ తో బోసు పట్టుబట్టలేదు. ఇదీ చరిత్ర. దీనిని నిష్పాక్షికంగా అవగాహన చేసుకోవడం ముఖ్యం.
సుభాస్ చంద్రబోసు పట్ల మనదేశంలో వీరావేశ అభిమానులు ఎందరో ఉండేవారు. వారందరూ ఫాసిజం, నాజీయిజం, జపాను సామ్రాజ్యవాదం పట్ల నిరసన వ్యక్తం చేయలేకపోయారు. ఇందుకు బోసు కారణం. జర్మన్ లు ఆర్యులన్నట్లే, మనమూ ఆర్య జాతివారమనే ఆహంభావం బోసుతోబాటు వీరూ పెంచుకున్నారు. ముందు చూపులేని యీ సంకుచిత జాతీయ భావం వలన, బోసు మనదేశంలో పునర్వికాసానికి ఏమాత్రం దోహదం చేయలేకపోయారు.

Thursday, May 15, 2008

సాహితీపరులతో సరసాలు-22

దేవులపల్లి కృష్ణశాస్త్రి
(1897-1980)




శబ్ద శిల్పి కృష్ణశాస్త్రి. చెవికి యింపుగా లేని పదం తొలగించి మళ్ళీ తగిన పదం లభించే వరకూ పూరించే వాడు కాదు. ఆయన పోగారి.
‘మల్లీశ్వరి’ నుండి ‘వుండమ్మా బొట్టుపెడతా’ వరకూ కృష్ణశాస్త్రి రాసిన పాటలు అనితర సాధ్యాలు. ఒకసారి ఉండమ్మా బొట్టుపెడతా సినిమాకు రాయాల్సిన చివరి పాట ఎన్నాళ్ళకూ పూర్తి చేయలేదు. ప్రొడ్యూసర్లు కలవరం చెందారు. చివరకు గుమ్మడి వెంకటేశ్వర రావును రాయబారం పంపారు. అప్పటికే గొంతు పోయిన కృష్ణశాస్త్రి విషయం గ్రహించారు. గుమ్మడికి ఒకచీటే మీద రాసిచూపారు. ఏమని?
నిజలింగప్పకు ఆరోగ్యంగా లేదు నయం కాగానే రాస్తాను అని.
ఆ మాటే గుమ్మడి వెళ్ళి ప్రోడ్యూసర్లకు చెబితే, ఎక్కడో కర్నాటక ముఖ్యమంత్రి నిజ లింగప్పకు ఆరోగ్యం బాగా లేకుంటే, పాట పూర్తి చేయడానికీ దానికీ ఏమిటి సంబంధం అన్నారు. గుమ్మడి గుట్టు విప్పి, చెప్పాడు. గురువు గారి ఉద్దేశం-నిజ లింగప్ప అంటే, తన లింగానికి అని గ్రహించమన్నారు. అందరూ విరగబడినవ్వారు.
కృష్ణశాస్త్రి అబద్దాలలో బ్రతికాడని గోరాశాస్త్రి అన్నారు. ఆయన్ను దగ్గరగా చాలా కాలం చూచిన వాడు గనుక అలా అనగలిగాడు.
బ్రహ్మ సమాజ ప్రభావితుడైన కృష్ణశాస్త్రి, 1936లో పిఠాపురం రాజా కొలువులో వున్నారు. జస్టిస్ పార్టీ నుండి చీలి సొంత పార్టీ పెట్టిన రాజా కాంగ్రెస్ పై పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కృష్ణశాస్త్రి జన రంజకంగా పిట్ట కథలు చెప్పి, కనుక రాజావారికి ఓ టెయ్యండనేవారు. చివరలో జనం గొల్లున నవ్వేవారు. రాజావారు ఓడిపోయారు.
కృష్ణశాస్త్రి చాటువులు కూడా రాశారు. అవి చదివి వినిపించారే గాని ప్రచురించలేదు. అంతశృంగారం జనం తట్టుకోలేరనుకున్నారేమో.
మద్రాసులో డి. ఆంజనేయులుగారు, సికింద్రాబాద్ లో గోరా శాస్త్రి గారు నన్ను తీసుకెళ్ళి కృష్ణశాస్త్రికి పరిచయం చేశారు.
కృష్ణశాస్త్రి కవితలు, వచన రచనలు చదివాను. ఆయన సినిమా పాటలు ప్రత్యేక ఆకర్షణ.
జరుకే శాస్త్రి (జలసూత్రం రుక్మిణీ నాధశాస్త్రి) పేర డీలలో కృష్ణశాస్త్రిపై విసుర్లు వేశారు.



తెలుగు కవులలో ఒక మేజర్ గా కృష్ణశాస్త్రి నిలబడతారు. సీత, అనసూయ ఆయన మేనకోడళ్ళే. హైదరాబాద్ లో ఆదర్శనగర్ లో కృష్ణశాస్త్రి వుండగా తరచు కలిసే వాడిని.
ఒకసారి మామిడిపూడి వెంకట రంగయ్య గారి జన్మదినోత్సవం ఆంధ్ర మహిళా సభ (హైదరాబాద్)లో అతి ఘనంగా జరిపారు. నేనూ ఆ సభకు వెళ్ళాను. వెంకట రంగయ్య గారితో నాకు సన్నిహిత పరిచయం వుంది. నేనూ ఆయనా కలసి ఆంధ్రలో స్వాతంత్ర సమరం గ్రంధం రాస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించింది. సన్మానం జరుగుతుండగా కార్యక్రమంలో లేకున్నా, హఠాత్తుగా కృష్ణ శాస్త్రి రంగ ప్రవేశం చేశారు.
గురుపూజ అంటూ కాళ్ళకు నమస్కరించి, శాలువా కప్పి, సత్కరించారు. కాలేజీలో తనకు వెంకట రంగయ్య గారు టీచర్ అని చెప్పారు. ఇంటి కెళ్ళిన తరువాత వెంకట రంగయ్య గారు నాతో చెబుతూ, “వీడు నా శిష్యుడ్ని అంటాడు, నా గుర్తున్నంత వరకూ యితగాడికి నేను కాలేజీలో పాఠాలు చెప్పిన దాఖలాలు లేవన్నారు”. అందుకే గోరా శాస్త్రి వ్యాఖ్యానించారు. అబద్ధాలలో బ్రతుకుతాడు కృష్ణశాస్త్రి అని. శశాంక నేనూ కూడా కృష్ణశాస్త్రిని కలిశాం. దోషాలు, అబద్ధాలు ఎన్నివున్నా. కృష్ణశాస్త్రి కవిత్వం, పాటలు వేరేలోకానికి చెందినవి.
బ్రహ్మ సమాజ ప్రార్థనా సమావేశాలలో చివరగా ఏడవడం మరొక అంశం. కృష్ణశాస్త్రి ఏడిపించడమే గాక, ఏడుస్తాడుకూడా.
Imageryలో కృష్ణశాస్త్రి గొప్పవాడు. శివుడి తలపాగ వలెగంగ వున్నదనడం ఇతరులకు తట్టే అంశం కాదు. ఇలాంటివి ఆయన కవితల నిండా చూడొచ్చు.

కృష్ణశాస్త్రి బాధ లోకానికి బాధ అనే నానుడి కూడా వాడుకలోకి వచ్చింది. అలా ఏడిపించగలశక్తి ఆయనకే వుంది.
హైదరాబాద్ ఆలిండియా రేడియోలో కృష్ణశాస్త్రి, గోపీచంద్ పని చేస్తుండగా, ఇరువురూ నిందారో పణల పర్వంలో మునిగి తేలారు. అదొక కాంప్ వలె కొన్నాళ్ళు సాగింది. ఆహ్వానించదగిన విషయమేమీ కాదు.
పాలు నలుపు
పాల వెన్నెల నలుపు
శెట్టి గారింట్లో చందురుడే నలుపు
అని చాటువులు రాసిన కృష్ణశాస్త్రి, ఎంత ఘాటు ప్రేమయో అని భానుమతి పాడుతుంటే ఇంత లేటు వయస్సులోనా అని చమత్కరించాడు.



రచనలు :
కృష్ణ పక్షం, ఊర్వశి ప్రవాసము, మహతి, కన్నీరు, ఋగ్వేది, పల్లకీ, పుష్ప లాలికలు, శర్శిష్ఠ, అప్పుడు పుట్టి వుంటే, తిరుప్పావు, ధనుర్దాసు, గోదాదేవి, మేఘమాల, కవి పరంపర, పద చిత్రాలు, కవితా ప్రశస్తి.

Sunday, May 11, 2008

Book review-rare and unique







గాంధీజీ అధ్యయనంలో తవ్వేకొద్దీ నిత్య సత్యాలు










1. The year of the phoenix.

2. Dwija : A Prophet Unarmed,
( Arnold Hanniman, New Delhi)
- T.K. Mahadevan
Editor : Gandhi Marg (Quarterly)


పుస్తకాలు రాసింది సిసలైన గాంధీయుడు.పైగా పరిశోధకుడు. కనుక జాగ్రత్తగా చూడాలి.
గాంధీజీ గొప్ప స్వాతంత్ర పోరాట రధసారధి. సత్యాగ్రహాన్ని ఆయుధంగా స్వీకరించి, అహింసా పద్ధతిలో, అశేష ప్రజానీకాన్ని పోరాట రంగంలోకి దింపిన వ్యక్తి గాంధీజీ, దేశ స్వాతంత్ర విషయంలో రాజీపడకుండా పోరాడిన విశిష్ట నాయకుడు. చరిత్రలో గాంధీజీ ఆ విధంగా చిరస్మరణీయుడుగా నిలుస్తాడు. స్వాతంత్ర పోరాటంలో హిందూ ముస్లింలను కలుపుకురావాలని ఆకాంక్షించిన గాంధీజీ, మత సామరస్యతకై కృషి చేశారు. స్వాతంత్ర పోరాటాన్ని గ్రామాలలోకి తీసుకెళ్ళారు. మహిళల్ని ఉత్తేజపరచారు. ఎటు చూచినా దేశ స్వాతంత్ర పోరాట నాయకుడుగానే గాంధీజీ కనబడతారు. మంచి లక్ష్యానికి మంచి మార్గం అనుసరించాలని చెప్పిన వ్యక్తిగా గాంధీజీ ఆదర్శప్రాయుడే. అలాంటి గాంధీజీ తన జీవితమే సత్య పరిశోధనగా పేర్కొన్నారు. అందుకే జీవిత చరిత్ర రాశామన్నారు.
ముఖ్యంగా గాంధీజీ తొలిజీవితం, దక్షణాఫ్రికా రంగంలో ఆయన పాత్ర శాస్త్రీయ ఆధారాలలో అధ్యయనం చేయాలి. అప్పుడు గాని అసలు గాంధీ మనకు అర్థం కారు.
1922లోనే సంపూర్ణ స్వరాజ్యం వస్తుందన్న గాంధీజీ, కేవలం తన మనస్సాక్షికి దైవం చెబుతున్న దృష్ట్యా అలా ఘంటాపధంగా చెప్పగలుగుతున్నామన్నారు. కాని, శాస్త్రీయాధారాలతో మనస్సాక్షి మాటల్ని పరిశీలించలేదు. స్వాతంత్రం 1922లో రాలేదు. హిమాలయాలంతటి తప్పు చేశానన్నాడు గాంధీజీ. కాని.
గాంధీజీ తన తొలి జీవిత వాస్తవాలు లండన్ డైరీ పేరిట ఇంగ్లీషులో రాశారు. 20 సంవత్సరాలు జాగ్రత్తగా అట్టి పెట్టి 1909లో 120 పేజీల లండన్ డైరీని తన బంధువు ఛగన్ లాల్ కు అప్పగించారు గాంధీ కార్యదర్శిగా సేవలు చేసిన మహదేవ దేశాయికి 1920లో అవి చేరాయి, ఉత్తరోత్తరా అది ప్యారీలాల్ కు చేరిందో లేదో తెలియదు. కాని, గాంధీజీ స్వయంగా నోట్ పుస్తకాలలో ఇంగ్లీషులో నిర్మొహమాటంగా రాసిన నిజాలు అదృశ్యమయ్యాయి కేవలం 20 పేజీలు అట్టిపెట్టి గాంధీజీ శీలాన్ని కాపాడదలచిన భక్తులు, మిగిలిన లండన్ డైరీని నామరూపాలు లేకుండా చేశారు. ఎందుకిలా జరిగింది? లండన్ లో విద్యార్థి జీవితాన్ని యధాతధంగా గాంధీ రాస్తే, భక్తులకు షాక్ కొట్టి అదంతా బయటకొస్తే కొంప మునుగుతుందని, రచన కనబడకుండా చేసి తృప్తిపడ్డారు! గాంధీజీకి సంబంధించిన నిజాలు నాశనం చేయడంలో ఆయన శిష్యులు ఎప్పటికప్పుడు తగిన పాత్ర వహిస్తూనే వున్నారు. మహాత్మగాంధీ రచనల సంపుటాలలో ఇట్లాగే కొన్ని వాస్తవాలను 1938లో నాశనం చేస్తే, గాంధీజీకి తెలిసి కూడా వూరుకున్నారు.
లండన్ డైరీలో మిగిలిన 20 పేజీల ఆధారంగా లండన్ ప్రయాణం గురించి కొన్ని వివరాలు లభిస్తున్నాయి. దక్షిణాఫ్రికా గురించి 30 ఏళ్ళ తరువాత జ్ఞాపకం వున్నంతవరకూ గాంధీజీ రాస్తే, అదే మిగిలిన వారికి ఆధారమైంది.










గాంధీజీ జీవితంలో మలుపుతిప్పిన సంఘటన 1893లో దక్షిణాఫ్రికా వెళ్ళడమే, అక్కడ ప్లీడరుగా ప్రాక్టీసు పెట్టి, సంపాదించుకోవాలని, ఇండియాలో అలాంటి అవకాశం లేదని గాంధీజీ భావించి ప్రయాణం కట్టారు. కాని, ఆ విషయం దాచిపెట్టి, 1983 ప్రయాణం గురించి పట్టీపట్టనట్లు రాశారు. ఇండియాలో పొందిన వైఫల్యానికి బదులు, దక్షిణాఫ్రికాలో పట్టుబట్టి సాధించాలని గాంధీజీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే సాధించారుకూడా. కాని ఆ విషయం తన రచనలో దాచారు. దక్షిణాఫ్రికాలో గాంధీజీ జీవితంలో ఎంత మలుపు తిప్పిందో, అంతగా ఆ విషయాన్ని ఆయన దాచారు. దాదా అబ్దుల్లా కేసు కోసమే ఆయన దక్షిణాఫ్రికా వెళ్ళలేదు. వెళ్ళి అక్కడ పట్టంగట్టి, ప్లీడరీగా కుదురుకోవాలనే నిశ్చయంతోనే వెళ్ళారు. అది సాధించారు కూడా.
గాంధీ జీవిత రచన చేసిన ప్యారీలాల్, దక్షిణాఫ్రికాలో గాంధీజీ వెళ్ళకముందు జాతి విచక్షణ పట్టించుకున్నవారే లేరని మనల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. కాని అప్పటికే ప్రిటోరియాలో సి.ఎం. పిళ్ళె, కింబర్లీలో దొరస్వామి పిళ్ళె, ఎ.ఒ. అల్లె వున్నారన్న సంగతి ఆయన పరిశోధించనే లేదు. మునుస్వామి అనే మరొ వ్యక్తి కూడా యధాశక్తి జాతి విచక్షణకు వ్యతిరేకంగా, తమ హక్కుల కోసం పోరాడిన వారిలో వున్నారు. ఇదంతా గాంధీయులు దాచారు. గాంధీ కూడా దాచాడు. అదే బాధ, దక్షిణాఫ్రికాకు కేవలం కేసునిమిత్తం వెళ్ళివుంటే, అది పూర్తికాగానే గాంధీజీ వచ్చివుండేవారు. ఆయనకు వీడ్కోలు సభ కూడా జరిగింది. అయినా గాంధీజీ అక్కడ వుండాలని భావించినందున, అందుకు తగిన పోరాట కారణాలు కూడా ఆయనకు లభించాయి. అలా చెబితే బాగుండేది. సత్యం కోసమే పుట్టినట్లు చెప్పిన గాంధీ, యీ విషయాన్ని దాచనక్కరలేదు, పైగా భారతీయులు సంతోషించేవారు. గాంధీజీ అబద్ధాలతో దక్షిణాఫ్రికాలో కొనసాగడానికి, భారతీయుల పక్షాన ఒక విజ్ఞాపన పత్రం సిద్ధం చేశారు. కొందరి సంతకాలు సేకరించారు. భారతీయులకు ఓటు హక్కు నిరాకరించే బిల్లును వ్యతిరేకించడానికి ఉద్యమించారు. అదంతా బాగానే వుంది, కాని స్వీయ చరిత్రలో, ఓటు హక్కు బిల్లు గురించి తనకు తెలియనే తెలియదని గాంధీజీ పచ్చి అబద్ధం ఆడారు. సత్యశోధనకై అంకితమైన వ్యక్తి అలా ఎందుకు చేశారు?
దక్షిణాఫ్రికాలో వుండదలచలేదు గనుక, వచ్చినపని పూర్తి అయింది గనుక, ఇండియాకు వెళ్ళదలచానని గాంధీజీ రాశారు. ఇది కూడా దారుణ అబద్ధం. ప్రిటోరియాలో కేసు విషయం చూస్తూనే, మరోపక్క దక్షిణాఫ్రికా సాంఘిక రాజకీయ పరిస్థితిని గురించి నోట్స్ రాసుకున్నారు. నేటాల్ భారతీయుల నిమిత్తం, వారి ప్లీడరుగా అక్కడే వుండదలచి గాంధీజీ తన కృషి అంతా కేంద్రీకరించారు. నేను ఇండియా వెళ్ళాలనుకుంటే, దైవం మరో విధంగా తలచింది అని గాంధీ రాశారు. కాని గాంధీ చేసిన కృషి అంతా ఒక పధకం ప్రకారమేనని సాక్ష్యాధారాలు, ఆయన ఉపన్యాసాలు, భారతీయుల సమావేశాలు తెలుపుతున్నాయి.
దక్షిణాఫ్రికాలో వుండదలచిన గాంధీజీ కావాలని పార్లమెంటుకు దరఖాస్తు సమర్పించడంలో జాప్యం చేశాడు. సమయానికి దరఖాస్తు యిస్తే పార్లమెంటులో ఓటు హక్కు బిల్లు ఆగేదే, అప్పుడు గాంధీజీ చేసేది లేక, ఇండియా తిరిగి రావలసి వచ్చేది. అక్కడే వుండదలచి, జాప్యం చెయ్యాలని, బిల్లు వస్తుందని తెలిసి కూడా వూరకున్నాడు. భారతీయులకు ఓటు హక్కు వున్నట్లే, నేటాల్ భారతీయులకు వుండాలని గాంధీ తన స్వీయ గాధలలో రాశారు. 1890లో భారతీయులకు ఓటు హక్కు లేదని తెలిసీ గాంధీ అలా వ్రాశారంటే, దీనిపై వ్యాఖ్య పాఠకులకే వదలేస్తున్నాను. 1893 సంవత్సరం గాంధీ జీవితంలో పెద్ద మలుపు అని ఇంతకు ముందే పేర్కొన్నాం. అంతకుముందూ ఆ తరువాత ఓడ ప్రయాణాలు, అనుభవాలు క్షుణ్ణంగా పూసగుచ్చినట్లు రాసిన గాంధీ, 1893 ఓడ ప్రయాణం మాత్రం అంటీ అంటనట్లు రాశాడు. ఆయన జీవిత చరిత్ర పరిశోధకులు ఆ విషయం పట్టించుకోలేదు.
“గాంధీ మార్గ్” త్రైమాస పత్రిక సంపాదకుడు, గాంధేయ అధ్యయనంలో నిపుణుడు టి.కె. మహాదేవన్ ప్రత్యేక పరిశోధన చేస్తే అనేక నగ్న సత్యాలు బయటపడ్డాయి. వృత్తి రీత్యా తనకు సంబంధించిన విషయమై గాంధీ రహస్యంగా వ్యవహరించడం కద్దు గాంధీ తన జీవిత చరిత్రను గుజరాత్ లో రాసి, వారం వారం నవజీవన్ పత్రికకు పంపారు. 1922 నుండే జైలులో వుంటూ కేవలం జ్ఞాపకశక్తిపై ఆధారపడి గాంధీ రాశాడు. తన సత్య శోధన రచనలో చాలా తప్పులు దొర్లినట్లు మగన్ లాల్ గాంధీకి రాసిన లేఖలో అంగీకరించారు. కాని దక్షిణాఫ్రికాకు చెందిన విషయాలు రాసిన తరువాత గాంధీ ఎన్నడూ దిద్దలేదు. పుస్తక రూపంలో జీవిత చరిత్రను వేస్తున్నప్పుడు కూడా గాంధీ మళ్లీ దిద్దలేదు. కనుక, దొర్లిన దోషాలు అలాగే వున్నాయి. చరిత్రలు రాసిన గాంధేయులుగాని, అభిమానులుగాని ఆయన రచనలలో నిజానిజాలు పరిశీలించలేదు. గోవింద బాబు కొన్ని విషయాలు గాంధీ తన జీవిత చరిత్రలో ఎలా వదిలేసిందీ ప్రస్తావించగా, సత్యాన్వేషణకు రాశాకగాని, కార్యకర్తలకు ధృడపత్రాలివ్వడానికి కాదని గాంధీ యంగ్ ఇండియాలో బదులిచ్చారు (జనవరి 31-1929) గాంధీ తన సత్యశోధనలో కావాలని నిజాల్ని దాచేస్తే ఎవరేం చేస్తారు. దక్షిణాఫ్రికాలో తాను ప్లీడరుగా దాదా అబ్దుల్లా కేసు చేబట్టినా, అతడు దొంగ సరుకు రవాణా చేస్తుండేవాడనే సత్యాన్ని గాంధీజీ దాచేశారు. కాని తన కుటుంబ మిత్రుడైన రుస్తుంజీ మాత్రం దొంగ సరుకు రవాణాలో పట్టుబడ్డాడని రాశాడు ఆయన మీద ప్రేమతోనే అలా రాశానని, జీవితగాధ వున్నంతవరకు రుస్తుంజీ పేరు చిరస్తాయిగా వుండాలని తన ఉద్దేశమని, అందుకే ఇతరుల పేర్లు వదలేశానని, తన కుమారుడు మణిలాల్ అభ్యంతరానికి సమాధానమిచ్చారు (1928 జూలై 15).
వివేకానంద శిష్యురాలు నివేదితను కలసిన విషయమై గాంధీ ప్రస్తావనను వివరిస్తూ 1927 జులై మోడరన్ రివ్యూ విమర్శించగా, గాంధీ తప్పుడు కూడా కేవలం జ్ఞాపకశక్తిపై ఆధారపడి రాశానని, సత్యశోధనకై ఉద్దేశించాను గనుక మనస్సుపై పడిన ముద్ర దృష్ట్యానే యిది చూడాలన్నారు.
కేవలం జ్ఞాపక శక్తిపై ఆధారపడి సత్య శోధన చేస్తే వచ్చిన దోషాలు గాంధీ జీవితంలో యిన్నీ అన్నీ కాదు. అయితే 30 సంవత్సరాల తరువాత జీవిత చరిత్ర ధారావాహికంగా రాసినా, కొన్ని సంగతులు ఫోటో తీసినట్లే రాశారు. తన జీవిత చర్రిత ప్రభావం చాలా మందిపై వుంటుందని తెలిసిన గాంధీ నిజాలు చెప్పడంలో జాగ్రత్త వహిస్తే, సత్య శోధన బాగుండేది. ప్యారీలాల్, పెయిన్, హటన్ బాక్ తో సహా జీవిత చరిత్ర రాసిన వారంతా గాంధీ రాసిన దానినే యధాతధంగా మనకు చెప్పడం వలన, శాస్త్రీయ పరిశోధన జరగలేదని తేలింది. గాంధీ అబద్దాలు రాస్తే, ఆయన చరిత్ర కారులు అవే చిలక పలుకుల్లాగా మనకు తిప్పి చెప్పారు. దక్షిణాఫ్రికాలో గాంధీ వీడ్కోలు సమావేశం అందుకు మచ్చుతునక. గాంధీజీ తన సత్యశోధనలో తన బాల్య ముస్లిం మిత్రుడు షేక్ మెహతాబ్ గురించిన అనేక వాస్తవాలు వదలేశానన్నారు. వాళ్ళిద్దరి మధ్య స్వలింగ సంపర్క సంబంధం వుందని ఎరిక్ ఎరిక్ సన్ తన గాంధీస్ ట్రూత్ లో అంటాడు. షేక్ మెహతాబ్ చిన్నప్పటినుండే మిత్రుడుగా గాంధీచేత చేయించని పాపం అంటూ లేదు. చివరకు దక్షిణాఫ్రికాకు సైతం షేక్ మెహతాబ్ ను పిలిపించుకున్నాడు. అయినా సత్యశోధన రచనలో చాలా వాస్తవాలు వదలేశారు.
దక్షిణాఫ్రికాలో గాంధీజీ చాలా పరిశోధనలు చేశారు. ఆయన కీర్తి ఇండియాలో వ్యాపించింది. భారతీయుల కోసం పోరాడి, దెబ్బలుతిని, నిలిచిన ధైర్యశాలి గాంధీ. దక్షిణాఫ్రికా అనుభవాలే గాంధీని భారతదేశంలో నాయకుడిగా రూపొందించడానికి పునాదులు వేశాయి. దక్షిణాఫ్రికాలో తన భార్య కస్తూరిబాను ఒక దశలో ఇంట్లో నుంచి గెంటశాడు యువతతో టాల్ స్టాయ్ ఫాంలో పరిశోధనలు చేశాడు. చెరువులో స్నానాలు చేస్తున్న యువతీ యువకులు చిలిపి చేష్టలు చేయగా, వారిని నగ్నంగా నడిపించి, ఆడపిల్లల జుట్టు కత్తిరించిన పరిశోధన కూడా యిందులో ఒకటి. నలుగురు పిల్లలు పుట్టిన తరువాత, ఇక లైంగిక సంబంధం వద్దని ఒట్లు పెట్టుకున్నది కూడా దక్షిణాఫ్రికాలోనే. గాంధీ బాల్య వివాహం చేసుకొని, విపరీతంగా లైంగిక కార్యకలాపంలో మునిగి తేలిన విషయం విస్మరించరాదు. అది గ్రహిస్తే ఆయన పెళ్ళి అయిన వారికి బ్రహ్మచర్యం పాటించమని సలహా యివ్వడంలో విజ్ఞతను గమనించవచ్చు. లైంగిక వాంఛలు ఆగాయో లేదోనని వృద్ధాప్యంలో కూడా కలకత్తా-నౌఖాళిలో ఇద్దరు యువతుల మధ్య నగ్నంగా పడుకుంటే, ఆయన కార్యదర్శి నిర్మలకుమార్ బోసు అభ్యంతరపెట్టి రాజీనామా యిచ్చిన విషయం గుర్తుంచుకోవాలి.
గాంధీ జీవితంలో స్వాతంత్ర పోరాటం ఆయనకు గొప్పతనాన్ని తెచ్చి పెట్టింది. అంతవరకే స్వీకరించకుండా ఇతర విషయాలు కూడా ప్రభావితం చేయడంతో మనం పరిశీలించి, అర్హతలు గమనించవలసి వచ్చింది. గాంధీ అభిప్రాయాలు ఆయుర్వేదం మొదలు ఆవుల వరకూ అనేక అంశాలపై వున్నాయి. అవన్నీ సత్యశోధన అనలేం. గాంధీ సైన్స్ బొత్తిగా చదువుకోలేదు. శాస్త్రీయ ధోరణిలో చూస్తే గాంధీ భావాలు అసలే నిలబడవు. అశాస్త్రీయమైన భావాలు వదిలేద్దాం. బీహారులో భూకంపం వస్తే, ప్రజలు పాపం చేశారు గనుక దేవుడు ఆగ్రహించాడని గాంధీ ప్రకటించాడు. ఆయన సన్నిహిత అనుచరులై-పండిట్ నెహ్రూతో సహా యీ అశాస్త్రీయ ధోరణిని బాహాటంగా ఖండించారు. దేశీయ దుస్తులే ధరించాలంటూ, రవీంద్రనాథ్ ఠాగూర్ ను సిల్కుబట్టలు వదలేయమంటే ఆయన నిర్మొహమాటంగా నిరాకరించారు. దేవాలయాలపై బూతుబొమ్మలున్న చోట, తనకు పెత్తనం వుంటే కూలగొడతానని గాంధీ అంటే, ఖొజరాహో దేవాలయ శిల్ప సంపద అభినందించిన వారు నవ్వుకున్నారు (అగేహానంద భారతి) కనుక స్వాతంత్ర పోరాటం మినహా మిగిలిన విషయాలలో గాంధీ భావాలు అట్టే పట్టించుకుంటే మనం నవ్వులపాలవుతాం. రాజకీయాలలో మాత్రం గాంధీ గారి చిత్తశుద్ధిని కొన్ని సందర్భాలలో శంకించినవారు లేకపోలేదు. అది కూడా అషామాషీగా కాదు, ఆధారాలతోనే అందులో అంబేద్కర్ పేర్కొనదగిన వ్యక్తి, ఆయన అడిగిన ప్రశ్నలు, చూపిన ఆధారాలు తిరుగులేనివి. గాంధీజీ అబద్ధాలకు మరో నిదర్శనంగా యీ విషయాలు నేటికీ మనముందున్నాయి. అటు గాంధీని ఇటు అంబేద్కర్ ను ఒకే వేదికపై నిలబెట్టి పొగిడే రాజకీయ వాదులను విస్మరించి యీ విషయాలు పరిశీలించాలి. ఓట్ల కోసం పడే పాట్లు వున్నంతకాలం రాజకీయ వాదులు ఎవరినైనా వాడుకుంటారు. శాస్త్రీయ పరిశీలనకు వారు ప్రవర్తన అడ్డురాకూడదు.
గాంధీకి చరిత్రలో ఏ మేరకు గౌరవ స్థానం యివ్వాలి అనేది కూడా శాస్త్రీయ పరిశీలకులు నిర్ధారించాలి. స్వాతంత్ర పోరాటంలో ఆయనకు సముచిత స్థానం యివ్వడానికీ మిగిలిన విషయాలలో పాటించడానికీ తేడా గ్రహించాలి.

Thursday, May 8, 2008

సాహితి పరులతొ సరసాలు 21

Abburi Ramakrishna Rao

అబ్బూరి రామకృష్ణారావు
(1896-1979)
ఆంధ్ర చరిత్రలో ఒక ప్రధాన పాత్ర వహించిన కవి అబ్బూరి. స్టేజి స్పెషలిస్ట్ గా, కవిగా తెలిసిన వారు, ఆయన రాజకీయాలు గుర్తెరుగరు. కమ్యూనిస్టుగా జీవితం ఆరంభించిన అబ్బూరి, రాడికల్ హ్యూమనిస్ట్ గా మారి, చివరకు భక్తుడుగా మిగిలారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లైబ్రేరియన్ గా వుంటూ, స్టేజి గురించి శ్రద్ధ వహించారు. అప్పుడే విద్యార్థిగా ఆయన్ను చూచాను. నాడు వైస్ ఛాన్స లర్ గా వున్న కట్టమంచి రామలింగా రెడ్డికి సన్నిహితుడు అబ్బూరి. అబ్బూరి రామకృష్ణారావు తెనాలి నుండి వచ్చారు. ఆంధ్ర యూనివర్శిటీలో ప్రముఖంగా స్థానం సంపాదించారు.

కాంగ్రెస్ లో రాడికల్ పాత్ర చేబట్టిన ఎం.ఎన్. రాయ్ (మానవేంద్ర నాథరాయ్) పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆయన్ను ఎం. వి. శాస్త్రి ద్వారా ఆంధ్రకు రప్పించాడు. వైస్ ఛాన్సలర్ కు పరిచయం చేశాడు. ఎం.ఎన్. రాయ్ ను యూనివర్శిటీలో చేరమని సి.ఆర్. రెడ్డి చేసిన ఆహ్వానాన్ని, మర్యాదగా రాయ్ తృణీకరించాడు.

అబ్బూరి, కమ్యూనిస్టు కాంగ్రేస్ రాజకీయాలకు భిన్నంగా, రాడికల్ డెమొక్రటిక్ పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహకుడయ్యారు. 1940 నుండీ 1948 వరకూ ఆ బాధ్యతలు నిర్వహించి, ఎం.ఎన్. రాయ్ మానవ వాద కార్యక్రమాలు ఆంధ్రలో ప్రచారం చేశారు. ఆయనకు తోడుగా విజయనగరంలో తాతా దేవకీనందన్, శ్రీకాకుళం నెల్లిమర్లలో పెమ్మరాజు వెంకట్రావు, కాకినాడలో ములుకుట్ల వెంకటశాస్త్రి తెనాలి నుండి ఆవుల గోపాలకృష్ణ మూర్తి, త్రిపురనేని గోపీచంద్, గుత్తి కొండ నరహరి మరెందరో తోడ్పడ్డారు.
కన్యాశుల్కం మొదలు అనేక నాటకాలు స్టేజిపై నిర్దుష్టంగా ప్రదర్శింపజేసిన అబ్బూరి, మంచి కవి, రచయిత. హైదరాబాద్ లో చివరి దశలో స్ధిరపడ్డారు. ఆయన గురువు ఎం.ఎన్. రాయ్ చనిపోయినప్పుడు, 1954లో ఒక గేయం ఇంగ్లీషులో రాసి డెహ్రడూన్ సమాధిలో వుంచారు.
1966 నుండీ నాకు బాగా సన్నిహితంగా అబ్బూరిని చూచే అవకాశం కలిగింది. ఆలపాటి రవీంద్రనాధ్ నేనూ చాలా సార్లు ఆయన్ను ఇంటి నుంచి సికింద్రాబాద్ సైలింగ్ క్లబ్బుకు తీసుకు వచ్చి, రెండు పెగ్గుల అనంతరం, ఆయన కబుర్లు విని ఎంతో సంతోషించేవాళ్లం.
ఆరోగ్యరీత్యా ఆయన డ్రింక్స్ మానేస్తే మంచిదని డాక్టర్ చెప్పారట. ఆయన భార్య యింట్లోనిష్ఠగా ఆహార పానీయాలు కంట్రోల్ చేసింది. అది భరించలేక మాకు ఫోను చేసేవారు వెళ్ళి, ఆయన భార్యకు హామీ యిచ్చి, బయటకు తీసుకెళ్ళేవాళ్ళం. అదొక పెద్ద అనుభవం.
ఆయన చివరిసారిగా పాల్గొన్న హేతువాద సభ హైదరాబాద్ లో 1970 ప్రాంతాల్లో జరిగింది. మహారాష్ట్రలో వాయ్ WAI నుండి తర్క తీర్థ లక్ష్మణ శాస్త్రి జోషి వచ్చినప్పుడు సభ ఏర్పరచి, అబ్బూరిని పిలిచాం. అప్పటికే ఆయనలో బాగా వార్ధక్య లక్షణాలు వచ్చేశాయి. హేతువాదం సన్నగిల్లింది. ఆయన వాయిస్ రికార్టుచేశాం. అనుభవాలు చెప్పించాం. ఆ సమాచారాన్ని అబ్బూరి ఛాయాదేవి (ఆయన కోడలు) వాడారు.

ఒకసారి క్లబ్బులో చెప్పిన మాటలు యిలా వున్నాయి. జాబాలి కథ అబ్బూరి చెబుతూ, చదువు నేర్పమని గురువు దగ్గరకు వెడితే నీది ఏ కులం అని అడిగాడట. మా అమ్మను అడిగి చెబుతానని అతడు వెళ్ళాడట. మరునాడు వచ్చి, మా అమ్మ ఎన్నో యిళ్ళలో పనిచేసిందట. అప్పుడు గర్భం ధరించగా, నేను పుట్టానట. కనుక ఎవరికి పుట్టానో చెప్పజాలను అన్నదట. ఈ విషయం విని, నిజం చెప్పావు గనుక నీవు బ్రాహ్మణుడికే పుట్టి వుంటావని, గురువు చదువు చెప్పాడట. ఇలాంటి వ్యాఖ్యానాలు అబ్బూరి ఎన్నో చెప్పేవాడు.
1940 ప్రాంతాల్లో గాంధీని దుయ్యబడుతూ ఆవుల గోపాలకృష్ణ మూర్తి వ్యాసం రాస్తే, ఘాటైన విమర్శ భరించలేక, అబ్బూరి దానిపై ఎం.ఎన్. రాయ్ కి ఫిర్యాదు చేశాడు. కాని రాయ్ అది చదివి, ఆవులను ఏమీ అనలేక పోయాడు.
అబ్బూరికి వరద రాజేశ్వరరావు, గోపాలకృష్ణ అని యిరువురు కుమారులు. రాయ్ అనుచరులుగా వారూ వుండేవారు. ఒకసారి ఒక విదేశీ పండితుడు ఆంధ్ర యూనివర్శిటీకి వచ్చి, సి.ఆర్. రెడ్డి ఎక్కడ వుంటాడని అబ్బూరిని అడిగాడు. ఆంధ్ర యోని వర్శిటీలో అని నర్మ గర్భంగా జవాబు చెప్పాడట.
రచనలు : అభినవ కవితా ప్రశంస (వ్యాసం), సూర్యరాజు (కథలు), ఊహాగానం, నదీ సుందరి, మంగళ సూత్రం (నవల), త్రిశంకు (కావ్యం), చాటువులు. అనువాదాలు – రవీంద్ర రచనలు.

Thursday, May 1, 2008

సాహితి పరులతొ సరసాలు 20 Gora Sastri





1969 లొ కర్నూలులొ సన్మానం పి వి నరసిమ్హారావు ,మధ్యలొ గోరాశాస్త్రి సన్మానపత్రం చదువుతున్న సి.ధర్మారావు

జీరాలో ఓ కోబ్రా- గోరాశాస్త్రి
(1919-1982)
విప్లవ కవుల దిగంబర ఉద్యమాన్ని గోరాశాస్త్రి వెక్కిరించేవారు. వారి తొలి పుస్తకం హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద అర్ధరాత్రి ఒక రిక్షా కార్మికుడితో ప్రారంభించామన్నారు (1968). కాలిముద్ర ముఖచిత్రంగా వేశారు. అందరివలె ప్రారంభోత్సవం చేయరుగదా, మరి ఎలా విడుదల చేశారు. కార్మికుడి చేత పుస్తకంపై మూత్రం పోయించారా అని గోరా శాస్త్రి హేళన చేశారు. అది తట్టుకోలేని విప్లవ కవులు ఆయన్ను జీరాలో ఒక కోబ్రా వుందంటూ కవితలల్లారు. (సికింద్రాబాద్ లో జీరా ప్రాంతంలో ఆయన అద్దెకుండేవారు).

విజయవాడలో నాస్తిక నాయకుడు గోరా (గోపరాజు రామచంద్రరావు) ఆంధ్రభూమి సంపాదకుడు గోరాశాస్త్రి (గోవిందు రామశాస్త్రి) మధ్య గందరగోళ పడిన వారు లేకపోలేదు. గోరాశాస్త్రి సంపాదకీయాలు చదివి గోరాకు ఉత్తరాలు రాసిన వారు, గోరాశాస్త్రి నాస్తికుడను కొని తిడుతూ రాసిన లేఖలు లేకపోలేదు.
గోరాశాస్త్రి శ్రీకాకుళం జిల్లాలో పుట్టి, భద్రాచలం ప్రాంతంలో పెరిగి, అనేక చిల్లర మల్లర ఉద్యోగాలు చేసిన గ్రాడ్యుయేట్. చివరకు మద్రాసులో ఖాసా సుబ్బారావు అనుచరుడుగా తెలుగు స్వతంత్ర సంపాదకుడుగా కుదురుకున్నాడు. ఇంగ్లీషు స్వతంత్ర ఎడిటర్ ఖాసా. మద్రాసు మెయిల్ మాకు ప్రయబాంధవి అనే వాడు గోరా శాస్త్రి. ఆ రోజుల్లో మెయిల్ ద్వారా వ్యాసాలు, ఉత్తరాలు వచ్చేవి.
మద్రాసులో వున్నందున 1950 ప్రాంతాల్లో తెలుగు రచయితలు, కవులు, కళాకారులతో గోరాశాస్త్రికి సన్నిహిత సంబంధాలుండేవి. ఆలిండియా రేడియోలో ఆయన నాటికలు ప్రసారమయ్యాయి. ఆశఖరీదు అణా అనేది బాగా ప్రచారంలోకి వచ్చిన నాటిక. తెలుగు స్వతంత్ర పత్రిక మంచి పేరు పొందింది. ఎందరో కవుల్ని రచయితల్ని గోరాశాస్త్రి ప్రోత్సహించారు. అందులో పి. శ్రీదేవి రాసిన కాలాతీత వ్యక్తులు బహుళ ప్రచారంలోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత గోరాశాస్త్రి సికింద్రాబాద్ వచ్చారు. అక్కడే చివరిదాకా వున్నారు. తెలుగు స్వతంత్ర ఆగిపోయిన తరువాత, ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకుడయ్యారు. డక్కన్ క్రానికల్ అనుబంధంగా ఆ దిన పత్రిక వుండేది. గోరాశాస్త్రి చేబట్టిన తరువాత పత్రిక పుంజుకున్నది. డక్కన్ క్రానికల్ సంపాదకీయాలు కొంత కాలం గోరాశాస్త్రి రాశారు.
గోరా శాస్త్రి వద్ద పొత్తూరి వెంకటేశ్వరరావు, జి. వరదాచారి అసిస్టెంట్స్ గా పనిచేశారు.
నేను ఎన్.శూలపాణి పేరుతో ఆంధ్రభూమిలో అనేక వ్యాసాలు(1962-65) రాశాను. అప్పట్లో నేనెవరో గోరా శాస్త్రికి తెలియదు. 1966లో పరిచయం అయిన తరువాత, ఆంధ్రభూమిలో రాయడం మానేశాను. ఇరువురం కుటుంబ మిత్రులమయ్యాం. తన పాత స్మృతులు, అనుభవాలు నాతో చెప్పేవారు.
గోరాశాస్త్రి ద్వారా నాకు పరిచయమైన వారిలో ఇచ్చాపురపు జగన్నాధరావు, డా. పి. తిరుమల రావు, శశాంక, గోపాల చక్రవర్తి, రావి శాస్త్రి, వి. రమాదేవి, భాట్టం శ్రీరామమూర్తి పేర్కొన్న దగినవారు.
గోరా శాస్త్రి కమ్యూనిస్టు వ్యతిరేకి. కాని అనేక మంది కమ్యూనిస్టులు ఆయనకు సన్నిహితులు. సెట్టి ఈశ్వరరావు, శ్రీశ్రీ అందులో వున్నారు.
గోరా శాస్త్రి నేనూ చాలా తరచుగా కలుసుకుని, సాహిత్యం, రాజకీయాలు చర్చించేవారం. సి. ధర్మారావు వచ్చి చేరేవారు. గోరాశాస్త్రి నిత్య దరిద్రుడు. ఎప్పుడూ డబ్బు కరువే. పైగా జబ్బు మనిషి. విపరీతంగా టాబ్లెట్స్ మింగేవాడు. ఉపద్రష్ట కృష్ణమూర్తి అనే బిజినెస్ మిత్రుడు ఆయనకు ఆర్థిక సహాయం చేస్తుండేవాడు. మధ్యలో పి.వి. నరసింహారావు దగ్గరకు వెళ్ళేవాళ్ళం. ఆయన కొంత సహాయపడుతుండేవాడు.
డా. పి. తిరుమలరావు తన స్వీయ చరిత్ర రాసి గోరా శాస్త్రి చే దిద్దించుకున్నారు. జర్నలిస్ట్ సీతారాం, జి. కృష్ణ వంటి వారిని తరచుగా సంపాదకీయ రచనల నిమిత్తం చర్చించేవారు.
రామోజీరావు ఈనాడు పత్రిక పెట్టదలచి, అనేక మందిని సంప్రదించారు. గోరా శాస్త్రి, నేను కొన్ని సార్లు అబిడ్స్ లోని మార్గదర్శి ఆఫీసులో సాయంకాలాలు కూర్చొని చర్చించేవాళ్ళం. రామోజీరావు శ్రద్ధగా ఆలకించి, నోట్స్ కూడా రాసుకునేవారు. 1970 ప్రాంతాల మాట అది.
గోరా శాస్త్రి శాకాహారి. బాగా డ్రింక్స్ పుచ్చుకునేవారు. అందులో నేనూ భాగం పంచుకునేవాడిని. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు. సంసారం యీదడం కష్టంగానే వుండేది. ఆయనకు ఆర్థిక సహాయం చేసే నిమిత్తం షష్ఠి పూర్తి సంచిక వేసి, కర్నూలులో సన్మానం చేయించాం. కోట్ల విజయభాస్కర రెడ్డి నాడు జిల్లా పరిషత్ చైర్మన్. పి.వి. నరసింహారావు విద్యామంత్రిగా వచ్చారు. మండవ శ్రీరామమూర్తి పూనుకోగా గోరాశాస్త్రికి ఆర్థిక సహాయం కొంత చేయగలిగాం. సంచికలో కొందరు వ్యాసాలు వేశాం. నేను వివరంగా సంపాదకీయం రాశాను.
మద్రాసులో వుండగా గోరా శాస్త్రి అనేక మంది సాహితీ పరుల్ని కలిశారు. అందులో ఎన్ కౌంటర్ ఎడిటర్ స్టీ ఫెన్ స్పెండర్ ముఖ్యులు. గోరాశాస్త్రికి అతి సన్నిహిత మిత్రులు. కె. రామలక్ష్మి, ఆరుద్ర, హైదరాబాద్ లో వుంటున్న దేవులపల్లి కృష్ణశాస్త్రికి నన్ను పరిచయం చేశారు. కృష్ణశాస్త్రి పరిణామం, ఆయన అబద్ధాలలో బ్రతికిన తీరు ఆసక్తి కరంగా చెప్పేవారు. మద్రాసు నుండి వచ్చిన సాహితీ మిత్రులు గోరాశాస్త్రితో కాలక్షేపం చేసేవారు.
గోరా శాస్త్రితో సన్నిహితత్వం వలన అనేక విషయాలు తెలిశాయి.
రచనలు : ఆశ ఖరీదు అణా (నాటిక), ఆనంద నిలయం (నాటిక), దూరతీరాలు (నాటిక), సెలవుల్లో (నాటిక).