Monday, February 2, 2009

గంజాయి పరిశోధన

అంతర్జాతీయ అవార్డులందుకున్న రాపాక సాంబశివరావు గారు రాష్ట్రంలో పశ్చిమ గోదావరి రాపాక కుగ్రామం నుండి అమెరికాకు వెళ్ళిన తెలుగు వారు. ప్రస్తుతం ఆయన అమెరికా జాతీయ డ్రగ్ ఎబ్యూజ్ పరిశోధనా కేంద్రంలో వున్నారు.
గంజాయి వంటి ఆరోగ్యానికి మంచిదేనని కొందరూ, కాదని మరికొందరూ సిగపట్టు పడుతున్న అమెరికాలో సాంబశివరావు పరిశోధన చేస్తున్నారు. మన సాధువులు గంజాయి దమ్ము పట్టిస్తూ, సామూహికంగా అనుభవిస్తూ, అది ముక్తి మార్గానికి సన్నిహితమని నమ్మారు. రానురాను గంజాయి పండించడం, తాగడం, అమ్మడం ప్రపంచవ్యాప్తంగా నేరం కింద ప్రకటించారు. అయినా దొంగచాటుగా పండిస్తూ, వ్యాపారం సాగిస్తున్నారు.
సాంబశివరావు గారు పని చేస్తున్న డ్రగ్స్ పరిశోధనాలయం వారు కూడా గంజాయిని పండిస్తున్నారు.
అది కేవలం పరిశోధన నిమిత్తమే. అందువలన సాంబశివరావు గారి బాధ్యత మరీ పెరిగింది.
మన యోగులు, బుషులు లోగడ ధ్యానం చేసినప్పుడు, ఏవైనా గ్రంథులు విడుదల అయ్యాయా? అయితే అవి మెదడుపై ఎలా పనిచేసి వుంటాయి. అనే ప్రశ్నలకు సమాధానం కోసం వెతుకుతున్నాం అని సాంబశివరావు గారంటున్నారు.. మెదడును పరిశీలించే కొద్దీ చాలా లోతుపాతులు బయటపడుతున్నాయి. చిక్కులు ఎక్కువగా వుంటున్నాయని సాంబశివరావు గారంటున్నారు.
సైన్స్ తో పాటుగా భారతీయ చింతన కూడా ఆసక్తి చూపుతున్న సాంబశివరావు గారు ........ రాజారావు, పురుషోత్తమ్మ దంపతులకు పుట్టారు. నరసాపూర్, వాల్తెరులలో చదివి ఫార్మసీలో నిపుణులుగా కలకత్తాలో పని చేసి 1968లో అమెరికా వెళ్ళారు. బర్కిలి యూనివర్శిటీ ఫార్మసీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.
అమెరికా ప్రభుత్వ పరిశోధనా సంస్థ నేషనల్ డ్రగ్ ఎబ్యూజ్ కేంద్రంలో కుదురుకున్నారు.
సైప్రస్ లో సాంబశివరావు గారి సేవలకు గుర్తింపుగా అంతర్జాతీయ అవార్డు లభించింది. పరిశోధన విభాగాధిపతి కావడం వలన తరచు పత్రికల వారి ప్రశ్నలకు తట్టుకోవలసిన స్థితి కూడా ఆయనకు వస్తున్నది.
వ్యసనానికి దారి తీసే యీ గంజాయిని చికిత్స పేరిట మార్కెట్ లో అనుమతించవచ్చా అనేది సాంబశివరావు గారి సంస్థ ఎదుర్కొంటున్న సమస్య.
ఇలా పరిశోధనారంగంలో వుంటూనే, తెలుగు వారి సంస్కృతితో సంబంధాలు పెట్టుకుని, సాంబశివరావు గారు, తీరిక వేళలో తెలుగు సాహిత్యం చదవడానికి ప్రయత్నిస్తారు.
1970 నుండీ నేటి వరకూ శాస్త్రీయ పరిశోధనారంగంలో సాంబశివరావు గారు అనేక ప్రమాణ పూరిత వ్యాసాలు ప్రచురించారు. కొన్ని ఇతరులతో కలసి రాశారు. 15 పుస్తకాలు పరిష్కరించారు. వ్యాసాలలో సెంచరీ కొట్టారు.
మన దేశ సైంటిస్టులు ఆర్.ఎస్.భట్ నగర్, ఎ.కె. ప్రసాద్, రేణుగోపాల కృష్ణన్, ఎన్. పట్టాభిరామన్, హెచ్.ఎన్. భార్గవ, బి.ఎన్. దవన్ వంటి వారితో సన్నిహితంగా సాంబశివరావు గారున్నారు.
సాంబశివరావు గారు శాస్త్రీయ పరిశోధనలోకి యోగం, మిగిలిన ఆధ్యాత్మిక విషయాలు ఎక్కడైనా యిముడుతాయా అని ఆసక్తితో చూస్తున్నారు. వైదవ్యాస్ వంటి వారి జోశ్యాలను గమనిస్తూ, నిజం ఉందేమో అని దుర్భిణి చేసి చూస్తున్నారు. సాంబశివరావు గారు సౌమ్యులు, మితభాషి, అన్వేషి వారికి భారతీయులకు చేతనైనంత చేయూతనిస్తున్న విజ్ఞాని.

1 comment:

pavan kiran said...

its really interesting but i think its converting a habit to the people.if they edicted then it causes problem to his health.any how you will win the race of research of this "ganjayi".

hello sir i am from also rapaka.i am a person having the first name"prerepa"