Saturday, November 24, 2007

Agehananda 17

మతం మార్పిడి వివాదం
దక్షిణాదిలో పర్యటిస్తుండగా మతం మార్చే క్రైస్తవుల సమస్య ఎదురయింది. సిరియన్ క్రైస్తవులు, పురాతన క్రైస్తవులతో సమస్యలేదు. కాని క్రైస్తవ ఫాదరీలు, పాశ్చాత్య మిషనరీలు మతం మార్పిడిలో క్రైస్తవ గొప్పతనం ఉందని అంటారు. ఇదే చికాకు కలిగిస్తుంది. హిందూ మతం ఇతరుల మతం మార్చదు. అది ప్రపంచ మతం కాదు. బౌద్ద, ముస్లిం, క్రైస్తవ మతాలకు మారినట్లు హిందువుగా మారడానికి వీల్లేదు. హిందూ, కులాల్లో పుట్టినవారే హిందువులు. ఇతర జాతులకంటే తమ మతం గొప్పని హిందువులు చెప్పారు.
నాగర్ కోయిల్ కు సమీపంలో ఒక పెద్ద చర్చి ఉన్నది. వాడకాంగూలం అనే చోట ప్రజలు ఫాదరీలతో పడక, మళీళ హిందూ మతంలోకి మారాలను కున్నారు. ఒకప్పుడైతే ఇది అసాధ్యమేమో గాని, రాను రాను దక్షిణాదిలో ఇలాంటి మార్పులకు అవకాశం ఏర్పడింది. మేము వాడకాంగూలం వెళ్ళేసరికి తమిళంలో భజనచేస్తూ, సుమారు 5 వేల మంది కనిపించారు. ఆర్ముగన్ నన్ను చొక్కా విప్పేయమని, నాకు గంధం పూసి, నొసటిపై త్రిపూండ్రం పెట్టాడు. నా వంటి నిండా శివభక్తుడి నన్నట్లుగా విబూధి పూశాడు. ఇలాంటి వాటిని వివేకానందుడు పులిమచ్చలుగా వర్ణించాడు.
వేలాయిన్ నన్ను నాగర్ కోయిల్ కు తీసుకెళ్ళాడు. నాడా జాతివారు హిందువులుగా మారారని తరువాత తెలుసుకున్నాను. 5 వేల మందిలో హఠాత్తుగా మార్పు రావడానికి నా ఉపన్యాసం కారణం కాదు. కాని నేను వాడకాంగూలం పోవడం వలన స్థానిక హిందూ నాయకలుకు కొంత చేయూత లభించింది. హిందూ ధర్మానికి గౌరవాన్ని ఇవ్వాలని వారు తలపెట్టారు. అలాంటి సమావేశాలకు నేను వెళ్ళటం ఆ ఒక్కసారే జరిగింది.

కుంభమేళా అనుభవాలు
13 ఏళ్ళకోసారి అలహాబాదులో కుంభమేళా జరుగుతుంది. ఆరు రోజుల పాటు రాత్రింబగళ్ళు పండితులు, సన్యాసులు చర్చల్లో పాల్గొంటారు. గొప్ప ఊరేగింపు జరుగుతుంది. కాశీ విశ్వవిద్యాలయంలో నను ఆఖరి సంవత్సరం చదువు చెబుతుండగా 1954లో కుంభమేళా జరిగింది. జర్మన్ రాయబార కార్యాలయం నుంచి వచ్చిన స్నేహితులు నన్ను తీసుకెళ్ళారు. అక్కడ జనాలను చూసి నాకు భయం వేసింది. బొంబాయి నుంచి వచ్చిన దళసామి శాఖకు చెందిన ఒక సన్యాసి కుటీరంలో నాకు బస యేర్పాటు చేశారు. కన్యాకుమారిలో అంతకు ముందు ఆయనను కలుసుకొన్నాను. స్వామి బ్రహ్మానందజీతో పాటు మనం కారులో వెళదామన్నారాయన ఉదయం నాలుగున్నరకు ఊరేగింపు ప్రారంభమైంది. ముందుగా నాగారుషులు బయలుదేరారు. వారి వెనుక మేమున్నాము. తరువాత క్రమంగా ఉదాసీనులు, నిర్మలులు, వైష్ణవులు మొత్తం 20 వేల మందికి పైగా సన్యాసులు ఉన్నారు. లక్షా యాభై వేల మంది పట్టే తోట ఐదు లక్షల మంది జనం కూడారు. మేము కారులో ముందుగా వెళ్ళాము. పూరీ గోవర్థన మఠాధిపతి ప్రప్రథమంగా నదిలోకి దిగారు. తరువాత మేము ఆ తరువాత మిగిలినవారు తొక్కిసలాట మొదలైంది. కాసేపట్లో 300 మంది చనిపోగా 900 పైగా గాయపడ్డారు. అప్పటికే కారులో చుట్టూ తిరిగి వెళ్ళిపోయాం.
ఒకచోట ఉపన్యాసంలో, విముక్తికి సన్యాసత్వం ఒక్కటే మార్గం కాదని హిందూ ధర్మం చెబుతున్నదని, ఇంద్రియాలను చంపుకోవడం ఒక మార్గం కాగా, మాటిని సద్వినియోగం చేసిన మోక్ష సాధనకు మళ్ళించడం మరొక మార్గమని చెప్పాను.

శంకరాచార్య సందర్శనం
గోవర్థనపీఠ జగద్గురువు శఁకరాచార్యులు భారతి కృష్ణ తీర్థ నన్ను చూడదల్చినట్లు యువ సాధువు వచ్చి చెప్పాడు. నేను పీఠాధిపతి దగ్గరకు వెళ్ళేసరికి కొందరు పెద్దలు ఆసీసులై ఉన్నారు. వారు సాదరంగా నన్ను ఆహ్వానించి పాండిత్య విషయాన్ని ప్రస్తావించారు. అంతలో శంకరాచార్యులు ప్రవేశించగా నేను సాష్టాంగ ప్రమాణం చేశాను. శంకరాచార్యులవారు ఆసీనులై సంభాషణలో పాల్గొన్నారు. ముక్తికి జ్ఞానానికి సన్యాసత్వం అవసరమా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. మూడు గంటలసైపు చర్చసాగింది. సన్యాసిగా ఉండమంటే పైకి కనిపించే రూపం కాదని చెప్పాను.
నిజమే, నీవు చెప్పినదానికి అనుకూలంగా ప్రమాణ గ్రంథాలలో పేర్కొన్న సందర్భాలున్నవి. ఋషులు ఉన్మాదులుగానూ, సాధారణ వ్యక్తులుగానూ, మంత్రులుగానూ వ్యవహరించిన సందర్భాలు లేకపోలేదని శంకరాచార్యులు అన్నారు. అత్యున్నత దైవాన్ని నమ్మడం ముఖ్యం కాదా? అని అడిగారు శంకరాచార్యులు.
నాకు ప్రమాణ గ్రంథాలు అర్థమైనంతవరకు దైవాన్ని తనలోనే చూసుకోవచ్చని లేదా నిరాకరించవచ్చని చెప్పాను. బహ్మ లేదా దైవరూపాలు అవతారాలు ఎన్నో విధాలుగా ఉంటాయని పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి.
దైవానికి జైమిని ప్రాధాన్యత ఇవ్వలేదు. కపిలుడి సాంఖ్య దర్శనంలో నిరీశ్వర వాదం ఉన్నది. అయితే అధికార భేద నియమం ఉంది అని శంకరాచార్యులు అన్నారు.
ప్రపంచాన్ని గురించి నీ భావాలు, ధోరణులు యేమిటని శంకరాచార్యులు అడిగారు.
ఈ విషయాలను గురించిన నా భావాలను అనేక వేదికలపైన చెబుతూనే ఉన్నాను.
ఒక వ్యక్తి యోగిగా కాషాయ వస్ర్లాలో ఉంటూనే మానవతావాదిగా అరమరికలు లేని రామణీయక జీవితాన్ని గడపవచ్చు. మన ఋషులు, సాధువులు, మానవతా వాదులు కాదు. మానవుడిని ఏదో ఒక మూలశక్తికి కొలమానంగా వాడుకోవడాన్ని మానవతా వాదం అంగీకరించదు. యోగి, మానవతా వాది సంఘర్షణకు దిగినవసరం లేదు. యోగిగా ఉండటం వ్యక్తిగత విషయం అతడి మార్మిక జీవితం సున్నితమైనది. ఇతరులకు చెప్పవలసింది కాదు. మానవతావాదిగా ఉండటం కూడా సున్నితమైన విషయమే. ఒకానొక ధోరణిలో మానవతా వాది ఆలోచిస్తాడు. ఆలోచన, ఆచరణ ఒకటేనని ఎవరెంతగా నొక్కిచెప్పగా, ఇవి రెండూ భిన్న స్థాయిలకు చెందినవి. ఒక వ్యక్తి అద్వైతిగా ఉంటూనే ఇంద్రియాలపట్ల జుగుప్స పెంచుకోనక్కరలేదు. అద్వైత సాధువు ఆశ్రమ ధర్మాలను బట్టి ఇంద్రియ సుఖాలను అదుపులో పెట్టుకుంటాడు. అతడు ఇంద్రియాలోలుడు కాకపోయినా, ఇంద్రియాలను గురించి, అందమైన వస్తువును గురించి ఈసడించుకోడు. ఆశ్రమ జీవితం మామూలు జీవితం కంటే ఎక్కువవగా తనకేదో అందిస్తుందని భావించిన వ్యక్తి ఇంద్రియాలను ఆగ్రహంతోగాక ఆశ్రమ ధర్మాల రీత్యా దూరంగా అట్టిపెడతాడు.
ఇండియాలో వేదాంత సంప్రదాయాన్ని పాటించేవారు అరుదయ్యారు. టిబెట్ లో హీనయాన బౌద్ధమతం ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నది. పాశ్చాత్యులు కూడా దీనిని అభ్యసిస్తున్నారు.

No comments: