Monday, January 21, 2008

సాహితీపరులతో సరసాలు -4


Kondaveeti Venkatakavi

కొండవీటి వెంకటకవి
(1918-1991)

కొండవీటి వెంకటకవిలో కవి ఎప్పుడు వచ్చి చేరిందో గాని, అది పేరులో అంతర్భాగమైంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి. సంస్కృతంలో శిక్షణ పొందిన వాడు. పెళ్ళికాక పూర్వం అచల మతంలో దిగంబరిగా వూళ్ళు తిరిగినట్లు చెప్పారు. అది మోతాదు మించిన ఆధ్యాత్మిక రీతి...
1945 ప్రాంతాల్లో ఆంధ్రలో కమ్యూనిస్టుల ప్రాబల్యం బాగా వున్నప్పుడు జరిగిన ఆసక్తి కర సంఘటన ఒకటి, కొండవీటి వెంకట కవి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి స్టేషన్ సమీపంలో ఒక జమిందారు ప్రాంగణంలో జరిగిన ఘట్టం అది. ఆంధ్రలో వున్న అనేక మంది స్వాములు, బాబాలు, మాతల్ని అక్కడి జమిందారు పేరిట ఆహ్వానించారట. సన్మానిస్తామని, సత్కారాలు అందుకోమని ఆహ్వానంలో రాశారు. ఆ మేరకు వచ్చిన వారిలో కొండవీటి వెంకటకవి కూడా వున్నారు. చుట్టూ ప్రహరీ, ఒకటే గేటు. వేదిక ఏర్పరచి, సన్మానానికి వచ్చిన వారిని కూర్చోబెట్టి కార్యక్రమం ఆరంభించారట. ఒకరు సన్మాన పత్రం చదవడం, మరొకరు సన్మానించడం. అదీ కార్యక్రమం. సన్మాన పత్రంలో అంశాలు వింటుంటే చెమటలు పట్టి బ్రతుకుజీవుడా ఎప్పుడు బయట పడతామా అని అనుకున్నారట.
ఆనాడు కమ్యూనిస్టులు ఒక్కొక్క బాబాగురించి వివరాలు తెప్పించి, వాస్తవాలే సన్మాన పత్రంగా సమర్పించారట. ఏ బాబా ఎలాంటి వాడు, ఆయన పూర్వాపరాలు ఏమిటి. సెక్స్ జీవితం, అవినీతి యిత్యాదులన్నీ బయటపెడుతూ పోయారట. తరువాత బెత్తాలతో బాదడం. అదీ కార్యక్రమం. బయటకు పారిపోడానికి వీల్లేదు. కనుక అందరూ గౌరవాన్ని అందుకున్నారట.
ఆ దెబ్బతో కొండవీటి వెంకటకవికి ఆధ్యాత్మికత వదలి పోయిందట. సాయంత్రానికి దగ్గరలో వున్న స్టేషన్ లో రైలెక్కి ఎవరి దారిన వారు పోయారట. కొండవీటి వెంకటకవి యీ స్వానుభవాన్ని చెప్పినవ్వించారు. ఇది రాయవచ్చా అని అడిగితే, నిక్షేపంగా రాయమన్నారు. నేను దీనిని సమీక్ష, ఈనాడు, ఉదయంలో రాశాను. అది సరే.
కొండవీటి వెంకటకవి తనను లక్షాధికారిగా చెప్పుకుంటూ, కోటేశ్వరుడిని కావాలని వుందన్నాడు. ఆశ్చర్య పోయిచూస్తుంటే, లక్షపద్యాలు చెప్పగలను, కోటి వరకూ అలా చెప్పాలని వుందన్నారు. వసుచరిత్ర అవలీలగా పాడి వినిపించేవాడు. భట్టు మూర్తి అంటే ఆయనకు విపరీత ప్రేమాభిమానం. ఒకసారి ఎ.సి. కాలేజి (గుంటూరు)కు పిలిపించి ఉపన్యాసం చెప్పించాం. ఆయన ప్రసంగం ఆంధ్రపత్రికలో ప్రచురించారు. స్ఫూర్తిశ్రీ (భాస్కరరావు) అది రాశారు. నేను అప్పట్లో కాలేజి సారస్వత సంఘానికి కార్యదర్శిని. 1956లో సంగతి.
వెంకటకవికి ఇంగ్లీషు రాదు. నెహ్రూ చరిత్ర కావ్యంగా రాయాలనుకున్నాడు. తుమ్మల సీతారామ చౌదరి గాంధీ ఆత్మకథ రాస్తే మంచి పేరు వచ్చింది. అందుకు దీటుగా నెహ్రూ కథ రాయాలని సంకల్పించాడు. ఆవుల గోపాలకృష్ణమూర్తి తోడ్పాటుతో ఇంగ్లీషులో విషయాలు చెప్పించుకుని రాశాడు. నెహ్రూతో ఇంటర్వ్యూ తీసుకుని ఢిల్లీ వెళ్ళి ఆయనకు సమర్పించి తృప్తి చెందారు. ఇది 1960 ప్రాంతాలలో సంగతి. నెహ్రూ సెక్యూలరిస్టు గనుక వెంకటకవికి తోడ్పడినట్లు ఎ.జి.కె. (ఆవుల గోపాలకృష్ణమూర్తి) చెప్పారు.
“దివ్యస్మృతులు” రచనలో రాస్తూ, ఎం.ఎన్. రాయ్ కు నివాళులు అర్పించారు. త్రిపురనేని రామస్వామి, ఏటుకూరి వెంకట నరసయ్య అంటే వెంకట కవికి యిష్టం. చిన్నయసూరి అంటే భక్తి. వాదోపవాదాలలో దిట్ట.
ఆయనతో నాకు 1954 ప్రాంతాలలో ప్రారంభమైన పరిచయం, ఆయన చనిపోయే వరకూ వుంది. హాస్య ప్రియుడు గావడం వలన మా సంభాషణ బాగా జరిగేది. హైదరాబాద్లో యీనాడులో వారం వారం శీర్షిక రాసేవాడు. పొన్నూరులో వుండగా ఆయన్ను కలిసే వాడిని. దాన వీరశూరకర్ణకు సంభాషణలు రాశాడు. అందులో కులంపై దాడి వాడివేడి సంభాషణలు ఎన్.టి.రామారావు గొంతులో వన్నెలు సంతరించుకున్నాయి.
వెంకటకవి విమర్శలు, తర్కాలు, వాదోపవాదాలు ఎన్నో ఎదుర్కొన్నాడు. రామరాజు భూషణుడు (భట్టుమూర్తి) పట్ల, కుల విచక్షణతో, ప్రబంధకవుల నుండి జరిగిన అవమానాలు. ఆయన ఏ కరువు పెట్టేవాడు.
దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారి వద్ద శిష్యరికం చేశాడు. వ్యాకరణంలో దిట్ట శాస్త్రిగారు చిన్నయసూరి అభిమాని. వెంకటకవి యిక్కడా, కులతత్వాన్ని తెచ్చి పెట్టి చిన్నయసూరి విషయంలో సాహిత్యలోకం కనబరచిన విచక్షణను నిరసించారు.ఆవులగోపాల కృష్ణమూర్తి అనుచరుడుగా వెంకటకవి చక్కని విమర్శను, హేతువాదాన్ని మానవ తత్వాన్ని అలవరచుకున్నారు. అయితే కులాభిమానం వీడలేక పోయాడు. అష్టావధానాలు చేశాడు. భువన విజయాలలో పాల్గొన్నాడు.


N.Innaiah performed the marriage of Manjulatha (Presently Vice-Chancellor of Pottisreeraamulu Telugu University) –Subramanyeswara Rao in 1970 at Exhibition Grounds, Hyderabad. The performance was secular without any religious mantras and promises were made as per Tripuraneni Ramaswamy’s guidelines, in Telugu language. Simultaneously on the same stage, at the same time, Kondaveeti Venkatakavi performed the marriage of the second son of Avula Sambasivarao and delivered the main speech.

లౌకిక వివాహాలు చేయించాడు; అంటే మంత్రాలు లేకుండా, త్రిపురనేని రామస్వామి రాసిన పెళ్ళి సూత్రాలు చదివించి, వివాహాలు జరిపించడం. మేమిద్దరం కలసికొన్ని పెళ్ళిళ్ళు చేయించాం. అందులో ఆవుల మంజులత పెళ్ళి, హైదరాబాద్ ఎగ్జిబిషన్ మైదానంలో జరిపించాం. ఆయన పురోహితుడు. నేను తోటి పురోహితుడ్ని. తోటి పెళ్ళి కుమారుని వలె! సంతరావూరు (చీరాల దగ్గర) వెలది వెంకటేశ్వర్లు పెళ్ళి కూడా అలాగే జరిపించాం.
కొండవీటి వెంకటకవి హాస్యప్రియుడు. తన షష్ఠి పూర్తి రాబోతున్నదనీ, తానే మంతగా ఆశించడం లేదనీ, ఎందుకైనా మంచిదని ముందుగా చెబుతున్నాననేవాడు. తనకు పెద్దగా కోరికలు లేవనీ, ఏనుగుపై వూరేగించి, కాలుకు గండపెండేరం (రత్నాలు బంగారం అయితే సరేసరి, లేకుంటే చత్తతోడా (గడ్డితో చేసిన కడియం) అయినా సరే అనేవాడు. వేయిస్తే, దుకూలాలు (తెల్లని పట్టువస్త్రం) కప్పితే చాలు అనేవాడు. చల్లపల్లి రాజాను అడిగితే ఏనుగు ఫ్రీగా యిచ్చే అవకాశం లేకపోలేదు అనేవాడు. లోగడ షష్ఠిపూర్తి జరిపించుకున్న వారిని, వెక్కిరిస్తూ అలా అన్నాడనిపిస్తుంది.
రచనలు : కర్షకా శతకం, హితబోధ, నృసింహతారావళి, చెన్నకేశవ శతకం, దివ్యస్మృతులు, నెహ్రూ చరిత్ర (కావ్యం), త్రిశతి (శతకాలు), ఈనాడులో వారం వారం కాలం.

4 comments:

Anonymous said...

చక్కగా ఉంది. కీర్తి కండూతి, సన్మాన కాంక్ష వీడని సూడో సన్నాసులకు జరిగిన సన్మానం అద్వితీయం. దీన్ని దాచుకోకుండా అందరితో పంచుకున్న, కొ.వెం.క. గారి మనస్తత్వం ప్రశంశనీయం. వారి హాస్య ప్రియత్వానికి జోహార్లు. దురభిమానానికి తావు లేని కులాభిమానం తప్పేం కాదులెండి. ఆమాటకొస్తే భారత క్రికెట్ జట్టుని మనమంతా అభిమానించమూ..

మొత్తం మీద వ్యాసం అదిరింది.

పూలవాన రవికిరణ్

కొత్త పాళీ said...

This is piece was informative and entertaining. Thank you

Rajendra Devarapalli said...

దానవీరశూరకర్ణ దుమ్ము రేపుతున్న రోజులవి.ముందు ఆ సినిమాలో డైలాగులు విన్నాకే మావూరు ఆ సినిమా వచ్చింది.సాదా ఖద్దరు కట్టి,వెనుక చేతులు పెట్టుకుని నిదానంగా రోడ్డు మీద నడుచుకెళ్తున్న ఓ మద్యవయస్కుడిని చూయించి ఆయనే కొండవీటి వెంకటకవి,మనూర్లోనే(పొన్నూరు)ఉంటున్నాడు అని చెప్తే నేనూ ఓ నాలుగడుగులు ఆయన పక్కనే నడిచి అబ్బా,ఒక సినిమా రచయిత మావూళ్ళో ఉంటున్నాడే అని మా స్కూలులో పొరుగూరునుంచి వచ్చే వాళ్ళందరితో చెప్పుకున్న రోజులు గుర్తొచ్చాయి.కండ గలిగిన సంభాషణలు రాసిన కవిగారి విద్వత్తును తెలుగుసినిమా లోకం పూర్తిగా వాడుకోలేకఫొయిందేమో!!

Anonymous said...

అర్ధంకాని శ్లోకాలకన్న, అందరికి అర్ధమయ్యే పదాలతో వ్రాసిన "వివాహవిధి" ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ ప్రాముఖ్యతని సంతరించుకున్నది.
ఆవశ్యకం కూడా!

కవిరాజు గారి - "వివాహవిధి" పధ్దతిలో రామస్వామిగారి ఒకానొక మనవడి వివాహం చెన్నైలో వెంకటకవిగారి చేతుల మీదుగానే జరిగింది.

త్యాగరాయనగరులో గిరి రోడ్డులో ఉండేవారు.
మంచి హాస్య ప్ర్రియుడు.