Monday, April 21, 2008

సాహితి పరులతో సరసాలు-18

Puranam Subramanya Sarma


పురాణం (ఎడమ), శ్రీశ్రీ (కుడి) తో స్వాతి కార్యాలయంలో

పురాణం సుబ్రహ్మణ్య శర్మ
(1929 - 1996)
పురాణం సీత పేరిట ఆంధ్రజ్యోతి వారపత్రికలో కొన్నేళ్ళు రాసిన సుబ్రహ్మణ్యశర్మ వాడి, పలుకు వున్న విమర్శకుడు. గుచ్చుకునేటట్లు అనగలడు, అనిపించుకోగలడు.
చిన్న ఉద్యోగాలు కొన్ని చేసినా ఆంధ్రజ్యోతిలో ఎక్కువ రోజులు కుదురుగా పనిచేశారు. ఎందరో రచయితలను ప్రోత్సహించారు. కొత్త దనం వుంటే యిట్టే పట్టేసేవారు. ఉదయం దిన పత్రికలో కొద్దిరోజులు పనిచేశారు.
రిటైర్ అయిన తరువాత హైదరాబాద్ అశోక్ నగర్ లో వుండగా, నేనూ, ఆలపాటి రవీంద్రనాధ్ కూడ బలుకుకొని వెళ్ళాం. మధురవాణి ఇంటర్వ్యూ శీర్షిక చర్చించాం. పురాణంకు అది బాగా నచ్చింది. తన పలుకు, నుడికారం, విమర్శ, ప్రతిభ అంతా రంగరించి ఆ శీర్షిక ప్రతి నెలా రాశారు. బాగా ఆకట్టుకున్నది. ఒకటి రెండు చోట్ల నా ప్రస్తావనకూడా ప్రవేశ పెట్టారు.
పురాణం అతిగా పోయినచోట రవీంద్రనాథ్ నిర్థాక్షణ్యంగా కత్తిరించేవాడు. పురాణం అందుకు బాధ పడేవాడుకాదు. త్రిపురనేని రామస్వామి, నార్ల వెంకటేశ్వరరావులపై రాసిన చోట నా ప్రస్తావన తెచ్చారు. నార్లపై రాసిన దగ్గర కె.ఎల్.ఎన్ ప్రసాద్ వివాదాన్ని రవీంద్రనాథ్ నిర్ధాక్షిణ్యంగా తొలగించారు. అలాగే సమకాలీకులపై రాయడానికి కూడా అంగీకరించలేదు. మొత్తం మీద ఆశీర్షిక బాగా ఫలించింది. మాటల్లో రాతల్లో చమత్కారం పురాణం సొత్తు.
మేమంతా కలసి మధ్యం సేవించినప్పుడు ఎన్నో విశేషాలు, తెరవెనుక జరిగినవి చెప్పేవారు. ఇందులో సి. నరసింహారావు, తుమ్మల గోపాలరావు కొన్ని సార్లు పాల్గొన్నారు. వెల్లంకి విశ్వేశ్వరరావు విజయవాడ లొ సుప్రసిద్ద కమ్మ్యూనిస్టు.ఆయన ఇంట్లొ మొదటి అంతస్తులో పురాణం అద్దెకు వుండే వారు.ఒక రోజు బాగా మద్యం సేవించి, రాత్రి సమయాన,ఇంటికి, వచ్చేసరికి అద్దె వసూలు కు వెల్లంకి వారు, కోపంగా నిలబడి వున్నారు. అడుగులు తడబడుతూ మెట్లు ఎక్కలేక , ఏమి కమ్యూనిస్టులు వీరు , పేదల ఉద్దరణకు వున్నామంటారు, మెట్టు మెట్టుకు మధ్య, మరో మెట్టు కట్టాడు నేను ఇంటికి వచ్చే సరికి అన్నాడు. ఆది విన్న వెల్లంకి, నవ్వు పట్టలేక, అద్దె గురించి అడగకనే, లోనికి వెళ్ళిపోయారు.
త్రిపురనేని రామస్వామిపై నేను విమర్శిస్తూ రాస్తే, పురాణం అభ్యంతరాలు కొట్టిపారేసి, ఉదయంలో ప్రచురించి, తరువాత విమర్శ శీర్షిక నడిపారు. నార్ల దగ్గర తోకాడించ బోయిన పురాణంకు ఎదురు దెబ్బలు తగిలాయి. గురజాడపై విమర్శలు, పరిశోధనకు సంబంధించిన విషయమై అవసరాల సూర్యారావు పాత్రను వెనకేసుకొచ్చి, నార్లను విమర్శించిన, పురాణానికి, త్వరలోనే తన తప్పు తెలిసింది. నార్లకు క్షమాపణ చెప్పి, ఉద్యోగం నిలబెట్టుకున్నాడు. నండూరి రామమోహనరావు గుమస్తా ఎడిటర్ అని నార్ల అంటే, పురాణం ఆమోదముద్ర వేశారు.
వ్యక్తుల్ని విమర్శనాత్మకమైన అంచనా వేసేవారు. బి.ఎస్.ఆర్. కృష్ణ జన్మదినానికి గుంటూరులో మాట్లాడుతూ, సింగిల్ కాలం వలె నిటారుగా వుండే బి.ఎస్.ఆర్., సహృదయుడు, సచ్చేలుడని చెప్పారు. అదేమిటో గాని పురాణం చనిపోయేవరకూ ఎప్పుడూ ఆర్థిక యిబ్బందులతోనే వుండేవాడు.
విషయాల్ని కొత్త కోణం నుంచి కూడా పురాణం చూచేవాడు. తిట్లు రెండు రకాలని, బ్రాహ్మణులతిట్లు శాపనార్థాలతో వుంటాయనేవాడు. నీపాడె, పచ్చి బద్దలు, తలపండు పగల, యిత్యాదులు. శూద్రులతిట్లు సృష్టి కార్యానికి చెందుతాయట!

రచనలు : మధురవాణి ఇంటర్వూలు, కథాసాగరం, చప్రాసి, కలకానిది, నీతికథా సంపుటాలు, బృందావనం, ఇడియట్, జేబులో బొమ్మ, చంద్రునికో నూలుపోగు, (జీవనలీల-అనువాదం), ఇల్లాలి ముచ్చట్లు (వ్యాసాలు).

4 comments:

Anonymous said...

బి.ఎస్.ఆర్ గారితో కూడా పరిచయం ఉందా మీకు?

Rajendra Devarapalli said...

పురాణం గురించిన ఈ రచన ఇంతకు ముందు ఎక్కడో చదివినట్లు జ్ఞాపకం,ఎక్కడ రాసారు?ఆయన చివరిరోజుల్లో ఆంధ్రభూమి దినపత్రిక వంటి వాటిల్లో వివాదాస్పద రచనలు చేసేందుకు ఎందువల్ల ప్రయత్నించారో?
రాజేంద్ర

innaiah said...

బి ఎస్ ఆర్ తొ 50 సంవత్సరాల సన్నిహిత పరిచయం.
పురానం గురించి జర్నలిస్త్ పరిచయాలలొ కొన్ని విషయాలు వున్నాయి

krishna rao jallipalli said...

పురాణం గారి రచనలలో చెప్పుకో తగ్గది.. చలం గారి జీవిత చరిత్ర -3 బాగాలు.
అలాగే.. చాలా చిన్న వయసులో మరణించిన వారి అబ్బాయి .. పురాణం సూర్య .. ఆ దిగులుతోనే పురాణం గారు కన్నుమూసారని చాల మంది అన్నారు.
పురాణం సీత ముచ్చట్లు .. top