Saturday, August 16, 2008

సాహితీ పరులతో సరసాలు

పెమ్మరాజు వెంకట్రావు

అమెరికాలో సుప్రసిద్ధ టి.వి. ఛానల్లో పెమ్మరాజు ఉమ పనిచేస్తున్నది. ఆమె రాజకీయ ప్రొడ్యూసర్. ఇంటిపేరును బట్టి మీకు పెమ్మరాజు వెంకట్రావు ఏమౌతాడు అని అడిగాను. ఆమె జవాబు ఇస్తూ తనకు తెలియదని, ఆయన పేరు విన్నానని దూరపు చుట్టం అయినట్లు చెప్పారని తెలిపింది. ఆమె ఆంధ్రలో పుట్టినా, అమెరికాలో స్థిరపడింది. అంతర్జాతీయ సుప్రసిద్ధ ఫోటో జర్నలిస్ట్ ను పెళ్ళి చేసుకుని న్యూయార్క్ లో ఉంటున్నది. ఇది 2000లో నేను అమెరికాలో ఉండగా జరిగిన విషయం.

ఆంధ్రలో కార్మికోద్యమ పితామహులలో ఒకడుగా పెమ్మరాజు వెంకట్రావు చరిత్రలో నిలుస్తారు. వి.వి. గిరి, బి. శివరావు వంటివారితో సన్నిహితంగా కృషిచేసిన ఖ్యాతి ఆయనది. 1907లో పుట్టిన పెమ్మరాజు వెంకట్రావు 1928 నాటికే గనుల ఇంజనీరింగ్ శాఖలలో (చీపురుపల్లి, విజయనగరం ప్రాంతం) పనిచేసి అనుభవం గడించారు. 1931 నుండి నెల్లిమర్ల జూట్ మిల్స్ కార్మిక సంఘం స్థాపించి 25 సంవత్సరాలు అధ్యక్షులుగా వున్నారు. అప్పుడే వరాహగిరి వెంకటగిరి, బి. శివరావులతో ఉత్తరప్రత్యుత్తరాలు నడపడం, కార్మిక రంగంలో విశేష అనుభవం గడించడం ఆయన ప్రత్యేకత. 1938 సెప్టెంబర్ 1 నుండే కార్మిక పత్రిక అనే వార పత్రిక విజయనగరం నుండి పెమ్మరాజు వెంకట్రావు సంపాదకత్వాన వెలువడింది. రెండవ ప్రపంచ యుద్ధారంభ రోజులలో వెంకట్రావు ప్రపంచ రాజకీయాల్ని అవగాహన చేసుకుంటూ ఉద్యమాల్ని సాగించారు.

ఆ దశలో ఆంధ్ర పర్యటనకు వచ్చిన ఎం.ఎన్. రాయ్ భావాలు వెంకట్రావు దృష్టికి రాగా, ఆకర్షితుడయ్యాడు. ఎం.ఎన్. రాయ్ స్థాపించిన ఇండియన్ లేబర్ ఫెడరేషన్ లో చేరాడు. అప్పటి నుండి ఎం.ఎన్. రాయ్ 1954లో చనిపోయేవరకూ పెమ్మరాజు వెంకట్రావు రాడికల్ హ్యూమనిస్టు భావాలతో రచనలు చేశారు. ఆయన తరచు కవితలు కూడా రాసేవారు. భారత పునర్వికాసం, బౌద్ధ విప్లవంపై దృష్టి వుండేది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత నెల్లిమర్ల జూట్ మిల్లు కార్మిక సంఘం నుండి తన స్థానాన్ని హైదరాబాద్ కు మార్చిన వెంకటరావు, కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆ సందర్భంగా ఆవుల గోపాలకృష్ణమూర్తికి రాస్తూ, కమ్యూనిజాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెసు ద్వారా కృషి చేస్తానని, రాయ్ భావాలు అమలు చేయడానికి పార్టీలో పనిచేస్తాననీ అన్నాడు. ఆ ప్రకారమే కాంగ్రెస్ పత్రిక పెట్టి రాయ్ భావాలు వ్యాసరూపంలో అందించారు.
నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా పెమ్మరాజు వెంకట్రావును అభిమానించారు. గాంధీభవన్ లో వెంకట్రావు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ముక్కుసూటిగా వున్న వెంకట్రావును కాంగ్రెస్ నాయకులు పైకి మెచ్చుకున్నా ఆయన్ను పైకి రానివ్వలేదు.

రాష్ట్రపతి నామినేషన్ వలన పెమ్మరాజు వెంకట్రావు ఒక టరమ్ శాసన మండలి సభ్యుడుగా పనిచేశారు. అప్పుడు తనవంతు కృషి కనిపించింది. 1958లో గోల్కొండ దినపత్రిక ఆగిపోగా వారపత్రికగా పెమ్మరాజు వెంకట్రావు కొంతకాలం హైదరాబాద్ లో నిర్వహించారు. కాని అదీ అట్టేకాలం సాగలేదు.

కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పెమ్మరాజు వెంకట్రావు క్రమేణా కాంగ్రెసు రాజకీయాలకు దూరంగా జరిగారు. ప్రెస్ లు స్థాపించి నష్టపడ్డారు. 1982లో ఎన్.టి. రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కొద్దికాలం వెంకట్రావు సన్నిహితంగా వున్నారు. ఇరువురి భావాలూ పొత్తు కుదరక, వెంకట్రావు రాజకీయాలకు స్వస్తి పలికారు. 1987 సెప్టెంబరులో పెమ్మరాజు వెంకట్రావు హైదరాబాద్ లో చనిపోయారు.

పెమ్మరాజు వెంకట్రావుతో 1958లో నాకు పరిచయమైంది. విశాఖపట్నంలో ఎం.ఏ. చదువుతుండగా ఆయన వ్యాసాలు గమనించి ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపారు. ఎం.ఎన్. రాయ్ రాసిన పునర్ వికాస విషయాలు తెలుగులో బాగా ప్రచారం చేశారు. ఆవుల గోపాలకృష్ణమూర్తి వద్ద కలుసుకునేవాళ్ళం. తరువాత హైదరాబాదులోనూ కలిశాం.

1 comment:

Anonymous said...

Very interesting....
I know Uma Pemmaraju...She works at Fox