Monday, August 6, 2007

నర హంతకులు -12

పుర్రెలతో ఆడుకున్న పోల్ పాట్




కంబోడియాలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కమ్యూనిస్టులు ముందే వేసుకున్న పధకం ప్రకారం, నరబలిని పెద్దయజ్ఞంగా చేశారు. 1975 ఏప్రిల్లో కంబోడియాలో కమ్యూనిస్టులు రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. రాజధాని నాంపేలో నివశిస్తున్న 30 లక్షల పౌరుల్ని గ్రామాలకు బలవంతంగా పంపారు. ఏప్రిల్ 17 ఉదయం 9 గంటలకు కమ్యూనిస్టు సేనలు తుపాకులతో పౌరులందరినీ విచక్షణా రహితంగా కొడుతూ, కాలుస్తూ రాజధాని చుట్టు ప్రక్కలవున్న అడవుల్లోకి మందలు మందలుగా తరిమి పంపించారు. ఆస్పత్రులలో వున్న రోగులతో సహా అందరినీ నిర్భంధంగా పంపేశారు. పుస్తకాలను, కాగితాలు, పత్రాలనీ తగులబెట్టి మెకాంగ్ నదిలో కలిపారు.
ఈ పధకాన్ని 1974 ఫిబ్రవరిలోనే కమ్యూనిస్టులు వన్నారు. సంపూర్ణ విప్లవం పేరుతో, పునర్నిర్మాణం చేయాలనే దృష్టితో సనాతన సామాజిక వ్యవస్థ పెకలించాలని ఆనాడు వేసిన పధకం పేర్కొన్నది. ఆ విధంగా హింసాకాండ చేశారు.
1975 ఏప్రిల్ 23న కంటోడియాలోని ఇతర చిన్న పట్టణాలలోని ప్రజలను ఆస్పత్రులలోని రోగులను చిత్రహింసలు పెట్టారు హాస్పిటల్స్ లో కదలలేని రోగులను చంపేశారు. అధికారులు ఊచకోతకోశారు. బిచ్చగాళ్ళను, పడుపుగత్తెలను మూకుమ్మడిగా చేర్చి కాల్చేశారు. కమ్యూనిస్టు స్ర్తీ సైనికులు స్ర్తీలను, పిల్లల్ని కాల్చేపని చేపట్టారు. నదులలో శవాలు తేలి ప్రవహించాయి, రక్తపు టేర్లు వాస్తవంగా పారాయి.
1875 జూన్ నాటికి నగరాలనుండి 35 లక్షల మందిని తరలించగా గ్రామాలనుండి 5 లక్షల మందిని వేళ్ళగొట్టారు. వీరందరిచేత నిర్భంధంగా పునర్నిర్మాణ కార్యక్రమాలు చేయించారు. దంపతులు ఎక్కువసేపు మాట్లాడితే, వాదించుకుంటున్నారనే నెపంతో చంపేశారు. ఉరితీతలన్నీ బహిరంగంగా వారి బంధువుల కళ్ళెదుట చేశారు. బడి పిల్లలచేత పంతుళ్లను ఉరితీయించారు. ఈ విధమైన నానారకాల హింసాకాండ హద్దులేకుండా కమ్యూనిస్టుల కంపూచియాలో సాగిపోయింది.
1975 ఏప్రిల్లో కంబోడియా రాజ్యాధిపతిగా కమ్యూనిస్టు మేధావి పోల్ పాట్ స్థానాన్ని ఆక్రమించాడు. ఈయన ఆధ్వర్యంలో జరిగిన హింస హత్యాకాండ వర్ణనాతీతం లెక్కకు వచ్చిన వాటిని బట్టి, లక్షమందిని ఉరితీశారు. బలవంతంగా ఖాళీ చేయించి అటూ యిటూ తిప్పి పని చేయించడంలో ప్రవాసులుగా 4 లక్షల మంది చనిపోయారు. శిబిరాలలో వివిధ రకాలుగా చనిపోయినవారు 4 లక్షలు. పారిపోతున్న వారిలో 20 వేల మందిని చంపారు. ఇదంతా 1975లో జరిగిన కాండ.



1975లో 2 లక్షల 50 వేలమందిని పోల్ పాట్ చంపించాడు. 1977లో కూడా యీ దారుణ హత్యాకాండ కొనసాగింది. మొత్తం దేశ జనాభాలో 5వ వంతు యీ విధంగా సంపూర్ణ విప్లవం కోసం, కమ్యూనిజం పేరిట పోల్ పాట్ హతమార్చాడు. వారి సంఖ్య వెరసి 12 లక్షలు.
కంబోడియాలో పోల్ పాట్ రాజ్యాన్ని అంతం చేయాలని వియత్నాం తలపెట్టింది. 1979 జనవరి 17న దండెత్తి రాజధాని వాంపేను పట్టుకున్నారు. ఒక నియంతృత్వం స్థానే మరో నియంతృత్వం వచ్చింది. రెండు లక్షల సైన్నాన్ని కంబోడియాలో దింపారు. సరిహద్దు కలహంగా 1978లో ప్రారంభమైనది కాస్తా ఈ విధంగా ఆక్రమణ క్రిందకు మారింది. కంపూచియాలో పోల్ పాట్ వ్యతిరేకంగా వున్న నేషనల్ యునైటేడ్ ఫ్రంట్ వియత్నాం కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పరచింది. మళ్ళీ వేలాది శరణార్దులు థాయ్ లాండ్కు పారిపోయారు. 1983 జనవరి 10న కమ్యూనిస్టు వ్యతిరేకులపై దాడిచేసి ఏరివేత కార్యక్రమంలో చాలా మందిని తుదముట్టించారు. సరిహద్దులలో వున్న శిబిరాలను పీకేసి, శరణార్ధులను చంపేశారు.
ఇదీ కంబోడియా కమ్యూనిజం సాధించింది.

నెమలి సింహాసన రాజ్యంలో మనుషుల వేట


నెమలి సింహాసనాన్ని అదిష్టించిన ఇరాన్ షా దేశాన్ని ఆధునీకరణం చేయడానికి అనేక నిరంకుశ పద్ధతులను అవలంభించాడు. శ్వేత విప్లవం తేవాలని కలలుగన్న షా, అతి త్వరగా, వేగంగా దేశాన్ని ఆధునీకరణం చేయాలని ప్రయత్నించాడు. విపరీతంగా ధనం ఖర్చు చేశాడు. పాశ్చాత్య విదానాలు అన్ని రంగాలలో ప్రవేశపెట్టాడు. యువకులకు విద్యార్ధులను రెచ్చగొట్టి, లాభాలను ఆర్జించే ఆక్రమ వ్యాపారస్తులను అరికట్టమన్నాడు. అలాంటి అవకాశం యిచ్చేసరికి యువకులు హింసాత్మక చర్యలకు దిగారు. మత గురువుల దగ్గర భూములు లాగేసి రైతులకు పంచాడు. అంతటితో ఆగక, ఇరాన్లో వ్యవసాయ రంగాన్ని సమిష్టి కరణ చేయాలని 1975లో ఉపక్రమించాడు. దేశ వ్యాప్తంగా 2800 సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు స్థాపించి, రైతుల భూముల్ని యీ సమిష్టి వ్యవసాయంలో షా, నిర్భంధంగా కలిపేశాడు. దేశంలో పెద్ద కుటుంబాలను విచ్ఛిన్నం చేసి, చిన్న గ్రామాలన్నీ పునర్వ్యవస్థీకరించి, చిన్నా భిన్నం చేశాడు. భూమిపై హక్కు రాజ్యానిధన్నాడు. ఈ విధంగా చేసేసరికి రైతులు అయిష్టంగా నిర్భంద వ్యవసాయంలో పాల్గొన్నారు. కాని యువకులు నగరాలలో ప్రవేశించి అయొతుల్లా ఖోమినీ మద్దత్తు దారులుగా ఆందోళనకు ఉపక్రమించారు. షా చాలా మందిని జైల్లో పెట్టి, చిత్ర హింసలకు గురిచేసినా, ఆందోళన పెరిగిందేకాని ఆగలేదు. చివరికి దేశం వదలిపోవలసిన గతి షాకు పట్టింది.
ఫ్రాన్స్ లో వుంటూ, ప్రవాస ప్రభుత్వాన్ని నడుపుతున్న అయొతుల్లా ఖొమినీ వచ్చి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇస్లాం మౌలిక వాదం పేరిట 1979 ఫిబ్రవరి నుండి ఖొమినీ చిత్ర హింసలు, నరమేధం ప్రారంభించాడు. అది ఇప్పటికీ కొనసాగుతూనే వున్నవి.
షా చేసిన ఆధునీకరణ అంతా మార్చేసి, స్ర్తీలను ముసుగులు వేసుకోమన్నారు. అల్లా శత్రువులనే పేరిట ఇస్లాం న్యాయస్థానాలలో మొదటి రెండేళ్ళలో ఖొమినీ 8 వేల మందిని చంపించాడు. అంతర్జాతీయంగా ఎందరు అభ్యంతరం పెట్టినా ఖొమినీ లెక్కచేయలేదు. షా హయాంలోని 23 సైనిక జనరల్స్ను 400 మంది సైనిక పోలీస్ అధికారులను, 800 మంది పాలనాధికారులను చంపేశారు. ఖొమినీకి వ్యతిరేకంగా వున్న మతాధిపతుల మద్దత్తుదారులలో 700 మందిని ఉరితీశారు. నామపక్షం వారిని 100 మందిని, ఉదారవాదుల్ని 500 మందిని చంపేశారు.
ఇరాన్లో అల్ప సంఖ్యాకులుగా వున్న ఖుర్దు జాతిలో వెయ్యిమందిని హతమార్చారు. 200 మంది టర్కోమస్స్ ను చంపారు. యూదులు, క్రైస్తవులు, షేక్ లు సాబియన్లు, షియా నిరసనవాదుల్ని సనాతన సున్నీలను అరమరికలు లేకుండా చంపారు. బహాయ్ అల్ప సంఖ్యాకులను చిత్రహింసలకు గురిచేశారు. ఖుర్ద్ కవి అల్లామియా వహిచి మొదలు 9 ఏళ్ళ బాలిక వరకు చంపడం ఖొమినీ రాజ్య ప్రత్యేకత, ఇరాన్ చేస్తున్న చిత్ర హింసలు సున్నీలపై పెరిగిపోగా, పొరుగు రాజ్యం ఇరాన్ యుద్ధానికి దిగింది. 3 సంవత్సరాలు ఈ యుద్ధం సాగింది. ఇరు దేశాలలో వందల వేల పౌరులు, సైనికులు నిరంతరం చనిపోయారు. ఇదంతా ఇస్లాం మౌలికవాదం పేరిట జరుగుతున్న దమనకాండే.

నర హంతకులు సమాప్తం.

1 comment:

mohanraokotari said...

sri sri desa charitralu gurthuku vasthundi, diiniki anthameppudu. ippudu america islamic countries lo ide chesthunnadi, israel ade chesthundi.