Monday, July 30, 2007

నర హంతకులు -11

ఇప్పుడు బయటపడుతున్న మావో నరమేధం



20వ శతాబ్దంలో 80 కోట్ల ప్రజలతో పరిశోధన చేసిన, అడ్డొచ్చినవారిని హతమార్చిన మావో విషయం క్షుణంగా ప్రతివారూ తెలుసుకోవాలి. మనుషులంటే ఇజాలు విలువైనవనే సిద్ధాంతం వలన జనాన్నే మందగా మళ్ళేసి, బందెలదొడ్డికి తోలి, ఎదురుతిరిగిన వారిని, దారిమళ్ళించి వారిని కాల్చి చంపడం ఆనవాయితీ అయింది. మావో చైనాను యీ రీతిలో నడిపించాడు. అనంతరం చైనా కొంతవరకు స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకుంటున్నది.
సోవియట్ రష్యా ప్రోత్సాహంతో చైనాలో 1920లో కమ్యూనిస్టు పార్టీ పుట్టింది. అప్పటికి మావోకు 27 సంవత్సరాలు. ఆనాటికి చైనా సైన్యంలో పనిచేసిన అనుభవం ఆయనకున్నది. మావో రైతు కుటుంబీకుడు. పెకింగ్ లోని యాంగ్ బాంగ్చి, ఆన్ పెకింగ్ ఉపాధ్యక్షుడి కుమార్తెను వివాహమాడాడు. మొదటి నుండి రైతు పక్షపాతిగా వున్న మావో బీజింగ్ లో మార్క్సిజం చదివాడు. అయినా ఆయన ఆలోచనలు రష్యాకు భిన్నంగానే సాగాయి.
రష్యా నుండి మైకేల్ బరోడిన్, ఎం.ఎన్. రాయ్ మొదలైన సలహాదారులు వచ్చి చెప్పిన బోధలు వినకుండా మావో సొంత మార్గాలు అవలంభించాడు. కొమింటాంగ్ లో విభేదించి చైనా కమ్యూనిస్టు దళాలను ఏర్పరచాడు. జాతీయవాద ప్రేరణతో రైతులను ఉత్తేజపరిచాడు. తొలుత వెయ్యి మంది నానాజాతి సంకర ప్రజలతో ఒక దళాన్ని మావో ఏర్పరచాడు. అది క్రమంగా 1927లో మొదలుబెడితే, 20 వేలవరకూ పెరిగింది. 1930లోనే తన సైన్యంలో సుమారు 2 వేల మంది కమ్యూనిస్టు వ్యతిరేకత చూపినందుకు వారిని కాల్చి చంపించాడు మావో. అంతకుముందు చాంకై షేకు కొన్ని వేల మంది కమ్యూనిస్టులను హతమార్చాడు, అప్పటికి మావో తన సైన్యం నుండి ఒక రహస్య దళాన్ని రూపొందించాడు. 1923-30లో చైనాలోని 5 రాష్ర్టాలలో మావో ఆధ్వర్యాన కమ్యూనిస్టు పార్టీ బాగా బలాన్ని సమకూర్చుకున్నది. మావో ఉత్తరువులననుసరించి మధ్యతరగతి వారిని చంపడం ప్రారంభమైంది. పురోహితులను, మత ప్రచారకులను హతమారుస్తుండేవారు.
చైనాలో సైన్యం లేకుండా ఏ పనీ జరగదనేది చరిత్ర చెప్పిన పాఠం. 1926లో మార్షల్ ఫేంగ్ యూసియాంగ్ కొమింటాంగ్ కమాండర్ గా 3 లక్షల కొమించుస్ దళాన్ని (ప్రజా సైన్యాన్ని) 7 వేల మైళ్ళ యాత్ర చేయించాడు. పెకింగ్పే దాడి కై తలపెట్టిన యీ యాత్ర వలన దక్షిణాది నుండి వెళ్ళిన సైన్యం ఉత్తరాదిపై ఆదిపత్యం వహించగలిగింది. ఇదే మావోకు ఆదర్శ ప్రాయమైంది.
1934 అక్టోబరులో మావో ఆధ్వర్యాన కమ్యూనిస్టు దళాలు యాత్ర ప్రారంభించి 1936 డిసెంబరులో ఎనాన్ లో ముగించారు. దీనివలన చైనాలో కమ్యూనిస్టులపై మావోకు పూర్తి ఆదిపత్యం లభించింది. ఆయన రాజకీయ మద్దత్తుదారుగా చౌ ఎస్ లై నిలచాడు.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం మావోను సైన్యం వదలి, ప్రభుత్వంలో చేరమని స్టాలిన్ సలహాయిచ్చాడు. అప్పటికే చైనా కమ్యూనిస్టు పార్టీ మావో ఆలోచనా విధానమే ఏకైక మార్గం అనే నినాదంతో వున్నది. 1945 నుండి 1949లో కమ్యూనిస్టులు పెత్తనంలోకి వచ్చేవరకూ చైనాలో అంతర్యుద్ధం సాగింది.
1948 డిసెంబరు నాటికి అనేక రాష్ట్రాలను పట్టుకోగలిగిన మావో, 1949 జనవరిలో బీజింగ్ ను స్వాధీనం చేసుకున్నాడు. ఈ పోరాటంలో చాంగ్ కైషేక్ దళాలు 4 లక్షల వరకూ హతమయ్యా యి. మరో 2 లక్షల మంది మావో సైన్యంలో చేరారు. 1959 ఏప్రిల్లో నాన్ కింగ్ ను పట్టుకోగలిగిన మావో చైనా సర్వాధిపతి అయ్యాడు.
మావో తొలుత యిచ్చిన పిలుపు భూ సంస్కరణ అమలు పరచమని, ఈ సంస్కరణోద్యమంలో 20 లక్షల మంది పెద్ద, చిన్న రైతులు హతమైనారు. వీరిలో 10 లక్షల మంది రైతులు 30 ఎకరాలలోపు వారే. రష్యా సహాయంతో చైనాను అగ్రరాజ్యంగా సైన్యంలో బాగా బలం గల రాజ్యంగా, రూపెందించాలని మావో సంకల్పించాడు.
1949లో రాజ్యానికి వచ్చిన కమ్యూనిస్టులు చైనాలో మావోపంధాను తీవ్రస్థాయిలో అమలు పరచడానికి పూనుకున్నారు. లింపియావో యిందులో చురుకుగా పాల్గొన్నాడు. భూసంస్కరణోద్యమం పేరిట 1950 నుండి 53 వరకూ నగరాలలో పెద్ద ప్రదర్శనలు ఏర్పరచి, సంఘ వ్యతిరేకులను ఏరివేయడానికి పూనుకున్నారు. విప్లవ వ్యతిరేకుల జాబితాలను రోజూ ప్రకటిస్తూ పోయారు.
నెలకు సగటున 22 వేల మంది సంఘ విద్రోహులను ఉరి తీస్తూ పోయారు. చైనాలో 1950 నుండి 1953 వరకూ సాగిన యీ ఏరివేత, ఉరితీత కార్యక్రమములో మావో ఆధ్వర్యాన 3 లక్షల నుండి విప్లవ వ్యతిరేకులు చంపివేయబడ్డారు. మావో సంస్కరణలో యిది తొలిఘట్టం. మూడు వ్యతిరేక ఉద్యమాలతో ఆరంభమైన మావో తరువాత 5 వ్యతిరేక ఉద్యమాలు నినదించారు. మావో ఆలోచనలు అందరూ విధిగా చదవాలన్నారు. అందుకు విముఖత చూపినవారిని జైళ్ళలో చిత్రహింసలతో సంస్కరించారు. దేశంలోని అన్ని వర్గాలకూ యీ తాతాచార్యుల సంస్కరణ వడ్డింపు తప్పలేదు. మావో తొలి సంస్కరణ ఫలితంగా చైనాలో ధ్యాన్యోత్పత్తి పడిపోయి, పెద్ద కరువును ఎదుర్కోవలసి వచ్చింది.
1955లో మావో మరో నినాదం యిచ్చాడు. సోషలిజానికి పెట్టుబడిదారీ వ్యవస్థకు జరిగే తుది పోరాటం అని బయలుదేరారు, కాని ఇదేమంత ఆకర్షణీయంగా లేదు, ఫలితాలనివ్వలేదు. వందపూలు వికసించాలి అనే కొత్త ఆకర్షణీయ నినాదంతో 1956లో మావో మరో ఆలోచన చేశారు. ఇది ఆధారంగా భిన్న అభిప్రాయాలు వెల్లడించిన వారిని పట్టుకొని శిబిరాలకు పంపారు నిర్భంధంగా పనులు చేయించారు. మావో తన నినాదాన్ని ఒక ఏడాదికే ఉపసంహరించుకున్నాడు.
ముందుకు దూకండి అని 1957లో మావో నినదించాడు. అప్పటికే రష్యాలో స్టాలిన్ చనిపోవడంతో ప్రపంచ కమ్యూనిస్టు అగ్రనాయకుడుగా మావో ఒక్కడే మిగిలిపోయాడు. కృశ్చేవ్ కూ మావోకూ పడలేదు. మావో చేస్తున్న పనుల్ని కృశ్చేప్ విమర్శించాడు. చైనాలో దేశవ్యాప్తంగా కమ్యూన్లు స్థాపించాలని ముందుకు దూకే ఉద్యమలక్ష్యం. మావో నాయకత్వాన్ని పిచ్చిదిగా కృశ్చేప్ పేర్కొన్నాడు. వ్యవసాయరంగం పారిశ్రామిక రంగం చిన్నాభిన్నం కాగా చైనాలో మావో సృష్టించిన కరువు మూడేళ్ళపాటు సతమతం చేసింది. ఎందరు ఆకలి చావులకు గురయ్యారో చైనా బయట పెట్టక, కమ్యూనిజం పేరిట దాచేసింది. దాంతో ముందుకుదూకే ఉజ్యమాన్ని 1959 జులై 23న హఠాత్తుగా ఆపేస్తున్నట్లు మావో ప్రకటించాడు. చైనాలో మావోతోబాటు లింపియావో, లీషాచీ, మావో భార్య చియాంగ్ చింగ్లు ప్రధాన పాత్ర వహించారు. ముందుకు దూకడం ఆపిన మావో సాంస్కృతిక విద్యారంగాలపై దృష్టి సారించాడు. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుని ఆలోచించిన మావో హఠాత్తుగా చైనారంగం మీదకు వచ్చాడు. 1966 జూలై 16న యాంగ్చీనదిలో మావో ఈత గొట్టినట్లు వార్తలు, పోటోలు ప్రచురించారు. గంటలో 10 మైళ్ళు ఈతగొట్టిన మావో ఎంత శక్తివంతుడో చూపాలనే ఈ ప్రచార ప్రయోజనం.
సాంస్కృతిక విప్లవం అనేది మావో యిచ్చిన మరో నినాదం ఇందులో మావో రెండవ భార్య మాజీ సినీతార చియాంగ్ చింగ్ ముఖ్య నిర్ణయాలు చేసింది. 1966లో ప్రారంభమైన ఈ సంస్కృతిక ఉద్యమం తుపాకి గొట్టం ద్వారా అధికారం వస్తుందనే నినాదం యిచ్చింది. దీనినే మన నక్సలైట్లు గోడలపై వ్రాస్తుంటారు. 1966 మేలో రెడ్ గార్డులు సాంస్కృతిక విప్లవానికై ఉద్యమించారు. మిడిల్ స్కూలు నుండి వచ్చిన విద్యార్ధులు ఎర్రచొక్కాలు ధరించిరాగా, ఉత్తరోత్తరా హైస్కూళ్ళనుండి మిగిలినవారు జతచేరారు. వీరి సంఖ్య ఒకకోటి దాకావున్నది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు భయంతో పారిపోగా, 1966 నుండి విద్యారంగం స్ధంభించింది. గోడలపై లక్షపైగా పోస్టర్లు వెలిశాయి. హింసను బాగా ప్రోత్సహించే ఈ పోస్టర్ల వలన రెచ్చిపోయిన విద్యార్ధులు విధ్వంసకాండకు దిగారు.
రెడ్ గార్డుల విధ్వంస చర్య వలన ఎంతో ఆస్తి నష్టం జరుగగా, గ్రామస్థాయిలో 4 లక్షల మందిని వారు పొట్టనబెట్టుకున్నారు. పై స్ధాయిలో విద్రోహులను జైళ్ళలో పెట్టి, నానాచిత్ర హింసలతో చంపేశారు. వారి భార్యలను వీధులలో బహిరంగంగా అవమాన పరిచారు.
రెడ్ గార్డులు వీలైనన్ని చోట్ల ఆక్రమణచేశారు. రేడియో, టి.వి. స్టేషన్లుతో సహా ఈ అక్రమణకు గురయ్యాయి. కమ్యూన్లలో, విశ్వవిద్యాలయాలలో యించుమించు అంతర్యుద్ధం సాగింది.
ఇలా చెలరేగిన రెడ్ గార్డుల హింసాకాండను చౌ ఎన్ లై ఆపాలని ప్రయత్నించి విఫలుడైనాడు. 1967లో యిదంతా చూచి, మావో నిరాశచెంది, ఉద్యమాన్ని ఆపమని తన భార్యకు చెప్పాడు.
1967 సెప్టెంబరులో చియాంగ్ చింగ్ పిలుపునిస్తూ మాటలలో హింస చూపమన్నది. ఆయేడే మావో అధికారికంగా ఉద్యమానికి మద్దత్తు ఉపసంహరిస్తూ, దీనిని ఆపడానికి ప్రజావిమోచన దశాల్ని పంపవలసివచ్చింది. హింసకు దిగిన రెడ్ గార్డులను చంపేస్తామని ఉత్తరువులివ్వాల్సిన స్థితి వచ్చింది. మావో స్వయంకృతాపరాధాన్ని లింపియావోపై త్రోసేశారు.

1 comment:

బుజ్జి said...

ఫ్రేము కొకణ్ణి చంపినట్టు చూపినా మావో సుమారు 25 లక్షలమందిని చంపాడనుకుంటే 1750 గంటల సినిమా తీయాలి.

ఆ మావో ఎప్పుడు చచ్చిపోయాడో వ్రాయలేదు రావు గారూ..

కొత్త రవికిరణ్