Friday, November 2, 2007

AGEHANANDA BHARATI -7

అద్వైతాశ్రమంలో నాలుగు నెలలు
సాయంత్రానికి మా రైలు హౌరా స్టేషన్ కు చేరింది. నేతాజీ సుభాష్ పెద్దన్నగారు శరత్ చంద్రబోస్ కుమారులిద్దరూ నా కోసం స్టేషన్ కొచ్చారు. కలకత్తాలోని ఉడ్ బర్న్ పార్క్ వద్దనున్న వారి ఇంట్లో ఆతిథ్యం. రామచంద్ర (లియోపాల్డ్ ఫిషర్)గా నేను ఒకరి ఇంట్లో అతిథిగా వుండటం అదే చివరిసారి. మరునాడు ఉదయం అద్వైతాశ్రమానికి వెళ్ళాను. స్వామి యోగేశ్వరానంద నాకు రెండేళ్ళ సీనియర్. ఆయన మద్రాసు యూనివర్శిటీలో ఎం.ఎ చదివారు. సంస్కృతంలో, ఇంగ్లీషులో మత విజ్ఞానంలో నిపుణులు. ప్రపంచంతో సంబంధాలు తెంచుకోడానికి ఇంకా ఎన్నాళ్ళు కావాలని నన్ను అడిగాడు. మళ్ళీ బోసుగారింటికి వెళ్ళాను. శరత్ చంద్రబోస్ భార్య నా వీడ్కోలు విందుకు చాలా మందిని ఆహ్వానించింది. సనాతన హిందువులు, వృద్ధులు వచ్చారు. మూడు విధాలైన బియ్యపు వంటకాలు, నాలుగు విధాలైన చేపకూరలు, మూడు రకాల పప్పులు, అనేక మసాలా కూరలు మిఠాయిలు వడ్డించారు. ఆ రాత్రి బాగా నిద్రపోయి ఉదయం ఆలస్యంగా లేచాను. మధ్యాహ్నం వీడ్కోలులో పురుషుల కరచాలనం చేయగా, స్త్రీలు పాదాభివందనం చేశారు. యూరప సంస్కృతి నుంచి యెంతో దూరం వచ్చేశాను అనిపించింది.
రామకృష్ణ మఠానికి వెళ్ళాను. స్వామీజీ అక్కడ ఇద్దరు బ్రహ్మచారులను, ముగ్గురు స్వాములను పరిచయం చేశారు. వారు నాకు నచ్చారు. సాయంత్రం చక్కని భోజనం చేశాను. తరువాత సత్సంగ సమావేశానికి రమ్మని స్వామీజీ చెప్పారు. రామకృష్ణ సూక్తులు చదివి వినిపించారు. అది బెంగాలీ అయినా నాకున్న సంస్కృతం, హిందీ పరిజ్ఞానం వలన కొంత అర్థం చేసుకున్నాను. వాటి ఇంగ్లీషు అనువాదాన్ని నాకిచ్చి పెద్దగా చదవమన్నారు. చదివాను. అప్పటికి ఇంకా విదేశీ దుస్తులతోనే వున్నాను. ఆ రాత్రికి ఇద్దరు బ్రహ్మచారులతో నేలమీద చాపపైన పడుకున్నాను.
ఆశ్రమంలో పుస్తకాలు అమ్మకం పనిలో ప్రతివారూ పాల్గొనవచ్చు. ఒకటి, రెండు సంవత్సరాలు అక్కడ పనిచేసిన తరువాత ఇతర కేంద్రాలకు పంపిస్తారు. ఒకచోట ఎవరినీ వుండనీయరు.
మూడు రోజుల్లో నేను ఆ క్రమశిక్షణకు అలవాటు పడ్డాను. రామకృష్ణ ప్రచురణ సంస్థ కలకత్తా నగరం మధ్యన ఉన్నది. ఇతర రామకృష్ణ మిషన్ కేంద్రాల నుండి రోజూ అక్కడకు వస్తూపోతూ వుంటారు. ప్రతిరోజూ సాయంత్రం రెండు గంటలపాటు నగరంలో కాలినడక చాలా విషయాలు తెలుసుకున్నాం. బ్రహ్మచారి సుధీర్ నా వెంట వచ్చేవాడు. సందులలో నేను తప్పిపోకుండా మురికి కూపాల పడి పాపం చేయకుండా నన్ను రక్షించేందుకు సుధీర్ను పంపించేవారు. అతను పొట్టిగా, సన్నగా వుండేవాడు. నేను నెమ్మదిగా నడిచేవాడిని. అతను గబగబా వెళ్ళేవాడు. కొన్నాళ్ళకు నాతో పాటు రావడం మానేశాడు. నాకు ఎలాంటి ప్రమాదమూ లేదని భావించాడేమో.
అద్వైత ఆశ్రమంలో మొత్తం నాలుగు మాసాలున్నాను. మార్చి మాసంలోనే విపరీతంగా చమటపోసేది. అప్పటికి కొంతవరకు కొత్త దుస్తులు అలవాటుపడ్డా, ధోవతి కట్టుకోవడం బాగా అలవడలేదు. అదెప్పుడో జారిపోతుందని స్వామీజీ అంటుండేవారు. ఆయన అన్నట్లు ఒకసారి చౌరంఘీలో వెడుతుండగా ధోవతి ఊడిపోయి కాళ్ళమీద పడింది. పైన చొక్కా వుంది కనుక సరిపోయింది. వంగి ధోవతి అందుకొని నడుముకు చుట్టుకునేలోపు కొందరి దృష్టి నాపైన పడ్డది. వారు నవ్వుతూ నావైపు ఆసక్తిగా చూశారు. దగ్గరలో వున్న ఒక దర్జీ షాపులోకి వెళ్ళాను. ఒకవ్యక్తి నన్నుచూచి మహారాజ్ ఏం కావాలి అని అడిగాడు. కొంచెం చాటు ప్రదేశం కావాలన్నాను. ప్రపంచం అంతా మీదే. ఎక్కడి కావాలంటే అక్కడికి వెళ్ళండి అన్నాడు. గుట్టలుగా పడివున్న బట్టలచాటుకు వెళ్ళి ధోవతి కట్టుకున్నాను. అప్పటి నుండి ధోవతి విషయంలో చాలా జాగ్రత్తపడ్డాను.
నేను కలకత్తా వచ్చినప్పుడే కొన్ని రోజుల తరువాత హిమాలయాల్లోని ఆశ్రమానికి శిక్షణ నిమిత్తం పంపిస్తామని చెప్పారు. కలకత్తాలో వున్నంత కాలం నగర జీవితం అధ్యయనం చేయడానికి అవకాశం ఏర్పడింది. హిమాలయాలకు వెడితే మళ్ళీ రావడం ఆలస్యం అవుతుంది గనుక ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను.
ఆశ్రమంలో తరచు జరిగే కార్యక్రమాలలో రకరకాల మిఠాయిలు పెట్టేవారు. తీపి పదార్థాలంటే నాకు ఇష్టముండేది కాదు కాని సన్యాసి స్వీట్లు బాగా తినాలట. నేను వద్దంటే నావైపు వింతగా చూసేవారు.
ఏప్రిల్ లో కలకత్తా దుర్భరంగా ఉంటుంది. అప్పుడు స్వామీజీలు కొందరు హిమాలయాలకు వెడతారు. నేను రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి మాధవానంద, అద్వైత ఆశ్రమ స్వామీజీ యోగేశ్వరానంద ప్రయాణానికి సిద్ధమైనాం. మమ్మల్ని సాగనంపడానికి ఆశ్రమవాసులు కొందరు హౌరా స్టేషన్ కు వచ్చారు. పూలమాలలతో ముంచెత్తారు. స్వామి మాధవానంద రిటైరయినవాడు, ఆయన శేషజీవితాన్ని భగవత్ ధ్యానంలో గడపదలచారు.
చంపావతికి బస్సులో మూడు గంటలు ఆలస్యంగా చేరిన మేము అక్కడ నుండి నడక ప్రారంభించాము. నాకు ఎత్తు ప్రదేశాలెక్కడమంటే ఇష్టం లేదు. ఒక గంట నడిచిన తరువాత చికాకు కలిగింది. నా వెనుక వస్తున్న బ్రహ్మచారి, భండారిస్వామి సంభాషణ మరీ జుగుప్స కలిగించింది. వాళ్ళు కన్నడంలో మాట్లాడుతూ మధ్యలో ఇంగ్లీషులోకి పోయి, అక్కడక్కడా బెంగాలీ పదాలు వాడారు.
ఆశ్రమానికి వెళ్ళే త్రోవలో లోహాఘట్ ఉన్నది. మేము మోహన్ లాల్ షా ఇంట్లో బస చేశాం. అతనిని షాజీ అని సంబోధించేవారు. అతను వివేకానందను చూచాడు. సేవించాడు. బ్రహ్మచారిగానే జీవితం గడిపాడు. అతని చూపును గ్రహించి సేవకులు పనులు చేసేవారు.
ఆశ్రమంలో నాగది విశాలమైంది. శుభ్రమైంది. నాకు ఒక రగ్గు, రాసుకోడానికి బల్ల, ఒక స్టూలు, పుస్తకాలతో కూడిన ఒక అల్మారా సమకూర్చారు. రామకృష్ణ, వివేకానంద సూక్తులు, ఉపనిషత్తులు, భగవద్గీత, మఠం నియమాలతో కూడిన చిన్న పుస్తకం ఇచ్చారు. మరునాడు ఉదయం మధ్యహాలులో టీ నిమిత్తం అందరూ సమావేశమయ్యారు. స్వామీజీ నాకు ఆశ్రమం చూపెట్టారు. పుస్తకాలతో పాటు ఒక టీ టేబుల్, టైప్ రైటర్, పాత గ్రామఫోన్, డ్రై బాటరీ రెడియో ఉన్నవి. తరువాత డైనింగ్ హాలు, బయట వంటిల్లు, స్నానాల గదులు ఉన్నవి.
అద్వైత ఆశ్రమంలో రామకృష్ణ మిషన్ ప్రచురణ కేంద్రం ఉన్నది. ఎడిటర్ కార్యాలయం ఉన్నది. ప్రబుద్ధ భారతి పత్రిక ఇక్కడ నుండే వెలువడుతుంది. ఒక పోస్టాఫీసు ఉంది. ఆస్పత్రి, విశ్రాంతి గృహం కూడా ఉన్నవి.
రాంసింగ్ అనే వ్యక్తి ఆశ్రమంలో ఆవుల సంరక్షణ చూచుకుంటాడు. పాలు పితికేటప్పుడు ఒక బ్రహ్మచారిని అతనిపై కాపలా పెట్టేవారు. అతడు పాలన్నీ పితకకుండా వదిలేసేవాడు. స్వాములకు పాలు సరిపోయేవి కావు. ఆశ్రమంలో కూరగాయల తోట ఉన్నది.
ఆశ్రమంలో నా విధులేవో తెలియపరిచారు. ప్రధాన భవనంలో కొంత భాగం శుభ్ర పర్చారు. లైబ్రరి పుస్తకాల్ని క్రమంలో పెట్టి కేటలాగు తయారు చేయటం, ఎడిటర్కు ప్రచురణ కర్తకు తోడ్పడుతూ ఫ్రూఫ్లు చదవడం నా పనులు. నాలుగు నెలలు ఆశ్రమంలో ఉండి అధ్యయనం చేస్తూ, ధ్యానం చేస్తూ గడపాలి. తరువాత కలకత్తా నుంచి బేలూరు మఠానికి పంపించి బ్రహ్మచర్య ప్రథమ దీక్ష ఇస్తారు. ఆ తరువాత మళ్ళీ ఇక్కడకు వచ్చి నాలుగైదేళ్ళు ఉండిన అనంతరం బేలూరు మఠంలో పూర్తి సన్యాసత్వాన్ని ఇస్తారు.
స్వామి యోగేశ్వరానంద ఆ సాయంకాలం నన్ను తన ఎదురుగా కూర్చోబెట్టి ఇలా అన్నారు. మీరు రోజూ రెండు పర్యాయాలు ధ్యానం చేయాలి. అధ్యనం చేయాలి. ఠాకూర్ (రామకృష్ణ) పేర ఇచ్చిన పనిచేయాలి. ఏ పనైనా సరిగా చేయకపోతే మందలింపు తప్పదు, ధ్యానం, అధ్యయనం, మీ స్వవిషయాలు. మోక్షానికి చదువు అక్కరలేదు. రామకృష్ణ నిరక్షరుడు. ఋషికి చదువు అవసరం లేదు అని చెప్పారు.
ప్రధాన స్వామీజీ చాలా వృద్ధులు. అంత ఆరోగ్య వంతులూ కారు.
దీక్షకు ముందు నేను నేర్చిన ధ్యానం ఒక విధమైన సాదన అయింది. మంత్రం గురువు ఉపదేశించాలి.
అప్పట్లో వివేకానంద సంపూర్ణ రచనలలో 8వ సంపుటి సిద్ధమవు తున్నది. ఇందులో అప్పటివరకు ప్రచురించని లేఖలు ప్రధానంగా ఉన్నవి.
లండన్లో రామకృష్ణ మఠాన్నినిర్వహిస్తూ స్వామి వివేకానంద వేదాంతంలో కమ్యూనిజాన్ని, గతితార్కిక భౌతికవాదాన్ని చూశాడు. కాని, ఆయన భాష్యాన్ని రామకృష్ణ మిషన్ వారు అంగీకరించలేదు.
నేను ఆశ్రమంలో ప్రవేశించిన తరువాత 8 మాసాలు పాటు ఉదయమే భగవద్గీత చదివి వినిపించేవారు.
గీత ద్వితీయాధ్యాయంలో ఇలా వున్నది. జన్మతః వచ్చిన చర్యలను తృణీకరించవద్దు అవి చెడ్డవైనా సరే పాటించు. ఇతరుల పనులు చేయడం కంటే ఇదే మంచిది అంటే పుట్టుకతో నీవు కొన్ని పనులు చేయడానికి అర్హుడవు. ఇతర పనులకు అనర్హుడవు అని అర్థం. ఇది మతపరంగా పచ్చి కులవాదం. ఈ భాగాన్ని స్వామి యోగేశ్వరానంద గబగబా చదివేవారు. నేను అభ్యంతర పెట్టాను.
ఆయన సమాధానం చెపుతూ మత పవిత్రతను, ఆధ్యాత్మికతను అర్థం చేసుకోలేని సమాజంలో పుట్టి పెరిగిన నీకు ఇవి అర్థం కావు అన్నాడు.
ఒకే ఆలోచనను రాజకీయ నియంత చెప్పినప్పుడు తృణీకరించి అదే మాటలను మత పెద్ద చెబితే అంగీకరించాలా? అని అడిగాను. నీకు తగినంత అంతర దృష్టి లేదు. సున్నిత మర్మాలను నీవు అర్థం చేసుకోలేవు. నీకా దృష్టి ఉంటే ఈ సందేహాలు రావు అన్నాడు.
ఆశ్రమంలో భోజనం తొంభై శాతం శాఖాహారమే. బెంగాలీ సన్యాసులు చేపలు, గుడ్లు తింటారు. వాటిని శాఖాహారంగానే పరిగణిస్తారు. సాయంత్రం 5-00 గంటలకు టీ ఇస్తారు. సాయంత్రం 7-00 గంటలకు ఒక గంటసేపు ధ్యానంలో నిమగ్నులవుతారు. రాత్రి ఎనిమిదిన్నరకు భోజనం ముగించి, అందరూ హాలులో చేరి రామకృష్ణ సూక్తులను, వివేకానంద ప్రసంగాలను, బ్రహ్మానంద సూచనలు చదువుతారు.
రామకృష్ణ మిషన్లో ఎక్కువగా బెంగాలీలు, దక్షిణాదివారు వుండేవారు.
కలికృష్ణ మహారాజ్ స్వామి విరాజానంద రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు. ఆయన పండితుడు, భక్తుడు, దయామయుడు, ఆయన ఆరోగ్యం సరిగా లేదు. పొట్టిగా వుంటాడు. నిడువైన గడ్డం. మొదటిరోజు నేను ఆయనను చూడలేదు. ఆయన వద్దకు తీసుకువెళ్ళాడు.
దీక్ష ఇచ్చేముందు రాత్రి పగలూ కూడా ప్రార్థనలతో, ధ్యానంతో గడపాలి. దీక్షనాడు ఉపవాసం వుండాలి. ఆరోగ్యం సరిగా వుంటే గురువు కూడా అలాగే పాటించాలి. నాకు దీక్ష ఇచ్చే సమయానికి ఆశ్రమ కార్యదర్శి వచ్చి మీకు హిందీలో దీక్ష ఇస్తారని చెప్పాడు. విరాజానంద మాతృభాష బెంగాలి. అతడి ఇంగ్లీషు చక్కగా వుంటుంది. అంతరు ముందు చాలా మందికి ఇంగ్లీషులోనే దీక్ష ఇచ్చాడు. ముహూర్తానికి నన్ను స్వామీజీ గదిలోకి పిలిచి నాచేతిలో ఫలాలతో కూడిన పళ్ళెం ఉంచారు. దీక్ష అనంతరం నేను సమర్పించిన దక్షిణ అది. చిరకాలంగా ఎదురుచూస్తున్న సమయం అసన్నమైన నేనంతగా ఉప్పొంగిపోలేదు.
నన్ను గదిలోకి పిలిచి మంత్ర బోధన చేశాడు. ఇది ఆకర్షణీయమైన చర్య. ఆ తరువాత ధ్యానంలో మంత్రం ఎలా జపించాలో, మనస్సును ఎలా మలచుకోవాలో, ఆసనాలు ఎలా వేయాలో చెప్పారు. ఒకే వస్తువుపై మనస్సును లగ్నం చేయడం, క్రమేణా మిగిలిన వాటన్నింటినీ మనస్సు నుంచి తొలగించడం జరగాలి.

.

1 comment:

ramana said...

see this
http;//nijamga-nijam.blogspot.com