
డల్లాస్ లో ఆసక్తికరంగా నెల నెలా తెలుగు వెన్నెల
తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వారి తెలుగు సాహిత్య వేదిక నిర్వహించిన 21 వ "నెల నెలా తెలుగు వెన్నెల" కార్యక్రమం స్థానిక పసంద్ ఇండియన్ రెస్టారెంట్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 50 మంది సాహితీ ప్రియులు హాజరయ్యారు. ఈ సమావేశానికి ప్రముఖ రచయిత, జర్నలిస్ట్, మానవతావాది డాక్టర్ నరిశెట్టి ఇన్నయ్య గారు ముఖ్య అతిధి గా విచ్చేశారు. మొదట మురళీధర్ టెక్కలకోట గారు స్వీయ కవితలు చదివి వినిపించారు. తరువాత రమణ జువ్వాది గారు సిరివెన్నెల రాసిన ఉగాది కవితా గానం చేశారు. తదుపరి డాక్టర్ గన్నవరపు నరసింహ మూర్తి గారు చంధోబద్ధంగా రాసిన ఉగాది పద్యాలను చదివి వినిపించారు. తదుపరి చంద్ర కన్నెగంటి గారు తెలుగు భాషలోని కొన్ని ప్రత్యేక పదాలను విశదీకరించారు. కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అనంత్ మల్లవరపు ముఖ్య అతిధి డాక్టర్ నరిశెట్టి ఇన్నయ్య గారిని సభకు పరిచయం చేశారు. మొదట ఇన్నయ్య గారు “తెలుగు ప్రజల పునర్వికాసం-నేటి ఆవశ్యకత” అనే అంశంపై ప్రసంగించారు.. తదుపరి మూఢ విశ్వాసాలు, మత ఛాందసవాదం మానవ సమాజానికి, మానవత్వానికి కలుగజేసె హానిగురించి వివరించి, హేతుబద్దత, శాస్త్రీయ ధ్రృక్పదం అలవర్చుకోవలసిన అవసరాన్ని వివరించారు. తదుపరి హేతువాదం మీద వాడిగా వేడిగా సాగిన చర్చలో, సభికుల ప్రశ్నలకు సమాధానాలు తెలియచేశారు. ముఖ్య అతిధిని బిఓటి చైర్ రాం యలమంచిలి, సత్యం కల్యాణదుర్గ గారు శాలువతో సత్కరించగా, టాంటెక్స్ ప్రెసిడెంట్ శ్రీధర్ కొర్సపాటి గారు పుష్ప గుచ్చంతో , సాహితీ వేదిక కార్యవర్గం జ్ఞాపికతో సత్కరించారు. రావు కల్వల గారి వందన సమర్పనతో కార్యక్రమం ముగిసింది.
No comments:
Post a Comment