Tuesday, November 6, 2007

Sanyasi satyam palikite -Agehananda

సన్యాసం అంటే...
మధ్యాహ్నం ఒంటిగంట నుండి రాత్రి ఏడున్నర వరకు సన్యాసిగా బాధ్యతలేమిటో ఎలా జీవించాలో ఆయన చెప్పారు. నేను మాయావటిలో ఉండగా లైంగిక విషయాలతో బాధపడ్డాను. నా ఆలోచనలు పసిగట్టినట్లుగా ఆయన అన్నారు. నీవు యవ్వనంలో ఉండగా నీకు లైంగిక బాధలు ఉండకపోవచ్చు. 45-60 సంవత్సరాల మధ్య శరీరం తిరుగుబాటు చేస్తుంది. మనస్సు భయాందోళనకు గురౌతుంది. అప్పుడు లైంగికంగా అసలు కష్టాలు ప్రారంభమౌతాయి. ఇప్పుడు నీకు చేస్తున్నది త్యాగమే అయితే యిది అసాధ్యం కాదు. మధ్యలో ఎప్పుడైనా నీవు పతనమైనా మనస్సును వికలం చెందనీయకు. మళ్ళీ తపస్సు ప్రారంభించు. నా దృష్టిలో పతనం కాని సన్యాసంటూ లేడు. అలా పడుతూ లేస్తూ ఉండాలి తప్పదు. వీటి మధ్య గిరిగీసి చూడటం అజ్ఞానం. మనం సాధువులం... న్యాయవాదులం కాదు అని బోధించారు.
సన్యాసం స్వీకరించిన తరువాత కాశీలో ఉండి భిక్ష స్వీకరించవచ్చు లేదా ఇతర సాధువులవలె తీర్థయాత్రలు చేయవచ్చు అని చెప్పారు. నీవు గ్రామాలలో పర్యటించేటప్పుడు ఏ చెట్టుకిందో కూర్చొని ఆహారం స్వీకరించు, ఆ గ్రామస్తులకు దర్మం బోధించు. వారెన్నడూ వినవి విషయాలు వినిపిస్తే అంతకంటే కావలసినదేముంది, మనం చేసేది గొప్పపని మనకు ప్రజలు ఆహారాన్ని ఇవ్వకపోతే మనం వ్యక్తులుగా, వ్యవస్థగా ఉండలేకపోవచ్చు. ఈ దేశంలో కాషాయవస్ర్తాలు అదృశ్యమయ్యే రోజు రావచ్చు. అది చాలా మందికి ఆనందంగా ఉంటుంది. మనం వీటిని పట్టించుకోకూడదు. ఎవరి దారిన వారుపోవాలి అని విశ్వానంద భారతి చెప్పారు.
సన్యాసిగా యెలాంటి మర్యాదలు పాటించాల్సింది ఆయన చెపుతూంటే నేను రాసుకోబోయాను. కాని, ఆయన వారించారు. పరిస్థితిని బట్టి అవన్నీ జ్ఞాపకానికి వస్తాయని ప్రశాంతత అవసరమైనప్పటికీ, ఒక్కోసారి ఆగ్రహం చూపవలసి వస్తుందని ఖచ్చితమైన నిబంధనలంటూ లేవని చెప్పారు. అప్పటికి సాయంకాలం ఆరయింది. స్వామి విశ్వానంద మళ్ళీ చెప్పారు. అర్థరాత్రి నిన్ను పూర్తి సన్యాసిని చేస్తాను. చాలామంది నిన్ను సన్యాసిగా గుర్తించకపోవచ్చు. సనాతనులు నిన్ను గుర్తించకపోవచ్చు. నీవు ఆధ్యాత్మిక స్థాయిని పెంచుకుంటే నేడు గుర్తించని వారు రేపు గుర్తించవచ్చు. నీవు ఆది బ్రహ్మ అవతారమైనా నీకు గుర్తింపురాదు. ఇదంతా బాధాకరంగా వున్నా నీవు పట్టించుకోరాదు. సంపద, సంతానం, సాంఘిక బహిష్కారం, సాంఘిక ఆమోదం ఇత్యాది అన్నిటిని వదలుకోవడమే సన్యాసి మార్గం. అవి పాటించనంతకాలం నీవు సన్యాసివే వెళ్ళి నిద్రపో, బ్రహ్మచారిగా ఇదే నీ ఆఖరి నిద్ర రేపటికి నీవు సన్యాసివౌతావు.
ఇంకో పావుగంటకు అర్థరాత్రి అవుతుందనగా లేచాను. స్నానం చేసి, లంగోటి ధరించి, లోహఘాట్లో కొన్ని దుస్తులు ఒక సేవకుడికి ఇచ్చి నా వెంట రమ్మన్నాను. కాశీ సందు గొందులలో వేగంగా నడుచుకుంటూ పోతే మణికర్ణికఘాట్ కు 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. మణికుండలం వద్ద ఒక క్షణం ఆగాను. గంగానది ఒడ్డుకు 15 గజాల దూరాన ఉన్న ఆ బావిలో శివుడి కర్ణకుండలాలు పడిపోయాయట. ఇక్కడ చనిపోవడం పవిత్రమని హిందువులు భావిస్తారు. రాత్రింబగళ్ళు ఇక్కడ శవాలు తగలబడుతూ ఉంటాయి.
అక్కడ చాలా మంది బ్రహ్మచారులు, సన్యాసులు ఉన్నారు. ఆనాడు అరడజను మంది బ్రహ్మచారులు సన్యాసం స్వీకరించనున్నారు. హరిద్వార్ నుండి వచ్చిన స్వామి జగదీశ్వరానంద నలుగురికి సన్యాసం ఇప్పించబోతున్నారు. నాతో ఈ విషయాలు చెప్పిన సన్యాసిని ఉద్దేశించి విశ్వానందజీ ఎవరికైనా సన్యాసం ఇస్తారని తెలుసా? అన్నాడు. ఒక మ్లేచ్చుడికి సన్యాసం ఇవ్వబోతున్నారట. అదెలా సాధ్యం? అయినా మద్రాసు సాధువు గొప్ప జ్ఞాని. ఆయనకు అన్నీ తెలుసు అన్నాడాయన. ఇంతలో ఒక పొడవాటి స్వామి వచ్చి నీకోసం ఆచార్య చూస్తున్నారు. త్వరగా రమ్మన్నాడు. ఆయన దుర్గ గుడి వద్ద విశ్రమించి ఉన్నారు. నన్ను చూసి ఇంకా అర్థగంట వ్యవధి ఉన్నది. ముందే వచ్చావు వెళ్ళి దేవుని పూజించు. ఇదే తగిన సమయం అన్నారు. మణికర్ణిలో నేను దేవుని పూజించి లేచే సరికి ప్రవేశద్వారం వద్ద నున్న విశ్వానందను చూసి పాదచారులు నమస్కరించి పక్కకు తప్పుకొన్నారు. బహుశా వారికి ముందే విషయం తెలుసనుకుంటాను. రానురాను శ్మశానంలో సన్యసత్వం స్వీకరించే పద్దతి తగ్గిపోతున్నది. సన్యసత్వాన్ని స్వీకరించడంలో కొందరు శ్మశానాన్ని కోరుకోగా, మరి కొందరు చక్కని గృహాన్ని లేదా దేవాలయాన్ని కోరుతుంటారు. మణికర్ణిక అందుబాటులో ఉండగా నేను మాత్రం సన్యసత్వం ఇక్కడే ఇస్తాను. నీకేది కావాలో కోరుకోమన్నారు. నేను శ్మశానాన్నే కోరుకున్నాను. నన్ను ఆశీనుణ్ణి చేసి స్వామి విశ్వానంద నా ఎదుట కూర్చుని వామహస్తంతో ఆచమనం చేశారు. సన్యాస దీక్ష సమయంలో అలా వేయాలట. 23 స్వాహాలు చదివి అందుకు ఉపకరించిన పరికరాలన్నీ విరాజి హోమంలో పడేశారు. చివరగా నా పిలకను కత్తిరించి దానిలో పడేశారు. తరువాత నన్ను మరో చితి వద్దకు తీసుకెళ్ళారు. అదింకా నిప్పంటించని చితి దాని మీద నన్ను పడుకోమన్నారు. నా దేహాన్ని ఏడు చోట్ల తాకి లాంచనప్రాయంగా చితినంటించారు. నేను సంకేతపూర్వకంగా దహనం కావించబడ్డాను. ఆ సందర్భంగా నేను లేచి చనిపోయిన వారినుద్దేశించి చదివే మంత్రాలు చదివాను. నా దేహం సజీవంగా ఉన్నప్పటికీ నేను చనిపోయాను. సన్యాసి నేను అంటే తన శరీరం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అని కాదు. నేను అంటే బ్రహ్మతో తాదాత్మ్యం చెందటం. సామాన్యుడుకూడా బ్రహ్మే. ప్రాణులన్నీ బ్రహ్మే. కాని సన్యాసికి తాను బ్రహ్మని తెలుసు. నేను బ్రహ్మచారి దుస్తులను వదిలేసి గంగానదివైపు నడిచాను. బ్రహ్మచారులు స్నానానికి వచ్చేటప్పుడు ఇతరులు వైదొలుగుతారు. నేను గంగలో మునిగి వచ్చిన తరువాత స్వామి విశ్వానంద నాకు కాషాయ వస్ర్తాలు ఇచ్చారు. నేను వెంటనే ధరించాను. ఆగేహానంద భారతికి విజయోస్తు అని నన్ను దీవించి నా కొత్త నామధేయాన్ని నిర్ణయించారు. నాకిచ్చిన దండను గంగా నదిలోకి విసిరేసి పరమహంసలకు నియమాలుండవని అన్నాను.
తొలి భిక్ష ఎవరినుండి స్వీకరిస్తావో నిర్ణయించుకోమని విశ్వానంద చెప్పారు. మేము ఘాట్ నుండి వచ్చేవరకి అరిటాకులలో మంచి ఆహారాన్ని పెట్టుకొని ఒక డజను మంది స్ర్తీ పురుషులు ఎదురు చూస్తున్నారు. వారు నా పాదాలు స్పృశించి తమ ఆహారం స్వీకరించమని కోరారు. సన్యాసి ప్రథమ పర్యాయం ఎవరి ఆహారం స్వీకరిస్తాడో వారికి చాలా గౌరవమనీ, ఈ విషయంలో నీవెవరికైనా మాటిచ్చావా? అని విశ్వానంద అడిగారు. ఆయన ఇంగ్లీషులో అడిగిన దానికి నేను ఇంగ్లీషులోనే సమాధానం చెప్పాను, అయితే నీవు మాటిచ్చిన వారి ఆహారమే స్వీకరించమన్నారు. నన్ను ఆహ్వానించిన వ్యక్తి అనేక పదార్థాలు సిద్ధం చేసి నా పాదాల చెంత ఉంచాడు. నేను కూర్చుని భుజించాను. ఈ శవానికి అప్పటికే చాలా ఆకలిగానూ, దప్పికగానూ ఉన్నది. తరువాత శవం వలె నిద్రపోయాను. లేచేసరికి విశ్వానంద వక్క నములుతూ మాపక్కనే కూర్చున్నారు. ఆగేహానంద మహారాజ్, స్నానం చేసి రండి మాట్లాడుకుందాం అన్నారు. తిరిగి వచ్చేసరికి లడ్లు, జిలేబిలు, టీ సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడేం చేస్తావు ఆగేహానంద అని అడిగారు. ఏం చేయమంటారు? అని అడిగాను. విశ్వానంద చెపుతూ, ఏడు పవిత్ర స్థలాలకు తీర్థయాత్రలు చేయవచ్చు లేదా భారత దర్శనానికై పర్యటించవచ్చు. కాని ఒక వారం పాటు ఉండి ధ్యానం చేయి అన్నాడు. నేను దేశపర్యటన చేస్తానని చెప్పి ఆయన ఆజ్ఞాపించినట్లుగా తరువాత ఏడు రోజుల పాటు అన్నపూర్ణ గుడివద్ద కూర్చుని ధ్యానం చేస్తూ రాత్రిళ్లు మణికర్ణిక ఘాట్ లోని స్మశాన మైదానంలో ధ్యానం చేశాను. ఒకవారం తరువాత స్వామి విశ్వానంద భారతి దగ్గరికి వెళ్ళి ఏదారిన వెళ్లమంటారని అడిగాను. ఆయన భుజాలెగరవేసి ఇలా అన్నారు. నేను సన్యాసి నైనప్పుడు హరిద్వార్లో ఉన్నాను. మైసూర్ లోని శారదా పీఠం వరకూ నడిచివెళ్ళి నరసింహ భారతికి ప్రణామం చేశాను. ఆయన దర్శనార్థం 1500 మైళ్లు నడిచి వచ్చానంటే ఆయన ఆ విషయాన్ని గుర్తించినట్లే లేదు. కనుక నీ ఇష్టం, ఎక్కడికైనా పో అన్నారు.
శృంగేరీ పీఠాధిపతి వద్దకు వెళ్దామనుకున్నాను. విశ్వానంద చెపుతూ నీ తెల్ల శరీరం దేనికైనా పనికివస్తుందేమో కాని గుర్తింపుకు మాత్రం అది ఆటంకం. అందువలన గుర్తింపుకు ప్రయత్నించవద్దు అన్నాడు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకున్నాను. స్వామీజీ ద్వారం చెంతనే నాపాదుకలను వదిలేసి బయలుదేరాను. మొదట్లో కొంత శ్రమనిపించినా మూడు వారాలకు మడమలు బాగా గట్టిపడ్డాయి. గంగా మాతకు తర్పణాలర్పించి, విశ్వనాథుణ్ణి పూజించి, ప్రసాదం స్వీకరించి బయలుదేరాను.

సన్యాసి దేశాటనం
కాశీని చుట్టి, దక్షిణాదికి బయలుదేరాను. కాని నాకు మార్గం తెలియదు. నాగపూర్ శివార్లలో తిరుగుతూ హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించబోతున్నట్లు తెలుసుకున్నాను. తరువాత జాగ్రత్తపడి కొన్ని గ్రామాల మీదుగా తిరుపతి వైపుకు పయనించాను. పెద్ద నగరాలలో ప్రముఖదైవ మందిరాలుంటే తప్ప సాధువు నగరాలను తాకకూడదంటారు. సాదువు తమ దర్శనార్ధం వచ్చిన గ్రామస్థులను వెళ్ళిపొమ్మనరాదు. నేను కునికిపాట్లు పడుతున్నప్పుడు కొందరు ముకుళిత హస్తాలతో ధ్యానం చేస్తున్నట్లు కూర్చుంటారు. గ్రామాలలో చెట్ల క్రింద, దేవాలయ ప్రాంగణాలలో నన్ను చాలామంది వెక్కిరించారు. అయినప్పటికి గ్రామాలలో 90 శాతం ప్రజలు సాధువులకు అనుకూలంగానే ఉన్నారు. 5 శాతం మంది సంప్రదాయ కారణాలుగా సాధువులను వ్యతిరేకిస్తున్నారు. మిగిలిన వారు సెక్యులర్ కారణాలుగా వ్యతిరేకిస్తున్నారు. సాధువుల వద్దకు ముందుగా స్ర్తీలు వస్తారు. వారు పిల్లలతో సహా పురుషులందరూ వెళ్లిపోయిందాకా ఉండి తరువాత తమ సందేహాలకు సాధువులకు వ్యక్తం చేస్తారు. అన్ని రకాల ప్రశ్నలు వస్తుంటాయి. కొన్ని పర్యాయాలు కలహాలను కూడా తీర్చ మంటుంటారు. నేను అనేక పర్యాయాలు రోడ్డుపై కూర్చుని అనుభవాలను నన్ను దర్శించుకోడానికి వచ్చినవారు చెప్పిన విషయాలను రాసు కున్నాను. వాటన్నిటినీ ప్రచురిద్దామనుకుని మళ్ళీ తమాయించు కున్నాను. వ్యక్తిగత విషయాలు నాతో చెప్పుకున్నప్పుడు వాటన్నిటినీ బయటపెట్టడం మంచిదికాదని భావించాను.

భారత స్త్రీల లైంగిక సమస్య
ఒక స్ర్తీ నాతో సందేహాలు తీర్చుకోడానికి ఇలా అడిగింది. నాకు ఏడుగురు సంతానం. గత పదేళ్ళుగా నా భర్తతో కాపురం చేస్తున్నాను. మన కవులు చెప్పే ఆనందం గాని, మనపాటలలో వినిపించే విషయాలుగాని నాకు ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు. ఆమె చెప్పదల్చుకున్న దేమనగా భార్యగా పిల్లలను కన్నానే తప్ప లైంగికంగా నాకు తృప్తిలేదు అని మాత్రమే.
నేను తొమ్మిది మాసాలు కాలి నడకన దేశమంతా తిరిగాను. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, వింధ్య ప్రాంతాలు, హైదరాబాదు. కూర్గ్ లలో గ్రామీణ స్త్రీలు ఇంచుమించు తమ లైంగిక అసంతృప్తిని మాటలలో నాకు వెల్లడించారు. ఢిల్లీ, కలకత్తా, పాట్నా, ట్రివేండ్రంలో ఉన్న వంశాలకు చెందిన స్ర్తీలు ఇలానే చెప్పటం నాకు తెలుసు. భారతీయ పురుషులు గొప్ప ప్రేమికులనే గొప్పలు చెప్పుకోవడం తప్ప భార్యల నుండి ఇలాంటి ఫిర్యాదులున్నాయని వారికి తెలియదు. ఈ విషయాలను వారికి చెప్పేవారు లేరు. గ్రామాలలో నేను పురుషులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ఈ విషయాలను సూచన ప్రాయంగా చెప్పాను. వారి ముఖాలలో రాగద్వేషాలున్నవి. తరచు స్త్రీలతో సంపర్కం ఉన్నప్పుడు స్త్రీలకు అసంతృప్తి ఉంటుందని పురుషులు భావించరు. ఒకవేళ తెలిసినా పట్టించుకోరు. లైంగిక సంబంధం ఒకవిధి అని, అది పురుషుడికి అనందాన్నిస్తే చాలని అనుకుంటారు.గ్రామాలలో ఆహారం, దైనందిన చర్యలు, లైంగిక విషయాలు, మత పరంగా జరిగిపోతుంటాయి. మొత్తం మీద గ్రామాలలో హిందువులు దయామయులు. ప్రేమపాత్రులు. నేను వారితో విభేదించినా, కఠినంగా మాట్లాడేవారు కాదు. ఆగ్రహం కూడా సన్యాసులపట్ల వ్యక్తమయ్యేదికాదు.

No comments: