Wednesday, May 16, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -5

వికాసం

మల్లాది రామమూర్తి సంపాదకత్వాన వికాసం మాసపత్రిక విజయవాడలో ప్రారంభమై హైదరాబాద్ కు చేరుకున్నది. 1970 ప్రాంతాలలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో ముమ్మరంగా పాల్గొన్న అనంతరం రామమూర్తి పత్రిక వచ్చింది. ఆయన 1940 నుండే ఎం.ఎన్. రాయ్ అనుచరుడు. వృత్తిరీత్యా అడ్వొకేట్. బాపట్ల, చీరాల, విజయవాడ మీదుగా చివరి దశలో హైదరాబాదులో స్థిరపడ్డారు. పట్టుదలతో పత్రిక నడిపినా ఒక్క చేతిమీద అదేమంత సులభం కాదని గ్రహించారు.

వికాసం పత్రికకు నేను చాలా రెగ్యులర్ గా వ్యాసాలు రాశాను. కార్మికులే బూర్జువాలైతే అనేది చాలా ప్రత్యేకమైనది. పుస్తక సమీక్షలు, చర్చలు సాగాయి. ఎం.ఎన్.రాయ్ మానవ వాద సిద్ధాంతాలు తిరగ రాయాలనే అంశం పై నాకూ, రావిపూడి వెంకటాద్రికీ వాదోప వాదాలు వికాసంలో సాగాయి.

మానవ వాద హేతువాద సంఘాల వార్తలు కూడా వికాసంలో అందించారు. రాడికల్ హ్యూమనిస్ట్ సంఘానికి పత్రిక లేనిదశలో వికాసం ఉపకరించింది. రాను రాను వికాసం మార్కెటింగ్ లేక, సమయాన్వేషణ లోపించి, ఆగిపోయింది. ఆర్ధికంగా రామమూర్తిగారే అన్నీ చూసుకున్నారు. చివరకు ఆపేయక తప్పలేదు. పదేళ్ళ చరిత్ర ఉన్న వికాసం మాజీ పత్రికలలో చేరింది.


ప్రసారిత

తెలుగులో పోస్టుగ్యాడ్యుయేట్ స్థాయి వరకూ ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు తోడ్పడే నిమిత్తం ప్రసారిత పేరిట త్రైమాసిక పత్రిక పెట్టాం. పోలు సత్యనారాయణ నేను కలిసి చేసిన ఈ ప్రయత్నంలో ప్రొఫెసర్ కె. శేషాద్రి సలహాలు ఉన్నాయి. ప్రింటింగ్ లో ఆలపాటి రవీంద్రనాథ్ తోడ్పడ్డారు. రచనలు సేకరించడం పెద్ద పని అయింది. విదేశాల్లో ఉన్నత విద్యారంగ స్థాయి ఏ దశలో ఉందో ఆ స్థాయిలోనే తెలుగులో విషయం అందించాలని ఉద్దేశించాం. అనుసరణే తప్ప అనువాదాలు సాధ్యమైనంత వరకూ రాకుండా చూశాం. అయితే జి.రాంరెడ్డి వంటివారు ఇంగ్లీషులో ఇచ్చిన వాటిని సరళీకృత తెలుగు చేశాం. అయా విషయాలపై ప్రత్యేక సూచికలు చేశాం. 1972—75 మధ్యలో చేసిన ఈ ప్రయత్నం బాగానే ఉన్నా, ఆర్ధిక ఇబ్బందులు ఉండేవి. అలాగే విషయ సేకరణ కష్టాలుండేవి. ప్రకటనలు ఆట్టే లభించలేదు. పంచాయతీరాజ్, పార్టీల వ్యవస్థ, రాజకీయ పార్టీల చరిత్ర మొదలైన సంచికలు తరువాత పుస్తకాలుగా వచ్చాయి. బుక్ లింక్స్ కె.బి.సత్యనారాయణ తోడ్పడ్డారు. మామిడిపూడి వెంకట రంగయ్య రచనలు అందించారు. శేషాద్రి కె. బాగా ఉపకరించారు. సి. లక్ష్మన్న రాశారు. ప్రొఫెసర్ బి. రమేష్ బొంబాయి నుండి రాశారు.

1975లో నేను ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం ఒప్పుకున్నందున ప్రసారిత నుండి తప్పుకున్నాను. పోలు సత్యనారాయణ కొన్నేళ్ళు నడిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసర్చ్ వారి ఆర్ధిక సహాయం లభించినా పత్రిక ఆపేశారు. ప్రసారితలో మేము ప్రచురించిన నక్స్ లైట్ ఉద్యమ వ్యాసాన్ని భాస్కరరావు రాశారు. అది ప్రత్యేక ఆకర్షణ అయింది. లక్ష్మణ శాస్త్రి జోషి పుస్తకం హిందూఇజం - ఎ క్రిటిక్ తెలుగు సంక్షిప్త అనుసరణ, ఎరిక్ ప్రాం, ఎం.ఎన్.రాయ్ ల పై రచనలు, సంజీవదేవ్ రచనలు చాలా విశిష్టమైనవిగా నిలిచాయి. పత్రిక బౌండ్ వాల్యూంలు స్టేట్ ఆర్కెస్ లో ఉంచాను.

-వచ్చే వారం ఈనాడు తో నా అనుభవాలు

No comments: