Sunday, March 22, 2009

18 ఎన్నికల పర్వాల అనంతరం






Please bear with the lengthy matter. Now elections are on and hence this will give reasonble background.You may read in parts as your time permits.


(1952 నుండి ఇప్పటి వరకూ మన రాష్ట్రంలో జరిగిన లోక్ సభ, శాసన సభల ఎన్నికలను సూక్ష్మంగా పరిశీలించిన తరువాత ఈ స్పందన అందిస్తున్నాము.)
రాజకీయాలు దిగజారిపోయాయని, లోగడ ఇలా ఉండేది కాదని భావించేవారు సరి కాదని, కింది వివరాలు తెలియజేస్తున్నాయి. లోపాలకు ప్రధాన కారణం పార్టీల తత్వంలోనే ఉన్నది. నా పార్టీ తప్పు చేయదని, ఎదట పార్టీలు ఏం చేసినా తప్పు అని భావించే ధోరణి అన్ని పార్టీల రాజకీయాలలో ఉన్నది.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశంలో 1952 నుండి ఇప్పటికి 18 ఎన్నికల పర్వాలు ముగిశాయి. తొలి జాతీయ ఎన్నికలలో (1952) జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వం తిరుగులేనిదిగా ఉండేది. ఆయన్ను వ్యతిరేకించిన మహామహులంతా ఎన్నికలలో ఓడిపోయారు. అందుకు మచ్చుతునకగా బి.ఆర్. అంబేద్కర్, ఆచార్య రంగా, టంగుటూరి ప్రకాశం ఇత్యాదులను పేర్కొనవచ్చు. తొలి ఎన్నికలలో అంచెలవారీగా పోలింగు సాగుతూండగా, ఫలితాలను ఎప్పటికప్పుడే ప్రకటించేవారు. దాని ఫలితం జరగబోయే ఎన్నికలపై చూపేది. లోక్ సభ ఎన్నికలలో కమ్యూనిస్టులు హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయను బెజవాడ (విజయవాడ)లో నిలబెట్టి గెలిపించారు. మొదటిసారి ఎన్నికలలోకి దిగిన కొత్త రఘురామయ్య తెనాలి నుండి ఆచార్య రంగాను ఓడించి ఎన్నికయ్యారు. కాంగ్రెసు నుండి ఎన్నికలకు ముందు చీలిపోయి కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ పెట్టిన టంగుటూరి ప్రకాశం, ఆయన నుండి చీలిపోయి కృషీకార్ లోక్ పార్టీ పెట్టిన ఆచార్య రంగా ఓడిపోయారు. నీలం సంజీవరెడ్డి అనంతపూర్ లో ఆయన బావమరిది కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి చేతిలో ఓడిపోయి మళ్ళీ జీవితంలో అనంతపురంలో ఎన్నికలకు నిలబడలేదు. మదరాసులో మంత్రులుగా చేసిన కళా వెంకట్రావు, కల్లూరి చంద్రమౌళి, బెజవాడ గోపాలరెడ్డి, సంజీవరెడ్డి, మొదలైన వారంతా ఓటమిని చూశారు.
1952లో రాష్ట్ర ఎన్నికలు ఆంధ్రలో జరిగినప్పుడు నాటి మదరాసు రాష్ట్రంలో భాగంగానే సాగాయి. తెలంగాణాలో నైజాము పాలన కింద ఎన్నికలు జరిగాయి. వీటిని విడిగానే చూడవలసి ఉన్నది. ఆంధ్రలోనూ, తెలంగాణలోనూ కమ్యూనిస్టులు ప్రధాన ప్రతిపక్షంగా తలెత్తారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టే అవకాశం టంగుటూరి ప్రకాశానికి లభించినా మదరాసులో శ్రీప్రకాష్ గవర్నర్ గా ఆనాడు కమ్యూనిస్టుల పెత్తనం రానివ్వకుండా రాజగోపాలాచారిని ముఖ్యమంత్రిని చేశారు. ఆయన కౌన్సిల్ ద్వారానే శాసనసభకు వచ్చారు. మదరాసు హార్బరులో ఓడిపోయిన టంగుటూరి ప్రకాశం శృంగవరపు కోటలో ఎకగ్రీవంగా గెలిచి కమ్యూనిస్టులతో కలిసి మంత్రి వర్గాన్ని ఏర్పరచటానికి విఫల ప్రయత్నం చేశారు. తరువాత ప్రత్యేకాంధ్రకు ఆందోళన జరగగా 1953లో కర్నూలు రాజధానిగా కాంగ్రెసు పక్షాన టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యారు. కమ్యూనిస్టులు ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఆచార్య రంగా అనుచరులు తొలుత సహకరించకపోయినా తరువాత మంత్రివర్గంలో చేరారు. కానీ మద్యనిషేధం సమస్యపై ప్రకాశాన్ని దించివేశారు. రాష్ట్రంలో తొలిసారి గవర్నర్ పరిపాలన వచ్చింది.
అటు తెలంగాణాలో కమ్యూనిస్టులు పార్టీ పేరుతో కాక పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రెంట్ పేరుతో పోటీ చేసి 37 స్థానాలు గెలుచుకున్నారు. ఆనాడు బలంగా ఉన్న సోషలిస్టు పార్టీకి 11 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 96 స్థానాలు వచ్చాయి. పార్లమెంటుకు కాంగ్రెసుకు 14 స్థానాలు రాగా, పి.డి.ఎఫ్ కు 6 స్థానాలు వచ్చాయి. నైజాము నవాబు రాజప్రముఖ్ గా ఉండగా బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధికారం చేపట్టింది. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం తొలగిపోయింది. సాయుధ పోరాటాన్ని వారు నిలిపివేశారు. తొలి ఎన్నికలలోనే కాంగ్రెసు సీట్లు రాక జలగం వెంగళరావు, శీలం సిద్ధారెడ్డి వంటి వారు కాంగ్రెసుకు ఎదురు తిరిగి స్వతంత్రులుగా పోటీచేసి, 6 సంవత్సరాలు పార్టీ నుండి వెలివేయబడ్డారు.
ఎరుపెక్కిన ఆంధ్ర – 1955 ఉపఎన్నికలు
ఆంధ్రలో 1955లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. కమ్యూనిస్టులు అన్ని స్థానాలకు పోటీ చేసి, అధికారం చేజిక్కించుకునే స్థాయికి ఎదిగారు. వారిని ఓడించడానికి కాంగ్రెస్, ప్రజా సోషలిస్టు పార్టీ, కృషికార్ లోక్ పార్టీ కలసి ఐక్య కాంగ్రెస్ పేరిట పోటీ చేశారు. ప్రచార సరళి తీవ్ర రూపం దాల్చింది. విజయరాజకుమార్, వీరాచారి వంటివారు కామన్ ప్లాట్ ఫారాలకు కమ్యూనిస్టులను ఛాలెంజి చేసి, విజృంభించి ప్రచారం గావించారు. కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చినట్లే భావించి ముఖ్యమంత్రిగా పుచ్చలపల్లి సుందరయ్య, హోంమంత్రిగా మాకినేని బసవపున్నయ్యను పేర్కొన్నారు. కేంద్రం నుండి లాల్ బహదూర్ శాస్త్రి, ఎస్.కె. పాటిల్ వచ్చి కాంగ్రెస్ ఎన్నికలకు వ్యూహాన్ని రూపొందించారు. ఫలితంగా కమ్యూనిస్టులు అనూహ్యంగా ఓడిపోయి, 15 స్థానాల ప్రతిపక్షంగా సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పట్లో ఆంధ్రకు రాజధాని కర్నూలు.
1957 ఎన్నికలు
1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. తెలంగాణా ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం కలసిన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా సంజీవ రెడ్డి అధికారం చేపట్టారు. పెద్దమనుషుల ఒప్పందం జరిగినా ఆంధ్ర తెలంగాణా నాయకులంతా అధికారం మోజులో నిబంధనలనన్నిటినీ విస్మరించారు. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన సంవత్సరంలోనే మళ్ళీ ఎన్నికలు రాగా, అంతకు ఏడాది క్రితమే ఆంధ్రలో ఎన్నికలు జరిగినందున కేవలం తెలంగాణాకే ఎన్నికలు పరిమితం చేశారు. మళ్ళీ కాంగ్రెసు గెలవడంతో సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెసును బలపరిచిన కృషికార్ లోక్ పార్టీ, ప్రజాపార్టీలను సంజీవరెడ్డి దూరంగా పెట్టారు. 1958లో శాసనమండలి ఏర్పరచటంతో అనేక మందికి అవకాశాలు లభించాయి. కాంగ్రెస్ పార్టీలో పదవులు లభించని వారు, ఇతరులు కలిసి వేరే పార్టీలు పెట్టుకున్నారు. అప్పుడు దేశవ్యాప్తంగా ఏర్పడిన పెద్ద పార్టీ స్వతంత్ర పార్టీ.
1962 ఎన్నికలు
1962లో జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ 177 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. ప్రధాన ప్రతిపక్షంగా కమ్యూనిస్టు పార్టీ 51 స్థానాలలో నెగ్గింది. స్వతంత్ర పార్టీ 19 స్థానాలతో అసెంబ్లీలో ఆవిర్భవించింది. కాంగ్రెస్ లో సీట్లు లభించనివారు ఎదురు తిరిగి 20 స్థానాలలో స్వతంత్రులుగా నెగ్గారు. కె.వి. నారాయణరెడ్డి నాయకత్వాన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 29 మందితో ఏర్పడి, తరువాత కాంగ్రెసులో కలిసిపోయింది. తెన్నేటి విశ్వనాథం నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ 9 మందితో ఏర్పరచినా, అది కాస్తా తరిగిపోయి ముగ్గురితో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఆనాడు అసెంబ్లీలో తెన్నేటి విశ్వనాథం, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, గౌతు లచ్చన్న ప్రతిపక్షంలో ఉండి సభకు రాణింపు తెచ్చారు. ప్రజా సోషలిస్టు పార్టీలో ఉన్న పి.వి.జి. రాజు, భాట్టం శ్రీరామమూర్తి ఇత్యాదులను సంజీవరెడ్డి చేరదీసి కాంగ్రెసు పార్టీలో చేర్చుకున్నారు. ఈలోగా కర్నూలు జిల్లాలో ప్రైవేటు బస్సు రూట్లను సంజీవరెడ్డి జాతీయం చేయడంతో, అది పక్షపాతంగా చేసినట్లు హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆ స్థానంలో తాత్కాలికంగా దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు. తరువాత సంజీవ రెడ్డి అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షులుగా ఢిల్లీ వెళ్ళారు. 1962 ఎన్నికల తర్వాత సంజీవరెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయి 1964 వరకు పరిపాలించారు. 1964లో నెహ్రూ చనిపోగా కాంగ్రెసు పార్టీలో పెద్దమార్పు వచ్చింది. సంజీవరెడ్డి కేంద్రానికి వెళ్ళి, ఉక్కు శాఖ మంత్రి అయ్యారు. కాంగ్రెస్ ప్రముఖ నాయకులు కామరాజు నాడార్ నాయకత్వాన సిండికేటుగా ఏర్పడ్డారు. రాష్ట్రంలో బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా క్రమేణా సంజీవరెడ్డి వ్యతిరేక విధానాలను చేపట్టారు. విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం ఆందోళన జరిగింది. అది సంజీవరెడ్డి వ్యతిరేక ప్రచారంగా సాగింది.
1967 ఎన్నికలు
1967లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు 165 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెసులో ముఠాలు ఏర్పడి ఇంచుమించు 68 మంది ఎదురుతిరిగి కాంగ్రెసుపై ఇండిపెండెంట్లుగా పోటీ చేసి నెగ్గారు. అలాంటి వారందరినీ పార్టీ బహిష్కరించింది.
కమ్యూనిస్టు పార్టీ అప్పటికి రెండు ప్రధాన పక్షాలుగా చీలిపోయింది. రష్యా అనుకూల వర్గాన్ని సి.పి.ఐ.గాను, చైనా అనుకూల వర్గాన్ని సి.పి.ఎం.గాను పేర్కొన్నారు. ఉభయ పక్షాలూ ఎన్నికలలో పోటీ చేశాయి. సి.పి.ఐ.కి 9, సి.పి.ఎం.కు 11 లభించాయి. ఆ తరువాత నాగిరెడ్డి అసెంబ్లీకి రాజీనామా ఇచ్చి విప్లవ కమ్యూనిస్టు ఉద్యమంలోకి వెళ్ళిపోయారు. శ్రీకాకుళంలో నైక్సలైట్ ఉద్యమం తలెత్తింది.
1968 చివరిలో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణా ఉద్యమం 1969లో తీవ్రరూపం దాల్చింది. దాదాపు సంవత్సరంన్నర పాటు ఈ ఉద్యమం చెన్నారెడ్డి నాయకత్వాన సాగింది. ప్రత్యేక ముఠాగా కొండా లక్ష్మణ్ కూడా ఉద్యమాన్ని చేపట్టారు.
1972 ఎన్నికలు
1971లో లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. అప్పటికి కేంద్రంలో ఇందిరాగాంధీ పెద్ద నాయకురాలుగా ఆవిర్భవించింది. బంగ్లాదేశ్ ను సమర్థిస్తూ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఆమె తీసుకున్న నిర్ణయానికి వాజ్ పాయి వంటి నాయకులు కూడా సమర్థిస్తూ ఆమెను దుర్గ మాతగా ఆకాశానికెత్తారు. అప్పుడు జరిగిన లోక్ సభ ఎన్నికలలో తెలంగాణాలో చెన్నారెడ్డి నాయకత్వాన పోటీ చేసిన ప్రజాసమితి కాంగ్రెస్ ను ఓడించి 47.5 శాతం ఓట్లతో 11 స్థానాల ను గెలుచుకున్నది. ఆ తరునాత కొద్ది కాలానికే చెన్నారెడ్డి ప్రజాసమితిని కాంగ్రెసులో కలిపేసి రాష్ట్రానికి దూరంగా పదవి పుచ్చుకుని వెళ్ళిపోయారు. శాసన సభలో కాంగ్రెసుకు 219 స్థానాలు వచ్చాయి. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న బ్రహ్మానంద రెడ్డిని తొలగించి, ఆయన స్థానంలో పి.వి. నరసింహారావును తీసుకు వచ్చారు. 219 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకున్నది. మార్క్సిస్ట్ పార్టీకి కేవలం ఒక్క సీటుమాత్రమే వచ్చింది. సిపిఐకి 7 సీట్లు వచ్చాయి. కాంగ్రెసుకు ఎదురు తిరిగిన వారికి 53 స్థానాలు వచ్చాయి. 219 సీట్లతో కాంగ్రెస్ పి.వి.నరసింహారావు నాయకత్వాన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసింది.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సమసి పోగా ప్రత్యేక ఆంధ్ర కోసం ఉద్యమం సాగింది. దీనికితోడు భూ సంస్కరణల పేరిట సీలింగ్ పరిమితులను పి.వి. నరసింహారావు ప్రకటించడంతో ఉద్యమం తీవ్రతరమయింది. చివరకు పి.వి.నరసింహారావుని తొలగించి, రాష్ట్రపతి పరిపాలన ఏర్పరచారు.
కొంత సద్దు మణిగిన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావును నియమించారు. ఆయన సమైక్యవాదిగా నక్సలైటు ఉద్యమాన్ని అణచి వేయడానికి పూనుకున్నారు. 1975 జూన్ లో ఇందిరా గాంధి దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రాష్ట్రంలో వెంగళ రావు ముఖ్యమంత్రిగా కొనసాగారు.
1978 ఎన్నికలు
1977లో అత్యవసర పరిస్థితి తొలగిన తరువాత దేశంలో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఇందిరాగాంధీ పరిపాలనకి నిరసనగా ప్రజలు దేశంలో కాంగ్రెసును ఓడించారు. కానీ, రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ 41 స్థానాలు గెలవడంతో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రతిష్ఠ పెరిగింది. అప్పటికి జనతా పార్టీ ఏర్పడగా అందులో ప్రముఖ పాత్ర వహించిన నీలం సంజీవరెడ్డి నంద్యాల నుండి ఒక్కడే గెలుపొంది, కేంద్రానికి వెళ్ళి స్పీకర్ కాగలిగాడు. లోగడ జరిగిన పోలీసు అత్యాచారాలకు నిరసనగా జస్టిస్ భార్గవ కమిషన్ ఏర్పాటు చేయవలసి వచ్చింది.
1978లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. దేశంలో జనతా పార్టీ అధికారంలో ఉండటం వలన రాష్ట్రంలో కూడా ఆ పార్టీ అధికారానికి రావచ్చునని భావించింది. అప్పటికి ఉత్తర ప్రదేశ్ గవర్నరుగా ఉన్న చెన్నారెడ్డి రాష్ట్రానికి వచ్చి, కొత్తగా ఎర్పడిన ఇందిరా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడయ్యారు. కాంగ్రెస్ చీలిపోగా బ్రహ్మానంద రెడ్డి నాయకత్వాన ఏర్పడిన కాంగ్రెస్ కు రాష్ట్రంలో జలగం వెంగళరావు ప్రాతినిధ్యం వహించారు. 1978 ఎన్నికలలో ఇందిరా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నెగ్గింది. అత్యధిక సంఖ్యతో ఇందిరా కాంగ్రెస్ పార్టీ 174 స్థానాలు గెలుచుకున్నది. వెంగళరావు నాయకత్వాన రెడ్డి కాంగ్రెసుకు కేవలం 30 స్థానాలు, జనతా పార్టీకి 60 స్థానాలు, సి.పి.ఎం.కు 8, సి.పి.ఐ.కు 6 వచ్చాయి. చెన్నా రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. ఆయన ప్రత్యేక తెలంగాణా నినాదాన్ని మళ్ళీ తీసుకురాలేదు. రెడ్డి కాంగ్రెసు నాయకుడుగా వెంగళరావు ఉండేవాడు. జనతా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష స్థానం ఉన్నా వారిలో వారు కలహించుకొని చీలిపోయారు.
1980లో లోక్ సభ ఎన్నికలు జరగగా ఆంధ్ర ప్రదేశ్ లో 41 స్థానాలు ఇందిరా కాంగ్రెసు గెలిచింది. పార్వతీ పురం నుండి కిషోర్ చంద్రదేవ్ ఒక్కడే రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నెగ్గారు. జనతా పార్టీ పక్షాన పోటీ చేసిన జయపాల్ రెడ్డి ఓడిపోయారు.
1978 నుండి 82 వరకూ రాష్ట్రంలో కాంగ్రెసు ముఖ్యమంత్రులను కేంద్రం మారుస్తూ పోయింది. అవినీతి ఆరోపణలపై డా. చెన్నారెడ్డిని తొలగించి అంజయ్యను తెచ్చారు. ఆయన జంబో జట్ మంత్రిమండలిని ఏర్పరచి నవ్వులపాలయ్యారు. కొన్నాళ్ళకు ఆయన స్థానే భవనం వెంకట్రామ్ ను ముఖ్యమంత్రిని చేశారు. ఆరునెలలోనే ఆయన స్థానంలో కోట్ల విజయభాస్కర రెడ్డిని ముఖ్యమంత్రిని గావించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెసు అభాసుపాలయింది. విమర్శలకు గురయింది. అవినీతి ఆకాశానికంటింది.


1983 ఎన్నికలు
ఆ దశలో ఎన్.టి.రామారావు రంగ ప్రవేశం చేసి తెలుగు దేశం పార్టీ స్థాపించి తెలుగు వారి పరువు నిలబెట్టాలని ఢిల్లీలో తాకట్టుకు గురయిన తెలుగు స్థానాన్ని మళ్ళీ విడిపించాలని కాంగ్రెస్ అవినీతిని రూపుమాపి ప్రజాపాలన తీసుకురావాలని రాష్ట్రమంతా పర్యటించారు. ఆయనకు విశేష ఆదరణ లభించగా 1983 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎన్.టి.రామారావు నాయకత్వాన పెద్ద సంఖ్యాబలంతో (203) నెగ్గింది. ఆయనను ఓడించటానికి ఢిల్లీ నుండి కాంగ్రెస్ పార్టీ డబ్బుల సంచులను అభ్యర్థులకు పంచింది. సి.పి.ఐ.కి నాలుగు స్థానాలు సి.పి.ఎం.కు నాలుగు స్థానాలు, బి.జె.పి.కి 3 స్థానాలు, జనతా పార్టీకి ఒక స్థానం, ఇండిపెండెంట్లకు 17 వచ్చాయి. కాంగ్రెసు పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా 60 సీట్లతో సర్దుకు పోవలసి వచ్చింది.
ఎన్.టి.రామారావును తొలగించటానికి నాదెండ్ల భాస్కరరావు పన్నిన వ్యూహానికి కాంగ్రెసు పార్టీ వత్తాసుపలికింది. తెలుగుదేశంలో కృత్రిమ చీలికలు తెచ్చిన నాదెండ్ల భాస్కరరావుకు అండగా గవర్నర్ రామ్ లాల్ నిలిచారు. రామారావును తొలగించి ఒక నెలరోజుల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలించిన నాదెండ్ల భాస్కరరావు ఆయతో పాటు కాంగ్రెసు పార్టీ అభాసుపాలయింది.
1985 ఎన్నికలు
ఈ నేపథ్యంలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు పెట్టి నిగ్గు తేల్చాలని ఎన్.టి.రామారావు పట్టుబట్టగా 1985లో ఎన్నికలు జరిగాయి. తెలుగు దేశానికి 202 స్థానాలు రాగా, కాంగ్రెసు 50 స్థానాలు వచ్చాయి. భాస్కరరావు నామరూపాలు లేకుండా పోయాడు.
1989 ఎన్నికలు
ముఖ్యమంత్రిగా ఎన్.టి.రామారావు 1989 వరకు కొనసాగారు. అప్పటికే ఆయన పలుకుబడీ, ఆకర్షణా కొంత తగ్గుతూ వచ్చింది. 1989లో జరిగిన ఎన్నికలలో ఎన్.టి.రామారావు మెజారిటీ కోల్పోయి, 74 సీట్లతో ప్రతిపక్ష నాయకుడి స్థానంలోకి వెళ్ళిపోవలసి వచ్చింది. కాంగ్రెసు ముఖ్యమంత్రిగా డా.మర్రి చెన్నారెడ్డి 181 స్థానాలతో మరొకసారి అధికారం చేపట్టారు. అయితే ఆయన ఈసారి ఆట్టేకాలం కొనసాగలేకపోయారు. మళ్ళీ కాంగ్రెసు పార్టీ పాత అలవాట్ల ప్రకారం ముఖ్యమంత్రిని తొలగించి 1990 డిసెంబరు 17న ఎన్.జనార్దన రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది.
1991 లోక్ సభ ఎన్నికలు
లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీని తీవ్రంగా ఎదుర్కొని తెలుగుదేశం గెలుస్తున్న సందర్భంలో ఎన్నికల మధ్యలో 1991 మేలో రాజీవ్ గాంధీని మదరాసులో ఎల్.టి.టి.ఇ. ఉగ్రవాదులు ఆత్మాహుతి దళంతో చంపారు. అంతటితో ఎన్నికల ఫలితాలు మారిపోగా ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెసు నెగ్గింది. కానీ ఎన్. జనార్దన రెడ్డిని ఆట్టే కాలం ముఖ్యమంత్రిగా కొనసాగనివ్వకుండా కోట్ల విజయభాస్కర రెడ్డిని 1992లో ముఖ్యమంత్రిని చేశారు.
1994 ఎన్నికలు
1994లో శాసన సభ ఎన్నికలు వచ్చాయి. తిరిగి ఎన్.టి.రామారావు నాయకత్వాన తెలుగు దేశం 247 స్థానాలతో అధికారంలోకి రాగా, కాంగ్రెసుకు కేవలం 26 మాత్రమే లభించాయి. సి.పి.ఐ.కి 19, సి.పి.ఎమ్.కు 15 వచ్చాయి. బి.జె.పి.కి 3 లభించాయి. తెలుగు దేశానికి 219 స్థానాలు రావడం విశేషం. తరువాత 8 మాసాలకే 162 మంది తెలుగు దేశం శాసన సభ్యులు చంద్రబాబు నాయకత్వాన ఎదురు తిరిగి ఎన్.టి. రామారావును తొలగించి, చంద్రబాబును ఎన్నుకున్నారు. అంతటితో 1995 ఆగస్టు 30న ఎన్.టి. రామారావు రాజీనామా చేయవలసి వచ్చింది. ఆయన 1996 జనవరి 18న చనిపోయాడు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగాడు.


1996 ఎన్నికలు
1996లో లోక్ సభ ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబునాయుడుకి 16 స్థానాలు లోక్ సభలో లభించాయి. అందువల్ల కేంద్రంలో ఉన్న అస్థిరత్వ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర వహించగలిగాడు. 1996 మేలో ప్రధానమంత్రిగా దేవెగౌడను వెనకేసు వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ రాజశేఖర రెడ్డి నాయకత్వాన 90 స్థానాలతో ప్రతిపక్షంగా మాత్రమే ఉండగలిగింది.
1998లో లోక్ సభ ఎన్నికలలో తెలుగు దేశానికి 12 స్థానాలు రాగా, బి.జె.పి. సమర్థించింది. కమ్యూనిస్టు పార్టీలు చంద్రబాబును వ్యతిరేకించాయి.
1999 అసెంబ్లీ ఎన్నికలలో మరొకసారి చంద్రబాబు నాయుడు తెలుగు దేశాన్ని గెలిపించి ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆయన పరిపాలన కొనసాగు తుండగా ఆయన హయాంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ రావడం, కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞాన రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం, రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడడం, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు 2001 నవంబరు 27న తన మంత్రి వర్గాన్ని మరొకమారు మార్పులు చేసి రూపొందించారు.
2004 ఎన్నికలు
2004లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు సరైన కార్యక్రమాలు చేపట్టక అభాసు పాలయినారు. అప్పుడు వై.యస్. రాజశేఖర రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి తెలుగు దేశం పాలనను విమర్శించి, తప్పులు బయట పెట్టి, కాంగ్రెసు పార్టీ తలపెట్టిన సంక్షేమ పథకాలను పేర్కొన్నారు. ఆయన పర్యటన కాంగ్రెసు పార్టీకి సత్ఫలితాలను చేకూర్చిపెట్టింది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షస్థానంలోకి పోయేట్లు చేసింది. కాంగ్రెసు పార్టీ నాయకుడుగా వై.యస్. రాజశేఖర రెడ్డి ఐదేళ్ళు పరిపాలించారు. ప్రజాహిత కార్యక్రమాలు, ఎన్నో ప్రాజెక్టులను నిర్మాణం ప్రారంభించినారు. కేంద్రంలో కాంగ్రెసు పార్టీ సోనియాగాంధీ నాయకత్వాన అధికారంలో ఉండటం కూడా ఆయనకు మంచి బలాన్నిచ్చింది.
జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా పార్టీని స్థాపించి నీతి నిజాయితీ రాజకీయాల్లో కావాలని అవినీతికి దూరంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని డబ్బు ఖర్చు పెట్టటం ప్రధానంగా ఉండరాదని, అది ప్రజలకు ఆశలు చూపటం లోబర్చుకోవటం సక్రమం కాదని చెబుతూ, నేర చరిత్ర కలవారిని అభ్యర్థులుగా ఎంపిక చేయరాదని స్పష్టం చేస్తున్నారు.
ఇటీవలనే ప్రముఖ సినీ హీరో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికలకు సిద్ధమైనారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర సమితి, ఉభయ కమ్యూనిస్టులతో మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలకు సిద్ధమౌతున్నారు. జూనియర్ ఎన్టీ ఆర్, నందమూరి బాలకృష్ణ రోడ్ షోలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 2009 ఎన్నికలు జరగబో తున్నాయి.
ఓటర్లలో సగం మంది చదువు రానివారైనప్పటికీ అన్ని ఎన్నికల్లోనూ వారు యింగిత జ్ఞానంతో సరైన నిర్ణయాలు చేస్తూ తగిన పార్టీలను, అభ్యర్థులను గెలిపిస్తూ వస్తున్నారు. ఈ ధోరణి 1952 నుండి అన్ని ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపించింది. ఈ ఎన్నికల్లో కూడా అలాగే జరుగుతుందనటంలో సందేహం లేదు.
రాజ్యాంగం పేర్కొన్న శాస్త్రీయ ధోరణి ప్రజలకు చెప్పి, మూఢనమ్మకాలు తొలగించి, విజ్ఞానవంతులను చేయడానికి పార్టీలు పూనుకోవలసి ఉన్నది. కానీ ఆ దిశగా ఎవరూ పయనించడం లేదు. పైగా పార్టీ రాజకీయాలలో మతాలు ప్రవేశించాయి. కులం సంగతి సరేసరి.

1 comment:

Nrahamthulla said...

ఏకగ్రీవ ఎన్నిక
ఈ పద్దతి వలన లాభాలు

1. ఎన్నికల కోసం అభ్యర్దులు, ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏకగ్రీవ ఎన్నికల ద్వారా మిగులుతుంది.
2. ఘర్షణలు కొట్లాటలు హత్యలు ఉండవు. సామరస్య వాతావరణం నెలకొంటుంది.
3. ప్రచారం, సారాయి లాంటి అనుత్పాదక ఖర్చులు తగ్గటమేకాక ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు బహుమతిని ఆయా ప్రాంతాల అభివృద్ధికే వినియోగించవచ్చు.
4. అధికారుల యొక్క సమయం ఆదా అవుతుంది.
5. అభ్యర్థుల ప్రచారం ఉండకపోవుటచే శబ్ద కాలుష్యం బాధ తగ్గుతుంది.
మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు

* 1952 : షేక్ షాజహాన్ బేగం పరిగి శాసనసభ నియోజకవర్గం
* 1952 : కె.వి.పడల్ పాడేరు శాసనసభ నియోజకవర్గం
* 1952 : ప్రకాశం పంతులు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
* 1952 : కె.వి.పద్మనాభరాజు ఉత్తరపల్లి
* 1952 : శ్రీరంగం చిత్తూరు శాసనసభ నియోజకవర్గం
* 1952 : వీరాస్వామి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం
* 1952 : పి.వి.జి.రాజు విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1952 : గంట్లాన సూర్యనారాయణ విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1955 : ఎన్.వెంకటరత్నం బూరుగుపూడి
* 1955 : రామారావు కామారెడ్డి
* 1955 : టి.ఎన్.వి.రెడ్డి తంబళ్ళపల్లి
* 1956 : అల్లం కృష్ణయ్య వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం
* 1957 : సీతాకుమారి బన్స్ వాడ
* 1957 : పద్మనాభరెడ్డి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం
* 1957 : పి.మహేంద్రనాద్ నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1957 : భాట్టం శ్రీరామమూర్తి విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1960 : జి.డి. నాయుడు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
* 1962 ,1972 : బి.వి.సుబ్బారెడ్డి కోయిలకుంట్ల
* 1962 : డి.లక్ష్మీకాంతరెడ్డి ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1962 : టి.రంగారెడ్డి ఆర్మూరు
* 1962 : కె.పున్నయ్య ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం
* 1962 : కె.రాంభూపాల్ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం
* 1962 : కే.వి.రెడ్డి బోదన్
* 1962 : ఎ.రామస్వామి వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం
* 1967 కె.లక్ష్మీనరసింహరావు జగిత్యాల శాసనసభ నియోజకవర్గం
* 1968 ఎ.సంజీవరెడ్డి రాపూరు
* 1968 కె.రామయ్య బూర్గుంపహాడ్
* 1970 ఎం.ఎస్.సంజీవరావు రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎస్.భూపాల్ అమరచింత
* 1972 చింతలపాటి వరప్రసాద మూర్తి ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎమ్.రామమోహనరావు చింతలపూడి శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎన్.రామచంద్రారెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
* 1972 ఇ.అయ్యపురెడ్డి పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎం.మాణిక్ రావు తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 కళ్యాణ రామచంద్రరావు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 జి.గడ్డెన్న ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎం.సుబ్బారెడ్డి నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 డి.మునుస్వామి కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎస్.పి.నాగిరెడ్డి మైదుకూరు శాసనసభ నియోజకవర్గం
* 1972 వి.రామకృష్ణచౌదరి అనపర్తి శాసనసభ నియోజకవర్గం
* 1972 పి.నర్సారెడ్డి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 : అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం : మండలి వెంకటకృష్ణారావు
* 1972 : చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం (ఆదిలాబాదు జిల్లా) : కోదాటి రాజమల్లు
* 1972 : పెనుమత్స సాంబశివరాజు గజపతినగరం శాసనసభా నియోజకవర్గం
* 1974 ఆర్.సురేందర్ రెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
* 1975 ఎన్.యతిరాజారావు చెన్నూరు
* 1981 టి.అంజయ్య రామాయంపేట
* 2002 : దేవరకొండ శాసనసభ నియోజకవర్గం : రాగ్యానాయక్ భార్య దీరావత్ భారతి